‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.
ఆ రోజు రాజేశ్వరి మధ్యాహ్నం నడుంవాల్చి లేచేసరికి నాలుగైంది. చల్లని నీళ్లతో మొహం కడుక్కుని.. తుడుచుకుంటూ బైటికొచ్చింది. డాబా మీద ఆ మూలగా రెండు పావురాలు.. ఏవో గింజలు కనిపించినట్టున్నాయి, ఏరుకుని తింటున్నాయి. రాజేశ్వరి తను ఎప్పుడూ కూర్చునే కుర్చీవైపు నడవబోయింది. అవి రివ్వున ఎగిరిపోయాయి. తనను చూసి భయపడినట్లు ఉన్నాయి.
‘అయ్యో!’ అనుకుంది రాజేశ్వరి. కాసేపటి తర్వాత వచ్చి పక్కింటి పిట్టగోడ మీద వాలాయి. తననే చూస్తూ గుడగుడమని శబ్దం చేస్తూ.. ఏదో చెప్పుకొంటున్నాయి.‘ఈవిడేంటిక్కడ? కొత్తగా!’ అనుకుంటున్నాయేమో! ‘సన్నని మెడ, చిట్టిముక్కు, పిడికెడు శరీరం.. ఎంతందంగా ఉన్నాయో!’ అనుకుంది రాజేశ్వరి.లేచి గదిలోకెళ్లి గుప్పెడు మరమరాలు తెచ్చి డాబా మీద వెదజల్లింది. పావురాలు రాలేదు. అనుమానంగా చూస్తున్నాయి.. ఆమెవైపు. ఏమీ తెలియనట్టు వెనక్కి తిరిగి కూర్చుంది. కొద్దిసేపటికి వచ్చివాలాయి. ఒక కంటితో ఆమెను చూస్తూ.. ఒక్కో గింజనూ ఏరుకుని తింటున్నాయి. రాజేశ్వరికి మనసులో ఏదో తెలియని ఆనందం కలిగింది,ఊళ్లో తన ఇంట్లో అద్దెకు దిగిన సౌమిత్ర, అంజలి గుర్తుకొచ్చారు. అచ్చంగా ఈ పావురాల జంటలాగే ఉంటారు. మూలశంకకు ఆయుర్వేద వైద్యం నేర్చుకుని చాలామంది బెంగాలీ కుర్రవాళ్లు, బతుకు దెరువును వెతుక్కుంటూ వలసవెళ్తున్నారని ఎక్కడో విన్నది తను. తెలుగు రాష్ట్రాలకు మరీ ఎక్కువగా వస్తున్నారట. హైవే పక్కనున్న తమ ఊరికి రాజస్థాన్, బీహార్లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి పానీపూరీలాంటి ఫాస్ట్ఫుడ్ సెంటర్లు పెట్టుకుని చాలామంది జీవిస్తున్నారు. ఇల్లు వెతుక్కుంటూ వచ్చి.. ‘చిన్న పోర్షను కావాలి!’ అని అడిగినప్పుడు ఆ జంటను చూసి ముచ్చటపడింది తను. ఉత్తరంవైపు గదులు రెండు ఖాళీ చేయించి ఇచ్చింది.
‘కొత్తగా పెళ్లి అయ్యిందట. పోనీలే.. బతుకుతారు పాపం!’ అనుకుంది. అద్దెచాలా తక్కువ చెప్పింది. వెంటనే వెంట తెచ్చుకున్న సూట్కేసుల్తో దిగిపోయారు. ఒక సూట్కేసులో బట్టలు, మరో సూట్కేసులో వంట సామగ్రి. అంతే! అప్పటికప్పుడు తన దగ్గర వాడకుండా పక్కన పెట్టిన గ్యాస్స్టవ్, సిలిండర్ ఇచ్చి వాడుకోమన్నది. ఆ అబ్బాయికి తెలుగు మాటలు కొన్ని వచ్చు. అంజలికి భాషరాక ఇబ్బంది పడేది. రోడ్డు మీద షాపు ఒకటి అద్దెకు తీసుకొని క్లినిక్ పెట్టుకున్నాడు సౌమిత్ర.
ప్రారంభం రోజు భార్యతో వచ్చి.. “పెద్దవారు! ఆశీర్వదించండి” అంటూ రాజేశ్వరి పాదాలకు నమస్కరించాడు. వాళ్లొచ్చిన మరుసటి నెలలో మనవడి పుట్టినరోజుకు హైదరాబాద్ వచ్చింది రాజేశ్వరి. వచ్చేటప్పుడు ఇంటి తాళాలు వాళ్లకు ఇచ్చి వచ్చింది. పనమ్మాయి వచ్చినప్పుడు ఇంటిని శుభ్రం చేయిస్తూ ఉండమని..
పావురాలకు కొంత నమ్మకం కుదిరినట్టుంది. నిశ్చింతగా గింజలు ఏరుకుని తింటున్నాయి. ఆక్రమంలో రాజేశ్వరి కూర్చున్న కుర్చీకి దగ్గరగా వచ్చి.. తను ఏమాత్రం కదిలినా దూరంగా వెళ్లిపోతున్నాయి. రాజేశ్వరి వాటిని పరిశీలనగా చూసింది. ముక్కుమీద చిన్న తెల్లని చుక్క. కంటి చుట్టూ గీసినట్టున్న లేత పసుపురంగు, మెడచుట్టూ ముదురు నలుపు, ఒళ్లంతా లేత బూడిదరంగు! ఒక్కో గింజనూ తింటూ.. పరిసరాల్ని జాగ్రత్తగా గమనించుకుంటున్నాయి. ‘ఎంతందంగా ఉన్నాయి!’ అనుకుంది రాజేశ్వరి. ఒక చేత్తో పకోడీల ప్లేటు, మరో చేత్తో టీగ్లాసు పట్టుకుని.. “నానమ్మా!” అంటూ రాజేశ్వరి మనవరాలు వచ్చింది.పావురాలు తుర్రున ఎగిరిపోయాయి.
కొడుకు ఇంట్లో ఒక నెల ఉండి ఊరికి వెళ్లిపోదామనుకున్న రాజేశ్వరి.. అనుకోకుండా ఒకరోజు కళ్లు తిరిగి పడిపోయింది. కొడుకు వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాడు. కొత్తగా డయాబెటిస్ లక్షణాలు కనిపించాయి. ముందే హైబీపీ ఉంది. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంచుకుని పంపించేశారు. ఇంకానయం.. ఐసీయూలో పడుకోబెట్టెయ్యలేదని తృప్తిపడింది. రక్తపోటు మందులకు సాయం.. కొత్తగా షుగర్ ట్యాబ్లెట్లు కూడా చేరాయి. చాలా పదార్థాలు తినకూడనివయ్యాయి. ఆహారం మీద ఆంక్షలవల్ల కొంత, మందులవల్ల కొంత.. బాగా నీరసంగా ఉంటున్నది.
ఒకరోజు ఉన్నట్టుండి..
“అమ్మా! ఇక నువ్వు ఊరెళ్లొద్దు!” అన్నాడు కొడుకు. రాజేశ్వరికి గుండెలో గతుక్కుమంది. ఊళ్లో ఉన్న తన చిన్న ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో ఇష్టంగా పెంచుకున్న పూలమొక్కలు, పళ్ల చెట్లు, వాటి మీద వాలే రకరకాల పక్షులు, కనుచూపుమేరలో దూరపు కొండలు, కాలువల మీద ఉండుండి ప్రయాణించే పడవలు.. గోదావరి జిల్లాల పచ్చని ప్రకృతి అందాలు గుర్తుకొచ్చాయి.
మెట్టినింట అడుగుపెట్టింది మొదలు.. రాజేశ్వరి అక్కడికి దగ్గర్లో ఉన్న పుట్టింటికీ, బంధువుల ఇళ్లలో శుభాశుభకార్యాలకీ తప్ప.. దూర ప్రయాణాలు చేసింది లేదు.
కొడుకు బుద్ధిగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అప్పట్నుంచి అప్పుడప్పుడూ భర్తతో కలిసి కొడుకింటికి వచ్చి వెళ్లేది చుట్టపు చూపుగా. పదేళ్ల క్రితం భర్త పోయాక, ఆ ఇల్లే ప్రపంచమైపోయింది రాజేశ్వరికి. అప్పుడప్పుడూ కొడుకింటికి వచ్చినా.. ప్రాణమంతా ఆ ఇంటిమీదే ఉండేది.
‘పనిపిల్ల నీళ్లు పెడుతున్నదో లేదో! ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నదో లేదో!’ అని బెంగ పడేది.ఇంత వయసొచ్చి బంధాల నుంచి దూరం జరగాల్సిన ఈ సమయంలో కూడా చిత్రంగా తన మనసు అదే బెంగకు లోనవుతున్నది. రాజేశ్వరి ఆ రోజుల్లోనే డిగ్రీ చదువుకున్నది. ఉద్యోగానికైతే వెళ్లలేదుకానీ.. పుస్తకపఠనం ఆమెకు ఇష్టమైన వ్యాపకం. ప్రపంచ చరిత్ర మొదలు చిన్న కథల వరకూ, సైన్స్ వ్యాసాలు మొదలు ఖగోళ చరిత్ర వరకూ ఆమె చదవని పుస్తకం లేదు. తన ఇంట్లో ఒక గది మొత్తం.. ఆమె సేకరించిన పుస్తకాలతో నిండి ఉంటుంది. ఆమె భర్త కూడా ఆమె పుస్తకాల సేకరణకు సహకరించేవాడు. ఆ పుస్తకాలకు చెదలు చేరతాయేమో అనే బెంగ ఇంకోపక్క.. రాజేశ్వరికి అస్థిమితంగా ఉంది. రాజేశ్వరి కొడుకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో మూడంతస్తుల ట్రిప్లెక్స్ విల్లా కొనుక్కున్నాడు. ఇదివరకంతా ఉన్నన్నాళ్లూ.. గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న బెడ్రూంలో ఉండి వెళ్లిపోయేది. తన కొడుక్కు వాస్తు నమ్మకం ఎక్కువ.‘పెద్దవాళ్లు పైన ఉండాలి’ అంటూ.. ఇప్పుడు రాజేశ్వరిని సెక్ండ్ ఫ్లోర్ బెడ్రూంలో ఉంచాడు. అక్కడ షవర్, గీజర్, ఏసీలాంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. కానీ, భోజనానికి తను గ్రౌండ్ఫ్లోర్కు వెళ్లడం కానీ, కోడలో – పిల్లలో పైకి తీసుకురావడం కానీ జరుగుతున్నది. తను మెట్లు దిగి ఎక్కలేదని.. సాధారణంగా వాళ్లే తెస్తున్నారు.
ఒకరోజు తను బైట కూర్చుని ఉండగానే పావురాలు వచ్చి ముందు పిట్టగోడ మీదవాలాయి. ఆ తర్వాత గదిపైన అందంగా తీర్చిదిద్దిన బ్రిక్స్ డిజైన్ మీదికెళ్లి కూర్చున్నాయి. ఉన్నట్టుండి డిజైన్ కింద ఉన్న కంతలోంచి లోపలికి వెళ్లిపోయాయి. బాత్రూం పైన అటకలాంటి ఖాళీ ప్రదేశం ఉంది. అప్పుడర్థమైంది రాజేశ్వరికి.. బాత్రూం పైన వస్తున్న శబ్దాలేమిటో! పావురాలు జంటకట్టి ఆశ్రయం కోసం వెతుక్కుంటూ ఉన్నాయన్నమాట!
ఇక గుడ్లు పెట్టే ప్రక్రియ, క్రమంగా గుడ్లు పిల్లలు కావడం.. ఇదంతా ముగిసేసరికి ఎన్ని నెలలు పడుతుందో? తెల్లవారేసరికి గదిముందు రెట్టలు.. గుట్టలుగా ఉంటున్నాయి, ఒకటే దుర్వాసన.
ఆరోజు సౌమిత్ర దగ్గర్నుంచి ఫోనొచ్చింది.. “అమ్మా! పనమ్మాయి రావడం లేదు. మొక్కలు ఎండిపోతున్నాయి. అంజలి ట్యూబుతో మొక్కలకు నీళ్లు పడుతున్నది” అని..
రాజేశ్వరి సంతోషించింది. “అమ్మాయికి నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పుబాబూ!” అన్నది. ‘పనమ్మాయి రత్నం ఎందుకు రావడం లేదు? ఫోన్ చేసి అడుగుదామంటే వాళ్లాయనకే గానీ, తనకు ఫోన్ లేదు. పగలంతా అతను ఏదో పనిలో ఉంటాడు. రత్నానికి బాగాలేదేమో! పోనీలే ఎవరో ఒకరు చూస్తున్నారుగా!’ అనుకొని సర్దుకుంది. నాలుగు రోజుల తర్వాత రత్నం తనే ఫోన్ చేసింది..
“అమ్మగారూ! నాకు జెరం వచ్చి నాలుగు రోజులు మనింటికి ఎల్లలేదండి. అంతలోనే ఆ బాబు రావొద్దనేసేడండి! కరోనా రోజుల్లో ఎవరింటికెవరూ రాకూడదని గేటు మూసేసేడండి!” అంటూ ఫిర్యాదు చేసింది.
“అదీ నిజమేకదా! పోనీలే వాళ్లు చూసుకుంటున్నారటలే మొక్కల్ని” అన్నది రాజేశ్వరి. “అయ్యో అమ్మా! ఏం చూసుకోవడం? ఇంటి ముందున్న పూలమొక్కలన్నీ నరికేశారు. ‘ఇదేటిలాగ సేసేరు? మొక్కలంటే ఆయమ్మకి ప్రేణం’ అని నేను మొత్తుకుంటే.. ‘పాములొచ్చేత్తాయి’ అన్నాడండి. ఒక్క గులాబీ మొక్కగానీ, మల్లంటుగానీ ఉంటే ఒట్టండి!” అన్నది రత్నం.
రాజేశ్వరికి గుండె గుభేలుమన్నది. ‘అయ్యో! అపురూపంగా పెంచుకున్న మొక్కలు!’ అని ప్రాణం విలవిలలాడింది. “కొబ్బరి చెట్టునుంచి రాలిపడిన కాయల్లా తీసేసుకుంటున్నారండి. నిమ్మకాయలు, మావిడికాయలు ఒకటేటి.. మన చెట్ల కాయలు మొత్తం ఆళ్లే అనుభవిత్తన్నారండి!” అన్నది రత్నం మళ్లీ. రాత్రి భోజనాల దగ్గర ఈ సంగతి కొడుక్కు చెప్పింది.
వింటున్నంతసేపూ ఆమె మొహాన్ని గమనించిన కొడుక్కు.. ఆమె ఎంత గాభరా పడుతున్నదో అర్థమైంది. పావురాల సంగతి కూడా చెప్పింది. భోజనాల తర్వాత కొడుకు సావకాశంగా ఆమె పక్కనే కూర్చుని, నచ్చజెప్పే ధోరణిలో అన్నాడు.
“అమ్మా! పావురాల సంగతి ఇక్కడిది కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యగలను. దూరంలో ఉన్న మనింటి సంగతి ఏం చూడగలను? మనం అడిగితే ఎవరి వెర్షన్ వాళ్లు చెప్తారు. మనం అక్కడ లేనప్పుడు ఎవరు తింటే ఏమైంది? రత్నానిది అసూయ కావచ్చు కదా! అక్కడ ఎవరి మాటలూ పట్టించుకోకు. ప్రశాంతంగా ఉండు. డాక్టర్ నీకు అది చాలా ముఖ్యమని చెప్పారు కదా!”.
“అదికాదురా! మొక్కలు.. పుస్తకాలు!” అన్నది పొంతన లేకుండా. “బెంగాలీవాళ్లు తెలుగు పుస్తకాలు ఏం చేసుకుంటార్లే అమ్మా! ఇక మొక్కలంటావా.. ఏం చెయ్యగలం మరి? అన్నిటిమీదా మమకారాల్ని వదులుకోవాల్సిన రోజులివి” అన్నాడు. ఆ రాత్రి రాజేశ్వరికి కంటిమీదికి కునుకు రాలేదు. చెప్పలేని దిగులేదో అలుముకున్నట్టు అయ్యింది. మర్నాడు ఉదయాన్నే కొడుకు వంటింట్లోంచి స్టాండు నిచ్చెన పట్టుకొచ్చి.. పావురాల్ని తరిమేసి, పాత దోమతెర ముక్కను రెండు మడతలు వేసి మేకుల్తో కొట్టాడు. రాజేశ్వరి సాయంకాలం చూసేసరికి, పావురాలు దోమతెరను చింపేసి దారి చేసుకున్నాయి. వాటి మార్గాన అవి యథాప్రకారం బైటికి వెళ్తూ, వస్తూ బిజీగా ఉన్నాయి. రెట్టల దుర్వాసన ఇప్పుడు గూట్లోంచి కూడా వస్తున్నది. రాజేశ్వరి కొడుకు ఈసారి ప్లాస్టిక్ నెట్ బలమైంది తెచ్చి మేకులు కొట్టాడు. ఆశ్చర్యంగా దానినీ లాగి కిందపడేశాయి పావురాలు.
ఆరోజు రత్నం మళ్లీ ఫోన్ చేసింది..“అమ్మగారూ! ఆళ్లు మనింటికి అద్దె కడతన్నారో లేదో సూసుకోండి. మీరు ఆళ్లకి తాళాలు ఇచ్చేరు కదా! ఆ డాట్రుబాబు అద్ది కట్టలేదని రోడ్డు మీద షాపు కాళీ సెయ్యమన్నారంట. అందుకని బోర్డు తెచ్చి మనింటికాడ కట్టేసి.. మీ గదుల్లోకి ఆళ్ల కాపరం మార్చేసుకున్నారు. ఆళ్లకిచ్చిన గదులు ఆస్పటలులాగ వాడేసుకుంటున్నారండి! మీరు ఎళ్లేమందు ఏయించుకున్న బియ్యం బస్తా, పప్పులు, ఉప్పులు అన్నీ వాడేత్తన్నారండి!” అంటూ లబోదిబోమంటున్నది. తనగోల తనది. రాజేశ్వరి కోపం ఆపుకోలేకపోయింది. వెంటనే సౌమిత్రకు ఫోన్ చేసింది.
“అవునా?” అని అడిగింది. ఆమె గొంతు కోపంతో కంపించింది. అట్నుంచి సౌమిత్ర చాలా కూల్గా.. “అవునమ్మగారూ! మీరెలాగూ ఇక్కడ లేరు. మీ గదులు మేం వాడుకుంటే మాత్రం మీకు అభ్యంతరం ఏం ఉంటుందిలే అని అలా చేశాను. కొవిడ్ టైమాయె. మీకు తెలియందేం ఉంది? పేషెంట్లు ఎవరూ రాక రోడ్డుమీద షాపు అద్దె కట్టలేకపోయాను. అందుకని క్లినిక్ సామాన్లు తెచ్చి, మీరు మాకిచ్చిన గదుల్లో పడేశాను. మీ పిల్లల్లాంటోళ్లం! మీరే మమ్మల్ని దయ చూడాలి. ఇంకో సంగతి చెప్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంజలి ఇప్పుడు తల్లి కాబోతున్నది. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని పారిపోయి వచ్చేశాం. అందుకని వెనక్కి వెళ్లలేం! మీరే మా పెద్దలు. మమ్మల్ని దయతో చూడమని దాదాకి, బాభీకి కూడా చెప్పండి” అంటున్నాడు. మృదువుగా ఆ అబ్బాయి మాట్లాడే విధానానికి రాజేశ్వరికి నోట మాట రాలేదు.. ఏమనడానికీ తోచలేదు.
‘నాకొక మాట చెప్పాలి కదా! ఆ ఇల్లు నాది కదా!’ అని తనలో తనే అనుకుంది. పావురాలు గూట్లో నుంచి బైటికొచ్చి.. పిట్టగోడ మీద కూర్చుని వయ్యారంగా తలలు తిప్పుతూ ఆమెవైపు చూస్తున్నాయి. కాసేపటికి చనువుగా ఆమె కాళ్ల దగ్గరికొచ్చి అక్కడున్న గింజల్ని ఏరుకుని తింటున్నాయి. ‘ఇదంతా మా సొంతం, మమ్మల్నెవరూ వెళ్లగొట్టలేరు!’ అన్నంత ధీమాగా ఉన్నాయి.
ఇదివరకటి గుడగుడ శబ్దాలు మానేసి, దీర్ఘమైన రాగాలు తీస్తున్నాయి. బహుశా ఆడపావురం గుడ్లు పెట్టే సమయం కాబోలు!
భోజనాల దగ్గర కొడుకు.. “అమ్మా! ఇవాళ కార్పెంటర్ ఫోన్లో దొరకలేదు. రేపు మళ్లీ ఫోన్ చేసి పావురాలకు బలమైన అడ్డు ఏదైనా పెట్టించేస్తాను!” అన్నాడు. “వద్దులే నాన్నా! పోనీలే.. ఉంటే ఉండనీలే!”.. అన్నది బలహీనమైన గొంతుతో రాజేశ్వరి.
కె.వరలక్ష్మి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఎంఏ చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా సాహితీసేవ చేస్తున్నారు. ఐదు కథా సంపుటాలు, ఒక కవితా సంపుటి వెలువరించారు. వీరి మొదటి కథ ‘రిక్షా’.. 1985లో ‘జ్యోతి’ మాస పత్రికలో ప్రచురితమైంది. ఎక్కువగా స్త్రీ కేంద్రకంగా.. అదికూడా అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు, జీవితంలో వాళ్ల పోరాటాన్ని తెలుపుతూ కథలు రాస్తుంటారు. వరలక్ష్మి కథలన్నీ ఆర్ద్రతగా ఉంటాయి. గుండె తలుపులను తడతాయి. ప్రతి ఒక్కరినీ చదివింపజేస్తాయి.
ఆలోచింపజేస్తాయి. గాజుపళ్లెం, పిండి బొమ్మలు, మల్లెపువ్వు, మట్టిబంగారం, అతడు-నేనుతో పాటు ఎన్నో కథలు పాఠకుల మన్ననలు పొందాయి. అవార్డులు, బహుమతులు గెలుచుకున్నాయి.
-కె.వరలక్ష్మి
98664 67062