కదిలించేదే కథ అంటారు. అలాంటి 22 కథలను ఒక్క దగ్గరికి చేర్చి రచయిత వెలువరించిన కథా సంకలనమే ‘పరిహారం’ (మరికొన్ని కథలు). ఇందులో దాదాపుగా అన్ని కథలూ మనిషి జీవితంలోని వివిధ కోణాలను స్పృశిస్తూ, మనలో ఉన్న మానవత్వాన్ని తట్టి లేపుతాయి. పుస్తక శీర్షికగా ఎంచుకొన్న ‘పరిహారం’ కథకు ఆంధ్రప్రభ ఆదివారం ప్రత్యేక అనుబంధం- అజోవిభొ కందాళం ఫౌండేషన్ కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి లభించింది. యజమాని తన తప్పును నౌకరుపై వేసే కుటిల మనస్తత్వాన్ని చిత్రిస్తూ సాగుతుందీ కథ. అంతేకాదు ఊళ్లలో ఉండే దిగువస్థాయి రాజకీయాలను ఇది కండ్లకు కడుతుంది. ‘వాసనలేని పువ్వు’, ‘తప్పెవరిది’ కథలు సమాజంలో వంచనకు గురై, వ్యభిచార రొంపిలో కూరుకుపోయిన యువతుల జీవితాలను చిత్రించాయి. అడిగిన జీతమీయని యజమాని ప్రవర్తనకు విసిగిపోయిన నౌకరు ఏంచేశాడో వివరిస్తుంది ‘సంపాదన’ కథ. ఉద్యోగానికి పట్టాలతోపాటు ప్రవర్తన కూడా ముఖ్యమని చాటేదే.. ‘ఉద్యోగం’. ఆత్మీయత ఉట్టిపడే పిలుపు కోసం పరితపించే మనిషి ఆరాటాన్ని విశ్లేషించే ‘ఒరేయ్’, మనిషికి- పర్యావరణానికి ఉన్న సంబంధాన్ని, పర్యావరణం ధ్వంసమైతే మనిషి పరిస్థితి ఏంటన్న విషయాన్ని సుబోధకంచేసే ‘చేను- చేప’, వ్యవసాయంతోనే మానవ జాతి మనుగడ అని చాటే ‘పునరాగమనం’, మనిషిని మనిషి నమ్మకపోతే విలువలకు అర్థం ఉండదని నిరూపించే ‘విలువలు’ .
ఇలా ఈ పుస్తకంలోని కథల్లో ప్రతీది చదవదగిందే.
పరిహారం (మరికొన్ని కథానికలు)
రచయిత: బాలం వెంకట్రావు
పేజీలు: 162 వెల: రూ. 80
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
బాలల కోసం రామాయణ రమ్య గాథ
భారతీయ సంస్కృతికి, కుటుంబ జీవితానికి మూలస్తంభాలైన రచనల్లో రామాయణానిది ముందువరస. ఆదికవి వాల్మీకం మొదలుకొని ఆధునిక 21వ శతాబ్దం వరకు వివిధ భాషల్లో ఎన్నో రామాయణాలు వెలువడ్డాయి. ఈ వరుసలో తెలుగు బాలల కోసం లలిత గీతాలతో ప్రసిద్ధి చెందిన డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించిందే ‘వడ్డేపల్లి రాగ రామాయణం’. పుస్తకం పేరులో పేర్కొన్నట్లు గానే ఇందులో రామకథ రాగయుక్తంగా, అదీ చిన్నపిల్లలకు అర్థమయ్యే స్థాయి భాషలో అలతి అలతి పదాలతో లలితంగా లయాత్మకంగా సాగుతుంది. ‘రామాయణ చరితమంత/ రమ్యరాగ భరితం!/ త్యాగాలకు నిలయమైన/ సకల ధర్మ సహితం’ అంటూ ప్రారంభమయ్యే ‘రాగ రామాయణం’లో రామాయణం విశిష్టతతో మొదలుపెట్టి ఫలశ్రుతి వరకు 46 అంకాలుగా గేయరూపంలో కథ సాగినతీరు చదువరులను ఆకట్టుకుంటుంది. రచయిత ఫలశ్రుతిలో పేర్కొన్నట్లు పురాణాల కథలు పవిత్ర భావాలను, నిగూఢమైన సందేశాలను అందిస్తాయి. ఇందులో రామకథను సంక్షిప్తంగా గేయరూపంలో తెలపడంతో రామాయణంలోని వివిధ పాత్రలు, వాటి మధ్య సంబంధం పిల్లలు పాడుతూ గుర్తుంచుకునేందుకు వీలుంటుంది. సందర్భానికి తగినట్టు అందమైన చిత్రాలు ఉండటం ఈ పుస్తకానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చింది. వడ్డేపల్లి రామాయణ కథను ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేయడం విశేషం.
వడ్డేపల్లి రాగ రామాయణం (బాలల గేయ కథ)
రచయిత: డా॥ వడ్డేపల్లి కృష్ణ
పేజీలు: 125 వెల: రూ.120
ప్రతులకు: నవచేతన బుక్ హౌస్, విశాలాంధ్ర (విజయవాడ), నవోదయ (హైదరాబాద్), 9246541699
విలువలపై ‘దాడి’
దేశంలో ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ కారణంగా ప్రతి వస్తువు ‘మార్కెట్’ రూపాన్ని సంతరించుకుంది. చివరికి మనిషి కూడా అంగడి సరకుగా మారిన పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రపంచీకరణ కారణంగా సమాజంలో పతనమైన విలువలను రూపుకడుతూ రచయిత సింహ ప్రసాద్ రాసిన నాటకం ‘దాడి’. తాను గతంలో రాసిన ‘విషపరిష్వంగం’ కథనే నాటకంగా మలచారు. ప్రపంచీకరణ నేపథ్యంలో బహుళ జాతి సంస్థలు వర్ధమాన దేశాలలో ప్రతీ రంగాన్ని మార్కెట్గా మార్చుకొని సొమ్ముచేసుకుంటున్నాయి. దానికి వినోద రంగమూ మినహాయింపు కాదు. ‘దాడి’ కథ కూడా వినోదాన్ని పంచే రియాలిటీ షో ఇతివృత్తంతో సాగుతుంది. అయితే ఇందులో ఆనంద్ అనే నిరుద్యోగ, నిస్సహాయ యువకుణ్ని డబ్బుల కోసం అందరూ చూస్తుండగా ఆత్మహత్య చేసుకునేందుకు పురికొల్పుతారు. షోలో భాగంగా ఒక్కొక్క పాత్ర ఒక్కోలా ప్రవర్తిస్తుంది. చివరికి ఆనంద్ తాను ఆత్మహత్య చేసుకోనని భీష్మించుకుంటాడు. అప్పుడు అతని మిత్రుడు సూరి ద్వారా ప్రపంచీకరణ నేపథ్యంలో సమాజంలో ప్రతీ రంగంపై దాడి ఎలా జరుగుతుందో రచయిత చెప్పిస్తారు. భ్రమలు, ప్రలోభాల్ని తొలగించుకొని జీవితాలను, సమాజాన్ని తీర్చి దిద్దుకోవాలని సందేశం ఇస్తారు. ఇక ఇందులో విరామ సమయంలో వచ్చే వాణిజ్య ప్రకటనల ద్వారా క్రీడలు, విద్య, భాష, వైద్యం రంగాలపైనా కొనసాగుతున్న మార్కెట్ దాడిని రచయిత ఎండగట్టారు. ఇందులోని రెండో నాటకం ‘దేవయాని’. దేవతలు, రాక్షసుల యుద్ధం నేపథ్యంలో రాక్షస గురువు శుక్రాచార్యుల కుమార్తె ‘దేవయాని’ ప్రధాన పాత్రగా ఈ నాటకాన్ని రచించారు. తనదైన శైలిలో వర్తమాన రాజకీయాలను పౌరాణిక పాత్రల ద్వారా కండ్లకు కట్టారు సింహప్రసాద్.
దాడి- దేవయాని
రచయిత: సింహప్రసాద్, పేజీలు: 156, వెల: రూ. 80
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు,
98490 61668