‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా విడుదలకు ముందు చాలా కంగారుపడ్డాను అంటున్నాడు దర్శక, నిర్మాత కరణ్ జోహార్. దాదాపు ఏడేండ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోవడంతో.. కాస్త ఆందోళన చెందానని చెప్పుకొచ్చాడు. ‘గడిచిన మూడేండ్లు నా జీవితంలో చాలా భారంగా గడిచాయి. కరోనా దెబ్బతో ప్రపంచం అతలాకుతలమైంది. మా సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది.
వ్యక్తిగతంగా నేనైతే చాలా ఒత్తిడికి లోనయ్యాను. ‘రాఖీ.. రాణీ..’ సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఏదో తెలియని ఉద్వేగానికి గురయ్యాను. దాన్ని తట్టుకోలేక ‘సినిమా ఎలా ఉంది?’ అంటూ పది మంది అభిప్రాయాలు తెలుసుకున్నాను. ఇలా విడుదలకు ముందు సినిమా ఎలా ఉందని అడగటం నా జీవితంలో ఇదే మొదటిసారి. సినిమా విడుదలై మంచి విజయం సాధించడంతో ఊపిరి పీల్చుకున్నా. ప్రేక్షకులు చూపిన ఆదరణ తట్టుకోలేక గదిలోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చేశాను’ అని చెప్పుకొచ్చాడు కరణ్. ‘రాఖీ.. రాణీ..’ సక్సెస్ ఇచ్చిన కిక్తో మరిన్ని సినిమాలు చేయడంలో బిజీగా ఉన్నాడు కరణ్. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న మూడు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ‘యోద్ధ’ ఈ డిసెంబర్లో విడుదల కానుంది.