తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీ లేనంత సపోర్ట్ నితిన్కు ఉంది. ఈ తరం టాప్ దర్శకులందరితోనూ పని చేసిన ఏకైక హీరో నితిన్. త్రివిక్రమ్, వినాయక్, రాజమౌళి లాంటి అగ్ర దర్శకులతో ఈయన పని చేశాడు. అంతేకాదు ఇంకా ఎందరో దర్శకులతో వర్క్ చేసిన అనుభవం నితిన్ సొంతం. కేవలం సినిమాలు మాత్రమే కాదు అందరితోనూ మంచి సాన్నిహిత్యం మెయింటేన్ చేసే హీరో నితిన్ ఒక్కడే.
అందుకే ఈయన కోసం అందరూ వస్తుంటారు. మొన్న చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాజమౌళి వచ్చాడు. ఇప్పుడు త్రివిక్రమ్ ఈ హీరో కోసం వస్తున్నాడు. తాజాగా ఈయన రంగ్ దే సినిమాలో నటిస్తున్నాడు. మార్చి 26న ఈ సినిమా విడుదల కానుంది.
నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాను వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు మరో వారం రోజుల్లోనే సినిమా విడుదల ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ జోరు పెంచేశారు దర్శక నిర్మాతలు.
మార్చి 21న శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. దీనికి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. అంతేకాదు ముఖ్య అతిథిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తున్నాడు. నితిన్తో ఈయనకు మంచి స్నేహం ఉంది. ముఖ్యంగా పవన్ స్నేహితుడు కావడంతో త్రివిక్రమ్ను గురూజిగా భావిస్తుంటాడు నితిన్.
తనతో అ.. ఆ సినిమా చేసిన దగ్గర్నుంచి ఆయనకు అభిమాని అయిపోయాడు. శిష్యుడిగా తన దగ్గర్నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పాడు నితిన్. అప్పట్నుంచి నితిన్ బ్యాక్ చేస్తూనే ఉన్నాడు త్రివిక్రమ్. అప్పట్లో ఆయన అందించిన కథతో ఛల్ మోహన్ రంగా సినిమా చేశాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుములతో భీష్మ సినిమా చేసినపుడు కూడా అండదండలు అందించాడు. ఇప్పుడు రంగ్ దే సినిమాకు కూడా ఈయన వెంటే ఉన్నాడు. పైగా సితార ఎంటర్ టైన్మెంట్స్ సినిమా కావడంతో త్రివిక్రమ్ అండదండలు ఉన్నాయి.