తెలంగాణం.. గ్రంథాలయ వికాసం
నిజాముల కాలంలో తెలంగాణ అంతటా ఉర్దూ అధికారిక భాష. కానీ, అత్యధికుల భాష మాత్రం తెలుగే. అయినా తెలుగు వివక్షకు, నిర్లక్ష్యానికి గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో మాడపాటి హనుమంతరావు, కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, రావిచెట్టు రంగారావు, మునగాల రాజా తదితరులు తెలంగాణలో తెలుగు భాషను నిలబెట్టడానికి నడుంబిగించారు. అలా గ్రంథాలయాల స్థాపన మొదలైంది. క్రమంగా అది ఉద్యమ రూపం దాల్చింది. ఈ క్రమాన్నంతా ‘మన తెలంగాణ గ్రంథాలయాలు’ శీర్షికన పుస్తక రూపం ఇచ్చారు డా॥ చేగొని రవికుమార్. హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర (ప్రస్తుతం తెలుగు) భాషా నిలయంతో మొదలైన ఆధునిక గ్రంథాలయాల స్థాపన, రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం (హనుమకొండ), ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం (సికింద్రాబాద్), ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని (సూర్యాపేట) మొదలైన వాటితో శిఖరస్థాయికి చేరుకుంది. ప్రధాన నగరాలు, పట్టణాల్లోనే కాకుండా చెన్నిపాడు, చిలుకూరు లాంటి పల్లెల్లో సైతం గ్రంథాలయాల స్థాపన జరిగింది. వీటితోపాటు సురవరం ప్రతాపరెడ్డి స్మారక గ్రంథాలయం, ఆసఫియా స్టేట్ లైబ్రరీ, అణా గ్రంథమాల గురించి కూడా ఇందులో వివరించారు. గ్రంథాలయ ఉద్యమ వైతాళికులు రావిచెట్టు రంగారావు, ప్రతాపరెడ్డి, కోదాటి నారాయణ రావు, ఆళ్వారుస్వామి, బోయినపల్లి వెంకట రామారావు జీవితాలనూ స్పృశించారు. హైదారాబాద్ సంస్థాన సాంస్కృతిక చైతన్యంలో గ్రంథాలయాల పాత్రను తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది.
మన తెలంగాణ గ్రంథాలయాలు
రచన: డా॥ చేగొని రవికుమార్
పేజీలు: 152
వెల: రూ. 250
ప్రతులకు: ఫోన్- 9848645986
పరమాత్మతో ప్రయాణం
మనిషి జీవితం ఎన్నెన్ని మలుపులతోనో సాగిపోతుంటుంది. అయితే ఎంత అనుభవం ఉన్నా జీవితం అయితే శాశ్వతం కాదన్న సత్యం అందరికీ తెలిసిందే. కాకపోతే కొన్నిసార్లు మనవి కాని క్షణాల్లో కూడా మనకు అనుకోని సహాయం దొరుకుతుంది. ఈ అనుకోని సహాయమే ‘భగవంతుడు ఉన్నాడు’ అనుకునేలా చేస్తుంది. మరికొన్నిసార్లు మనం ఎక్కడెక్కడికో తెలియని ప్రదేశాలకు వెళ్లినట్లు, ఏదో జరగబోతున్నట్లు కలలు రావడం, అనుభూతి చెందడం జరుగుతుంది. ఇవి అప్పుడప్పుడు నిజం అవుతాయి కూడా. ఇలాంటి అనుభవాలే ‘శివుడి ఆజ్ఞ లేకుంటే చీమ అయినా కుట్టదు’ అన్న సామెత స్థిరపడేలా చేశాయి. ఇలా తనకు కలల రూపంలో, అనుభూతుల ద్వారా, ఏదో సంకల్పం ద్వారా జరుగుతాయని ముందే అనిపించి, వాస్తవ రూపం దాల్చిన సంఘటనలను ‘దైవంతో నా అనుభవాలు 2’ (నా ఆధ్యాత్మిక ప్రయాణం) పేరుతో పుస్తకం రూపంలో తీసుకువచ్చారు వెంకట వినోద్ పరిమి. ఇలాంటి నేపథ్యంతో రచయిత ఆధ్యాత్మిక అనుభవాలు, తీర్థయాత్రల్లో అనుభూతి చెందిన విశేషాలు తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఉపయుక్తం. అంతేకాకుండా ఖాటూ శ్యామ్, తిరుమల, షిర్డీ, అరుణాచలం, తిరుకడైయూర్ తదితర క్షేత్రాల విశేషాలూ తెలుస్తాయి.
దైవంతో నా అనుభవాలు- 2
రచన: వెంకట వినోద్ పరిమి
పేజీలు: 160
వెల: రూ. 200
ప్రతులకు: ఫోన్- 8558899478
-హర్షవర్ధన్ చింతలపల్లి
బుక్ షెల్ఫ్
జ్ఞానదీప్తులు – జ్ఞాపకాలు
రచన: మద్దాళి రఘురామ్
పేజీలు: 119
వెల: అమూల్యం
ప్రతులకు: 9866057777
ద్వారబంధాల చంద్రయ్య దొర
రచన: కోటిపల్లి సుబ్బారావు
పేజీలు: 57
వెల: 99
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫిరంగిదళం (మొగ్గలు)
రచన: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
పేజీలు:40
వెల: రూ. 30
ప్రతులకు: 9032844017
కాలం (కవితా సంపుటి)
రచన: పున్న అంజయ్య
పేజీలు: 100
వెల: రూ.100
ప్రతులకు: 9396610639