ఎన్ఐఏ ఏజెంట్ వైష్ణవిగా ‘స్పై’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన నటి ఐశ్వర్య మేనన్. ఆ తరువాత ‘భజే వాయు వేగమ్’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ రెండు చిత్రాలూ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నది ఈ భామ. ఒకవైపు కన్నడ, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు టాలీవుడ్లోనూ పాగావేసిన ఈ ముద్దుగుమ్మ ఈసారి ‘నాగబంధం’తో రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న కార్వాన్ కబుర్లు ఇవి.
మాది వాస్తవానికి కేరళం రాష్ట్రం. కొన్ని కారణాల వల్ల తమిళనాడులోని ఈరోడ్కు వలసొచ్చి అక్కడే స్థిరపడ్డాం. దీంతో నా బాల్యమంతా తమిళనాడులోనే గడిచింది. బీటెక్ వరకు చదువుకున్న నాకు సినిమాల్లో నటించాలనే బలమైన కోరిక ఉండేది. ఆ ఆసక్తితోనే అవకాశాల కోసం ప్రయత్నించి కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాను.
నాకు సంతోషం వచ్చినా, బాధ కలిగినా సోషల్మీడియాలో వ్యక్తం చేయడం అలవాటు. బాధకంటే ఆనందాన్నే ఎక్కువగా పంచుకుంటాను. ఓ సందర్భంలో నా ఫొటోలను పోస్ట్ చేయగా.. సినిమా ఆఫర్ల కోసం ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తుందని చాలామంది బ్యాడ్ కామెంట్లతో విమర్శించారు. నన్ను ద్వేషించేవారికి నేను చెప్పేది ఒక్కటే. మీరు ఎగతాళి చేసినా, విమర్శించినా ఒకరికోసం నా అలవాటును మార్చుకోను.
ఇతర భాషల్లో చేస్తున్న సినిమాలు మంచి ఆదరణకు నోచుకుంటున్నాయి. అందుకే తెలుగులోనూ నా టాలెంట్ను నిరూపించుకునేందుకు వచ్చాను. గతంలో నేను నటించిన రెండు టాలీవుడ్ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. అయినా కూడా ఇక్కడ నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నాను. విజయానికి ముందు ఓటమి ఎదురవుతుందంటారు కదా. ఆ పాలసీనే నేను ఫాలో అవుతున్నా. కచ్చితంగా సక్సెస్ అవుతా.
‘నాగబంధం’ ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక, అడ్వెంచర్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందిన సినిమా. అనంత పద్మనాభస్వామి ఆలయం, అక్కడి నాగబంధం రహస్యాల కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విరాట్ కర్ణ, నభా నటేశ్లతో కలిసి సినిమాలో నటించడం కొత్త అనుభూతినిచ్చింది.
నా అభిమాన నటుడు మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి గారే. ఆయనతో ఒక్కసారైనా నటించాలనే కోరిక ఉండేది. ఆ అవకాశం అంత త్వరగా వస్తుందని అస్సలు ఊహించలేదు. ఆయనతో కలిసి నటించడాన్ని నేను ఎన్నటికీ మరిచిపోలేను. మమ్ముట్టి నటించిన బజూకా సినిమాలో నేను కీలకపాత్ర పోషించాను. ఈ చిత్రంలో నా నటనకు మంచి మార్కులే పడ్డాయి.