శతాబ్దాల కిందట రాణి రుద్రమదేవి వచ్చిందిక్కడికి. చుట్టూ ఉన్న ప్రకృతి సోయగాలకు మురిసిపోయింది. గుట్టమీదున్న లింగమయ్యను చూసి తన్మయం చెందింది. ఆనాటి ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక సౌరభం నేటికీ కనిపిస్తాయి. కొండపై కొలువైన శివయ్య, ఆయన చెంతకు చేరిన భ్రమరాంబ భక్తులకు అభయమిస్తారు. ఊకచెట్టు వాగు మధ్యలో నిలువెత్తు శివుడి విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం తీర్థ క్షేత్రంగా అలరారుతున్నది.
అపర శ్రీశైలంగా పేరున్న పామాపురం చేరుకోగానే, ఎవరికైనా అలౌకిక అనుభూతి కలుగుతుంది. ఓ పక్క నిండుగా పచ్చదనంతో గుట్ట. మరోపక్క దండిగా ప్రవహించే ఊకచెట్టు వాగు. చెక్డ్యామ్ పైనుంచి జాలువారే జలతరంగాలు, ఆ పక్కనే ధ్యానముద్రలో గంగాధరుడి విగ్రహం పర్యాటకులకు సాదర స్వాగతం పలుకుతాయి. ఆ అందాలను ఆస్వాదిస్తూ గుట్టపైకి చేరుకోగానే భ్రమరాంబ సహిత రామేశ్వరస్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఒకప్పుడు దీన్నే ముచ్చ రామనాథస్వామి ఆలయమని పిలిచేవారు.
రుద్రమదేవి కట్టించింది
ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. స్థలపురాణం ప్రకారం ఈ క్షేత్రం ఇప్పటిది కాదు. ఆలయాన్ని రెండుసార్లు పునర్నిర్మించారు. క్రీ.శ.550-750 మధ్య కాలంలో మొదటిసారిగా కట్టించారని చెబుతారు. కాకతీయుల కాలంలో, ఓసారి రాణి రుద్రమదేవి ఈ ప్రాంతానికి వచ్చిందట. ఇక్కడి ప్రకృతిని చూసి ముగ్ధురాలైంది. కానీ, గుట్టపైకి వెళ్లి చూడగా.. శిథిలమైన ఆలయం కనిపించింది. గర్భగుడిలో ఏ ఆదరణ లేకుండా ఉన్న లింగాన్ని చూసి ఆమె మనసు కలత చెందింది. ఆలయాన్ని పునర్నిర్మించి, నిర్వహణ బాధ్యతలను పామాపురం గ్రామానికి చెందిన తంబాల వంశస్థులకు అప్పగించింది. స్వామి కైంకర్యాల కోసం రుద్రమఅనేక మాన్యాలను ప్రకటించినట్టు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తున్నది.
పర్యాటకుల తాకిడి
గుట్ట అడుగున పారే ఊకచెట్టు వాగు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. అందులో 18 అడుగుల ఎత్తుతో గంగమ్మ ఒడిలో.. ధ్యానముద్రంలో కూర్చున్న శివుడి విగ్రహం ఏర్పాటు చేశారు. శివుడి పీఠాన్ని తాకుతూ చెక్డ్యామ్ నుంచి జాలువారే జలరాశిని చూసేందుకు కూడా పర్యాటకులు పామాపురం వస్తుంటారు. కుటుంబంతో తరలివచ్చి పుట్టినరోజు, పెండ్లిరోజు వంటి వేడుకలు చేసుకుంటారు. ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరి సాయంత్రానికి స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ యాత్ర ఓ మంచి పర్యాటక అనుభూతినిస్తుంది.
2017లో మరోసారి..
కాలక్రమంలో ఈ ఆలయం మళ్లీ శిథిలావస్థకు చేరుకుంది. 1981 ప్రాంతంలో స్వామి దర్శనం కోసం అలంపూర్ రెడ్డిరాజుల వంశస్థుడు సురేందర్ రెడ్డి పామాపురం వచ్చారట. ఆయన కోరిక మేరకు సురేందర్రెడ్డి కొడుకు 2017లో ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఇదే సమయంలో గణపతి సచ్చిదానందస్వామి ఆశీస్సులతో భ్రమరాంబ అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. నాటి నుంచి పామాపురం శివయ్యను భ్రమరాంబ సహిత రామేశ్వరస్వామిగా పిలుస్తున్నారు భక్తులు. మహాశివరాత్రి పర్వదినం ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. గిరిజా కల్యాణం వేడుకలో అశేషంగా భక్తులు పాల్గొంటారు. సాయంత్రం జరిగే రథోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచీ తరలివస్తారు. కార్తీక మాసంలోనూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి శివలింగం కాశీలోని జ్యోతిర్లింగాన్ని పోలి ఉంటుందని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మంటపం, జంటనాగుల మందిరం, ఆంజనేయస్వామి దేవాలయం ఉన్నాయి. ఆలయానికి అనుబంధంగా కల్యాణ మంటపం కూడా ఉంది.
ఇలా చేరుకోవాలి..
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై కొత్తకోట పట్టణం ఉంది. అక్కడి నుంచి పామాపురానికి ఆటోల్లో చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో వెళ్లేవారు జాతీయ రహదారిపై ఉన్న నటవల్లి మీదుగా పామాపురానికి వెళ్లవచ్చు.
-రాందేని చంద్రమౌళి