తెలంగాణ జానపదులకు ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ. పిల్లల నుంచి పెద్దల వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పండుగ ఏటా ‘పెత్రమాస’కు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. భాద్రపద అమావాస్యను పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు. పితృ అమావాస్యే పెతర అమాస.. పెత్రమాస.. పిత్రమావాస్య పేర్లతో వాడుకలో ఉంది. దీనినే మహాలయ అమావాస్య అనీ పిలుస్తారు. పెత్రమాసనాడు ప్రారంభించిన బతుకమ్మకే విలువ. ఈ అమాసకే పెద్దలకు బియ్యమిస్తారు. అష్టమి, నవమి పంచాంగాన్ని నమ్మేవాళ్లు ఈ తిథుల్లో ముఖ్యమైన పనులు చేపట్టరు. పేదలకు వీలైనన్ని దానాలు చేయడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం. భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకు ఉన్న 15 రోజులు పితృపక్ష మహాలయంగా చెప్తారు.
దోసకాయ పలారం నాకు.. దోసెడు పాటలు మీకు
బతుకమ్మ పండుగలో పునాస దోస ప్రత్యేకతే వేరు. బతుకమ్మ ప్రసాదంలో పునాస దోస లేకుండా ఉండదు. అమ్మకు ఇష్టమైన ప్రసాదాలలో పునాస దోసకాయ ఒకటి. ఇది దేశీయమైన దోసజాతే. వానకాలంలో జొన్నచేలలో, మక్కతోటల్లో, పెరట్లలో కర్రలకు పాకుతూ విరగకాస్తాయి. ఒక్కోకాయ మూరెడు పొడవు ఉంటుంది. ఒకటి కోస్తే.. నలుగురి ఆకలి తీరుతుంది. బతుకమ్మ నైవేద్యాలలో దోసకాయ తప్పనిసరి. దోసకాయ తరిగి, పెరుగన్నంలో కలిపి దద్దోజనం పెడతారు. దోసకాయ చల్లదనమే వేరు. పైగా చాలా రుచిగానూ ఉంటుంది.
1. బొడ్డెమ్మ సిబ్బి = బతుకమ్మను పేర్చేందుకు ఉపయోగించే సిబ్బి (బొడ్డెమ్మ పండుగత్తుందంటే ఒల్లు పులకరిత్తుంది.
తీరొక్క పూలు తేవాలె, కొత్త బట్టలు కొనాలె, కొత్త పాటలు నేర్వాలె. అన్నింటికిమించి మేదరోల్ల దగ్గర మంచి బరికెలతో సిబ్బి చేయించాలె). సిబ్బిపై గుమ్మడి ఆకులు పరిచిన తర్వాత గునుగు పూవ్వులు మొదలు తీరొక్క పూలను పేర్చుకుంటూ వెళ్తారు.
2. సత్తు బుక్కుడు = సత్తుపిండి తినడం (బతుకమ్మ పడుగప్పుడు సత్తుపిండితో ప్రత్యేకంగా కొన్ని పదార్థాలు చేస్తారు. వాటిని కొందరు బుక్కుతూ (తింటూ) ఉంటారు. పాటలు పాడినంక సత్తుపిండిని బుక్కి ఆకలి తీర్చుకుంటారు.)
అరుగు మీద అక్కమ్మ ఉయ్యాలో.. అచ్చన్నలాడంగ ఉయ్యాలో
బతుకమ్మ ఆటల్లోనే కాదు.. పాటల్లోనూ పల్లె జీవనం ఉట్టిపడుతుంది. మహిళలు తీరిక సమయాల్లో అరుగులపై కూర్చొని అచ్చన్నలాడేవారు. అచ్చన్నలంటే.. అచ్చందకాయలాట. కొన్నిచోట్ల ‘అచ్చనగిల్లలాట’ అంటారు. నాలుగైదు గచ్చ(కచ్చ)కాయలను చేతుల్లోకి తీసుకొని, ఒకచేతిని ద్వారంలా పెట్టి.. ఎగరేసిన గిల్లను చేతితో పట్టుకునేంతలో మరో గిల్లను ఆ ద్వారంలోకి నెట్టడం. ఈ క్రమంలో ఎగరేసిన గిల్లను పట్టుకోకపోతే.. ఎదుటివారికి ఆడే అవకాశం ఇవ్వాలి. ఈ ఆట ఆడేందుకు, చూసేందుకు ముచ్చటగా ఉంటుంది. గచ్చకాయలకు ప్రత్యామ్నాయంగా ముగ్గురాళ్లతో, గుండ్రటి ఇసుకరాయితోనూ ఈ ఆట ఆడతారు.
జంబి కింద రాత
బతుకమ్మ, దసరా పండుగల్లో ముఖ్యమైన ఘట్టం ‘జంబికింద రాత’. గ్రామం నడిబొడ్డులో, లేదా ఆరుబయలు స్థలంలో జంబి/జమ్మిమండ(కొమ్మ)ను తీసుకొచ్చి పాతుతారు. ఆ మండ దగ్గర డప్పులు, కోలాటాలు, ఆటపాటల కోలాహలం కనిపిస్తుంది. పూజారి సహా గ్రామపెద్దలు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత పూజారి ఓ కాగితంపై ఊరి భౌగోళిక చరిత్ర రాస్తాడు. ఆ తర్వాత గ్రామస్తులు ఎవరికివారు చిన్నచిన్న కాగితాలమీద ‘శమీశమయతే పాపం…’ అనే శ్లోకం రాసి, తమ ఆదాయ వ్యయాలను నమోదుచేసి అక్కడ ఉంచి పూజలు చేస్తారు. తర్వాత ఆకు తెంపుతారు. తర్వాత దానిని ‘బంగారం’గా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని, అలయ్బలయ్ చేసుకుంటారు. అయితే ఇలా రాసే లెక్కల్లో కొన్ని దొంగలెక్కలు కూడా ఉంటాయి. వాటికి అంత ప్రాధాన్యం ఉండదు. అందుకే, ‘జంబి (జమ్మి) కింద రాత’ అనే పలుకుబడి దొంగలెక్క అనే అర్థంలో వ్యంగ్యంగా ప్రచారంలో ఉంది.
3. అర్రెం = విడువదగినది. వర్జ్యం – వర్జెం – అర్జెం – అర్రెంగా మారి ఉండొచ్చు. (బతుకమ్మ పండుగ ఆరో రోజును అర్రెం అంటారు. ఆరోజు బతుకమ్మ ఆట ఆడరు. పాటలే పాడతారు. మధ్యలో ఒకరోజు విశ్రాంతి తీసుకోవడాన్నీ ‘ఆరాం’ అంటారు.)
4. మలీద ముద్దలు = బియ్యంపిండితో చేసే నైవేద్యం (బియ్యపుపిండితో రొట్టెలను చేసి, తుంపి.. వాటికి చక్కెర కలిపి ఉండలుగా చేస్తారు. సద్దుల బతుకమ్మ నాడు వాయినం ఇచ్చుకుంటూ పంచుతారు. కొన్నిచోట్ల అటుకులు, బెల్లం, మలీదలు బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు)
-డప్పు రవి