హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 103 అవినీతి కేసులు నమోదైనట్టు ఏసీబీ డీజీ అంజనీకుమార్ వెల్లడించారు. వీటిలో ట్రాప్ కేసులు 66, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 17, క్రిమినల్ మిస్కండక్ట్ కేసులు 13, అవినీతికి సంబంధించిన ఎంక్వైరీ కేసులు 7 ఉన్నట్టు వివరించారు. డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక వారోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ఆయన ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ.. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేలా ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల లక్ష్యమని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసేలా కలెక్టర్లతో ఆదేశాలు జారీచేయించేందుకు ఏసీబీ డీఎస్పీలు చొరవ తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్ట్లు పెట్టేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులెవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని లేదా వాట్సప్ ద్వారా 9440446106 నంబర్ను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.