‘అతడు’ అసలు పార్థు కాదు! తప్పిపోయిన మనవడు.. ఆ తాతకు పాతికేండ్ల తర్వాత గానీ కనిపించడు. ఆ వచ్చిందీ అసలు మనవడు కాదని సినిమా చివరాఖరికి గానీ తెలియదు. ఈ స్క్రిప్ట్లో రాజు నేపాలి పాత్ర ఉండి ఉంటే.. ద గ్రేట్ పాశర్లపూడి సత్యనారాయణమూర్తికి అసలు పార్థు దొరికేవాడు. అదీ ఆ పిల్లాడు తప్పిపోయిన మర్నాడే!! ఇంతకీ ఎవరీరాజు నేపాలి? తప్పిపోయిన పిల్లలకు అతనికి సంబంధం ఏంటి?
సిక్కింలో ఓ ప్రాంతం. పదహారేండ్ల వయసున్న కొందరు పిల్లలు వీకెండ్ విహారానికి పశ్చిమబెంగాల్లోని సిలిగుడి ప్రాంతానికి వెళ్లారు. రెండు రోజులు హాయిగా గడిపారు. ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు. అందరూ రైలు దిగారు. ఎవరిండ్లకు వాళ్లు వెళ్లారు. వీరిలో ఓ కుర్రాడు బిజోయ్ (పేరు మార్చాం) ఇంటికి రాలేదు. బిజోయ్ తల్లిదండ్రులు ‘మా అబ్బాయి రాలేదేంటి?’ అని అతని స్నేహితులను అడిగారు. ‘రైలు దిగే దాకా మాతోనే కదా ఉన్నాడు..’ అని సమాధానం ఇచ్చారు. బిడ్డకు ఏమైందోనని ఆ తల్లిదండ్రులు కంగారుపడ్డారు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా ముందుగా పోలీసులను సంప్రదిస్తారు. కానీ, బిజోయ్ తండ్రి మాత్రం రాజు నేపాలికి ఫోన్ చేశాడు. విషయం చెప్పి.. తన కొడుకును కనిపెట్టే బాధ్యత రాజుకు అప్పగించాడు. ఆయనంటే అక్కడివారికి అంత నమ్మకం.
బిజోయ్ తండ్రి నుంచి వివరాలు అందగానే రాజు రంగంలోకి దిగాడు. పోలీసులకూ ఫిర్యాదు చేయమని అతనికి చెప్పాడు. నిమిషాల్లో ‘దోర్స్ ఎక్స్ప్రెస్’ని అలర్ట్ చేశాడు. తప్పిపోయిన పిల్లలను కనిపెట్టి, కాపాడే వలంటీర్ల వాట్సాప్ గ్రూప్ ఇది. ఇందులో మొత్తం 230 మంది ఉన్నారు. రాజు పిలుపు అందుకోవడంతోనే వాళ్లుండే ప్రాంతాలను జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. అబ్బాయి పేరు, ఎత్తు, పోలికల సెర్చింగ్ ఆపరేషన్ యాక్టివేట్ చేశారు. స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వివరాలు షేర్ చేసి వెతుకులాట ముమ్మరం చేశారు. ఇన్ని చేసినా బిజోయ్ ఆచూకీ దొరకలేదు. రోజులు దాటాయి.. వారాలు దాటాయి.. అయినా ప్రయోజనం కనిపించలేదు. ఓ రోజు బిజోయ్ వాళ్ల నాన్నకు ఒక ఫోన్కాల్ వచ్చింది. ‘మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు. లక్ష రూపాయలు చెల్లిస్తే గానీ, మీ అబ్బాయి మీ ఇంటికి క్షేమంగా రాడు’ అని హెచ్చరించారు. ఫోన్ సంగతి రాజుకు తెలియజేశాడు బిజోయ్ తండ్రి. రాజు మెరుపు వేగంతో స్పందించాడు. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా దుండగులు ఎక్కడున్నారో కనిపెట్టే ప్రయత్నం చేశాడు. పోలీసుల సహకారంతో ఆ ఫోన్ ఏ టవర్ నుంచి వచ్చిందో ఆరా తీశాడు. బీహార్ నుంచి వచ్చిందని తెలిసింది. తన టీమ్తో అక్కడికి చేరుకున్నాడు. దుండగుల చెర నుంచి బిజోయ్ని రక్షించి క్షేమంగా వాళ్ల ఇంట్లో అప్పగించాడు.
రాజు ఒకరోజు పూణెలోని ఓ దాబాలో కూర్చున్నాడు. వెనక నుంచి ఎవరో అతని భుజాన్ని తట్టారు. ఎవరన్నట్టు చూశాడు రాజు. వెక్కివెక్కి ఏడుస్తూ తనను తాను పరిచయం చేసుకుందామె! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తన స్నేహితురాలిని చూసి నమ్మలేకపోయాడు రాజు.
ఎందరో తల్లిదండ్రుల కన్నీరు తుడిచే దోర్స్ ఎక్స్ప్రెస్ మెయిల్ ప్రారంభం వెనుక ఓ కన్నీటి కథ ఉంది. అదేమిటంటే?… రాజుకు మారుమూల పల్లెల్లో పర్యటించడం ఇష్టం. 1992లో ఓసారి నేపాల్కు వెళ్లాడు. అక్కడో అమ్మాయి పరిచయమైంది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. రాజు వాళ్లింటికీ వెళ్లాడు. కొన్నాళ్లకు ఆ అమ్మాయి అన్న తన సోదరికి పెండ్లి కుదిరిందనీ, నిశ్చితార్థానికి రావాలని రాజుకు ఆహ్వానం పంపాడు. స్నేహితురాలి నిశ్చితార్థానికి వెళ్లాడు. రోజుల వ్యవధిలో ఆమె వివాహమైంది. ఆనాటి నుంచి పుట్టింటితో ఆమె సంబంధాలు తెగిపోయాయి. అల్లుడి గురించి ఆరా తీస్తే.. ఏ సమాచారమూ దొరకలేదు. బిడ్డ ఎక్కడుందో వెదికి, వెదికి ఆమె తల్లిదండ్రులు అలసిపోయారు. ఆశలు వదులుకున్నారు. ఏండ్లు గడిచిపోయాయి. ఒకరోజు పూణెలోని ఓ దాబా దగ్గర.. తన స్నేహితురాలిని చూసి నమ్మలేకపోయాడు రాజు. ‘ఇన్నాళ్లూ ఎక్కడున్నావ్? ఇలా మారిపోయావేంటి?’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘కట్టుకున్నవాడు మోసం చేశాడు. పూణె రెడ్ లైట్ ఏరియాలో నన్ను అమ్మేశాడు’ అని బావురుమందామె. వెంటనే స్నేహితురాలి సమాచారం ఆమె తల్లిదండ్రులకు చేరవేశాడు. వ్యభిచార రొంపిలో చిక్కుకున్న కూతురును కలవడానికి వాళ్లు ఒప్పుకోలేదు. అప్పటికే హెచ్ఐవీ బారినపడిన ఆమె కొన్నాళ్లకు మరణించింది.
స్నేహితురాలు మోసపోయిన తీరు, ఆమె మరణం రాజును కలచివేసింది. మానవ అక్రమ రవాణా కారణంగా ఎందరి జీవితాలో నాశనం అవుతున్నాయి. కిడ్నాప్, హ్యూమన్ ట్రాఫికింగ్ అడ్డుకోవాలనే లక్ష్యంతో 2007లో రాజు ‘దోర్స్ ఎక్స్ప్రెస్ మెయిల్’ని ప్రారంభించాడు. తనలాంటి ఆలోచన ఉన్నవాళ్లందరితో కలిసి, మరికొన్ని ఎన్జీవోలు, ప్రభుత్వ శాఖల సహకారంతో పశ్చిమ బెంగాల్లోని దోర్స్ ప్రాంతంలో ఒక నెట్వర్క్ రూపొందించాడు. తప్పిపోయిన వారిని వెదకడం, మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడమే వీళ్ల లక్ష్యం. ఇందుకోసం సిక్కిం- పశ్చిమ బెంగాల్ సరిహద్దు గ్రామాల్లో ఊరికో వలంటీర్ను నియమించాడు. తాలూకా, జిల్లా స్థాయుల్లో కో ఆర్డినేటర్లతో సమన్వయం చేస్తూ తప్పిపోయిన, కిడ్నాప్ కేసులను ఛేదిస్తున్నాడు. ఇప్పుడీ నెట్వర్క్ నేపాల్, భూటాన్ దేశాలకూ విస్తరించింది. కేసుల ఛేదనలో పోలీసులు, రైల్వే అధికారుల సహకారం తీసుకుంటూ ఇప్పటివరకు వెయ్యిమందికి పైగా పిల్లలను కాపాడారు రాజు అండ్ కో. ఇక్కడి తల్లిదండ్రులు సొంత ఫోన్ నంబర్ అయినా మర్చిపోతారేమో గానీ, రాజు నంబర్ నోటికి గుర్తుపెట్టుకుంటారు. పిల్లలు తప్పిపోతే రాజు సురక్షితంగా ఇంటికి చేరుస్తాడని వాళ్ల నమ్మకం.