కరీంనగర్: ఒకప్పుడు ఆరుగాలం పండించిన పంటను అమ్ముకుందామంటే దగ్గరలో మార్కెట్ ఉండేది కాదు. కిలోమీటర్ల దూరం పోవాలంటే రవాణాకు వేలకు వేలు ఖర్చయ్యేది. తీరా తీసుకెళ్లిన తర్వాత మార్కెట్లో ధాన్యం పోద్దామంటే జాగ ఉండేదికాదు. ఎక్కడోచోట పోసిన తర్వాత రోజులకొద్దీ పడిగాపులు గాసేది. కొనడానికి వచ్చిన అడ్తీదారులు ఒక్కొక్కరు ఒక్కో (ధర నిర్ణయం) పాట పాడుతోంటే రైతుగుండె దడతో బరువెక్కేది. నిర్ణయమయ్యేదాకా ముఖంలో ఆందోళన కనిపించేది. మద్దతు ధర ఊసే లేక పోయేది. ధాన్యం అమ్మిన తర్వాత సేట్ల కార్యాలయాలకు వెళ్లి డబ్బుల కోసం గంటల తరబడి వేచిచూసేది. బిల్లు పట్టికలో ఆ చార్జీ.. ఈ చార్జీ.. కమీషన్ అని సవాలక్ష రాసి మిగిలిన పైసలు రైతు చేతిల పెట్టేది. ఈ తిప్పలన్నీ ఎందుకని కల్లంకాన్నే దళారీకి అమ్మితే ఆఖరికి అప్పే మిగిలేది.
ఇప్పుడు రైతు పంట అమ్ముకోవడానికి ఊరు దాటాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ చార్జీలకు వేలకు వేలు పెట్టాల్సిన పనిలేదు. ధాన్యాన్ని పట్టుకపోయి పడిగాపులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ధర ఎంత పెడుతరో అన్న ఆందోళన ఏమాత్రం లేదు. డబ్బుల కోసం ఎటూ తిరగాల్సిన పని ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే.. తెలంగాన సర్కారు కర్షకులపై కరుణ చూపుతున్నది. వడ్లు కొనేది లేదని కేంద్రం చేతులెత్తేసినా.. రైతులకు భరోసా ఇచ్చింది. ఊరిలోనే కేంద్రాలు ఏర్పాటు చేసి కొనడంతోపాటు వెనువెంటే చెల్లింపులు చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు వేగవంతం కాగా, పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర దక్కుతుండడంతో కర్షకలోకం హర్షం వ్యక్తంచేస్తున్నది.
తెలంగాణ సర్కారు రైతన్నకు అండగా నిలుస్తున్నది. ఆది నుంచీ కంటికిరెప్పలా కాపాడుకుంటున్నది. కేంద్రం నల్ల చట్టాలతో ఇబ్బందులు పెడుతూ.. మార్కెట్లు ఎత్తివేస్తూ.. కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా ఎక్కడా నష్టం జరగకుండా చూస్తున్నది. అందులో భాగంగా కేం ద్రం దొడ్డు వడ్లు కొనేదీ లేదని తేల్చిచెప్పడంతో మేము న్నాం.. మేకేం కాదని అభయమిచ్చింది. ఊరికో సెంటర్ ఏర్పాటు చేసి కొనుగోళ్లు మొద లు పెట్టింది. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు, హుజూరాబాద్లోనే 95 కేంద్రాలను ప్రారంభించారు. వారం నుంచే కొన్ని కేంద్రాలకు ధాన్యం వస్తుండగా, రెండ్రోజుల్లోనే 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. చెల్లింపులు వెంటనే చేస్తున్నారు. అందులో ఆన్లైన్లో నమోదైన రైతులకు రూ.50 లక్షల దాకా చెల్లించారు. జిల్లాలోని మానకొండూర్, శంకరపట్నం తదితర మండలాల్లో కూడా కోతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా అధికారులు కేంద్రాలను ప్రారంభించారు. మానకొండూర్లో మినహాయిస్తే హుజూరాబాద్లోనే ప్రస్తుతం కేంద్రాలకు ఎక్కువగా ధాన్యం వస్తోందని అధికారులు తెలిపారు.
పెరిగిన వరి సాగు..
కాళేశ్వరం జలాలతో జిల్లాలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. జిల్లా సాధారణ విస్తీర్ణం 1,56,261 ఎకరాలు మాత్రమే. కానీ, గత వానకాలం సీజన్లో 2,72,951 ఎకరాల్లో సాగు చేశారు. దీంతో జిల్లాలో 6.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో హుజూరాబాద్లోనే 73,653 ఎకరాల్లో వరి సాగు జరిగింది. 1.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 4.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు రావచ్చని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లుచేశారు.
కేసీఆర్ కొనకుంటే అడ్డికి పావుశేరు అమ్ముడైతుండే..
నాకు నాలుగెకరాల భూమి ఉంది. నేను 20 ఏండ్లసంది ఎవుసం జేస్తున్న. మునుపు ఎవుసమంటేనే దుఃఖమచ్చేది. గతంల కాలం వచ్చిందంటే భయమయ్యేది. సకాలంలో ఎరువులు, ఇత్తునాలు దొర్కపొయ్యేటివి. కాలువల కాడ నీళ్ల కోసం కాపలా కాసేది. కరెంట్ కోసం రాత్రిపూట జాగారం చేసేది. కండ్ల ముందు పంటలు ఎండుతాంటే గుండె మండుకపోయేది. అచ్చిన పంటను అమ్ముదామంటే మస్తు గోసపడడేది. దళారులకు అమ్మితే అచ్చిన పైసలు వడ్డీలకే సరిపోయేటియ్. చివరికి సూత్తే అప్పులే మిగిలేటియ్. ఇన్ని కష్టాలు పడి ఎవుసం చేసుడు ఎందుకా అనిపించేది. తెలంగాణల కేసీఆర్ సీఎం అయిన తర్వాత మా కష్టాలన్నీ తీరినయ్. ఉద్యోగం జేసే మా కొడుకుతో సమానంగా నేను ఎవుసంల సంపాదిస్తున్న. పరుకకు కూడా పనిజేయని భూములు ఇప్పుడు లక్షల రూపాయల విలువ జేత్తున్నయ్. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేదిలేదని చెప్పినా కేసీఆర్ సార్ మాకు భరోసా ఇచ్చిండు. ఎక్కడికో వెళ్లకుండా ఊళ్లెనే కొంటుండు. కొన్న వారంలనే పైసలు ఖాతాల్ల ఏస్తున్రు. కేసీఆర్ సారు లేకుంటే దళారులకు అడ్డికి పావుశేరు అమ్ముడైతుండె.
మ్యాక ఐలయ్య, రైతు, హిమ్మత్నగర్ (వీణవంక రూరల్)