అమరావతి,జులై:టెన్త్,ఇంటర్ గ్రేడ్ల కేటాయింపువిషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా వ్యాప్తి కారణంగా ఏపీ సర్కారు పదో తరగతి,ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే టెన్త్,ఇంటర్ విద్యార్థుల మార్కులకు 30శాతం వెయిటేజీ,ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కులకు 70శాతం వెయిటేజీ ఇచ్చి మార్కులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ఛాయరతన్ కమిటీ కసరత్తు తుది దశకు చేరుకున్నది.
ఫార్మెటివ్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలన్న నిర్ణయానికి కమిటీ వచ్చినట్లు సమాచారం. పదో తరగతి విద్యార్థులకు అధికారులు రెండు ఫార్మెటివ్ పరీక్షలను నిర్వహించారు. అయితే ఫార్మెటివ్ 1 పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన 3సబ్జెక్టులను తీసుకుని ఆ మార్కుల యావరేజ్ లెక్కిస్తారు.
ఇలానే ఫార్మెటివ్ 2కు సైతం చేస్తారు. ఉదాహరణకు 50 మార్కులకు నిర్వహించిన ఫార్మెటివ్-1 పరీక్షలో ఓ విద్యార్థికి సరాసరి మార్కులు 35,ఫార్మెటివ్-2 పరీక్షలో 40 మార్కులు వస్తే మొత్తం కలిపి 75 మార్కులుగా పరిగణిస్తారు. అయితే ఈ మార్కుల ఆధారంగా ఆ విద్యార్థికి సబ్జెక్ట్ గ్రేడ్,మొత్తం గ్రేడ్ ఇవ్వనున్నారు.