‘ఎత్తు పల్లాల మధ్య సాగిపోయే జీవిత ప్రయాణంలో పైకి రావడం గొప్ప కాదు. కానీ.. బతుకు శాపగ్రస్తమై, సమాజం నుంచి వివక్ష ఎదురైన పరిస్థితుల్లోనూ పట్టుదలతో ఉన్నత స్థితికి చేరుకోవడం గొప్ప. ట్రాన్స్జెండర్ ఆషాడం ఆశ జీవితమే ఇందుకు ఉదాహరణ. ఒకప్పుడు యాచన చేస్తూ బతికిన తను సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని తీర్మానించుకున్నారు. ఆ సంకల్పానికి తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలిచింది. ఆ మార్పు యాత్ర ఆశ మాటల్లోనే..
కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మా సొంతూరు. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కు ట్రాన్స్ జెండర్స్కూ వర్తిస్తుంది. కానీ, చాలామందికి మేమంటే చులకన. ఇలాంటి పరిస్థితే నాకూ ఎదురైంది. అమ్మానాన్నలకు మేం నలుగురం. నేను ట్రాన్స్జెండర్ అని తెలిశాక బంధువులు చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. అమ్మ, నాన్న, అక్క, సోదరులు మాత్రం నాతో మామూలుగానే ఉండేవారు. నావల్ల ఎవరికీ ఇబ్బంది కావొద్దనే ఇంటికి దూరంగా బతుకుతున్నా. ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కొంతకాలం భిక్షాటన చేశాను. ఆ అడుక్కున్న డబ్బులోంచే కొందరికి వాటా ఇవ్వాల్సి వచ్చేది. పోలీసులతోనూ ఇబ్బందులు ఎదురయ్యేవి. డిగ్రీ చదివిన నేను ఇంత దుర్భర జీవితం గడపాలా? అనే ప్రశ్న నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేది. దీంతో ఓ బలమైన నిర్ణయానికొచ్చాను. గౌరవప్రదంగా జీవించాలని నిర్ణయించుకున్నాను.
గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నా..
గ్రాఫిక్ డిజైనింగ్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఎవరో చెప్పారు. కానీ, మిగతావాళ్ల మధ్య నేను ఇమడగలనా? అనే భయం వెంటాడేది. అయినా, మొండి పట్టుదలతో కరీంనగర్లోని ఆరెంజ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు రవీందర్ సార్ను సంప్రదించాను. నా నిర్ణయాన్ని ఆయన ప్రోత్సహించారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేశాను. ఇంట్లో నుంచే జాబ్ వర్క్ మొదలుపెట్టాను. ఫొటోగ్రఫీలోనూ ప్రావీణ్యం సాధించాను.
ఆరునెలల క్రితం సొంతంగా ఫొటో స్టూడియో ఏర్పాటు చేసుకున్నాను. నా నేపథ్యం కారణంగా పెద్దగా ఆర్డర్స్ వచ్చేవి కావు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది అయ్యింది. ప్రస్తుతం, ‘ఇన్ఫో’ అనే కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్లో ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఎల్జీబీటీ కమ్యూనిటీకి మా ఆర్గనైజేషన్ తరఫున సహకారం అందిస్తున్నా. గతంలో ఓ ఎన్జీవోలో పని చేశాను. కరోనాలో చాలామంది ట్రాన్స్జెండర్స్కు దగ్గరుండి మరీ వ్యాక్సిన్స్ ఇప్పించాను. గత ఏడాది జరిగిన ట్రాన్స్జెండర్స్ మేళాలో తెలంగాణ ప్రభుత్వం నన్ను ‘ఉత్తమ ట్రాన్స్ జెండర్’గా ఎంపిక చేసింది.
కొత్త మలుపు..
ఓసారి మా ‘ఇన్ఫో’ సంస్థ కార్యక్రమానికి కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్య అతిథిగా వచ్చారు. నేను డిజైన్ చేసిన బ్రోచర్ చూసి ఆశ్చర్యపోయారు. ఫొటో స్టూడియో నిర్వహణలో నా ఆర్థిక ఇబ్బందులను గ్రహించి.. సఖి సెంటర్ను సంప్రదించాలని సూచించారు. అక్కడి నుంచి మెప్మా (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్)కు వెళ్లాను. వాళ్లే నన్ను ‘వీ హబ్’కు పరిచయం చేశారు. ‘వీ హబ్’ అధికారులు నాకు రాయితీ మీద రుణం ఇప్పించేందుకు ఎంతో శ్రమించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద రుణం మంజూరు చేయించడానికి.. రిజిస్ట్రేషన్, ట్రేడ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్ వంటివన్నీ దగ్గరుండి చూసుకున్నారు.
సర్టిఫికెట్స్లో నా జెండర్ ‘మేల్’ అని ఉంటుంది. ఆధార్, గుర్తింపు కార్డుల్లో మాత్రం వేరుగా ఉండటంతో నా దరఖాస్తు తిరస్కరించారు. మళ్లీ గరిమా అగర్వాల్ మేడం చొరవ తీసుకుని.. బ్యాంక్ వారికి లేఖ రాశారు. ఇటీవలే రూ.5 లక్షల సబ్సిడీ రుణం మంజూరైంది. ఫొటో స్టూడియోకు కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చుకున్నా. తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చి సమాజంలో సముచిత స్థానం కల్పించింది. చాలా సంతోషకరమైన విషయం ఇది. చివరగా ఒక్క మాట.. మన దేశంలో పురుషులతో సమానంగా మహిళలను గౌరవిస్తారు. కానీ.. మమ్మల్ని మాత్రం చిన్నచూపు చూస్తారు. ట్రాన్స్జెండర్లు అంటే భిక్షాటన, సెక్స్ వర్కర్స్ అనే భావన ఉంది. చేయూతనిస్తే గౌరవంగా బతికేందుకు మాలో చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఈ దిశగా సమాజం చొరవ చూపాలి.
… గంజి ప్రదీప్ కుమార్