హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబరు 4 (నమస్తే తెలంగాణ): ‘మాస్కు లేనిదే లోనికి అనుమతి లేదు’.. దుకాణాలు, షాపింగ్ మాల్స్, సినిమాహాళ్లు, ఇతర ప్రదేశాల్లో ఇప్పటిదాకా కనిపించిన బోర్డు. ఇక నుంచి ‘వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రం ఉంటేనే అనుమతి’ అని సూచిక బోర్డు చూడాల్సి వస్తుంది. అవును! ఒమిక్రాన్ వ్యాప్తివేగం అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నది. దీంతో వ్యాక్సిన్ వేసుకొన్నట్టు సర్టిఫికెట్ చూపించాలని అడుగుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార సంస్థల్లో ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేస్తున్నారు. మొన్నటిదాకా శానిటేషన్, మాస్కుకే పరిమితమైన నిబంధనల్లో ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా చేరిపోయింది. వ్యాక్సిన్ వేసుకొన్న వ్యక్తి ద్వారా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఒమిక్రాన్ను తప్పించుకోవాలంటే సర్టిఫికెట్ కచ్చితం అని సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ఐటీ, ఇతర కంపెనీలైతే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్నవారినే అనుమతిస్తున్నాయి. కర్ణాటకలో ఒమిక్రాన్ కేసులు నమోదవటంతో షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సంస్థలు వ్యాక్సిన్ ధ్రువపత్రాన్ని చూపిస్తేనే తమ ప్రాంగణంలోకి అనుమతిస్తున్నాయి. ఇన్నిరోజులు అంతర్జాతీయ ప్రయాణాలకే పరిమితమైన వ్యాక్సిన్ ధ్రువపత్రం ఇప్పుడు దేశంలోనూ తప్పనిసరి అవుతున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం కొత్తగా 213 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా, ఇతర వ్యాధులతో ఒకరు మరణించారు. 156 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కేంద్రం ప్రకటించిన 11 రిస్క్ దేశాల నుంచి వచ్చిన 70 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ వచ్చినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో శనివారం నాటికి 3.88 కోట్ల కొవిడ్ టీకా డోసులు వేసినట్టు తెలిపింది. మొదటి డోస్ 2.54 కోట్లు, రెండో డోస్ 1.33 కోట్లు వేసినట్టు వివరించింది. 69.34 లక్షల డోసులు అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నది. హైదరాబాద్ శివారులోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల ఓ అపార్ట్మెంట్లో పది మంది కరోనా బారినపడ్డారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్లోని బాలికల పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులకు, తూప్రాన్ పట్టణ పరిధిలోని హైదర్గూడలో ఓ ఉపాధ్యాయురాలితోపాటు ఆమె ఇద్దరు కుమారులకు కరోనా పాజిటివ్ వచ్చింది.