జరిగిన కథ :
ద్వీప రాజ్య రాకుమార్తెలు నారాంబ, పేరాంబ బందీలుగా అనుమకొండకు పయనమయ్యారు. వెంటే వారి తమ్ముడు జాయప కూడా పల్లకిలోకి ఎక్కాడు. దారిలో తన అసమాన ప్రతిభతో అందరి మన్ననలూ పొందాడు. కాకతీయ సర్వసైన్యాధిపతి చౌండ సేనాని.. జాయపను తన మత్తగజంపై ఎక్కించుకొని
అనుమకొండ పుర ప్రవేశం చేశాడు.
స్వాగత సత్కారాల హడావుడిలో జాయప మత్తగజాన్ని దిగి జనంలో కలిసిపోయాడు. చిన్నగా కురుస్తున్న వర్షంలో చిన్నారి జాయప ఒంటరిగా అనుమకొండ పురవీధులలో సంచరించాడు. యుద్ధంలో పెద్దదిక్కును
కోల్పోయిన గోపయ కుటుంబాన్ని కలుసుకున్నాడు. గోపయ మరణ వార్త అప్పుడే తెలుసుకున్న ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోగా.. జాయప కూడా వారితో కలిసి బిగ్గరగా ఏడ్చాడు. వాళ్లు భోజనాలు చేసేలా.. తన మాటలతో ఓదార్చాడు.
సమయం మరో రెండు జాములు దాటింది. మరోసారి ఓ వానజల్లు వీధుల్ని తడిపి పోయింది. అనుమకొండ వీధుల్లో ఇద్దరు కావలివాళ్లు.. గుర్రపుబండిలో నిప్పుల కాగడాలు పెట్టుకుని వస్తున్నారు. ఆరిపోయిన వీధి కాగడాలు మళ్లీ వెలిగిస్తున్నారు. నిశి రాత్రివేళ ఇద్దరూ విజయోత్సవ కబుర్లు గట్టిగా చెప్పుకొంటూ.. ఓ వీధి దీపాన్ని వెలిగించడానికి బండి దిగారు. ఆ దీప స్తంభం ఎక్కిన భటునికి తన చేతిలోని కాగడా వెలుగులో.. దూరంగా రహదారి మధ్యలో ఏదో వింతజంతువు నిలబడి చూస్తున్నట్లు కనిపించింది. ఒక్కసారిగా పిచ్చికేక వేశాడు. అటే చూసిన మరో భటునికి పై ప్రాణాలు పైనే పోయాయి. పైగా ఆ వింతజంతువు ఇటే తరుముతున్నట్లు పరుగెత్తుకు వస్తూ ఉండటంతో.. ఇద్దరూ బండి వదిలేసి పరుగు లంకించుకున్నారు.
అయితే ఆ వింత జంతువు వారికంటే వేగంగా పరుగెత్తి, వారి ఎదుట నిలబడింది. ఇద్దరూ వణికిపోతూ చూశారు. అప్పుడు గ్రహించారు.. అది జంతువు కాదు, ఓ బాలుడు. చిన్నారి జాయప. ఇద్దరికి మతిపోయినంత పనైంది.
‘ఇంత రాత్రివేళ.. వర్షం కురుస్తున్న సమయంలో.. ఇంత చిన్నపోరడు.. రాజభటులమైన మమ్మల్నే భయపెడుతున్నాడే!?’ అనుకున్నారు.
“యాయ్.. ఎవ్వడివి రా.. నువ్?”.
“ఎవరు మీరూ?”.
భటులిద్దరూ ముఖాలు చూసుకున్నారు..
‘మమ్మల్నే అడుగుతావా!?’ అనే ప్రశ్నార్థకంతో!
“మేం రాజభటులం. కావలి సైనికులం!”.
“అలాగా! దొంగలేమో అనుకున్నా!” అన్నాడు చిన్నారి జాయప.
ఆ మాటతో ఇద్దరికీ మతి పోయింది. వేలడంత లేని పిలగాడు. చీకట్లో వెరపు లేదు. రాజభటులు అన్న జడుపు లేదు. నడుంపై చేతులు పెట్టుకుని రాజబిడ్డలా చూస్తూ, పైగా ‘దొంగలా?’ అంటున్నాడు.
“అసలు ఎవ్వలు వయా నువ్.. యాడికెల్లి అచ్చినవ్?” అన్నాడొకడు.
“మా బాబాయి గారు.. శ్రీ శ్రీ శ్రీ మల్యాల చౌండ నాయకులు. వారింటికి వచ్చాను” అన్నాడు తాపీగా.
ఇద్దరూ కంగారు పడిపోయారు. ముఖాముఖాలు చూసుకున్నారు. ‘నమ్మాలా వద్దా?’..
నమ్మితే ఒక తంటా. నమ్మకపోతే ఇంకో తంటా.
రెండు ఘడియల తర్వాత వారి గుర్రపుబండి మహాసేనాని మల్యాల చౌండ రాజప్రాసాదం ఎదుట ఆగింది. ప్రవేశమార్గం వద్ద నెగళ్లు వేసుకుని ముచ్చట్లు చెప్పుకొంటున్న ద్వారపాలకులకు సంగతి చెప్పగా.. ప్రతీహారుడు మొగసాల లోపలివెళ్లి, వార్తాహరుడు వచ్చినప్పుడు మోగించే గంటను మోగించాడు. ఒక్క ఘడియ తర్వాత.. అంగరక్షకులు వెంటరాగా, సింహద్వారం తెరచుకుని మల్యాల చౌండ సేనాని బయటికి వచ్చాడు. ఇద్దరు కావలి భటుల మధ్య.. చిన్నారి జాయప. ఎవ్వరూ ఏమీ చెప్పకుండానే విషయం పూర్తిగా అర్థమయ్యిందా యుద్ధ విశారదుడికి.
“అరే.. జాయప! ఇదేమిటి.. ఎప్పుడు అంబారి దిగిపోయావు? ఇంత రాత్రివరకు ఎక్కడ ఉన్నావు నాయనా?” అని అడిగాడు.
“సంతవీధి సందులో నడిచి వస్తున్నాడు ప్రభూ! మీ పేరు చెప్పడంతో ఇక్కడికి తీసుకువచ్చాం. మీకు నిద్రాభంగం కలిగించాం! ప్రభువులు మన్నించాలి!”.. కావలివాళ్లు తలవంచి చెప్పి.. అలాగే వెనక్కి జరిగారు.
చౌండ వెనకే.. భార్య మైలాంబిక, పిల్లలు కాటయ నాయకుడు, పద్మాక్షి వచ్చారు. అందంగా, అమాయకంగా ఉన్న జాయపను ఆశ్చర్యంతో చూస్తున్నారు.
“రా జాయప! లోపలికి రా..” అంటూ, అతని చెయ్యి పట్టుకొని లోపలికి చౌండ తీసుకురావడం వాళ్లను ఆశ్చర్యపరచింది.
సామాన్యులు దరి చేరలేనట్లుండే గంభీర పురుషుడు చౌండ. ఆ చిన్నారి కోసం ప్రసన్న సల్లాప హృదయుడై ప్రవర్తిస్తుండటం.. తన భార్య మైలాంబిక విభ్రమంగా చూస్తున్నది. జాయపను లోపలికి తీసుకెళ్లిన చౌండ.. తన సమున్నత ఆసనం పక్కనున్న మరో ఆసనంపై ఎత్తుకొని కూర్చోబెట్టాడు. తమ తండ్రి మరో పిల్లవాణ్ని అలా ఎత్తుకొని పక్కన కూర్చోబెట్టడం.. పిల్లలిద్దరికీ విచిత్రంగా తోచింది. ఇద్దరూ అడుగులు ముందుకేసి.. పద్మాక్షి వెళ్లి తండ్రి ఒడిలో కూర్చోగా, కాటయ పక్కగా ఆనుకుని నిలబడ్డాడు. వాళ్ల వెనుక.. మైలాంబ నిల్చుని ఉన్నది. ముగ్గురి చూపూ జాయప మీదే. జాయప మాత్రం.. నిర్వికారంగా ఎలాంటి కొత్తా లేకుండా నింపాదిగా ఉన్నాడు. అతనిలో ఏదో విద్వత్తు ఉంది. అది అందరినీ అతనివైపు లాగుతున్నది. దానికి చౌండ కుటుంబం మినహాయింపు కాదు. ఆయనకు లభించిన మహోన్నత స్వాగత సంబురాలు పూర్తయ్యి.. పురజనుల హర్షధ్వానాలన్నీ సద్దుమణిగాక ఇంటికి చేరాడు చౌండ. మహా హారతితో స్వాగతం పలికింది భార్య మైలమ. మల్యాల ఇంటి ముత్తయిదువ ఒక హారతి పట్టగా, యువతులంతా మరో హారతి, కొండిపర్తి నుంచి వచ్చిన వీరశైవ మహాపండితులంతా మరో హారతి.. ఒక్కొక్కటి పది వీశెల కర్పూరం వెలిగించి భారీ భేరీ, పటాహ, కాహళుల ధ్వని అంబరాన్ని తాకుతుండగా మూడు హారతులతో మహా హారతి పట్టారు.. చౌండ రాజప్రాసాదం సింహద్వారం ఎదుట.
ఆయన జైత్రయాత్ర విజయవంతమైన సందర్భంగా ఆమె బంధువులకు, ఆత్మీయులకు, సన్నిహితులకు ఇంటివద్ద ప్రత్యేక విందు ఏర్పాటుచేసింది. విందు పూర్తయ్యి కదలిన అతిథులకు రథాల వరకు వెళ్లి వినమ్ర విధేయతతో వీడ్కోలు పలికి, కాస్త విశ్రాంతిగా సతీసుతులతో ముచ్చటిస్తున్న చౌండకు అంతరాయం కలిగిస్తూ.. జాయప అక్కడ ప్రత్యక్షమయ్యాడు. జాయపను చూశాక ఆయనలో అలసట తగ్గి, ఆనంద మధురిమ మరింత పెరగడం చూసి భార్యాపిల్లలు ఆశ్చర్యపోతుండగా, అతణ్నే చూస్తూ మురిపెంగా చెప్పాడు చౌండ.. “పేరు జాయప! అబ్బురపరచే విన్యాసాల వీరుడు.. బాలమేధావి!”.
మైలమ ముందుకు వచ్చి.. “పేరు సరే! ఎవరీ అబ్బాయి? సైనికులు, యుద్ధ యోధులు తప్ప.. పిల్లలు మీకెలా తెలుసు? ఎక్కడ కలుసుకున్నారు మహానుభావా?” అన్నది చిరునవ్వుతో.
“ఈ పిల్లవాడు పినచోడుడి కుమారుడు.. దివి యువరాజు మైలమా!” స్థిరంగా చెప్పాడు చౌండ.
ముగ్గురూ ఆశ్చర్యంగా చూశారు.
“మైలమా.. పిల్లలను లోపలి తీసుకెళ్లు..” అన్నాడు.
ఆయన చెప్పిన విధానానికి ఆమె మారు మాట్లాడకుండా.. తన పిల్లలతో కదిలింది. “జాయపను కూడా..” అన్నాడు ఆయన. జాయప కూడా కదిలి ఆ పిల్లలతో కలిశాడు. అప్పటికే జాయప బాగా అలసిపోయి ఉన్నాడు. నిద్ర ఆహ్వానిస్తున్నది. ముగ్గురు పిల్లలతో ఆమె లోపలికి వెళ్లింది. కానీ, చౌండ అక్కడే చాలాసేపు ఉండిపోయాడు సాలోచనగా.. ‘ఉదయం చక్ర
వర్తుల వారికి నారమ, పేరమ సంగతి ఎలా చెప్పాలి? జాయపను ఏమి చెయ్యాలి?’.. అనే ఆలోచనలతో, చౌండకు నిద్ర పట్టలేదా రాత్రి.
ఉదయం రాచనగరుకు బయలుదేరిన చౌండ రథం.. మరో మహా ప్రాసాదం వద్ద ఆగింది. ఆ ప్రాసాదం మహా సేనాని, కాకతీయ సామ్రాజ్య సకల సేనాధిపతి రుద్ర సేనానిది. చక్రవర్తి తర్వాతి అత్యుత్తమ సైనికహోదా ఆయనదే. ఆయనను ఎప్పటికీ సకల సేనాధిపతిగా నిర్ణయించారు చక్రవర్తి. నగరు బయటికి వచ్చి చౌండను ఆహ్వానించాడు రేచర్ల రుద్రసేనాని. అంతటి మహావ్యక్తి తనకు పలికిన స్వాగతానికి వినమ్రుడై సాష్టాంగ ప్రణామాలు సమర్పించాడు చౌండ. తన పాదాలను ముద్దాడిన చౌండను ఆప్యాయంగా హత్తుకున్నాడు రుద్రసేనాని. ఇద్దరూ లోపలికి వెళ్లి విశ్రాంతిగా సుఖాసీనులు అయ్యాక అడిగాడు రుద్రసేనాని..
“ఏమిటి చౌండయా! చక్రవర్తులవారే మిమ్మల్ని కలవాలని సంసిద్ధులు అవుతున్న వేళ.. మీరు ఇటు రావడం!”.. పకపకా నవ్వాడు.
‘ఆడపిల్లలను బందీలుగా తెచ్చిన సంగతి చక్రవర్తికి విన్నవించడం ఎలా?’.. మైలమను ఇదే అడిగాడు. ఆమె సలహా ఏమిటంటే.. రుద్రసేనాని వారి సలహా తీసుకోమని. అందుకే రాచనగరుకు వెళ్లాల్సిన రథం.. ముందు రుద్రసేనాని నగరుకు మళ్లింది.
“దేవుడి దర్శనానికి ముందు విఘ్నేశ్వరుల దర్శనం ముఖ్యంకదా పెద్దన్న గారూ!” నర్మగర్భంగా జవాబిచ్చాడు చౌండ.
చక్రవర్తి దర్శనానికి ముందు విఘ్నం ఏదో తొలగించుకోవాలని తన అభిప్రాయంగా ప్రకటించగా.. దానిని గ్రహించాడు రుద్రయ. నిజానికి నారమ, పేరమను బందీలుగా తీసుకువస్తున్నట్లు చక్రవర్తికే కాదు.. తంత్రీపాలుడు కేసరి నాయకుడికి కూడా చెప్పలేదు చౌండ. అదే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నది. చక్రవర్తికి విన్నవించాలా వద్దా? చెప్పకుంటే రాకుమార్తెలను అంతఃపురం బయట ఉంచడం క్షేమంకాదు. వారికి తెలియకుండా లోన ఉంచడమూ సాధ్యం కాదు. ఇంత ఆనంద సమయంలో చక్రవర్తికి ఈ సంగతి విన్నవించడం మంచిదా? కాదా?.. చౌండ చెప్పింది ఆసాంతం విన్నాడు రుద్రయ. అంశం చిన్నదే కానీ సున్నితమైనది.
“ మీరే ఈ సమస్యకు పరిష్కారం చూపగలరని అనుకుంటున్నా” చెప్పాడు చౌండ. అతని ఇబ్బందిని అర్థం చేసుకున్న రుద్రసేనాని నవ్వి..
“మీ ఇబ్బందిని నేను స్వీకరిస్తాను చౌండయా. నా అనుమతిపైనే చౌండ సేనాని ఆ నిర్ణయం తీసుకున్నాడని నేను చక్రవర్తులకు విన్నవిస్తాను. సరేనా?” అన్నాడు.
హృదయ భారమంతా క్షణకాలంలో తుడిచి పెట్టుకుపోయింది. సంతోషంగా లేచి, రెండు చేతులూ జోడించి, తలవంచి నమస్కరించాడు చౌండ.
రుద్రయ కూడా లేచి..
“మీరు నిశ్చింతగా చక్రవర్తి ఆస్థానానికి వెళ్లి, అపూర్వ గౌరవ సత్కారాలను అందుకోండి. ఇలాంటి గొప్ప ముహూర్త వేళ మీలాంటి వీరాధివీరులు ఎలాంటి సందిగ్ధంలో ఉండకూడదు. పదండి! మిమ్మల్ని రాచ
నగరికి తోడ్కొని వెళ్లే అవకాశం నాకివ్వండి చౌండయా..” అంటూ అభిమానంగా ఆయన భుజంపై చెయ్యివేసి.. బయట రథం వరకూ తోడ్కొని వచ్చాడు రుద్రసేనాని. చౌండను తన రథంలోకి ఆహ్వానించి, తనూ అధిరోహించాడు రుద్రసేనాని. ఇద్దరు మహావీరులను ఒకే రథంలో చూడగానే.. జనాలు ఉత్సాహంతో జేజేలు పలకడం ప్రారంభించారు. అది చూసి మరికొందరు.. అలా వీధి ప్రజలు వీరి రథం వెంట పరుగులు తీయసాగారు. దారంతా అదే సంరంభం. అందరికీ చేతులు ఊపుతూ.. రాచనగరు చేరుకున్నారు జంట మహాసేనానులు. (సశేషం)
చక్రవర్తి దర్శనానికి ముందు విఘ్నం ఏదో తొలగించుకోవాలని చౌండ సేనాని తన అభిప్రాయంగా ప్రకటించాడు. దానిని గ్రహించాడు రుద్రయ. నిజానికి నారమ, పేరమను బందీలుగా తీసుకువస్తున్నట్లు చక్రవర్తికే కాదు.. తంత్రీపాలుడు కేసరి నాయకుడికి కూడా చెప్పలేదు చౌండ. అదే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నది.
మత్తి భానుమూర్తి