రోమ్: ఇటలీలోని పాఠశాలల్లో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే బుర్ఖా, నిఖాబ్లను నిషేధించడంతోపాటు, ఒక్కో తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని ఆదివారం ప్రకటించారు. విద్యా వ్యవస్థలో ఇటాలియన్ భాషా పరిజ్ఞానం, వలస విధానాలకు సంబంధించిన చర్యలను క్యాబినెట్ ముందుకు తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు. మెలోని తన ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీ యువజన విభాగం వార్షిక సమావేశంలో ఈ ప్రతిపాదన వెల్లడించారు. ప్రతి తరగతి గదిలో విదేశీ విద్యార్థుల సంఖ్య గరిష్ఠ పరిమితిని చట్టబద్ధం చేసే చర్యను త్వరలోనే క్యాబినెట్ ముందుకు తీసుకువస్తామని తెలిపారు.