నలుగురు నిందితుల అరెస్ట్
మహబూబాబాద్, అక్టోబర్ 1 : పది లక్షల విలువైన క్వింటాల్ గంజాయిని స్వాధీనం చేసుకొని, నలుగురు నిందితులను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన షేక్ ఇస్మాయిల్, గూడూరు మండలం కోబల్తండాకు చెందిన ధరంసోత్ శ్రీను, హాముతండాకు చెందిన ధరావత్ కిరణ్కుమార్, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండకు చెందిన పల్లెకొండ సాంబమూర్తి కొంతకాలంగా ఏపీలోని వైజాగ్ పరిసర ప్రాంతంలోని ఓ వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేస్తుంటారు. అక్కడి నుంచి భద్రాచలం, ఇల్లందు మీదుగా కొత్తగూడ, గంగారం, గూడూరుకు తరలించి పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉంచేవారు. తర్వాత బైకులు, ఇతర వాహనాలు, రైళ్ల ద్వారా మహారాష్ట్రకు తరలించేవారు. ఈ క్రమంలో కోబల్తండా వద్ద తనిఖీల్లో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. గంజాయి రవాణా చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద రూ.10 లక్షల విలువైన 102 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.