హైదరాబాద్, జూన్28 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీ తీరు ‘ఎవరికి వారే.. యుమునా తీరే’ అన్న చందంగా మారింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఓ ప్రిన్సిపాల్ స్వతహాగా తనకు తానుగా ప్రస్తుతం పనిచేస్తున్న చోటనే ప్రమోషన్ తీసుకొని, ఆ తర్వాత అధికారులకు సమాచారం అందించడం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. మరోవైపు ప్రమోషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్ను ఇప్పటికే సెక్రటరీ నిలుపుదల చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ గురుకుల సొసైటీలో 23మంది గ్రేడ్-2 ప్రిన్సిపాళ్లకు గ్రేడ్-1 ప్రిన్సిపాళ్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ సొసైటీ ఇన్చార్జ్ సెక్రటరీ ఇటీవల ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రమోషన్ పొందిన ప్రిన్సిపాళ్లకు జూన్ 5న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తేదీ సైతం ప్రకటించారు. అయితే, ఆ ప్రమోషన్లపై గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రమోషన్ల ప్రక్రియను క్రమానుగతంగా చేపట్టకపోవడాన్ని నిలదీశాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్లకు సంబంధించి కౌన్సెలింగ్ను నిలుపుదల చేస్తున్నట్టు సొసైటీ ఉన్నతాధికారులు జూన్ 4న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రిన్సిపాల్ తనకు తానుగానే ప్రమోషన్ తీసుకున్నారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న గురుకులంలోనే గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించారు. తదుపరి విషయాన్ని జోనల్ ఆఫీసర్కు రిపోర్టు చేశారు. ఈ విషయం గురుకులంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సర్వీస్ రూల్స్, ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్, హాజరు తదితర అంశాలపై జోనల్ ఆఫీసర్లతో సోమవారం నుంచి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. రోజుకో జోన్ చొప్పున జోనల్ ఆఫీసర్లు, జోన్ పరిధిలోని గురుకుల ప్రిన్సిపాళ్లతో ఆయా అంశాలపై చర్చించనున్నారు. 6వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.