చిన్నప్పటినుంచీ నాకు ఏది దొరికితే దాన్నే ఇష్టపడటం, దానితోనే రాజీ పడటం, మనసుకు సర్దిచెప్పుకోవడం నా మనస్తత్వం. ఎప్పుడైతే నేను బీఏ చదవాలని నిర్ణయించుకున్నానో, అప్పటినుంచి ఆ డిగ్రీని ప్రేమించడం మొదలుపెట్టాను. అప్పట్లో డిగ్రీలన్నిటిలో బీఎస్సీ కొంచెం గొప్పగా ఉండేది, ఆ తరువాత బీకాం.
డిగ్రీలన్నీ ఒక్కటే అయినప్పటికీ బీఏ అనేది పై రెండిటితో పోలిస్తే కొంచెం తక్కువ. అది ఆడవాళ్లు మాత్రమే చదువుతారనే ఒక అపోహ కూడా ఉండేది. ఇక అందులోనూ ప్రైవేటుగా బీఏ అంటే ఇంక అంతే సంగతులు అన్నట్టుగా అందరూ భావించే వారనుకుంటా. నేను మాత్రం ‘అంతా భ్రాంతియేనా? జీవితానా వెలుగింతేనా?’ అని ఏడుస్తూ ఎప్పుడూ లేను. ‘ఓకే, ఇది డిసైడ్ అయింది కదా, దీని సంగతేంటో చూద్దాం’ అన్నట్టుగా ఉండేదాన్ని.
చాలా పాత తెలుపు నలుపు సినిమాల్లో మొట్టమొదట స్క్రీన్ మీద పేర్లు వచ్చేటప్పుడు ఎన్టీ రామారావు బీఏ, కె.రాఘవేంద్రరావు బీఏ, డీవీ నరసరాజు బీఏ, కొంగర జగ్గయ్య బీఏ లిట్.. ఇలా పేర్లు కూడా మొత్తం చదివిన బాపతు కదా మనం! నటీమణుల్లో వాసంతి బీఏ అని వచ్చేది. అంత గొప్ప వాళ్లే బీఏ చదవగా లేంది నాకేంటి అనుకుని అడ్మిషన్ ఫీజు కట్టి బీఏ లో చేరీ చేరగానే నా పేరు పక్కన కూడా ఎన్ రమాదేవి, బీఏ ఫస్ట్ ఇయర్ అని రాసుకునేదాన్ని. నేనెప్పుడూ అంతే!
జరుగుతున్న దానికంటే ఓ పదేళ్లు ముందు ఆలోచించి అదంతా ఇప్పుడే జరిగిపోయినట్టు ఆనందపడటంలో ముందుంటాను. అది జరగలేదనుకోండి… అప్పుడే బాధపడొచ్చు. ఇప్పట్నుంచీ కన్నీళ్లు వేస్ట్ చేసుకోవడం ఎందుకూ! నేను ఎప్పుడైతే బీఏ చదవాలని నిర్ణయించుకున్నానో అప్పుడు అది కూడా అంత ఈజీ ఏం కాదని అర్థమయింది. అయితే, ఆ సమయంలో నాకు దేవుడిలాగా ఒక వ్యక్తి కనబడ్డారు. ఆయనే రామన్న. అక్కకు ఇంటర్ నుంచి మంచి ఫ్రెండ్ అయిన సరోజకు కాబోయే భర్త. అక్క పెళ్లి సెటిల్ అయినప్పుడే సరోజక్కకు రామన్నతో పెళ్లి నిశ్చయం అయింది.
వాళ్లకు కూడా పెళ్లి సెటిల్ అయిన ఏడాదికి పెళ్లి జరిగింది. రామన్న కాకతీయ యూనివర్సిటీలోనే కెమిస్ట్రీ శాఖలో డిమాన్స్ట్రేటర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. చాలా హెల్పింగ్ నేచర్. ‘నువ్వు ఇంత ఇంటలిజెంట్వి కదా! నీ కుటుంబ పరిస్థితి వల్ల ప్రస్తుతం నువ్వు కాలేజీలో రెగ్యులర్గా చేరి చదవలేక పోతున్నావు. కానీ, వర్రీ అవొద్దు, ఉస్మానియా యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్ అని ఒక విభాగం ఉంటుంది. అక్కడి నుంచి నువ్వు ప్రైవేటుగా చదువుకోవచ్చు. అది కూడా బీఎస్సీ అయితే ప్రాక్టికల్స్ ఉంటాయి, బీకాం అకౌంట్స్ కొంత కష్టం, బీఏ చదువుకుంటే నీకు ఈజీ’ అని చెప్పి ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేసారు.
ఒకసారి ఆయన హైదరాబాద్ వెళ్లినప్పుడు అప్లికేషన్ తెచ్చి దగ్గరుండి పూర్తి చేయించి, ఫొటోలు, సర్టిఫికెట్లు అన్నీ పెట్టి సబ్మిట్ చేయమని చెప్పారు. మరి ఫీజు ఎట్లా? ఏ మాత్రం డబ్బులు లేవు. నేను దిగులుగా ఉండటం చూసి మా అమ్మ తన చేతులకున్న బంగారు గాజులను మా ఇంటి దగ్గర్లో ఉన్న సుశీల అనే కోమట్లావిడ దగ్గర కుదువబెట్టి డబ్బులు తెప్పించి ఇచ్చింది. అమ్మ ఆ రోజున ‘చదివింది చాల్లే!’ అనుకుంటే నా చదువు ఎప్పుడో గట్టెక్కేది. మట్టిగాజులతో అమ్మ చేతులు చూసినప్పుడల్లా ఎంతో బాధేసేది.
మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ చదవటం కోసం నేను రిజిస్టర్ చేయించుకున్నాను. ‘ఆకాశము నుండి శంభుని శిరము’ అనే పద్యంలో ‘పెక్కు భంగులు వివేకభ్రష్ట సంపాతముల్” అని గంగా నదిని వర్ణిస్తారు. ఆ పద్యం చదివితే నాకు బాధేసేది. భగీరథుడు తపస్సు చేస్తే ఆయన పూర్వీకులకు ఉత్తమ గతులు ప్రాప్తించడం కోసం వచ్చింది గానీ, తనంతట తాను వచ్చిందా గంగ! ‘ఒక్కో మెట్టు దిగి పాతాళానికి వచ్చింది, తెలివి లేని వాళ్ల పతనం ఇలాగే ఉంటుంది’ అని కవి అనడం సరైనదేనా? గంగా నదితో పోల్చుకోవడం కాదు గానీ, నా తప్పేమీ లేకపోయినా నేను మెడిసిన్ చదువుతాననుకుని బీఏలో వచ్చి పడ్డాను.
నేను రాజీ పడినా నా ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డారు. ఒక దశలో నేనే కాక నాకు చదువు చెప్పిన టీచర్లు, మా బంధువుల్లో కొందరు నేను డాక్టర్ అవుతానని నా తరఫున కలలు కన్నారు. మా వరదారెడ్డి సారైతే ‘ఏం డాక్టరమ్మా! ఏం సంగతి?’ అనే పలకరించేవారు. ‘అయ్యో! గిట్లెందుకు అయిందిరా?’ అని బాధపడేవారు. ఓ సారి మా నాన్న కజిన్ అనసూయత్తయ్య కొడుకు డా॥ నర్సింహారావు (మేం నర్సిం బావా అనేది) హైదరాబాదు నుంచి వరంగల్ వెళుతూ మా ఇంటికి వచ్చాడు. వాళ్ల నాన్న, అన్నయ్య కూడా డాక్టర్లే. మాటల మధ్య ‘ఏం జేస్తున్నవ్ రమా?’ అనడిగాడు. ఎంతో కష్టపడి మాటలు కూడదీసుకుని చెప్పాను.
‘ఆ.. ఇగ ప్రైవేటుగ బీయ్యే అంటే అయినట్టే! అంతే సంగతులు!!’ అన్నాడు నవ్వుతూ లైట్గా. తలకాయ తీసి కాసేపు ఎక్కడన్నా పెట్టుకుని మళ్లీ వద్దామా అనిపించింది. ఏమీ మాట్లాడలేదు. ‘నేను బాగా చదువుకుని పేద్ద ఉద్యోగం చేసి ( ఏ ఉద్యోగమో క్లారిటీ లేకపోయినా) ఈయనకు చూపించాలి’ అని గట్టిగా మనసులోనే శపథం చేశాను. చాలా ఏళ్ల తరువాత నేను బ్యాంకు ఆఫీసర్గా ఉన్నపుడు ఓసారి ఏదో పెళ్లిలో కలిసినప్పుడు ఆయన అన్న మాట గుర్తు చేశాను. ‘చూడు మరీ! నేను అట్ల అన్నందుకే నువ్వు పట్టుదలతో చదివి ఇంతదానివి అయినవ్ గదా!’ అని నవ్వాడు నర్సిం బావ. నేనూ నవ్వేసాను. మనం అనుకున్నవన్నీ జరగవు. జరగని వాటికోసం నిరాశ పడవద్దు. మనకేది దొరికిందో అదే మనది అనుకోవాలని ఒక కొత్త పాఠం అప్పుడు నేను నేర్చుకున్నాను.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి