చిత్రసీమలో హీరోయిన్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. వారిలో తెలుగమ్మాయిలు మాత్రం తక్కువే. అడపాదడపా వచ్చేవారిలో అవకాశాలు దక్కించుకొని, విజయాలతో నిలిచేవాళ్లు ఒకరిద్దరే. అయితే, పరభాషల భామలతో పోలిస్తే తామేమీ తక్కువ కాదంటున్నది అనన్య నాగళ్ల. పరిశ్రమలో ఉత్తరాదివారికి సమానంగా అవకాశాలు దక్కుతున్నాయని చెబుతున్నది ఈ తెలంగాణ బిడ్డ. మూడో సినిమాకే పవర్స్టార్ పవన్ కల్యాణ్తో స్క్రీన్ షేర్ చేసుకున్న అనన్య గురించి..
‘మల్లేశం’తో మనమ్మాయే అనిపించిన అనన్యది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. ఇబ్రహీంపట్నంలోని రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్లో చదివింది. నటన మీద ఆసక్తితో ఉద్యోగాన్ని వదులుకొని, షార్ట్ ఫిలిమ్స్లో నటించడం మొదలుపెట్టింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ‘మల్లేశం’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఇటీవలే ‘ప్లే బ్యాక్’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నది. టాలీవుడ్లో పాగా వేస్తున్న ఉత్తరాది భామలకు తానేమీ తక్కువ కాదని నిరూపించింది.
“పవన్ కల్యాణ్ సర్తో కలిసి నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది ‘వకీల్సాబ్’లో ప్రాధాన్యమున్న పాత్ర దక్కడం చాలా సంతోషంగా ఉంది. నా భావాల్ని చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు” అంటూ ‘వకీల్ సాబ్’ అవకాశంపై సంతోషాన్ని పంచుకుంది.
అనన్యకు సినిమాల్లోకి రావాలని ఉన్నా.. ఒక్కసారిగా హీరోయిన్ అయిపోవాలని మాత్రం అనుకోలేదు. నటనలో అనుభవం సంపాదించేందుకు, ముందుగా లఘుచిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో ఒక్కోమెట్టూ ఎక్కుతూ వచ్చింది. మూడేండ్లలోనే హీరోయిన్గా స్థిరపడింది. అనన్య నటించిన ‘షాదీ’ అనే లఘు చిత్రం ‘సైమా అవార్డ్స్’కు నామినేట్ అయ్యింది.
‘మల్లేశం’ సినిమాలో భాష, యాసకోసం అనన్య పడిన శ్రమ వృథా కాలేదు. చిన్నసినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకున్న ఈ చిత్రం అవకాశాలు తెచ్చి పెట్టింది. రెండు కాలాల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో వచ్చిన ‘ప్లే బ్యాక్’ సినిమాతో ద్వితీయ విఘ్నాన్ని అధిగమించింది. మూడో చిత్రంతోనే బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘పింక్’ తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్’లో.. పవర్స్టార్ పక్కన నటించే చాన్స్ కొట్టేసింది. అంతేకాదు, పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ‘ప్లే బ్యాక్’ రీమేక్లోనూ అవకాశాన్ని దక్కించుకున్నది.“పాత్రలో ఒదిగిపోయే తెలుగమ్మాయిలకు బాగానే ప్రోత్సాహం ఉంది. ఇందుకు నేనే ఉదాహరణ. ‘మల్లేశం’ తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కథల ఎంపిక ముఖ్యం కాబట్టి, ఆచితూచి అడుగులేస్తున్నా” అని చెబుతున్నది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ రాబోయే సినిమాలోనూ అవకాశం దక్కించుకున్నది అనన్య. ‘మల్లేశం’లో చేసిన కొందరు నటులను ‘పుష్ప’ చిత్రం కోసం తీసుకున్న దర్శకుడు సుకుమార్, అనన్యకు కూడా తన తదుపరి చిత్రంలో చాన్స్ ఇస్తానని మాటిచ్చాడు. సుక్కు వంటి దర్శకుడి సినిమాలో అవకాశం దక్కించుకోవడమంటే.. కెరీర్లో మరో మెట్టు ఎక్కినట్లే.‘స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలంటే చిట్టిపొట్టి బట్టలేసుకుంటే సరిపోతుందని నేననుకోను. సినిమా అంటే కుటుంబ సమేతంగా కూర్చుని చూడగలగాలి. అనన్య సినిమా అంటే.. చిన్నాపెద్దా అంతా కలిసి చూడొచ్చు అనే నమ్మకం కలగాలి. అందుకే కథా ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంచుకొంటున్నా’ అంటున్నదీ తెలంగాణ బిడ్డ.