హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): వాహనాల రిజిస్ట్రేషన్లో ‘టీజీ’ ప్రారంభం కావడంతో ఆర్టీఏకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. ఓ వైపు జోరుగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండటం, మరోవైపు ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పెరుగుతుండటంతో ఆదాయం కూడా భారీగా వస్తున్నది. ఈ నెల 15 నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లలో ‘టీజీ’ సీరిస్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా ఫీజుల ద్వారా రూ.1.25 కోట్లు రాగా.. ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రూ.1.26 కోట్ల ఆదాయం వచ్చింది. వారం రోజుల ఆదాయాన్ని లెక్కిస్తే (గురువారం నాటికి) ఫీజుల ద్వారా రూ.3.10 కోట్లు, ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రూ.2.48 కోట్లు వచ్చాయి. మొత్తం కలిపి రూ.5.59 కోట్లు సమకూరాయి.
ఫ్యాన్సీ నంబర్లకు పోటాపోటీ..
ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకోవడానికి వాహనదారులు పోటీ పడుతున్నారు. టీజీ ప్రారంభమైన తొలిరోజే ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో టీజీ 09,0001 నంబర్ ఏకంగా రూ.9,61,111 పలకడం విశేషం. అలాగే టీజీ 09,0909 (రూ.2.30 లక్షలు), టీజీ 09,0005 (రూ.2.21 లక్షలు), టీజీ 09,0002 (రూ.1.2 లక్షలు) పలికాయి. మరోవైపు ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులకు మాత్రం పాత టీఎస్ కోడ్తోనే అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరోవారం రోజుల వరకు పాత స్లాట్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి మాత్రం టీజీ కోడ్ సీరిస్ను కేటాయిస్తున్నారు.