ఓ విషయం గురించి నిష్పాక్షికంగా ఆలోచించాలన్నా, రాయాలన్నా దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. అదే సమయంలో, దాంతో ఎలాంటి భావోద్వేగ సంబంధమూ ఉండకూడదు. ఆ రకమైన అనుబంధమే ఉంటే మన ఆలోచనల్లో, రాతల్లో పక్షపాతం చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఈ కారణంగానే నేను రామానంద తీర్థులవారి గురించి నిష్పాక్షికంగా రాయలేను. స్వభావరీత్యా నేను అహంకారిని కాదు. అదే సమయంలో పెద్దలుగా కనిపించే ప్రతివారి కాళ్లకీ మొక్కేంత విధేయతా లేదు. అయితే, ఇదే లక్షణం కారణంగా నా భక్తిని, విధేయతలను ఒకరిద్దరు అర్హులకు మాత్రమే అందించే అవకాశం లభించింది. గత నాలుగు దశాబ్దాలలో నాకు ఎదురు పడిన అత్యంత పూజ్యనీయులలో రామానంద తీర్థులు ఒకరు. ఆ మహనీయుడి గురించి నిష్కర్షగా రాయడం కష్టమే. దాని బదులు స్వామీజీ మహనీయ వ్యక్తిత్వాన్ని నా దృష్టికోణం నుంచి వివరించే ప్రయత్నం చేస్తాను.(తనను అమితంగా ప్రభావితుడిని చేసిన స్వామి రామానంద తీర్థ గురించి పీవీ రాసిపెట్టుకున్న ఒక అముద్రిత వ్యాసం)
నాటి హైదరాబాద్ సంస్థానంలో పేరుకు మాత్రమే మూడు ముఖ్యభాషలు. నిజానికది బహుభాషా నిలయం. ఈ గడ్డమీద ఎందరో దేశభక్తులు, నాయకులు జన్మించారు. ప్రతి రంగంలోనూ ప్రముఖంగా ఎదిగి, హైదరాబాద్కు గర్వకారణంగా నిలిచారు. రాష్ట్రంలో ఎక్కడనుంచి వచ్చినా సరే, హైదరాబాద్నే తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ఇక్కడినుంచే పని చేస్తూ తమ స్ఫూర్తిని జిల్లాలకు వ్యాపింపచేశారు. ఒక ప్రాంతానికి చెందిన వారుగా గుర్తింపు పొందలేకపోయారు. రామానంద తీర్థ ఇందుకు మినహాయింపు. కన్నడిగుడిగా జన్మించాడు కాబట్టి, కర్ణాటక వారికి సొంతవాడయ్యారు. మరాఠ్వాడ ప్రాంతంలో తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారు కాబట్టి, మహారాష్ట్రీయులకు ప్రియతముడయ్యారు. ఇక, తెలంగాణకు చేరుకున్న తర్వాత ఆయన రాజకీయ వ్యక్తిత్వం పరిపక్వతను అందుకుంది. తెలంగాణ సమస్యలను పరిష్కరించడానికి తన రాజకీయ జీవితాన్ని, నాయకత్వాన్నీ పూర్తి స్థాయిలో వినియోగించారు.
ఒక శక్తి, వ్యవస్థ
స్వామీజీ ఎవరితోనైనా తీవ్ర వాగ్వాదానికి దిగిన సందర్భం ఒక్కటికూడా నాకు గుర్తు లేదు. ఎవరూ ఆయనను ఓ సాధారణ మనిషిగా భావించేవారు కాదు. ఓ శక్తిగా, వ్యవస్థగా గుర్తించేవారు. సంవాదంలో, వాగ్ధాటిలో, రాజకీయ వ్యవస్థ నిర్మాణంలో ఆయనకంటే గొప్ప వ్యక్తులెందరినో చూశాను. ఆయనకంటే గొప్ప త్యాగాలు చేసిన వారు, కష్టాలకు ఓర్చినవారు ఎందరో ఉండే ఉంటారు. మేధస్సులోనూ ఆయనను మించినవారు ఉండవచ్చు. కానీ, బహుముఖ ప్రజ్ఞ, అనిర్వచనీయఆకర్షణలో ఆయనకు సాటిలేదు. మా మీద స్వామీజీ ప్రభావం రాజకీయ- ఆధ్యాత్మికపరమైంది. స్వామీజీ ఒక్క పిలుపు ఇస్తే, ఇక ఆగే వారం కాదు. స్వామీజీకి, ఆయన లక్ష్యాలకు మధ్య సంపూర్ణమైన ఏకత్వం ఉండేది.
పర్యటన.. పరామర్శ..
ఈ నేపథ్యంలో స్వామీజీ తెలంగాణలో విస్తృతంగా పర్యటించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. ఇటు పోలీసులు, అటు పోరు దళాలమధ్య ప్రజలు నలిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులమధ్య తన స్వాభావిక ధీరత్వంతో ప్రయాణం మొదలుపెట్టారు స్వామీజీ. తనను కాపాడేందుకు పోలీసులు లేరు. స్వామీజీ యాత్రపట్ల ప్రభుత్వానికి ఎలాంటి సానుకూలతా లేదు. కానీ, స్వామీజీ అదరలేదు. బెదరలేదు. పల్లెనుంచి పల్లెకు ప్రయాణించారు. ప్రతి పల్లెలోనూ జీవితేచ్ఛ అడుగంటిన రైతులను కూడగట్టి, వాళ్లకు సానుకూలమైన సందేశాన్ని అందించేవారు. స్వామీజీ యాత్ర నాకు నౌఖాలీ, తిపేరాలలో గాంధీ చేసిన ప్రయాణాలు గుర్తు చేసేది. హైదరాబాద్లో కూర్చున్న సందేహాస్పదులు స్వామీజీ ప్రయాణాలమీద లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు.
ఈ రోజుకు కూడా స్వామీజీ చేసిన ఆ చారిత్రక యాత్ర ప్రభావాన్ని ఎవరూ స్పష్టంగా అంచనా వేయలేదు. పైగా అధికారపు ఆకర్షణల మధ్య క్షణక్షణానికీ మారిపోయే రాజకీయ వాతావరణం మధ్య నాటి యాత్ర ప్రభావాన్ని గుర్తించడం కష్టమే. కానీ, ఆ ప్రయాణంలో భాగమైన వారు, దాని గురించి అవగాహన ఉన్నవారు మాత్రం ఆ యాత్రను ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ వెంటనే తెలంగాణలో పూజ్య వినోబా సాగించిన యాత్రను, దానినుంచి చిగురించిన భూదానోద్యమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. రాజకీయ, సైద్ధాంతిక కారణాలవల్ల కౌలుదారులు, రైతుల సమస్య దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వాటి పర్యవసానంగా ఏర్పడిన చట్టాలగురించి ప్రత్యేకించి గుర్తు చేసుకోవాల్సిన పనిలేదు. కానీ, స్వార్థం రాజ్యమేలుతున్న దశలో రైతుల సమస్య గురించి నినదించి, ఆ దిశగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తొలి స్వరం రామానందుల వారిదే!
ఎంత చెప్పినా స్వామీజీ రాజకీయ వ్యక్తిత్వానికి సంబంధించిన ఓ ముఖ్యమైన పార్శం ఇంకా మిగిలే ఉంది. స్పష్టమైన దృక్పథంతో, వెనుకడుగు వేయని పట్టుదలతో సాగే తత్వం వారిది. భూసంస్కరణల విషయంలో ఆయన పోరాట పటిమ రాజకీయ వర్గాల్లో ప్రతికూల స్పందనలను రగిల్చాయి. అయితే, స్వామీజీ నేతృత్వంలో సిద్ధాంతాలకు ఎంతగా విలువ ఉండేదంటే, దాని తీక్షణత ముందు కీచులాటలకు దారి తీసే కులం, వర్గం, ప్రాంతం, వ్యక్తిత్వం, లాభాపేక్ష లాంటి కారణాలన్నీ మరుగున పడిపోయాయి. భూసంస్కరణలు, రాష్ర్టాల పునర్విభజన విషయంలో స్వామీజీ విధానాలను వ్యతిరేకిస్తూ రాజకీయ వైరం బలపడింది. కానీ, భూసంస్కరణల ఆకాంక్షను ఎంతగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నించినా.. ‘టెనెన్సీ యాక్ట్ ఆఫ్ హైదరాబాద్’ చాలా పురోగామిగాను, పేదలకు మేలే చేసే విధంగానూ రూపొందింది. దేశానికే ఆదర్శంగా నిలిచింది!
భాషాప్రయుక్త రాష్ర్టాలు
భాష ప్రాతిపదిక మీద రాష్ర్టాలను పునర్విభజించాలనే వాదన స్వామీజీ రాజకీయ జీవితంలోని మరో ముఖ్యమైన ఘట్టం. ఆనాటి రాజకీయ నాయకులు ఈ సమస్యను సమయానుకూలంగా ఇష్టానుసారం ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో స్వామీజీకి వ్యతిరేకంగా ఉన్న నాయకుడు నేరుగా నాతో.. ‘నేను భాషా ప్రాతిపదికన రాష్ర్టాల విభజనకు వ్యతిరేకమేమీ కాదు. సమయం వచ్చినప్పుడు వాటి ఏర్పాటు ఉంటుంది. అయితే, ఈ విషయంలో స్వామీజీ పట్టుదలవల్ల హైకమాండ్ దగ్గర ఆయన ప్రభావం తగ్గిపోయింది. దీన్ని మేం తప్పకుండా మా రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటాం’ అని చెప్పాడు. ఇప్పటికీ ఆ మాటలు నా చెవిలో మార్మోగుతూనే ఉన్నాయి. అంటే, స్వామీజీ ఆశయాలు అంబరాన్ని అంటినా, ఆయన ప్రభావం మాత్రం తగ్గుముఖం పడుతూ వచ్చిందన్నమాట.
ఈ సంఘటనను గుర్తు చేసుకున్నప్పుడు సిగ్గనిపిస్తుంది. స్థానిక పత్రికలలో ఆయన వ్యక్తిత్వాన్ని, ఆశయాలను వక్రీకరిస్తూ రాయడంతోసహా స్వామీజీని అవమానించడానికి అన్ని రకాల ప్రయత్నాలూ జరిగాయి. ఆ దుష్ప్రచారంతో స్వామీజీ కోల్పోయిందేమీ లేదు. కానీ, ఓ మహోన్నత దేశభక్తుడు రాజకీయ వేదికనుంచి అర్ధంతరంగా నిష్క్రమించడం వల్ల ఎంత నష్టం జరిగిందో, ఏ నాయకుడికైనా తెలిసి ఉంటుందా? అని నా అనుమానం. ఒక్కోసారి, ఇది స్వామీజీకి మంచిదే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే, లక్ష్యం ముగిసిన తర్వాత యోధుడు ఇక అక్కడ ఇమడలేడు. ఇది క్రూరంగా తోచినా గుర్తించాల్సిన చారిత్రక సత్యం. కఠోర వాస్తవం. మరో దారుణమైన విషయం ఏమిటంటే, స్వామీజీ ఆశయాలు ఇంకా పూర్తిగా నెరవేరనే లేదు. అంతలోనే, ఆయన క్రియాశీల రాజకీయాలనుంచి విరమించుకోవడంతో వాటి సాధనకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. ప్రజలకు ఇదో తీరని నష్టం.
నిర్మాణంలో..
హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వం నుంచి విరమించుకుని, రాజకీయాలకు అతీతమైన కార్యాచరణకు పూనుకోవడం వల్ల స్వామీజీ ఔన్నత్యం మరింతగా పెరిగింది. 1962లో పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడేందుకు కూడా మొగ్గు చూపక పోవడం ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో కీలక ఘట్టంగా మారింది. తన సమయంలో ముఖ్యభాగాన్ని రామతీర్థ ఆశ్రమాన్ని పునర్నిర్మించడానికి వెచ్చించారు. రాజకీయ వేత్తలనుంచి ఎవరూ పెద్దగా కృతజ్ఞతను ఆశించరు. తమ ప్రత్యర్థులు చనిపోయిన తర్వాత కూడా వారికి మంచిపేరు రాకుండా చూడగల సమర్థులు వారు. కనీసం సామాన్య ప్రజానీకమైనా తమకు మేలు చేసిన వారిని గుర్తించి, వారిపట్ల కృతజ్ఞత చూపాల్సిన అగత్యం ఉంది. చరిత్రకూడా అసంఖ్యాకమైన వివరాల మధ్య ఓ ఘట్టానికి కారణభూతులైన వ్యక్తులను విస్మరిస్తూ ఉంటుంది. చరిత్రను నమోదు చేయడం మొదలు పెట్టిన దగ్గరనుంచీ కూడా, ఈ ప్రహసనం కొనసాగుతూనే ఉంది.
హైదరాబాద్ సామాజిక-ఆర్థిక చరిత్రను ఎవరైనా లిఖిస్తారో లేదో నాకు తెలియదు. ఆ ప్రయత్నం జరిగినా జరగకపోయినా అందులో రామానంద తీర్థను నేను ముఖ్యమైన నాయకునిగా గుర్తిస్తాను. తరాలకొద్దీ ప్రజలు అంధకారంలో ఉండి ఓ సత్యాన్ని గుర్తించనంత మాత్రాన, అది సత్యం కాకుండా పోదు! ఆ మాటకు వస్తే, మనం చరిత్ర అనుకునేదే మానవాళి ఉనికిలో ఓ చిన్న భాగమే. తెలంగాణ ప్రజలు రామానంద తీర్థ అనే గొప్ప దేశభక్తుడిని, సమాజ సేవకుడినీ ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాను. ఆయనపట్ల తమ అనురాగాన్ని, కృతజ్ఞతను అందిస్తారని నా ఆశ. నిర్యాణం చెందిన తర్వాత కూడా, స్వామీజీ తన ఆశయరూపంలో జీవిస్తూనే ఉంటారని నా ప్రగాఢ విశ్వాసం.
భూతల నరకం
నాటి హైదరాబాద్ సంస్థానంలో దయనీయమైన పేదరికం ఒకవైపు, వెనుకబాటుతనం మరోవైపు వెరసి పీడనకు దారితీశాయి. రజాకార్లు, భూస్వాములు, సంఘవ్యతిరేక శక్తులు, స్వార్థపరులు.. అందరూ కలిసి కొంతకాలం భూమ్మీదే నరకాన్ని సృష్టించారు. సామాజిక పరమైన, ఆర్థిక పరమైన సమస్యలు మత, రాజకీయ రంగులు పులుముకున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి సంక్లిష్టమైన కార్యాచరణ కావాలి. అచంచలమైన పట్టుదలతో స్వామీజీ ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉద్యమించారు. కొద్దిమంది ఇందులో తమ లాభనష్టాలను బేరీజు వేసుకుని ఉద్యమం నుంచి వెనక్కి తగ్గారు. కొందరైతే ఉద్యమాన్ని సైతం మలిన పరిచే ప్రయత్నం చేశారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా స్వామీజీ పర్వత సదృశమైన నిబ్బరంతోనే ముందడుగు వేశారు. సమస్య గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉంది. పైన కనిపించే అలజడి వెనకున్న లోలోపలి తీవ్ర సంక్షోభానికి సూచన అని ఆయనకు తెలుసు. అందుకనే, ఆ సమస్యను పరిష్కరించనంత వరకూ, సంఘవ్యతిరేక శక్తులను నిర్మూలించి ఉపయోగం లేదని తరచూ చెబుతుండేవారు. భూమిమీద హక్కులలో ఉన్న తీవ్ర అసమానతల వల్లే అనేక పోరాటాలు తలెత్తుతున్నాయని, మూలసమస్యను పరిష్కరించనంత వరకూ శాంతిస్థాపన సాధ్యం కాదనీ హెచ్చరించారు