Shreyas arunkumar | ఏడేండ్ల వయసులోనే మ్యాప్లో ప్రపంచ దేశాలను గుర్తిస్తూ ‘సెభాష్’ అనిపించుకుంటున్నాడు కేరళకు చెందిన శ్రేయాస్ అరుణ్ కుమార్. ఈ బుడతడి ఘనత తెలుసుకుందాం..
రెండో తరగతి చదువుతున్న శ్రేయాస్కు చిన్నప్పటినుంచే ప్రపంచ పటమన్నా, దేశాలూ వాటి రాజధానుల పేర్లన్నా అమితమైన ఆసక్తి. తల్లిదండ్రులతో ఏ విషయం చర్చించినా చివరికి అక్కడికే వచ్చేవాడట. కొడుకు అభిరుచిని గమనించిన తండ్రి అరుణ్ కుమార్ శ్రేయాస్ ఆరో పుట్టినరోజు సందర్భంగా ఓ అట్లాస్ను బహుమతిగా కొనిచ్చాడు. ఇంకేముంది! లేచింది మొదలు పడుకొనే వరకు అట్లాస్తోనే ఆడుకునేవాడు. దేశాల పేర్లు, రాజధానుల పేర్లు తెలుసుకునేవాడు. లాక్డౌన్ వల్ల దొరికిన సమయాన్ని వినియోగించుకుని ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నాడు శ్రేయాస్. 195 దేశాల పేర్లు, వాటి రాజధానులను కేవలం నాలుగు నిమిషాల యాభైనాలుగు సెకన్లలో గుర్తించి అతి తక్కువ సమయంలో ఆ ఘనత సాధించిన బాలుడిగా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు శ్రేయాస్కు చదువంటే మహా ఇష్టం. గంటకు రెండు పుస్తకాలు చదివేయగలడు. రోజూ ఉదయాన్నే దినపత్రికలు తిరగేసే అలవాటు కూడా ఉంది. కొడుకు పేరున ‘రీడింగ్ రూమ్ విత్ శ్రేయాస్’ అనే ఓ యూట్యూబ్ చానల్ పెట్టి శ్రేయాస్ వీడియోల్ని అప్లోడ్ చేస్తున్నాడు అరుణ్. శ్రేయాస్ గురించి తెలిసిన చాలామంది రచయితలు తమ పుస్తకాలను సమీక్ష కోసం పంపుతున్నారట. ప్రపంచ దేశాలన్నిటినీ గుర్తించి ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకునేందుకు సిద్ధమవుతున్న శ్రేయాస్కి మనమూ చెబుదాం..ఆల్ ద బెస్ట్!