కొత్తగూడెం క్రైమ్: మావోయిస్టులు కిడ్నాప్ చేసిన తన భర్త కోసం మరో మహిళ పోరాటం చేస్తున్నది. తన భర్తను విడిచిపెట్టాలని మవోయిస్టులను అభ్యర్ధిస్తున్నది. గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గత ఏడాది నవంబర్లో సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. దాంతో ఆయన భార్య అర్పితా లక్రా మావోయిస్టులతో పోరాడి తన భర్తను విడిపించుకున్నది. ఇప్పుడు మావోయిస్టుల చెరలో ఉన్న మరో ఇంజినీర్ భార్య తన భర్త విడుదల కోసం ప్రాధేయపడుతున్నది.
మావోయిస్టులు శుక్రవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి వంతెన వద్ద నిర్మాణ పనుల పర్యవేక్షణలో ఉన్న ఇంజినీర్ అశోక్ పవార్తోపాటు మరో ఉద్యోగిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. దాంతో ఇంజినీర్ పవార్ భార్య సోనాలి.. తన భర్తను విడిచిపెట్టాలని మావోయిస్టులను అభ్యర్థిస్తున్నది. తన కుటుంబమంతా అశోక్ మీదే ఆధారపడి ఉన్నదని, కాబట్టి తన భర్తకు ఎలాంటి హాని తలపెట్టకుండా విడుదల చేయాలని ఆమె కోరింది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. తన భర్త ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని సోనాలి ప్రాధేయపడింది.