ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ
తిరుపతి సహా రెండు ఎంపీ,
14 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు
15 రోజుల తర్వాత ఫలితాలు
షెడ్యూల్ ప్రకటించిన సీఈసీ
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూలు ఖరారైంది. ఏప్రిల్ 17న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం లోక్సభ స్థానాలకు, 11 రాష్ర్టాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల తేదీలను ప్రకటించింది. నాగార్జునసాగర్తోపాటు రాజస్థాన్లో మూడు, కర్ణాటకలో రెండింటితోపాటు, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లలో ఒక్కోస్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 23న నోటిఫికేషన్ వెలువడనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ 17న ఎన్నిక జరుగుతుంది. 15 రోజుల తర్వాత మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ పేర్కొన్నది. ఉప ఎన్నికలు జరిగే ఏప్రిల్ 17న పశ్చిమబెంగాల్లో ఐదో విడత పోలింగ్ జరుగనున్నది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజునే అన్ని ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా చేపట్టనున్నారు. పోలింగ్కు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తదితర ఏర్పాట్లను చేసుకోవాలని ఎన్నికలు జరిగే ప్రాంతాల రిటర్నింగ్ అధికారులను సీఈసీ ఆదేశించింది.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్నది. కాగా, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మాత్రమే కోడ్ అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొన్నది. కాగా.. నాగార్జునసాగర్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కే జానారెడ్డి పేరును ఏఐసీసీ ప్రకటించింది. తిరుపతి ఎంపీ స్థానానికి డాక్టర్ గురుమూర్తిని వైఎస్సార్సీపీ ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించింది.