మహబూబ్నగర్ ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జోగులాంబ గద్వాల జిల్లాలో బండి సంజయ్ పాదయాత్రకు సామాన్యుల నుంచి నిరసన సెగ తగిలింది. సోమవారం ఇటిక్యాల మండలం వేముల-షాబాద్ గ్రామాల మధ్య బండి సంజయ్ని మహిళలు అడ్డుకొన్నారు. పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెంపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆ పార్టీ ఎంపీగా సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. వీరికి స్థానికులు అండగా నిలిచారు. అదేసమయంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు అటువైపు వెళ్లారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన బీజేపీ గుండాలు మహిళలను పక్కకు నెట్టేసి స్థానికులు, టీఆర్ఎస్ నాయకులపై రాళ్లు, కర్రలతో విచక్షణ రహితంగా దాడిచేశారు.
అటుగా కారులో వెళ్తున్న అయిజ మండలానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త అంజిపై రాళ్లదాడికి దిగారు. రోడ్డుపై నిలబడకుండా భయభ్రాంతులకు గురిచేశారు. ధరల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపి ప్రభుత్వం సమాధానం చెప్పలేక తమపై దాడికి దిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ నాయకుల దౌర్జన్యం నశించాలని డిమాండ్చేస్తూ మహిళలు అక్కడే టెంటు వేసుకొని సిలిండర్తో ఆందోళనకు దిగారు. బీజేపీ డౌన్ డౌన్ నినాదాలు చేశారు. దాడులకు నిరసనగా బీజేపీ ఫ్లెక్సీలను స్థానికులు తగులబెట్టారు.