ఇంటి సామగ్రి తరలింపు నుంచి వస్తు రవాణా వరకు ప్రతి చోటా ఒకే సమస్య. ట్రక్కు డ్రైవర్ నుంచి ఒకే రకమైన సమాధానం.. ‘వచ్చేటప్పుడు ఖాళీగానే రావాలి సార్. రిటర్న్ డబ్బులు కూడా కలిపే మాట్లాడుతున్నా’. సిరిసిల్ల యువకుడు ఆ సమస్యకు సాంకేతిక పరిష్కారం కనిపట్టాడు. ‘ఆదా ట్రిప్’ అనే మొబైల్ అప్లికేషన్ను ఆవిష్కరించాడు. ఇన్వెస్టర్ల అండ లభిస్తే.. ఈ యాప్ రవాణా రంగంలో మరో ఉబెర్ కావచ్చు, ఇంకో స్విగ్గీ అనిపించుకోవచ్చు.
సిరిసిల్ల జిల్లా లింగన్నపేటకు చెందిన బాలరాజు సిద్దిపేటలో ఫ్రిజ్ కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లేందుకు ట్రాలీ అవసరమైంది. ఆటో డ్రైవర్తో మాట్లాడితే వెయ్యి రూపాయలు అవుతుందని చెప్పాడు. ‘ఐదొందల కంటే ఎక్కువ కాదు. నలభై కిలోమీటర్లే కదా?’ అన్నాడు బాలరాజు. ‘నిజమే అన్నా! ఇంతదూరం నుంచి వెళ్లి.. మళ్లీ వచ్చేటప్పుడు కిరాయి లేకుండానే రావాలి కదా! నాకూ కుటుంబం ఉంది. వాళ్లూ బతకాలిగా’ అన్నాడు డ్రైవర్. ఆ మాట కూడా నిజమే అయినా, ఎవరి పరిమితులు వారికి ఉంటాయి. ఆ కాస్త దూరానికే అంత మొత్తం ఇవ్వలేక.. ఫ్రిజ్ను షాపులోనే ఉంచాడు. రసీదు తీసుకొని బస్టాండ్ వైపు వెళ్లి.. తమ ఊరివైపు వెళ్లే ట్రాలీ ఆటోల గురించి ఆరా తీశాడు బాలరాజు. సరుకు అన్లోడ్ చేసి, సిరిసిల్లకు వెళ్లబోతున్న ఆటో డ్రైవర్తో కిరాయి మాట్లాడాడు. ‘ఖాళీగానే వెళ్తున్నా కదా! రూ.400 ఇవ్వండి చాలు’ అన్నాడతను. సంతోషంగా ఫ్రిజ్తో ఇంటికెళ్లిన బాలరాజుకు ఖాళీగా వెళ్తున్న ట్రాలీకి, సరిగ్గా అదే మార్గంలో సరుకు తీసుకెళ్తున్న కస్టమర్కు వారధిగా ఉండగలిగితే? అన్న ఆలోచన వచ్చింది. అంతే, బాలరాజులోని ఆంత్రప్రెన్యూర్ బయటికి వచ్చేశాడు. ‘ఆదా ట్రిప్’ అనే స్టార్టప్ను ఏర్పాటు చేయించేదాకా వదిలిపెట్టలేదు. ఇందులో లావాదేవీ మొత్తం మొబైల్ అప్లికేషన్ సాయంతో జరుగుతుంది. పల్లె నుంచి పట్నానికి, పట్నం నుంచి నగరానికి, నగరం నుంచి మరో నగరానికి.. ఎక్కడికి వెళ్లే వాహనమైనా సరే, ఇక నుంచి ఖాళీగా ఉండదు. సామాన్యుడు కూడా వేలకు వేలు వదిలించుకోవాల్సిన ఇబ్బంది రాదు. ఆ ఇద్దరినీ కలిపినందుకు ‘ఆదాట్రిప్’కు సైతం అంతో ఇంతో ముట్టి తీరుతుంది.
ప్రస్తుతం వినియోగదారులు, డ్రైవర్ల నుంచి ఎలాంటి రుసుములూ తీసుకోవడం లేదు. భవిష్యత్లో ఆదా ట్రిప్ నుంచే లావాదేవీలు నిర్వహించేలా మనీ ఫీచర్లను డిజైన్ చేస్తున్నాడు బాలరాజు. మ్యాపింగ్, పేమెంట్ గేట్వేలను అనుసంధానించి కిలోమీటర్ల లెక్కన రుసుము వసూలు చేయాలన్నది ఆలోచన. యాప్ నుంచే డ్రైవర్లకు చెల్లించే వెలుసుబాటు కల్పించనున్నాడు. ప్రస్తుతానికి, డ్రైవర్లు ఖాళీ ట్రిప్పులతో తిరుగు ప్రయాణం కాకుండా లోడ్ ఇస్తున్నందుకు వారి వద్ద నుంచి నామమాత్రంగా డబ్బులు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఆదా ట్రిప్ గురించి తెలిసినవారు, లాజిస్టిక్స్లో పేరొందిన వ్యాపారవేత్తలు ఈ స్టార్టప్ను చేజిక్కించుకునేందుకు బేరసారాలు చేస్తున్నారు. బాలరాజుకు మాత్రం తన కలల
పంటను దూరం చేసుకునే ఆలోచన లేదు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు సమీకరించి సంస్థను లాభాల బాట పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘నా ఆలోచనపై నాకున్న నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తున్నది’ అంటున్నాడు బాలరాజు.
తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నది. ‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి’ అంటూ మంత్రి కేటీఆర్ పిలుపునిస్తున్నారు. బాలరాజుకు ఆ విషయం తెలుసు. కాబట్టే, నేరుగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)ను సంప్రదించాడు. అతని ఆలోచన వారికి నచ్చడంతో మెంటార్షిప్, ఎకోసిస్టమ్ కనెక్షన్లను ఇచ్చారు. వివిధ వేదికలపై రాజు తన ఆలోచనను ప్రజెంటేషన్ ద్వారా వివరించాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల సాయంతో అప్లికేషన్ను రూపొందించాడు. ఆ ప్రయత్నంలో టీ-హబ్, టీ-ట్రైబ్ సహకారం అందించాయి. మంత్రి కేటీఆర్ స్వయంగా ‘ఆదా యాప్’ను ప్రారంభించారు. ఇప్పుటి వరకూ రెండున్నర వేలమంది కస్టమర్లు, మూడున్నర వేలమంది ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు బాలరాజు పరివారంలో చేరారు.