‘బుద్ధి మారాలి. లింగ వివక్షను ఎత్తి చూపే తీరు మారాలి. ఈ సృష్టిలో అంతా సమానమే అనే భావన రావాలి. అందుకు మీరు ఊఁ అనాల్సిందే. ఈ స్మార్ట్ యుగంలో కూడా ఇంకా మీరు ఉఁ ఉఁ అంటూ కూర్చుంటే నాలాంటి డ్రాగ్ ఆర్టిస్టులు పుట్టుకొస్తూనే ఉంటారు’ అంటున్నాడు హైదరాబాద్కు చెందిన పాత్రుని చిదానంద శాస్త్రి. లింగ వివక్షను రూపుమాపేందుకు డ్రాగ్ కళను ఆయుధంగా చేసుకొని.. ఎంతోమందికి అవగాహన కల్పిస్తున్నాడు శాస్త్రి.
మ న చుట్టుపక్కల ఎవరైనా ఎంతోకొంత వేరుగా కనిపిస్తే చాలు ‘అరేయ్ చూడు.. వాడు కచ్చితంగా తేడా గాడే’.. అంటారు. ఇంకొందరైతే ఒక అడుగు ముందుకేసి ‘చూడు పిన్నమ్మా.. పాడు పిల్లాడు పైన పైన పడతనంటాడు’ అంటూ ఆటపట్టిస్తారు. పొట్టకూటి కోసం చప్పట్లు కొడుతూ వీధుల్లో యాచించే ట్రాన్స్జెండర్స్ కనిపిస్తే.. కొందరికి ఎక్కడలేని కోపం. ‘ఛీ ఛీ పాడు జన్మ.. ఎందుకీ బతుకూ’ అంటూ తిట్టిపోస్తారు. ‘వాళ్లేం కావాలని అలా పుట్టలేదు.. పుట్టుకతో వచ్చిన లక్షణాలను పట్టుకుని ఎదుటి మనిషిని అవమానించడం అన్యాయం. భూమ్మీద తేడాగా పుట్టడమే నేరమా? బతికే హక్కే లేదా? తేడాగా కనిపిస్తే చాలు హేళనగా చూస్తారా? ఇంకానా ఇకపై చెల్లదు. ఈ సృష్టిలో అంతా సమానమే’ అంటున్నాడు చిదానంద శాస్త్రి.
డ్రాగ్ ఆర్ట్ విదేశాల్లో చాలా ప్రాచుర్యం పొందిన కళ. ఇది మన‘పగటి వేషం’ వంటిది. అలంకరణ వైవిధ్యంగా ఉంటుంది. హావభావాలూ వేరుగా ఉంటాయి. వ్యక్తికరణ కొన్నిసార్లు సున్నితంగా, కొన్నిసార్లు తీవ్రంగా ఉండవచ్చు. ఎల్జీబీటీ కమ్యూనిటీ నుంచి ఇండియాలో ఈ కళను ప్రదర్శించేవాళ్లలో టాప్-5లో ఉంటాడు చిదానంద శాస్త్రి. తెలుగు రాష్ర్టాల్లో ఏకైక డ్రాగ్ ఆర్టిస్టు శాస్త్రి! ‘విదేశాల్లో ఎల్జీబీటీ వ్యక్తులకు సముచిత గౌరవం ఉంటుంది. మనదేశంలో మాత్రం వారిని విభిన్నంగా చూస్తారు. సమాజంలో ఆ వివక్షను రూపుమాపాలనే ఉద్దేశంతో ఈ కళను ఎంచుకున్నా’ అని చెబుతాడు శాస్త్రి. డ్రాగ్ ఆర్ట్ ద్వారా ఎల్జీబీటీ వర్గాల గురించి అవగాహన కల్పిస్తున్నాడు. అలాగే హెచ్ఐవీ, ఎయిడ్స్, అత్యాచారాలు, నేర ప్రవృత్తి, థర్డ్ జెండర్ హక్కులపై విభిన్న వేషాల ద్వారా అవగాహన పెంచుతున్నాడు.
చిదానంద కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి బెంగాల్లో స్థిరపడింది. శాస్త్రి పదేండ్లుగా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్న ఆయన తన కమ్యూనిటీ ప్రజల కోసం ప్రత్యేకంగా వెబ్సైట్, యూ ట్యూబ్ చానల్స్ నిర్వహిస్తున్నాడు. ఆ వేదికల ద్వారా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఈ తరానికి తన కాన్సెప్ట్ అర్థమవడానికి మీమ్స్, వీడియోలు, ఫొటోలతో వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాడు. చిన్ననాడే భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నాడు. ఇప్పటికీ దాదాపు వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. పాటలు పాడతాడు, రాస్తాడు. కవితలు అల్లుతాడు. షార్ట్ఫిల్మ్స్ చేస్తాడు. నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు. టెడ్ఎక్స్ వేదిక ద్వారా ఐదుసార్లు ప్రసంగించాడు. మరో అవకాశం వస్తే.. తన వాదనను సూటిగా, సుత్తిలేకుండా తెలుగులోనే వినిపించాలని అనుకుంటున్నాడు చిదానంద.
‘చూడు పిన్నమ్మ.. పాడు పిల్లాడు’ ఈ పాట వినగానే ఆలోచనకు వచ్చేది ట్రాన్స్జెండర్సే. వారిని ఏమీ చేతకాని వ్యక్తుల్లా చిత్రీకరించింది నాటి సమాజం. 1957 నుంచి ప్రాచుర్యంలో ఉన్న జానపద గీతాల్లో ట్రాన్స్జెండర్స్ ప్రస్తావన ఉంది. అందుకే అప్పటినుంచి నేటి వరకూ ఉన్న అలాంటి వివక్ష పూరితమైన పాటలను తిరగ రాస్తున్నాడు చిదానంద శాస్త్రి. 1957లో వచ్చిన మాయాబజార్ సినిమాలోని ‘చిరంజీవ చిరంజీవ’ అనే పాటను, 1977లో వచ్చిన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ సినిమాలోని ‘చూడు పిన్నమ్మ’ పాటను తిరగరాసి స్పూటిఫై, యూట్యూబ్, అమెజాన్ మ్యూజిక్లలో విడుదల చేశాడు. వీటితోపాటుగా ‘ప్రైడ్ మాసం అన్నా ఇది.. ప్రైడ్ మాసం’ అంటూ జూన్లో మరో పాటను ఆయా వేదికల ద్వారా విడుదల చేశాడు.