సముద్రానికి సహనం ఎక్కువ. ఎన్ని వ్యర్థాలు వేసినా, ఎంత చెత్త తోసినా అలలు వాటిని ఒడ్డుకు చేరుస్తూనే ఉంటాయి. కాబట్టే, సంద్రం స్వచ్ఛతకు చిరునామా అయ్యింది. పర్యావరణాన్ని కాపాడటం తన బాధ్యతగా భావిస్తాడు సముద్రుడు. నాగరిక సమాజం మాత్రం ఆ సహనాన్ని బలహీనతగా భావిస్తున్నది. సామాజిక స్పృహను కోల్పోయి సముద్రాలను మురికి కూపాలుగా మారుస్తున్నది. దేశ ఆర్థిక రాజధాని ముంబై సముద్ర తీరం వ్యర్థాలకు నిలయం కావడంతో ఎన్నో సముద్ర జీవజాతులు అంతరించి పోతున్నాయి. ఈ విపరిణామంతో విస్తుపోయిన విద్యార్థులు, ఉద్యోగులు మేధావులు, పర్యావరణ ప్రేమికులు చేతులు కలిపి బీచ్లకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు.
ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తున్నప్పుడు.. వాళ్లకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. పర్యావరణ ప్రేమికులూ అంతే. కాబట్టే, ఎక్కడెక్కడి వాళ్లంతా కలిసి, ‘యునైటెడ్ వే ముంబై’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ముంబైలోని దాదర్ తీరం నుంచి మలాద్ తీరం వరకూ తొమ్మిది బీచ్లను దత్తత తీసుకున్నారు. చిన్న ప్లాస్టిక్ కవర్ నుంచి, పెద్దపెద్ద వ్యర్థాల వరకూ అన్నిటినీ ఏరిపారేస్తున్నారు. ముంబైలోని సముద్ర తీరం రక్షణకు ఏర్పడిందీ ఎన్జీఓ. సముద్ర తీరాన్ని శుభ్రంగా ఉంచుతూ, సందర్శకులకూ అవగాహన కల్పిస్తున్నారు.
దాదర్ నుంచి మలాద్ వరకూ..
సెప్టెంబర్ చివరి వారంలో గణేశ్ నిమజ్జనాలు జరిగాయి. ముంబైలోని బీచ్లలో ఎటు చూసినా వినాయక విగ్రహాలే. మహిమ్ బీచ్లో ప్రతిమల తాకిడి భారీగా ఉండటంతో, ముంబై మున్సిపల్ కార్మికులకు సైతం వాటిని తొలగించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ‘యునైటెడ్ వే ముంబై’కి చెందిన 40 మంది విద్యార్థినులు ఆ శిథిల విగ్రహాలను తొలగించేందుకు సాయపడ్డారు. ఇతర వ్యర్థాలను కూడా సేకరించి కార్మికులకు అప్పగించారు. 2017 నుంచి తాము దత్తత తీసుకున్న బీచ్ల నుంచి నేటి వరకు దాదాపు మూడున్నర లక్షల కిలోల వ్యర్థాలు సేకరించారు. వాటిలో ఓ లక్ష కిలోల వ్యర్థాలను రీసైక్లింగ్ కేంద్రాలకు పంపారు. తాము దత్తత తీసుకున్న తొమ్మిది బీచ్లకు తొమ్మిది మంది సూపర్వైజర్లు ఉన్నారు. వీరు నిత్యం బీచ్లను పర్యవేక్షిస్తుంటారు. వలంటీర్ల బృందం చెత్త సేకరించడంతో పాటుగా, సందర్శకులకు దీని వల్ల కలిగే నష్టాలను వివరిస్తుంది. సముద్ర కాలుష్యం కారణంగా అంతరించిపోతున్న సముద్ర జీవుల గురించి అర్థవంతంగా వివరిస్తారు. సముద్ర తీరం పొడవునా గోడలకు పెయింటింగ్ వేయడం నుంచి ప్రతీది బాధ్యతగా తీసుకుంటారు. అక్కడక్కడా చెత్తకుండీలు ఏర్పాటు చేస్తారు. పరిసర నివాస ప్రాంతాల్లో డస్ట్ బిన్స్ పంపిణీ చేస్తున్నారు.
115 కొత్త జీవుల గుర్తింపు
2017 నుంచి ‘యునైటెడ్ వే ముంబై’ చేపట్టిన సముద్రతీర సంరక్షణ పనులు ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇస్తున్నాయి. 2020లో ముంబైలోని పలు బీచ్లలో కొత్తగా 115 జీవుల ఉనికిని గుర్తించారు శాస్త్రవేత్తలు. బీచ్ చింబైలో అరుదైన వృక్షజాలాన్ని, జంతుజాలాన్ని కనిపెట్టారు సముద్ర నిపుణులు. ఈ ప్రయత్నంలో భాగంగా ‘మెరైన్ ఫీల్డ్ గైడ్’ను కూడా రూపొందించారు. దీనివల్ల ఆయా బీచ్లలో ఎలాంటి జంతుజాలం, వృక్షజాలం ఉందనే సమాచారం సందర్శకులకు తెలుస్తుంది. ‘మేం కనుగొన్న జాతులు మమ్మల్ని మంత్రముగ్ధులను చేశాయి. తీర రక్షణ కోసం పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లి విద్యార్థులకు, ఉద్యోగులకు సముద్ర జీవుల గురించి అవగాహన కల్పిస్తాం’ అంటున్నారు ‘యునైటెడ్ వే ముంబై’ వైస్-ప్రెసిడెంట్ అజయ్ గోవాలే. ఈ ఎన్జీవో ద్వారా ఒక్క బీచ్ల పరిరక్షణే కాకుండా.. అన్నార్థుల ఆకలి తీర్చడం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, బడుగులకు నిత్యావసర వస్తువులు అందించడం వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.