అమాయకుడిపై ‘దొంగ’ అనే ముద్రవేస్తే.. కొన్నాళ్లకు అతనూ దొంగగా మారే ప్రమాదం ఉంది. తప్పులు చేయనివారిపై అభాండాలు వేస్తూ అబద్ధపు ప్రచారం చేస్తే.. సమాజం మీద కసితో వాళ్లూ తప్పులు చేసే అవకాశం ఉంది. ఏ తప్పూ చేయని వాడికి కూడా తప్పు చేయాలనే ఆలోచన వచ్చేలా మాట్లాడుతుంటారు కొందరు. ఇలాంటి సందర్భాలకు సరిపోయే సామెత ఇది. ఎనకటికి ఒక భూస్వామి తన నువ్వుల పంటకు మొండిచేతులోణ్ని కావలి పెట్టిండట. కొద్దిరోజులకు ఎందుకో అనుమానం వచ్చి ‘నువ్వులు బుక్కుతున్నవా?’ అంటూ గద్దించాడు. ‘మొండిచేతులోణ్ని నువ్వులెట్ల బుక్కుత దొర’ అన్నడట. ‘ఎందుకు బుక్కరాదురా మొండిచేతులకు ఉమ్ము అంటించి నువ్వులద్దుకోని తినొచ్చు కదా’ అని చెప్పిండట. తనపై ఎలాగూ దొంగ అనే ముద్ర పడింది కాబట్టి.. ఆ మరుసటి రోజు నుంచి భూస్వామి చెప్పినట్లే బుక్కడం మొదలుపెట్టాడట. ఇప్పటికీ బాధితుడి తరఫున మాట్లాడుతూ ‘మొండిసేతులోనికి నూలు బుక్క నేర్పకు’ అంటుంటారు పెద్దలు.