హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గడిచిన రెండేండ్లలో ఇసుక మాఫియా ఏ స్థాయిలో రెచ్చిపోతుందో తెలియడానికి నమోదవుతున్న మరణాలే నిదర్శనం. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో సుమారు 12 మంది ఇసుక లారీల కిందపడి చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు ఆర్టీఐ ద్వారా మైనింగ్శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇసుక లారీల ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారు? ఎంతమంది గాయపడ్డారు? అనే వివరాలు కోరుతూ ‘యూత్ ఫర్ యాంటీ కరెప్షన్’ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టీఐ ద్వారా సమాచారం కోరారు.
దీంతో 2024లో ముగ్గురు చనిపోగా, ఒకరు గాయపడ్డట్టు, 2025లో తొమ్మిది మంది చనిపోగా, ఇద్దరు గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక లారీలు అంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారని, పట్టపగలు, అర్ధరాత్రి అనే తేడా లేకుండా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని రాజేంద్ర అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఇసుక లారీలతో బయటకు రావాలంటేనే జనం భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక లారీల కోసం ప్రభుత్వం నిర్ణీత సమయం అంటూ ఒకటి ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఇసుక లారీలు వచ్చే ఏరియాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి, వాటి వేగాన్ని అదుపుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొన్నారు.