హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తేతెలంగాణ): ఏపీలో సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. టికెట్ ధరలు, ఆన్లైన్ విధానం అమలు, క్యాంటీన్లలో ధరలు, ప్రేక్షకులకు కల్పిస్తున్న సౌకర్యాలపై తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఏపీ వ్యాప్తంగా టాకీసులపై దాడులు చేసి, నిబంధనలు పాటించని 106 థియేటర్లను సీజ్ చేశారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 50 టాకీసులను సీజ్ చేశారు. కుళ్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారనే కారణంతో ఓ థియేటర్ యాజమాన్యానికి రూ.20 వేల జరిమానా విధించారు. ఏపీలోని థియేటర్లలో నిబంధనల ఉల్లంఘనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.