బొమ్మ అంటే బొమ్మే కాదు. ప్రతి బొమ్మ వెనుకా ఓ ఆసక్తికరమైన కథ ఉంటుంది. ఆ కథకు నీతి ఉంటుంది. ఆ నీతికి ఏదో ఓ శ్లోకంతో మూలం ఉంటుంది. పిల్లలకు మనం కొనిపించే బొమ్మలే వాళ్ల వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తాయి. విరల్ మోదీ, అవని సర్కార్ పురాణ బొమ్మల ప్రాజెక్టు లక్ష్యం కూడా ఇదే.
పాత తరానికి బడిలో గురువులు, గుడిలో పూజారులు, ఇంట్లో పెద్దలు పురాణాల కథలు చెప్పేవారు. దివ్య పురుషుల గాథలు వివరించేవారు. కానీ నేటి తరానికి ఆ అదృష్టం లేదు. ఈ సంక్షోభాన్ని అర్థం చేసుకున్నారు అమెరికాలో స్థిరపడిన భారతీయ మూలాలున్న అన్నాచెల్లెళ్లు.. విరల్ మోదీ, అవని మోదీ సర్కార్. ఇద్దరూ కలిసి పురాణ పాత్రల బొమ్మలను తయారుచేస్తున్నారు. అలా దేశవిదేశాల్లోని భారతీయులకు మన పురాణాలపై అవగాహన కల్పిస్తున్నారు. పదేండ్లలోపు వయసులోనే వారి కుటుంబం న్యూజెర్సీలో స్థిరపడింది. అయినా మూలాలను మరిచిపోకుండా పెంచారు కన్నవారు. ఇంట్లో మాతృభాషనే మాట్లాడేవారు. సంస్కృతి, సంప్రదాయాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. టీవీలో ఎప్పుడూ భారతీయ కార్యక్రమాలే చూపేవారు. కొంతకాలం క్రితం ఇటు అవని, అటు విరల్ భార్య పండంటి ఆడపిల్లలకు జన్మనిచ్చారు. రెండు ఇండ్లలోనూ మహాలక్ష్మి అడుగుపెట్టిందని సంతోషించారంతా. ఆ క్రమంలోనే భారతీయ పురాణాలను కొత్తతరానికి తెలియ జెప్పాలని అనుకున్నారు. అలా వచ్చిందే పురాణాల బొమ్మల ఐడియా. దాంతో పురాణ పురుషుల బొమ్మలతో వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ‘మోదీ టాయ్స్’ పేరుతో అమెరికాలోనే కంపెనీ మొదలుపెట్టారు.
“నన్ను, ఇద్దరు అన్నయ్యలను అమెరికాలోనే పెంచి పెద్దచేసినా, భారతీయతకు ఏమాత్రం దూరం చేయలేదు. ఇంట్లో భారతీయ వంటకాలు తిన్నా, మాతృభాష మాట్లాడినా, తెలియకుండానే కొంత అమెరికన్ జీవనశైలిని ఒంట బట్టించుకున్నామని ఒప్పుకోక తప్పదు. నేను కూడా భారతీయ పురాణాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. నా కూతురు, మేనకోడలు పుట్టగానే వాళ్లకు భారతీయ పురాణాలపై అవగాహన కల్పించాలని అనుకున్నాం. శ్లోకాలను, పాటలను నేర్పించాలని నిర్ణయించుకున్నాం. వినాయకుడు, కృష్ణుడు, రాముడు తదితర పురాణమూర్తుల బొమ్మలను తయారుచేస్తున్నాం. కొంత టెక్నాలజీ జోడించి వినాయకుడి పొట్ట దగ్గర నొక్కితే శ్లోకాలు వినిపించేలా డిజైన్ చేశాం” అని వివరిస్తారు అవని మోదీ సర్కార్.