భవ కమలాసన ప్రముఖ దేవతలు
ప్రవిమలంబుగ ప్రణుతించిరెలమి
దివిబీటకొని మ్రోసె దేవ దుందుభులు
దివిజ కామినులు నర్తించిరింపార
పొరిబొరి మందార పుష్పవర్షములు
సురకోటి దేవతీసుతుమీద గురిసి
రంతట, కంసుండు హతుడౌట యెఱిగి
అంతఃపురాంగనలడలు దీపింప
నడుగులు తడబడ నాత్మలు కలగ
సుడివడి లోగుంది సృక్కి బల్వడిని,
నురముల శిరముల నొరి మ్రోదుకొనుచు
పరిపరివిధముల విలపించి మిగుల
నార్తనాదంబుల నందంద బొగిలి
ఈ ద్విపద పాదాలు మడికి సింగన రచించిన ద్విపద భాగవతము లోనిది. ఇది భాగవత దశమ స్కంధమునకు చెందిన కథ మాత్రమే. పదిహేనవ శతాబ్దపు కవిగా భావిస్తున్న మడికి సింగన ద్విపద భాగవతము పోతన మహాభాగవతం కంటే ముందుదని పరిశోధకుల భావన. కాకతీయ రాజుల కాలంలో పెద్దపల్లి దగ్గరి రామగిరి ఇతని నివాసం. కంసుణ్ని శ్రీకృష్ణుడు సంహరించిన సందర్భం మన ద్విపద అంశం. కంసుడు మరణించగానే శంకరుడు, బ్రహ్మ మొదలగు దేవతలు విమలమనస్కులై కృష్ణుడికి నమస్కరించారు. దేవ దుందుభులు మోగాయి.
దేవతా స్త్రీలు నృత్యాలు చేశారు. కృష్ణుడిపై మందార పుష్పాలను వర్షంగా కురిపించారు. అదే సమయం కంసుని మరణవార్త అంతఃపుర స్త్రీలకు తెలిసి కంపనంతో వారి అడుగులు తడబడ్డాయి. ఆత్మలు విచారం పొంది కుంగిపోయాయి. మిగుల చింతించి, రొమ్ములు, తలలు బాదుకుంటూ ఆర్తనాదాలు చేస్తూ ఏడ్పులు పెడబొబ్బలు పెట్టారట. ఇదీ పై పద్య భావం.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ