ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ప్రతి విప్లవానికి సాంకేతిక పరిణామమే మూలంగా నిలుస్తున్నది. వ్యవసాయం నుంచి పారిశ్రామిక విప్లవం వరకు, ముద్రణా యంత్రం నుంచి డిజిటల్ కమ్యూనికేషన్ వరకూ ప్రతి మార్పు మానవ సమాజాన్ని కొత్త దిశలో నడిపించింది. ముఖ్యంగా సినిమా రంగం కాలానుగుణంగా రూపాంతరం చెందుతుండటం విశేషం. ఒకప్పుడు టాకీ చిత్రాలుగా, నలుపు తెలుపు సినిమాలుగా, రంగుల చిత్రాలుగా, ఫిలిం రీల్స్ వంటి దశలను దాటి నేడు ఏఐ ఆధారిత హైబ్రిడ్ ఫిలిం మేకింగ్ వైపు సినీరంగం వేగంగా ప్రయాణిస్తున్నది. ప్రస్తుత సినిమా నిర్మాణంలో ప్రీ-ప్రొడక్షన్ నుంచి పోస్ట్- ప్రొడక్షన్ వరకు అనేక దశల్లో అవసరమయ్యే భారీ సమయం, అపారమైన శ్రమ, కోట్లాది రూపాయల పెట్టుబడిని తగ్గించేందుకు మానవ మేధకు కృత్రిమ మేధ తోడవుతుంది. సంప్రదాయ సినీ సృజనాత్మకతకు కొత్త సాంకేతికత ఎలా తోడవుతున్నదో ‘హైబ్రిడ్ ఫిలిం మేకింగ్’లో స్పష్టంగా వివరించారు రచయిత ముద్దం నరసింహ స్వామి.
కథ ఆలోచన నుంచి స్క్రీన్ప్లే, ప్రీ-విజువలైజేషన్ నుంచి షూటింగ్, వర్చువల్ ప్రొడక్షన్ నుంచి వీఎఫ్ఎక్స్, డిజిటల్ విజువల్ డిజైన్ నుంచి ఆటోమేటెడ్ ఎడిటింగ్ వరకు ప్రతి దశలో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. అయితే సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ‘ఏఐ మనిషిని రిప్లేస్ చేస్తుందా?’అనే వాదన చాలామందిలో వినిపిస్తున్నది. కానీ, ఏఐ మనిషిని భర్తీ చేయడానికి రాలేదన్న సంగతి అర్థం చేసుకోవాలి. కళాకారుడి సృజనాత్మకతను మరింత విస్తరించడానికి ఇది వచ్చింది. కథను పుట్టించేది, దానికి భావోద్వేగాన్నిచ్చేది మనిషి మాత్రమే. ఏఐ వాటికి వేగాన్ని, దృశ్య వైభవాన్ని మాత్రమే అందిస్తుంది. ఇది మనకు ప్రత్యర్థిగా కాకుండా సృజనాత్మకత కలిగిన సహచరుడిగా మాత్రమే పరిగణించడం మంచిది. కళాకారుడు ‘కవి’ అయితే సాంకేతికత ‘కాగితం’ అవుతుంది. ఈ రెండిటి కలయిక అద్భుతమైన దృశ్య కావ్యాలకు పునాది. టెక్నాలజీ, క్రియేటివిటీ కలిసినప్పుడే హైబ్రిడ్ ఫిలిం మేకింగ్ పూర్తి రూపం దాల్చుతుంది. భవిష్యత్తులో ఇవి రెండూ కలిస్తే ప్రపంచ వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆవిష్కృతమయ్యే అవకాశాలున్నాయి. కొత్తగా సినీరంగంలోకి అడుగుపెట్టే వారికి మార్గనిర్దేశం చేసే పుస్తకమిది.
రచయిత: ముద్దం నరసింహ స్వామి
పేజీలు: 203, ధర: రూ.500
ప్రతులకు: మీడియా బుక్ హౌస్, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్
-రాజు పిల్లనగోయిన