జరిగిన కథ : ఒంటరి అయిన పితృదత్తపై ధారానగర ఉద్యోగులు కన్నేశారు. వారిని తెలివిగా ఒక చెక్కపెట్టెలో బంధించి, భోజరాజుకు అప్పగించిందామె. కానీ, ఆయన వారిని శిక్షించకుండా కేవలం ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించి విడిచిపెట్టేశాడు. దాంతో వారివల్ల ఎప్పటికైనా తనకు, తన కొడుక్కి ప్రాణహాని కలగవచ్చనే భయంతో.. పితృదత్త పాటలీపుత్రానికి ప్రయాణం పెట్టుకుంది. మధ్యలో ఆ తల్లీకొడుకులకు కామందకుడనేవాడు పరిచయం అయ్యాడు.
కామందకుని మనసులోని మర్మమేమిటో పితృదత్త ముందస్తుగా కనిపెట్టలేక పోయింది. కానీ, అతను ధారానగర వాసియేననీ, చిన్నతనం నుంచి పితృదత్తపై మనసు పెట్టుకుని.. ఇప్పుడిలా సమయం చూసి ఆమెను లోబరుచుకోవాలనే ఆలోచనతోనే వెంబడించాడని తెలిసిన తరువాత తట్టుకోలేకపోయింది.
వాణ్ని నాలుగు తిట్టి తరిమేసింది. కానీ, ధారానగరం నుంచి పాటలీపుత్రానికి రెండునెలల ప్రయాణం ఉండటంతో.. దారి పొడవునా ఎన్నోరకాలుగా ఆమెను కామందకుడు ఆటంక పరచసాగాడు. ఆ సమయంలో ఫణి దత్తుడే కనుక అడ్డుగా లేకపోతే పితృదత్త ఏమయ్యేదో!
కామందకుని వల్ల ఎన్నో కష్టాలు పడుతూ, ఎట్టకేలకు పితృదత్త కొడుకుతో కలిసి పాటలీపుత్రం చేరుకుంది. అప్పటికే ఆమె మేనమామలు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. మాతామహుడి సోదరుడొకడు అక్కడే ఉండటంతో ఆయనింటికి చేరుకుంది పితృదత్త.
ఆ గృహస్థు తన మనవరాలిని చూసి సంతోషించాడు. కానీ, ఆమె వెనకే దూసుకువచ్చిన కామందకుడు..
“తాతగారూ! నేను మీ మనవరాలి భర్తను. ఈమె కాపురాన్ని కాలదన్ని చెప్పాపెట్టకుండా మీ ఇంటికి వచ్చేసింది” అని చెప్పాడు.
దాంతో ఆ ముసలాయన సందిగ్ధంలో పడ్డాడు.
“అమ్మా! ఈ తగువేమిటి? వీడిలా చెబుతున్నాడేమిటి? నిజం చెప్పమ్మా!” అని బుజ్జగించి అడిగాడు.
పితృదత్త జరిగినదంతా చెప్పింది. దాంతో ముసలాయన కామందకుణ్ని ఇంటినుంచి వెళ్లగొట్టాడు. అయినా వాడు విడిచిపెట్టకుండా వీధిలోకి వెళ్లి కొంత అల్లరి చేశాడు. ఇరుగు పొరుగువాళ్లలో కొందరు నందరాజుగారి వద్ద అభియోగం తెమ్మని సలహా చెప్పారు. మరునాడు ఆ తగవు విని, పితృదత్త మాతామహుణ్ని నందరాజు సభకు పిలిపించాడు. “పితృదత్త భర్తపేరు నాగరాజు. అతను విదేశాలలో ఉన్నాడు. ఈ కామందకుడు కుబుద్ధితో ఆమె వెంటపడుతున్నాడు” అని చెప్పాడు మాతామహుడు.
“మీ మనవరాలి కుమారుడికి పదేళ్ల వయసు ఉంటుంది కదా! అతణ్ని పిలిస్తే ఈ విషయంలో సాక్ష్యం చెప్పగలడా?!” అని అడిగాడు నందరాజు.
“చిత్తం!” అని సమాధానమిచ్చాడు మాతామహుడు. తన ముందుకు వచ్చి ఠీవిగా నిలబడ్డ ఫణిదత్తుడి తేజస్సును చూసి, నందరాజు ఆశ్చర్యపోయాడు. ‘ఇతడు విప్రబాలకుడంటే నమ్మడం ఎలాగ?! రూపంలో మన్మథుణ్ని మించినవాడు. చక్రవర్తి కాగల చిహ్నాలు కనిపిస్తున్నాయి’ అని మనసులో తలపోశాడు.
“బాలకా! నీ పేరేమిటి? ఏం చదువుతున్నావు?” అని గంభీరంగా ప్రశ్నించాడు.
“నాపేరు ఫణిదత్తుడు! ప్రస్తుతం వ్యాయామాగమ విద్య చదువుతున్నాను” చెప్పాడు ఫణిదత్తుడు. “వేదశాస్ర్తాలను మాని, క్షత్రియులకు ఉచితమైన విద్యలెందుకు చదువుతున్నావు?”. “మా గురువులు వాటితోపాటు ఇవికూడా చెబుతున్నారు. నాకిది చాలా ఇష్టమైన అంశం”.
“సరే! ఎక్కడ నేర్చుకుంటున్నావు?”.
“ధారానగరంలో ప్రభూ! భోజరాజుగారి వ్యాయామ పాఠశాలలో చదువుకుంటున్నాను. ఆయన మా కుటుంబానికి నెలకు మూడువందల భత్యంతోపాటుగా, నాకు చదువుకూడా చెప్పిస్తున్నారు”.
“అయితే భోజరాజుగారు మిమ్మల్ని బాగా ఎరుగునన్న మాటేకదా!”.
“ఎరుగును మహారాజా!”.
“మరి అక్కణ్నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చేశారు?”.
“అక్కడ మాకు దగ్గరి చుట్టాలెవ్వరూ లేరు. అందువల్ల ఆ విద్యలన్నీ ఈ నగరంలోనే నేర్పిస్తానని నన్ను మా అమ్మ తీసుకువచ్చేసింది”.
“సరే! సాములో నువ్వెంత సాధన చేశావు?!”.
“మహారాజా! చక్రపరివర్తనం, లంఘనాతిలంఘనం, దండపరిక్రీడనం, విచిత్రకౌక్షీయక ప్రక్షేపణం, పరిప్లుతవ్యాప్తి, శరీరగుప్తి మొదలైన సాధనలలో మొదటిశ్రేణిలో ఉత్తీర్ణుడినయ్యాను”.
“ఏదీ.. నీ చక్రపరిభ్రమణ పాటవం చూద్దాం. ఆ మేడ ఎక్కి దిగు” అన్నాడు నందమహారాజు.
“చిత్తం” అంటూ ఫణిదత్తుడు నడుముకు దట్టీ బిగించి, ఎదురుగా ఉన్న మేడనెక్కి.. చేతులు సారించి కేవలం పది చంక్రమణలతో నేలకు దిగాడు. నందరాజు ముందుకు వచ్చి, రెండు భుజాలపై అరచేతులతో కొట్టుకొంటూ దండ చరిచాడు.ఆ ప్రదర్శన చూసి, నందరాజు చిన్నపిల్లాడిలా చప్పట్లు కొట్టాడు. కాసేపాగి.. “నీ తండ్రి పేరేమిటి?! ఆయన ఎక్కడున్నాడు?” అని అడిగాడు. “ఆయన పేరు నాగరాజు. విదేశాలలో ఉన్నాడని నా తల్లి చెప్పింది” అని చెప్పాడు ఫణిదత్తుడు. “ఇతను నీ తండ్రినని వాదిస్తున్నాడు. నిజమేనా?”. “కాదు మహారాజా! వీడు పాటలీపుత్రానికి వస్తుంటే దారిమధ్యలో మమ్మల్ని అడ్డగించాడు” అంటూ జరిగిన కథనంతా రాజుతో వివరించి చెప్పాడు ఫణిదత్తుడు. వెంటనే..
“వీడిని చెరసాలలో తోసేయండి” అని ఆజ్ఞాపించి..
“పద! నీ తదుపరి చదువు మా నగరంలోనే కొనసాగిద్దువుగానీ” అంటూ ఫణిదత్తుణ్ని తీసుకుని బయల్దేరాడు నందరాజు. నందభూపాలునికి వ్యాయామాగమం అంటే చాలా ఇష్టం. ఆ విద్యను తన నగరంలో అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. దేశవిదేశాలనుంచి మల్లయుద్ధ వీరులను రప్పించి.. పెద్ద మల్లశాల కట్టించి, అనేకమంది పిల్లలకు శిక్షణనిప్పిస్తున్నాడు. నందరాజు కుమారుడైన రుక్మవర్మ కూడా ఆ పాఠశాల విద్యార్థిగానే ఉన్నాడు. “ఈ పిల్లవాడొక మల్లుడు. ధారానగరం నుంచి వచ్చాడు. ఇకముందు మన పాఠశాలలో చదువుతాడు. ఇప్పుడు మన విద్యార్థులలో ఎవరైనా వీడితో కుస్తీ పట్టగలరా?!” అని ఫణిదత్తుణ్ని చూపించి, పాఠశాలలోని పిల్లలను అడిగాడు నందరాజు. సుబాహుడు, సుప్రహస్తుడు, వజ్రకాయుడు అనే ముగ్గురు పిల్లలు దండలు చరుస్తూ ముందుకు వచ్చారు. ముగ్గురూ విడివిడిగా ఫణిదత్తునితో మల్లయుద్ధం చేశారు. తన తాడన నైపుణ్యంతో ఫణిదత్తుడు వాళ్లు ముగ్గురినీ సులభంగా ఓడించి.. మల్లాడి మల్ల చరిచాడు.
తరువాత రాజు తన కుమారుడు రుక్మవర్మను పిలిచి..
“నువ్వు కూడా వెళ్లు” అన్నాడు. కానీ, ఉపాధ్యాయులు వారించారు.
“రాకుమారుడు పసివాడు కదా మహారాజా! మరికొంత శిక్షణ అవసరం” అన్నారు. అప్పుడు నందుడు ఫణిదత్తుణ్ని కౌగిలించుకుని..
“శ్రద్ధగా నేర్చుకో నాయనా!” అని వెళ్లిపోయాడు.
నిజానికి రుక్మవర్మ కన్నా ఫణిదత్తుడే చిన్నవాడు. కానీ, అతనిముందు విద్యలో రాకుమారుడే చిన్న. ఇది రుక్మవర్మకు కష్టంగా తోచింది. అనుక్షణం పాఠశాలలో ఏదో ఒక విషయంలో ఫణిదత్తుణ్ని చిన్నబుచ్చుతూనే ఉండేవాడు. ఫణిదత్తుడు తానై పిలిస్తే వినిపించుకునే వాడు. పలకరించకపోతే ఆక్షేపించేవాడు. సుబాహుడు, ప్రహస్తుడు, వజ్రకాయుడు మాత్రం.. తొలినాడే ఫణిదత్తునికి ఆప్తమిత్రులైపోయారు. నలుగురూ ఆ పాఠశాలలోనే ఉత్తమశ్రేణిలో నిలిచేవారు.భీముని పట్ల దుర్యోధనునికి ఉన్నట్లుగా.. రుక్మవర్మ మాత్రం ఫణిదత్తుడితో ఈర్ష్యతోనే మెలిగేవాడు. కాలక్రమంలో ఫణిదత్తునికి పద్దెనిమిదేళ్ల వయసు వచ్చింది.
* * *
ఒకనాడు చేతిలో ఒక పత్రికతో నందుడు పాఠశాలకు వచ్చాడు. విద్యార్థుల సాముగరిడీలను పరిశీలించాడు. చివరిగా ఫణిదత్తుని చేయిపట్టుకుని.. “నాయనా! నీ జెట్టితనం ప్రశంసనీయంగా ఉంది. ఇదిగో.. మనకు కాశీనుంచి ఆహ్వానపత్రిక వచ్చింది. అక్కడ మల్లయుద్ధ పోటీలు జరగబోతున్నాయట. గెలిచినవారికి రతనాల గండపెండేరం ఇస్తారట. మన పాఠశాలలో సమర్థులైన విద్యార్థులుంటే పంపమని రాశారు. యువరాజుతోపాటు మీ నలుగురూ, మరికొంతమంది కలిసి కాశీకి వెళ్లిరండి. రేపే ప్రయాణం” అని చెప్పాడు. తండ్రిమాటలు రుక్మవర్మకు బొత్తిగా రుచించ లేదు. కానీ, మారుమాట్లాడే ధైర్యం లేకపోయింది. మేలుజాతి గుర్రాలనెక్కి వీరులందరూ కాశీకి ప్రయాణం కట్టారు. నెల వ్యవధిలో కాశీకి చేరుకున్నారు. కాశీరాజు వీరికి తగిన విడిదిని ఏర్పాటు చేశాడు. పోటీలు ప్రారంభమయ్యాయి. దేశదేశాలనుంచి వందలకొద్దీ మల్లవీరులు వచ్చారు. ఆ పోటీలు సుదీర్ఘంగా ఆరునెలలపాటు కొనసాగాయి. అక్కడకూడా రుక్మవర్మ ఎప్పుడూ ఫణిదత్తునితో కలిసేవాడు కాదు. మిగిలినవారిని కూడగట్టుకుని అతనిపై కుట్రలు పన్నుతుండేవాడు. ఫణిదత్తుడు చేసే సాధనల వివరాలను ఇతర యోధులకు మిత్రధర్మంగా తెలియచేస్తూ.. అతణ్ని వధిస్తే బహుమానమిస్తానని చెబుతుండేవాడు.
అది తెలిసి, సుబాహుడు మొదలైన ముగ్గురూ ఫణి దత్తుణ్ని ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టేవారు కాదు. మొత్తంమీద ఆరునెలల తరువాత పోటీలలో దక్షిణాదికి చెందిన వీరమల్లుడనేవాడు విజేతగా నిలిచాడు. మిగిలిన పాఠశాలల వాళ్లందరూ వాడికి దాసోహమని పలికారు.
“రుక్మవర్మా! ఇంక మీ పాఠశాల వంతు మిగిలింది. మీలో వీరమల్లునితో పోరగలవారుంటే ముందుకు రావచ్చు” అని పలికాడు. అప్పుడు రుక్మవర్మ పైకి లేచి.. “మహారాజా! ఈ వీరమల్లుని ప్రతాపం చూస్తూనే ఉన్నాం. అతని దేహం వజ్రపుముక్కే కానీ, చర్మాస్తిమయం కాదు. ఆరునెలల నుంచి ఒంటిచేత్తో ఎదురొడ్డిన ప్రతివారినీ గెలుస్తూనే ఉన్నాడు. కొద్దిగా కూడా చెక్కుచెదరలేదు. వానితో పోరాడగలిగేవాడు మా పాఠశాలలో నేను తప్ప మరెవరూ లేరు. కానీ.. నాకీ ఊరు వచ్చింది మొదలు నీరుపడక దేహంలో స్వస్థత లేదు. ఇప్పుడు నేను పోరాడలేను. కనుక మీరు గండపెండేరం అతనికే ఇవ్వవచ్చు” అన్నాడు. “సరే!” అని సభనుద్దేశించి, వీరమల్లుని గెలుపును ప్రకటించే ముందుగా.. “ఓ మహాయోధులారా! ఈ జెగజ్జెట్టితో తలపడేవారింకా ఉంటే మందుకు రావచ్చు” అని చాటాడు. ఆ మాటలు విని, సుబాహుడు ముందుగా పైకి లేచాడు. అతని తరువాత ప్రహస్తుడు, వజ్రకాయుడు ఒకరి తరువాత ఒకరుగా వీరమల్లునితో ద్వంద్వయుద్ధానికి తలపడ్డారు. కానీ, ఎవరూ నిలవలేకపోయారు. చివరిగా ఫణిదత్తుడు ముందుకు వచ్చాడు. దండలు చరుస్తూ వీరమల్లునితో కలబడి అతిభీకరమైన విద్యా ప్రదర్శనం చేశాడు. వారి యుద్ధం మూడురోజులపాటు కొనసాగింది. మూడోనాడు ఫణిదత్తుడు వీరమల్లుణ్ని ఎత్తి కిందపడవేశాడు. జయసూచకంగా మల్ల చరిచాడు. సభాసదులందరూ జయజయ ధ్వానాలు పలికారు. ఫణిదత్తుని గెలుపును తట్టుకోలేనివారు రుక్మవర్మతోపాటు ఆ సభలో మరికొందరు కూడా ఉన్నారు.
“ఆరునెలల నుంచి అలసిపోయి ఉన్నవాణ్ని గెలవడం గొప్పతనం కాదు. తగినంత విరామం ఇచ్చి.. ఆ తరువాత మరోసారి ఫణిదత్తుడు అతనితో తలపడాలి” అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “సరే! మీరు చెప్పినట్లే మరోసారి పోటీచేసి వీడినెత్తి కుదెయ్యకపోతే.. వీడి చెప్పులు తలమీద మోస్తాను” అని శపథం చేశాడు ఫణిదత్తుడు. కాశీరాజు విస్మయుడవుతూ.. తదుపరి పోటీకి నెలరోజుల గడువు పెట్టాడు. అంతవరకూ పోటీకి వచ్చిన మల్లవీరులందరూ కాశీపట్టణంలోనే విహరించసాగారు. * * * ఒకనాడు ఫణిదత్తుడు సుబాహుడు మొదలైనవారితో కలిసి గంగానదిమీద నౌకావిహారం చేస్తున్నాడు. గంగా తరంగాలమీద ఊయలలూగుతున్న నీటిపక్షులను చూస్తూ.. పూలసువాసనలతో కూడిన పిల్లగాలులను ఆస్వాదించసాగాడు. ఆ సమయంలో సాయంకాల సూర్యునిలా ఎర్రనైన ముఖం ఒకటి తటాలున నదిపైకి తేలి అంతలో మునిగిపోవడం అతని కంటపడింది. వెంటనే రత్నకంకణాలు, అంగుళీకాలు దాల్చిన రెండు చేతులు పైకి లేవడం చూశాడు. “నావను ఆపండి. ఎవరో మునిగిపోతున్నారు” అని అరిచాడు ఫణిదత్తుడు. అతను చూపించినవైపు చూస్తే మిగిలినవాళ్లకు ఏమీ కనిపించలేదు. అప్పుడు నావికులు.. “వద్దు బాబూ! అది మొసలి లాంటిది. దిగిన వారిని పట్టి చంపుతుంది. ఇంతకుముందు నీలాగే జాలిపడి నీటిలో దూకినవాళ్లెవరూ తిరిగి రాలేదు” అని చెప్పారు.
ఇంతలో అదే దృశ్యం మరోసారి ఫణిదత్తుని కళ్లముందు కదలాడింది. వెంటనే మరేమీ ఆలోచించకుండా ఫణిదత్తుడు నీటిలోకి దూకాడు. వేగంగా ఈదుకుంటూ వెళ్లి ఆ రెండుచేతులనూ పట్టుకుని పైకి లాగబోయాడు. వెంటనే ఆ వనిత ఇనుపగుండులా బరువైపోయింది. తనతోపాటు ఫణిదత్తుణ్ని కూడా నీటి అడుగుకు లాక్కుపోయింది.
సుబాహుడు మొదలైన మిత్రులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నదిలోకి దూకారు. ఆ రోజంతా ఫణిదత్తుని గురించి వెతుకుతూనే ఉన్నారు. కానీ లాభం లేకపోయింది. నీటివాలున ఫణిదత్తుడు కొట్టుకుపోయాడని, ఈపాటికి మరణించి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు.