‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లోరూ.2 వేల బహుమతి పొందిన కథ.
వేగంగా వస్తున్న కారుకు అడ్డుగా నిల్చొని, చేయి ఊపుతున్నాడు ఓ వ్యక్తి.. ఆపండన్నట్టు.
నేను కారు స్లో చేసి ‘ఏమిటి?’ అన్నట్టు చూశాను.
నడివయసు వ్యక్తి అతను. రైతులా ఉన్నాడు. నేను కారు ఆపగానే నావైపు వచ్చి..
“జర గా గోపాల్రావుప్యాట దాక గీ ముసలోన్ని తీస్కపోవాలె సారు! గాడ సర్కార్ దవఖాన కాడ దించిపోతె సాలు!”.. అన్నాడు రోడ్డుపక్కన కూలబడి ఉన్న వృద్ధుని వైపు చూపిస్తూ..
నేను అతణ్నే చూస్తూ..
“ఏ.. బస్సుల్లేవా? నా కార్లనే ఎందుకు ఎక్కించుకోవాలి?” అన్నాను.
‘ఈ మధ్యన ప్రతి ఒక్కడికీ కార్లను ఆపి లిఫ్ట్ అడగడం ఫ్యాషనైపోయింది!’ అనుకుంటూ!
“గా బస్సోడే గీడ దించిపోయిండు సారు. పైసల్ తక్కువున్నయని.. దిగుమని ఆగం బట్టించిండ్రట. కాలుజారి కిందవడ్డడు. కాలు కదిలిత్తలేడు. ఇరిగిందో పాడో..! గీనెకు ఎవ్వలు లేనట్టున్నరు సారు. పాపం గా సర్కారు దవాఖాన దాక తీస్కపోతే.. గాళ్లు ఏదన్న జేత్తరు!” అతను టకటకా చెప్పుకొంటూ పోతున్నాడు.
రోడ్డుపక్కన వాలిపోయినట్టుగా పడి ఉన్న వృద్ధునివైపు చూశాను. తలతిప్పుకోబోతూ.. మళ్లీ ఆ వృద్ధుణ్ని తిరిగి చూశాను.
అరవై ఏండ్లు పైబడి ఉంటాడు. జీవితంలో చాలా ఒడుదొడుకులు చవిచూసిన వ్యక్తిలా శరీరం శుష్కించి కనిపిస్తున్నాడు. ఆదరించేవారు లేని అసహాయుడిలా, లేచి నిల్చోలేని స్థితిలో అల్లాడిపోతున్నాడు.
నా మనసు పొరల్లో ఎక్కడో ఏదో కదలినట్లయ్యింది. ఆ వృద్ధుణ్ని తేరిపార చూసి.. కారు దిగాను.
“ఏం పేరు ఈయనది..?” అతనివైపు నడుస్తూ అడిగాను.
“తెల్వది సార్..” అన్నాడు.
ఈలోపు ఆ వృద్ధుడు ఏదో గొణిగాడు. కానీ, సరిగా అర్థం కాలేదు. నేను దగ్గరగా వెళ్లి..
“పెద్దాయనా..! ఏం పేరు నీది..?” అన్నాను గట్టిగా.
అతను బాధను పంటిబిగువున భరిస్తున్నట్టు ఇబ్బంది పడుతూ..
“వెం.. వెం.. కట.. రాములు!” అన్నాడు.
“ఎక్కడుంటారు? మీవాళ్ల అడ్రసేమైనా
చెబుతారా?”.
అతను అసహాయంగా తల వెనక్కివాల్చాడు. తొంటి ఎముక బాధిస్తున్నట్టు విలవిల్లాడిపోయాడు.
“ఏ ఊరోగనీ బతికిసెడ్డ మనిసి లెక్కనే ఉన్నడు. గీనెకు ఎవలు లేనట్టున్నరు సారూ” అన్నాడు ఆ వ్యక్తి.
నేను మరో ఆలోచన చేయలేదు.
“ఏదైతేనేం? ఎక్కించు” అన్నాను.
“గా దవాఖాన్ల షెరీక్ జేసినంక ఆళ్ల మనుసులు ఎవలన్న ఉన్నరేమో ఆరా తీస్తా సారు. పాండ్రి..” అంటూ పక్కనే ఉన్న మరోవ్యక్తిని పిలిచి, ఇద్దరూ అతని భుజాలు పట్టి లేపారు. ప్రాణాలు పోయినట్టుగా అల్లాడిపోయాడు ఆ వృద్ధుడు. నేనూ సాయంపట్టి చాలా కష్టంగా కారు వెనుక సీట్లోకి చేర్చాం. కారు ఆపిన వ్యక్తిపేరు ‘సాంబడు’ అని నిర్ధారించుకొన్నాక..
“ముందుకొచ్చి కూర్చో సాంబన్నా!” అన్నాను. అతను కూర్చోగానే కారు కదిలింది. గ్రామీణ రోడ్డు కావడంతో తారురోడ్డయినా గతుకులమయంగా ఉంది. మధ్యమధ్యలో వెనక్కి తిరిగి చూసుకుంటూ నిదానంగా పోనిచ్చాను కారును.
“మీరు దేవునోలె వచ్చిండ్రు సారూ! లేకపోతె గీ ముసలోన్ని ఎవలు పట్టించుకునెటోళ్లు కాదు. మా లింగడు కూడ రమ్మంటె రాకపాయె..” సాంబడు దారెంట మాట్లాడుతూనే ఉన్నాడు.
“ఈయన వివరాలేవీ నిజంగానే తెలియదా సాంబన్నా?”.
“లేదు సారూ! ఈనెది గా పెగడపెల్లి అని ఎవలో సెప్పిండ్రు. జెర పదిమందికి తెల్సిన మనిసి అయ్యుంటడు. తెల్సుకునుడు కష్టమేం గాదు”.
మధ్యమధ్యలో పెద్దాయనకు ధైర్యం చెబుతూ ముందుకు సాగుతుంటే.. గోపాల్రావుపేట వచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రోడ్డు పక్కనే ఉంది. కారు దాన్ని దాటి వెళ్తుంటే..
“అగో.. గదే గదే సారూ! దవఖాన. ఆపుండ్రి!”.. సాంబడు అరిచాడు.
నేను కారును ఆపకుండానే..
“సాంబన్నా! నీకేం పని లేకపోతే ఈపూట నువ్వు నాతోనే ఉండు. ఈ పెద్దాయన్ను కరీంనగర్ ఆస్పత్రిలో చూపిద్దాం..” అన్నాను నిదానంగా.
సాంబడు కంగారు పడ్డాడు.
“అయ్యో సారూ! నాకాడ పైసల్లేవు. గంత దూరమచ్చి నేనేం జెయ్యాలె? అయినా మీకెందుకు లొల్లి. గాలికోయె కంప! గీ దవఖానలేత్తె పాయె!” అన్నాడు.
“తొందరపడకు సాంబన్నా! ఎట్లాగూ ఓ మంచిపనికి దిగినవ్. పూర్తిగా చేస్తేనేకదా ఫలితం ఉండేది. పాపం పెద్దాయనకు ఎవరున్నారో లేదో అంటున్నావ్! నువ్వే పెద్దకొడుకనుకో!” అన్నాను.. అతని మనసు మార్చే ప్రయత్నం చేస్తూ.
“ఏం పెద్దకొడుకో ఏమో! నాకాడైతే పైసల్లేవు!” అన్నాడు రెట్టిస్తూ.
“పైసలెందుకు సాంబన్నా! నేనున్నాగదా! నువ్వు నాతో ఉండు చాలు” అంటూ రోడ్డు బాగా ఉండటంతో స్పీడు పెంచాను.
పైసల విషయం ఎత్తకపోయేసరికి సాంబడు కూడా సైలెంట్ అయిపోయాడు. నలభై నిమిషాలకు కరీం
నగర్లోని లక్ష్మణ్ ఆర్థో
పెడిక్ సెంటర్లో అడ్మిట్ చేశాం. డాక్టర్
ఆపరేషన్
థియేటర్లో ఉండటంతో రెండు గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. అప్పటికే చీకటి పడుతుండటంతో..
“ఏం చేద్దాం సార్..?” అన్నాడు సాంబడు నిరాశగా.
అతనికి ఎప్పుడెప్పుడు ఆ బాధ్యత నుంచి విముక్తుడైతే బాగుండు అన్నట్టుంది.
అతని స్థితిని అర్థం చేసుకున్నాను. వాళ్లూరికి బస్సులో వెళ్లడానికి గంట పడుతుంది.
“సాంబన్నా! నా ఫోన్ నెంబర్ తీసుకొని నువ్వెళ్లిపో! నేను ఏ రాత్రి వరకైనా పెద్దాయనకు ఎక్స్రే తీయించి, అవసరమైన చికిత్స చేయిస్తాను. నువ్వు ఎట్లాగైనా వాళ్ల కుటుంబ సభ్యులు ఎక్కడుంటారో కనుక్కొని వాళ్లకు తెలియజేసి, నాకూ ఫోన్ చేయ్” అన్నాను.
సాంబన్న మొహంలో భారం తొలగిపోయిన భావన కనిపించింది.
“గట్లనే సారు. నేను ఎట్లనన్న రేపు మాపటీలి వరకు గీయన కుటుంబం గురించి తెల్సుకొని ఆళ్లకు, మీకు తెలియజెప్త.. మరి నే బోయత్త!” అన్నాడు.
నేను అతని జేబులో ఐదొందల నోటు ఉంచాను.
“అయ్యో! ఎందుకు సారూ గిన్ని పైసలు? మా ఊరికి బస్కిరాయి యాభై రూపాలే” అన్నాడు.
“ఉండనీ సాంబన్నా!”..
బతుకు జీవుడా! అంటూ బయటపడ్డాడు సాంబడు. సాయంత్రం బస్సుకు వాళ్లూరు వెళ్లిపోయాడు.
నేను నా భార్య జ్యోతిర్మయికి ఫోన్చేసి విషయమంతా వివరించాను.
రెండుగంటల తర్వాత డాక్టర్ వచ్చాడు. నిదానంగా పరీక్షించాడు. ఎక్స్రే రిపోర్టు వచ్చింది.
“కుడివైపు తొడభాగం నుంచి తొంటి వరకు పగులు ఏర్పడింది. యాభై రోజులు కదలకుండా పడుకోబెట్టాల్సిందే!” అన్నాడు డాక్టర్.
పాదం నుంచి తొంటి వరకు పీవోపీ కట్టు కట్టారు. నెలరోజులపాటు వాడాల్సిన మందులు గట్రా రాసిచ్చారు. అన్నీ పూర్తయ్యేసరికి రాత్రి పది గంటలైంది.
అప్పటివరకూ అలసిన శరీరం బెడ్మీద ప్రశాంతంగా నిద్రపోతున్నది. తెల్లవారితే గానీ ఆయన కుటుంబ వివరాలు తెలిసేలా లేవు. సాంబడు ఏదైనా సమాచారం ఇవ్వొచ్చు. అప్పటివరకూ ఎలా??
పళ్లరసం ఆహారంగా ఇచ్చి, ఆ రాత్రికి నేను ఆయనతోనే ఉండిపోవడానికి సిద్ధపడ్డాను.
మర్నాడు ఆఫీసుకు సెలవుపెట్టి మధ్యాహ్నం వరకూ వెంకట్రాములుతోనే ఉండిపోయాను. ఈలోపు ఆయన ఏదైనా మాట్లాడతాడేమోనని చూశాను. కానీ, ఇంకా నీరసంగానే ఉండటంతో ఏమీ మాట్లాడలేకపోయాడు. అయినా ఒకటి రెండు ప్రశ్నలు వేసి చూశాను. కానీ, అశక్తత వల్లనేమో.. కన్నీరు కారుస్తూ, పైకి చూస్తూ ఉండిపోయాడు. నేను జాలిగా చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేకపోయాను. కొంచెం ఒత్తిడి చేసి పాలు, బ్రెడ్డు మాత్రం తినిపించగలిగాను. ఒంటిగంట సమయంలో సాంబడు ఫోన్ చేశాడు.
“ఎంకట్రాములు గురించి వివరాలు తెల్సుకున్న సారూ! గాయినది మా పక్కూరు పెగడపెల్లే. గిప్పుడు నేను గాయిన ఇంటికాన్నే ఉన్న” అన్నాడు.
నాలో ఆనందం పొంగింది.
“చెప్పు సాంబన్నా! ఇంట్లో ఎవరున్నారు?”.
“ఒవలూ లేరు సారూ! తాళం ఏసుంది. పక్కోళ్లను ఇచారించిన. గాయిన భార్య ఏడెనిమిదేండ్ల కిందనే కాలం జేసిందట. ఉన్న ఒక్క కొడుకూ యాన్నో దూర
దేశాన పెద్దనౌకరే సేత్తుండటగని గీనెను పట్టించుకోడట. లగ్గమైనసంది గంతేనట! గప్పట్ల ఒక్కట్రెండు సార్ల ఒచ్చి పోయిండట సారూ! గీ నాలుగైదేండ్ల సంది గిటుమొకాన అత్తలేడట. గిప్పుడు గా ఎంకట్రాములు ఒక్కడే కాలం ఎల్లదీత్తుండట!”.
నా మనసు మళ్లీ మౌనంగా మూల్గింది.
“కొడుకు ఎక్కడుంటాడో సరిగ్గా తెల్సుకోలేక పోయావా?”.
“లేదు సారూ! పదిరువై మందిని అడిగిన. ఎవలకు తెల్వదట”.
నేను వెంకట్రాములు వైపు దీనంగా చూస్తుండి
పోయాను. భార్య లేదు. కొడుకు ఉన్నా తండ్రి బాగోగులు విస్మరించి తనదారి తాను చూసుకున్నాడు. వృద్ధాప్యం! తొంటి వరకు బ్యాండేజీతో దాదాపు రెండునెల్ల వరకూ కదలలేని పరిస్థితి. ఏం చేసేది??
జ్యోతిర్మయికి ఫోన్చేసి విషయమంతా వివరించి ఆమె వచ్చేవరకూ ఆలోచిస్తూ ఉండిపోయాను.
రెండు గంటల సమయంలో జ్యోతిర్మయి క్యారేజ్ తీసుకొని వచ్చింది. ఇద్దరం కలిసి ముందుగా వెంకట్రాములుకు కాస్త ధైర్యం చెప్పి, భోజనం చేయించాం. అప్పటికి ఆయనలో కొంత మార్పు కనిపించింది. పరిసరాల మీద అవగాహన కలిగింది.
అప్పుడు మాట్లాడాడు.
“బాబూ! ఎవరోగానీ దేవునోలె చూసుకున్నావ్. ఖర్చుగూడా బాగానే అయినట్టుంది. నాకు తీర్చే స్తోమత లేదు బాబూ! మా పల్లెలో నాకో పాతిల్లు తప్ప ఇంకేమీ లేదు. ఎట్లన్నా నన్ను మా ఇంటిదగ్గర పడేయి బిడ్డా! నీ బాకీలో ఉండిపోవుడు తప్ప ఇంకేం చేయలేను..” అన్నాడు కాస్త ఓపిక తెచ్చుకుంటూ.
“మీ కొడుకు ఇప్పుడు ఎక్కడుంటున్నారో చెప్పగలరా!?” అన్నాను ఆతృతగా.
ఆయనేమీ మాట్లాడలేదు. పైకి శూన్యంలోకి చూస్తుండి పోయాడు.
“మీ కొడుకు గురించి చెప్పండి!” నేను రెట్టించాను.
ఆయన్నుంచి మౌనమే సమాధానమైంది తప్ప.. ఎలాంటి జవాబు రాలేదు. కళ్లనుంచి మాత్రం సన్నటి నీటి ధార కనిపించింది. ఆయన్ను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని అర్థమైంది. అప్పటికే జ్యోతిర్మయితో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చిన నేను.. ఆయనకు దగ్గరగా కూర్చొని స్థిరంగా అన్నాను.
“మీరేమీ అనుకోకపోతే.. మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను”.
వెంకట్రాములు విస్తుబోయి చూశాడు.
“నేనెవర్ని బాబూ? మీ ఇంటికి తీసుకపోయేంత గొప్పోణ్ని కాదు. ఉద్యోగం సద్యోగం లేక కాలం వెళ్లదీసినవాణ్ని. నా భార్య లోకం విడిచిపెట్టి పోయింది. తనతోపాటే కాలు బయటపెట్టిన నా కొడుకే నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. నన్ను భరించడం వల్ల మీకేం వస్తుంది బిడ్డా? ఇప్పటికే మీ బాకీలో పడిపోయిన. నా ఇంటిదాకా తీసుకెళ్లి పడేస్తే ఎట్లో ఎళ్లదీస్తా.. బతికుంటే నీ రుణంకూడా తీర్చుకునేందుకు ప్రయత్నిస్తా” అన్నాడు రెండు చేతులెత్తి మొక్కుతూ.
ఆయన ఎత్తిన చేతుల్ని వారిస్తూ..
“లేదండీ! మేం ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. తోడు లేకుండా మీరు ఈ రెణ్నెల్ల్లపాటు ఉండలేరు. కదల్లేరు. కదిల్తే పగిలిన భాగం అతకదు. శాశ్వతంగా లేవలేకపోతారు. కాబట్టి మా ఇంటికి తీసుకుపోతామని అంటున్నాం..” అన్నది జ్యోతిర్మయి.
ఆయన తల విదిలించాడు.
“అయినా సరే బిడ్డా! నేనెవర్నని మీకు భారం కావడానికి? వయసు మళ్లినోణ్ని. ఎట్లో అయితది. నా ఇంటిదాకా చేర్చండి చాలు” అన్నాడు మళ్లీ చేతులెత్తుతూ.
“మీరిట్లా మాటిమాటికీ చేతులెత్తడం మానండి. ఇప్పటికి నేనూ మీ కొడుకునే అనుకోండి!” అంటూ ఆయన రెండు చేతుల్నీ కిందికి దించాను. వ్యక్తం చేయలేని భావోద్వేగంతో లేవబోయాడు వెంకట్రాములు. కానీ, అశక్తుడయ్యాడు. పక్కనే ఉన్న జ్యోతి వారించింది.
అప్పటికే హాస్పిటల్వాళ్లు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసి బిల్లు సిద్ధం చేశారు. నేను అటువైపు నడిచాను. కావాల్సిన మందులు, అవసరమైన సామగ్రి కొని బిల్లు చెల్లించాను. ఈలోపు ఆసుపత్రి సిబ్బంది సాయంపట్టి వెంకట్రాముల్ని అంబులెన్స్లో ఎక్కించారు. అరగంట తర్వాత పెద్దాయన మా ఇంటికి చేరాడు. స్ట్రెచర్
సాయంతో ఇంట్లో గెస్టురూంలోకి తీసుకొచ్చారు వెంట
వచ్చిన సిబ్బంది. గదిలో ఉన్న బల్లను ఆయనకు అనుకూలంగా అమర్చి, దానిమీద పరుపు వేసి పడుకోబెట్టాం. గెస్టురూం ఆయనకు సౌకర్యంగానే ఉంది. అటాచ్డ్ బాత్రూం, పెద్దపెద్ద కిటికీలు, బయట పూల
మొక్కల నుంచి వచ్చే గాలితో ఒకరకంగా ఆయనకు హాయి కలిగించే వాతావరణమే. ఇంట్లో కూడా ఎవరూ లేరు. పిల్లలిద్దరూ చదువుల కోసం సిటీలో ఉన్నారు. అమ్మ చెల్లెలింటికి వెళ్లింది. ప్రస్తుతానికి మేమిద్దరం, మాతో ఆయన!
సాయంత్రం ఐదు అవుతున్నది. అన్నీ అమర్చాక పాలు, పళ్లరసం అందించింది మా ఆవిడ. అప్పటికే వెంకట్రాములు మలమూత్ర విసర్జనకు ఇబ్బంది పడుతున్నాడు. ఆయనకు ఏం మాట్లాడాలో.. ఎందుకు తాము ఆయన్ని ఆదరిస్తున్నామో అర్థంకాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. నేను ఆయన పక్కనే కూర్చొని ఓపెన్గా చెప్పాను.
“చూడండీ! ‘వీళ్లెవరు? నాకెందుకు సేవచేస్తున్నారు?’ అనే ఆలోచన మానండి. మేమిది సేవ అనుకోవడం లేదు. మీరు మీ శరీరాన్ని కనీసం నెలరోజులపాటు కదిలించకూడదు. కాబట్టి మలమూత్ర విసర్జనకు చైరూ, బేసిన్ సహా ఏర్పాటు చేశాం. నేను బయట ఉంటాను. మీరు కానిచ్చేయండి. తర్వాత నేను క్లీన్ చేస్తాను” అని తలుపువేసి బయటికొచ్చాను. పదిహేను నిమిషాల తర్వాత పిలిచాడు. బేసిన్ను వాష్రూంలోకి తీసుకెళ్లి క్లీన్చేసి వచ్చాను. వెంకట్రాములు చలించిపోయాడు.
“బిడ్డా..! నాలాంటి దౌర్భాగ్యుడి మలమూత్రాలు తీసే ఖర్మ నీకెందుకు బిడ్డా! నన్ను వదిలేయ్!”.. అంటూ చిన్నపిల్లాడిలా బావురుమన్నాడు.
జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించినా ఎన్నడూ రోదించి ఉండడు. ఇప్పుడు మాత్రం భరించలేని దుఃఖం పొంగుకొస్తుంటే కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఒక అనామకుడైన తాను ఇంతటి సేవకు అర్హుణ్ని కాదేమోనని విలపిస్తున్నాడు.
నేను ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేయలేదు. కడుపులో ఉన్న దుఃఖం మంచుగడ్డలా పూర్తిగా కరిగిపోవాలని చూశాను. ఏడ్చి ఏడ్చి కాస్త ఉపశమించాక నెమ్మదిగా దగ్గరికి జరిగి ఆయన పక్కనే కూర్చున్నాను.
“మనసులో ఉన్న సందేహాలు, బాధలన్నీ దుఃఖం రూపంలో వెళ్లిపోవాలని ఆగాను. ఇంకా ఏడవాలనిపిస్తే ఏడవండి! రేపట్నుంచి మళ్లీ మీకు దుఃఖం రావద్దు. మిమ్మల్ని పూర్తి ఆరోగ్యవంతులుగా చేశాకే మీ ఇంటికి తీసుకెళ్తాను. ఇక ఏ సందేహాలు లేకుండా హాయిగా నిద్రపోండి” అని లేచాను.
నేను బయటికి వెళ్లిపోబోతుంటే వెనుక నుంచి చేయిపట్టి పిలిచాడు.
“బిడ్డా! ఒక్కటి.. ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. లేకుంటే నేను నిద్ర పోలేను” అన్నాడు వెంకట్రాములు.
నేను ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని కలవాలని వస్తే.. ఆ కాలేజీని మీరు ఇతరులకు ఇచ్చేశారని విన్నాను. వేరే ఏదో కాలేజీలో పార్ట్టైంగా పనిచేస్తున్నారని తెలిసింది. అయితే అక్కడా దొరకలేదు. ఎక్కడుంటున్నారో ఎవరూ చెప్పలేదు. అప్పట్నుంచి ఇప్పటికీ మీరు నా మదిలో మెదలుతూనే ఉన్నారు. నాకు ఉద్యోగం వచ్చాక కూడా చాలా ప్రయత్నించాను. ఎక్కడా మీ వివరాలు తెలియలేదు. నా అదృష్టమో, దురదృష్టమో మీరు ఈ స్థితిలో దొరికారు.
నేను క్షణం ఆగి..
“అడగండి!” అన్నాను.
“నువ్వెవరు? ఇంత ఖర్చు, శ్రమను భరిస్తూ నాకెందుకు సేవ చేస్తున్నావ్? ఇది మాత్రం చెప్పు బిడ్డా!”.
నేను నిమిషంపాటు మౌనంగా ఉండిపోయాను. మా నాన్న కళ్లముందు మెదిలాడు. మనసు ఉద్విగ్న స్థితిలోకి మారుతుంటే నెమ్మదిగా మనసు విప్పాను.
“ఇరవై ఏళ్ల క్రితం మీరు ‘విద్యార్థి జూనియర్ కళాశాల’ నడుపుతున్నప్పుడు నేను ఆ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిగా మీకు శిష్యుణ్ని. గణితంలో నా రాతను, గీతను మార్చిన మీరు నాకు గురువులు. మీరు లేకుంటే ఈరోజు నేనిట్లా ఉండేవాణ్ని కాను సార్..” అన్నాను.
వెంకట్రాములు భృకుటి ముడివేసి చూస్తుంటే
కొనసాగించాను.
“మీకు గుర్తుందో లేదో సార్! నాకు ఎంసెట్ పరీక్ష రోజే మా నాన్న చనిపోయాడు. నేను ఆయన శవం దగ్గర ఏడుస్తుంటే నన్ను పక్కకు తీసుకెళ్లారు. నా పేదరికాన్ని గుర్తుచేశారు. మా కుటుంబం పట్ల నా బాధ్యత ఏమిటో గుర్తుచేశారు.
‘అనారోగ్యంతో చనిపోయిన మీ నాన్న తిరిగిరాడు. కానీ, మీ అమ్మనూ చెల్లెనూ చూడాల్సిన బాధ్యత నీదే!’ అని చెప్పారు. అందర్నీ ఒప్పించి బలవంతంగా నన్ను మీ బైకు మీద కరీంనగర్ తీసుకెళ్లి, ఎంసెట్ ఎంట్రెన్స్ రాయించి తీసుకొచ్చారు. ఆ తర్వాతే అంత్యక్రియలు చేయించారు. దాని ఫలితమే.. నేను పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీర్ను అయ్యాను. చెల్లెలి పెండ్లి చేయగలిగాను. ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను.
నేను ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని కలవాలని వస్తే.. ఆ కాలేజీని మీరు ఇతరులకు ఇచ్చేశారని విన్నాను. వేరే ఏదో కాలేజీలో పార్ట్టైంగా పనిచేస్తున్నారని తెలిసింది. అయితే అక్కడా దొరకలేదు. ఎక్కడుంటున్నారో ఎవరూ చెప్పలేదు. అప్పట్నుంచి ఇప్పటికీ మీరు నా మదిలో మెదలుతూనే ఉన్నారు. నాకు ఉద్యోగం వచ్చాక కూడా చాలా ప్రయత్నించాను. ఎక్కడా మీ వివరాలు తెలియలేదు. నా అదృష్టమో, దురదృష్టమో మీరు ఈ స్థితిలో దొరికారు. ఏదైతేనేం.. ఇన్నాళ్లకు మీరు మా నాన్నలా మా ఇంట్లో చేరారు. మీకు సేవ చేయడం మా నాన్నకు చేస్తున్నట్లే భావిస్తున్నాను”.. ఓ క్షణం ఊపిరి పీల్చుకొని..
“నా ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష సార్!”
నా కంఠంలో అదోరకమైన ఉద్విగ్నత.
మొహంలో ప్రసన్నత తాండవిస్తుండగా ఆయన చేతిలోనున్న నా చేయిని మరింత బిగించాడాయన. పక్కనే నిలబడి కొంగుతో కన్నీళ్లద్దుకొంటున్న నా భార్య జ్యోతిర్మయిని దగ్గరికి పిలిచాడు. ఆమె చేయిని తన ఎడం చేతిలోకి తీసుకున్నాడు. ఇద్దరి చేతుల్నీ తన రెండు చేతుల్తో బిగించిపట్టాడు. ఆ బిగింపులో వేనవేల భావాలు పలుకుతున్నాయి.
కటుకోజ్వల మనోహరాచారి
మనోహరాచారి స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. ఎంఏ (తెలుగు) చేశారు. డా. డింగరి రామాచార్య సాహిత్యంపై పరిశోధన చేసి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. కోరుట్ల బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. 1996లో స్వాతి వీక్లీ సరసమైన కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన ‘వర్షంలో వనకన్య’ ఈయన మొదటి కథ. ఈయన రాసిన 52 కథలు ప్రముఖ దిన, వార పత్రికల్లో ప్రచురణకు నోచుకున్నాయి. 150 కవితలు, 25 నాటికలు, 50 పాటలు కూడా రాశారు. 8 పుస్తకాలను వెలువరించారు. తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తక రచయితల బృందంలో సభ్యుడిగా పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పాలుపంచుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా స్థాయి విశిష్ట సాహితీ పురస్కారంతోపాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. తన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని మలుపుతిప్పిన తన చిన్ననాటి గురువును ఒక విద్యార్థి ఎలా ఆదరించాడన్నదే ఈ ‘ఆప్తుడు’ కథ ఇతివృత్తం.
కటుకోజ్వల మనోహరాచారి
94410 23599