‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ.
అక్కడ భయంకర నిశ్శబ్దం ఆవరించుకుంది. అంతమంది ఉన్నా, అంతా మౌనశిలల్లా మారిపోవడంతో.. సూది కిందపడ్డా శబ్దం వినిపించేంతగా నీరవం రాజ్యం ఏలుతున్నది.
మూడు రోజుల క్రితం.. ఆ ఇంటి యజమాని తండ్రి – విశ్వనాథశాస్త్రి కాలం చేశాడు. డబ్భు అయిదేళ్లు అతనికి. స్వల్ప అనారోగ్యంతో మరణించాడు. పౌరోహిత్యం చేసేవాడు.. శాస్త్రులు గారు. ముఖ్యంగా శ్రాద్ధకర్మలను శాస్త్రోక్తంగా జరిపించేవాడు.
విశ్వనాథశాస్త్రి మరణించి.. అప్పటికి మూడవ రోజు. చిన్నదినం జరిగింది. బంధుమిత్రులు అందరూ విచ్చేశారు. శాస్త్రులుగారి పెద్ద కుమారుడు రామశాస్త్రి. నలభై అయిదేళ్లు అతనికి. తండ్రికి తలకొరివి పెట్టాడు. కర్మ కాండలను భక్తిశ్రద్ధలతో జరిపిస్తున్నాడు.
చిన్నకర్మ కాండను శాస్త్రులు గారిని దహనం చేసిన శ్మశానవాటికలోనే జరిపించారు. పంతులుగారు యథావిధి పూజ చేశారు. శవాన్ని వాహనం వరకు, ఆ తరువాత వాహనం నుంచి చితి వరకు మోసినవారి భుజాలకు నూనె రాసారు. శాంతి, పిండప్రదానం జరిగాయి.
చివరిగా పిండాలను కాకులకు పెట్టే ఘట్టం. విస్తరిని గట్టు మీద పెట్టి..
‘లోటుపాట్లు ఉంటే క్షమించి, వాటిని ఆరగించండి!’ అంటూ మనసులోనే కన్నీటితో తండ్రిని ప్రార్థించుకున్నాడు రామశాస్త్రి.
అయితే, పిండాలను ముట్టడానికి కనుచూపు మేరలో ఎక్కడా కాకి అన్నదే కానరాలేదు. సుమారు గంటసేపు వేచి ఉన్నా.. ఒక్క కాకీ రాలేదు. ఎటు చూసినా పావురాలే! రామశాస్త్రికీ, అతని కూడా వెళ్లినవారికీ ఏం చేయాలో తోచలేదు.
‘కిం కర్తవ్యం?’ అన్నట్టు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు నిరుత్సాహంతో. వారి అవస్థను గమనించిన కర్మకాండ జరిపించిన పంతులు గారు..
“పల్లెటూళ్లలో లాగ, నగరాలలో కాకులు కనిపించవు. పావురాలే ఉంటాయి. ఈ ఒక్కచోటే కాదు, అన్ని ప్రాంతాలలోనూ ఇదే సమస్య. ‘మమ’ అనుకుని సరిపెట్టుకోవాల్సిందే! మీరు దణ్ణం పెట్టేసుకుని వెళ్లండి. అదృష్టం బాగుంటే.. ఏ కాకి అయినా దారి తప్పి
ఇటు వస్తే తింటుంది. లేకపోతే పిండాలను నీళ్లలో కలిపేయవచ్చును!” అంటూ సలహా ఇచ్చాడు.
ఆ వాటికను పరిశీలనగా చూశాడు రామశాస్త్రి. ఆ శ్మశాన వాటికలోనూ, చూట్టూరా చెట్లు బాగానే ఉన్నాయి. కానీ, వాటిపైన కాకి అనే పక్షి కనిపించలేదు. అన్నిచోట్లా పావురాలే ఉన్నాయి.
“కనీసం గద్ద అయినా కనిపిస్తే బావుండేది” అన్నారు ఎవరో.
“గద్దలు కూడా ఎప్పుడో కానీ కనిపించవండి. ఒకవేళ ఒకటీ అరా ఎప్పుడైనా ఇటువైపు వచ్చినా.. ఈ విస్తరి దాని కంటికి ఆనాలికదా!” అన్నాడు వాటిక సిబ్బందిలో ఒకడు.
మరికొంత సమయం ఓపికగా వేచి చూసి.. చేసేదిలేక, పంతులు గారి సలహాను పాటించి తిరుగుముఖం పట్టారు అందరూ.
ఇంటికి వచ్చాక విషయం చెప్పడంతో.. ఒక్కసారిగా ఘొల్లుమన్నది రామశాస్త్రి తల్లి రామాయమ్మ.
డబ్భు ఏళ్లు ఉంటాయి ఆవిడకు. సత్యకాలపు మనిషి. చాదస్తం ఎక్కువ.
“అయ్యో! కర్మ చేసి పిండాలు కాకులకు పెట్టకుండా వచ్చేశావా! ఇంత బతుకూ బతికి, కాకులు తన పిండాలు ఆరగించకపోతే.. మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుందా? ఆయనకు పుణ్యలోకాల ప్రాప్తి సంభవిస్తుందా? దేహం చితికి ఆహుతి అయితే, కర్మకాండలో చేసిన పిండాలు కాకులు ఆరగించనవసరం లేదా?
జీవితమంతా ఎన్నో శ్రాద్ధకర్మలను సంతృప్తికరంగా నిర్వహించిన మనిషి.. తనవరకూ వచ్చేసరికి ఇలాగ అయిందేమిట్రా దేవుడా! పిండాలు కాకులకు పెట్టకుండా ఉత్తచేతులతో ఎలా వచ్చేశావురా నాయనా?” అంటూ దుఃఖించడం మొదలుపెట్టింది.
కాకుల కొరత సమస్యను అర్థం చేసుకునేలా తల్లికి ఎలా బోధపరచాలో, ఆమెను ఎలా సముదాయించాలో తెలియలేదు రామశాస్త్రికి. ఆ పరిస్థితిలో తాను చేయగలిగింది ఏమిటో కూడా బోధపడలేదు. ఖిన్న వదనంతో తల వంచుకుని మౌనంగా ఉండిపోయాడు.
ఎవరి మీదనైనా ఆగ్రహిస్తే.. ‘వాడి పిండం కాకులకు పెట్టా!’ అంటూ తిట్టేవాడు విశ్వనాథశాస్త్రి. అది ఆయన ఊతపదం. ఇప్పుడు ఆయన పిండం పెట్టడానికి కాకులు కరువయ్యాయి!
మిగతావారు కూడా రామాయమ్మకు పరిస్థితిని
వివరించడానికి తమవంతు ప్రయత్నం చేశారు కానీ, ఆవిడను సమాధాన పరచలేకపోయారు.
పెద్దకర్మ వరకూ నిత్యమూ తండ్రి పటం వద్ద పూజ చేసి, అనంతరం ఆ ప్రసాదాన్ని విస్తరాకులో పెట్టి తీసుకువెళ్లి చెట్టు కింద పెడుతున్నాడు రామశాస్త్రి. పొరపాటున ఏ కాకి అయినా అటువైపు రాకపోతుందా అన్న పేరాశ. తన కోర్కె నెరవేరాలని తండ్రి ఆత్మకు మదిలోనే ప్రార్థిస్తున్నాడు కూడాను.
అతని ఆశ అడియాసే అవుతున్నది. ఎంతసేపు వేచి ఉన్నా.. పావురాలు వచ్చి ఆరగిస్తున్నాయే తప్ప ఒక్క కాకీ కనిపించిన పాపాన పోలేదు.
చివరికి.. ‘ఏదయితేనేం.. పక్షేగా!’ అనుకుంటూ మనసుకు సరిపెట్టుకుని పావురాలకు పెట్టేసి వస్తున్నాడు.
“ఒకప్పుడు గుళ్ల వద్ద, మసీదుల వద్ద మాత్రమే కనిపించేవి పావురాలు. ఇప్పుడు అవి లేని ప్రదేశం అంటూ లేదు. నగరం అంతటినీ కబ్జా చేసేశాయి” అన్నాడు రామశాస్త్రి మేనమామ, నిట్టూర్చుతూ.
“మా చిన్నప్పుడు కాకి ఇంటి మీద వాలి అరిస్తే.. బంధువులు వస్తున్నారంటూ సంతోషించేవారు అంతా. ఇప్పుడేమో కాకి అరిస్తే చాలు.. ‘అరిష్టం!’ అంటూ కోపగించుకుంటున్నారు. ‘బంధువుల రాక వంటి ఇచ్ఛగించని వార్తలను మోసుకువస్తున్నది’ అంటూ తరిమేస్తున్నారు. బహుశా.. అందుకే అవి మనల్ని వెలివేసినట్టున్నాయి” అన్నారు బంధువులలో ఒకరు, నవ్వుతూ..
పదకొండవ రోజున పెద్దకర్మ. ఆ రోజు సమీపిస్తుంటే.. రామశాస్త్రికి భయమూ, దిగులూ పట్టుకున్నాయి.
పిండప్రదానం విషయంలో తల్లి చాలా పట్టుదలగా ఉంది. ‘కాకులకు పెట్టంది పిండప్రదానమే కాదు!’ అంటున్నది. కాలం చేసిన భర్తకు అది ఘోరాపరాధంగా, అవమానంగా భావిస్తున్నది. అందువల్ల భర్తకు ఊర్ధలోకాలు ప్రాప్తించవేమోనన్న బెంగ, నమ్మకమూ ఆమెవి.
సనాతన ధర్మాచరణకూ, అనాదిగా వస్తున్న ఆచారాలకూ నిలువెత్తు నిదర్శనం ఆవిడ. ఆమె మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్న సత్యం అందరికీ అర్థం అవుతూనే ఉంది. కానీ, ఆ పరిస్థితిలో ఏం చేయడానికీ వారు అశక్తులు..
రామశాస్త్రి కొడుకుగా తండ్రి పట్ల తన బాధ్యతను నిర్వర్తించడం లేదన్న తలంపు ఆమె మనసులో బలంగా నాటుకున్నది. సకల శాస్త్రాలలోనూ దిట్ట అయిన, తన విద్వత్తుతో అందరి కర్మలనూ శాస్త్రోక్తంగా, శ్రద్ధగా నిర్వహింపజేసిన విశ్వనాథశాస్త్రి పిండాలు.. కాకులకు భక్ష్యం కాకపోవడం అనేది ఆమె జీర్ణించుకోలేకపోతున్నది.
‘శ్మశానవాటికలో కనిపించనంతగా కాకులకే కరవు వచ్చిందా!?’ అన్నది ఆమె వాదన. పెద్దకర్మ రోజున భర్త పిండాలను కాకులకు పెట్టకపోతే, తాను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని శపథం చేసింది ఆవిడ.
దాంతో ఖంగుతిన్న రామశాస్త్రి, తమ్ముడు కృష్ణశాస్త్రి, మేనమామ మార్కండేయ శాస్త్రీ గుంపుచింపీలు పడ్డారు. ఎలాగైనాసరే, ఎక్కడనుంచైనా సరే ఆ రోజుకు ఓ కాకిని పట్టుకుని రావాలని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే, రామాయమ్మ మొండి మనిషి. ఎవరు చెప్పినా వినిపించుకోదు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోదు.
ఆ అన్నదమ్ములతోపాటు, వారి స్నేహితులు కూడా ఊరిమీద పడ్డారు, కాకుల కోసం..
రామశాస్త్రి పెద్దకర్మ ముగిసే వరకూ ఇల్లు కదలకూడదు. తనకు తెలిసిన వారందరికీ చెప్పాడు.. ఓ కాకి కావాలనీ, ఎంత ఖర్చు అయినా పరవాలేదు అనీను.
కృష్ణశాస్త్రి పార్కుల వెంటపడ్డాడు. తోటల వెంట
తిరిగాడు. ఎక్కడ చెట్లు ఉంటే అక్కడ వెదికాడు. ఎక్కడా కాకి జాడ లేదు. దాని అరుపు కూడా వినిపించలేదు. ఎవరో చెప్పారు.. కొన్ని నెలల క్రితం తమ కాలనీ వద్ద ఉన్న చెట్టు మీద అరుదుగా ఓ కాకిని చూశామనీ, ఆ తరువాత మళ్లీ అది కనిపించలేదు అనీను.
ఒకప్పుడు ఇంటి ముందు కాకి అరిస్తే..
‘అబ్బా! ఏమిటా కాకిగోల!’ అంటూ విసుక్కునేవారు అంతా. ఇప్పుడు కావాలంటే ఒక్కటీ కనిపించడం లేదు. వసంత రుతువులో కోయిల గొంతు మాత్రం వినిపిస్తున్నది అడపాదడపా.. చెట్లు ఉన్న చోట.
“మా పిల్లలకు కాకినీ, పిచ్చుకనూ చూపించుదామంటే.. అవి రెండూ కూడా పుస్తకాలలో బొమ్మలకూ, ఫొటోలకే పరిమితం అయిపోయాయి!” అంటూ నిట్టూర్చారు ఒకరు.
నగరంలోని ‘జూ’కు వెళ్లాడు కృష్ణశాస్త్రి, కాకుల వేటలో భాగంగా..
‘జూ’ అంతా తిరిగినా.. ఎక్కడా ‘కావు’ మన్న శబ్దం కానీ, ‘కాకి’ అన్న శాల్తీ కానీ కనిపించలేదు.
పెద్దకర్మ ఇక నాలుగు రోజుల్లోకి వచ్చేసింది. వాయసం సమస్య అలాగే ఉండిపోయింది.
‘కాకి సంతతి ఇప్పటికీ గ్రామాలలో ఉండవచ్చును!’ అన్నారు ఎవరో.
తండ్రికి తలకొరివి పెట్టినందున, రామశాస్త్రి కర్మకాండ పూర్తి అయేంతవరకు ఊరి పొలిమేరలు దాటకూడదు. అందువల్ల కృష్ణశాస్త్రిని తీసుకుని, మేనమామ మార్కండేయ శాస్త్రి అత్యవసరంగా గ్రామానికి వెళ్లాడు..
కృష్ణశాస్త్రి గ్రామం వెళ్లి చాలా ఏళ్లయింది. పట్టణంలోని ఉరుకులు పరుగుల జీవనయానంలో, స్వగ్రామాన్ని కూడా మర్చిపోవాల్సి వస్తున్నది చాలామంది. గ్రామాన్ని చూసిన అతను ఖంగుతిన్నాడు. మునుపటిలా లేదు అది. ఊళ్లో నిండుగా కనులపండువగా ఉండే వృక్షాలు, చెరువులూ బాగా కుంచించుకుపోయాయి! కొన్ని మాయమైపోయాయి. వాటి స్థానంలో ఇళ్లూ, ఇతర కట్టడాలూ లేచాయి. పొలాల్లో కూడా ఇదివరకటిలా వృక్షసంపద కనువిందు చేయడం లేదు. చెట్లు, చెరువులూ తరిగిపోవడంతో పక్షులు ఇతర ప్రాంతాలకు వలసపోయాయి.
గ్రామంలో కాకులు కాకుండా.. ఇతర పక్షులే కనిపించాయి. చేలల్లోనూ అదే పరిస్థితి.
“ఏదో తెగవారికి కాకులు ఆహారం అనీ, అందువల్ల వాటి జాతి క్రమంగా నశించిపోవడానికి అది కూడా ఓ కారణం!” అనీ చెప్పారు కొందరు.
అక్కడక్కడా కాకులు కనిపించినా.. వాటిని పట్టుకునే మార్గం కనిపించలేదు మామా – అల్లుళ్లకు.
“ఎరుకల వాళ్లో, మరో తెగవాళ్లో.. కాకుల్ని పట్టుకునేవారి సాయం కోరితే, పని జరుగుతుంది!” అన్నారెవరో.
అందువల్ల కాకుల్ని మానేసి, ఆ వర్గపు మనుషుల కోసం వెదుకులాట ఆరంభించారు మేనమామ,
మేనల్లుడు.. పెద్దకర్మ నాటికి తిరిగివచ్చిన మేనమామ వంక ఆత్రుతగా చూశాడు రామశాస్త్రి.
విజయసంకేతంగా ఓ చిరునవ్వు నవ్వాడు మార్కండేయ శాస్త్రి.
“కాకుల సంతతి గ్రామాల్లో కూడా నశించి పోతున్నది. కర్ణుడి చావుకు నూరు కారణాలు అన్నట్టుగా.. కాకుల అదృశ్యానికి అనేక కారణాలు ఉన్నాయి” అన్నాడు మార్కండేయ శాస్త్రి.
“ఏది ఏమైతేనేం! ఎవరినో పట్టుకుని, ఓ కాకిని పట్టించి తీసుకువచ్చాం. అక్కయ్య మనోభావాలు దెబ్బతినకుండా, ఆమె మనోవాంఛ కూడా నెరవేరుతుంది. బావ ఆత్మకూ అసంతృప్తి అనేది ఉండదు. మనకు తలబాధ తప్పుతుంది!”..
వారితోపాటు కాకిని పట్టుకువచ్చిన వ్యక్తికి కాకిని అద్దెకు ఇచ్చినందుకు మూల్యమే కాక.. రానూ పోనూ ప్రయాణపు ఖర్చులు, నగరంలో అతగాడి బస, భోజనం ఖర్చులూ అన్నీ భరించాల్సి రావడంతో.. ఒక్క కాకి కోసమే తడిసి మోపెడు అయింది ఖర్చు. అయినా, రామశాస్త్రి బాధపడలేదు. తల్లి కోర్కె తీరుతున్నందుకూ, తండ్రి పిండాలను వాయసం భుజించబోతున్నందుకూ ఆనందం కలిగింది.
పదకొండో రోజున విశ్వనాథశాస్త్రి గారి పెద్దకర్మ తతంగం శాస్త్రోక్తంగా, సంతృప్తికరంగా జరిగింది. పూజ ముగిసే సమయానికి కాకితో వచ్చాడు.. గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి. సన్నటి ఊచలతో చేసిన ఓ బోనులో ఉన్నది ఆ వాయసం. బయటికి తీస్తే ఎగిరిపోతుంది. అందుకే దాన్ని బోనులోనే ఉంచారు.
బోను తలుపు తెరచి విస్తరిని లోపల ఉంచారు. ఓసారి ఆ విస్తరి వంకా, మనుషుల వంకా రాజసంగా చూసి.. పిండాలను ఆరగించడం ఆరంభించింది వాయసం. కాసేపట్లో విస్తరి ఖాళీ చేసేసింది. దాంతో అందరి మనసులకూ తృప్తి కలిగింది. వదనాలు వెలిగి
పోయాయి.
వారితోపాటు కాకిని పట్టుకువచ్చిన వ్యక్తికి కాకిని అద్దెకు ఇచ్చినందుకు మూల్యమే కాక.. రానూ పోనూ ప్రయాణపు ఖర్చులు, నగరంలో అతగాడి బస, భోజనం ఖర్చులూ అన్నీ భరించాల్సి రావడంతో.. ఒక్క కాకి కోసమే తడిసి మోపెడు అయింది ఖర్చు. అయినా, రామశాస్త్రి బాధపడలేదు.
స్నానాలు చేసి ఆనందంతో ఇంటిముఖం పట్టారు. ఆ వాయసాన్ని తీసుకువచ్చిన వ్యక్తికి, అనుకున్న దానికంటే ఎక్కువే ముట్టజెప్పాడు రామశాస్త్రి సంతోషం కొద్దీ.
రామాయమ్మ మనసు ఇప్పుడు కుదుటపడింది. కాకులు లేని చోటుకు కాకి రావడం అనేది.. భర్త ఆత్మ
బలమే! అంటూ పెనిమిటిని తలచుకుని దణ్ణం పెట్టుకుంది..
“ఏమండీ!” అన్న భార్య పిలుపుతో, ఆలోచనల్లోంచి తేరుకున్నాడు రామశాస్త్రి.
‘ఏమిటి?’ అన్నట్టు చూశాడు.
“మీకోసం ఎవరో వచ్చారు. వాళ్లకు కాకి కావాలట!” అని చెప్పింది ఆమె.
వీధిలోకి వెళ్లాడు అతను.
ఒకతను రామశాస్త్రిని చూసి నమస్కరించాడు.
“రేపు మా తండ్రిగారి దశదిన కర్మ ఉంది. పిండ ప్రదానానికి కాకి కావాలి” అన్నాడు వినయంగా.
“అలాగే! రేపు వచ్చి పట్టుకువెళ్లండి” అన్నాడు రామశర్మ.
“దాని అద్దె ఇప్పుడే చెల్లించమంటారా?” అని అడిగాడు అతను, జేబులోంచి డబ్బులు తీస్తూ.
రామశాస్త్రి అతణ్ని వారించి..
“వాయసానికి బాడుగ తీసుకోం. కార్యక్రమం
పూర్తి అయ్యాక జాగ్రత్తగా దాన్ని తీసుకువచ్చి మాకు అప్పగిస్తే చాలు” అన్నాడు.
“అలాగే!” అంటూ, నమస్కరించి వెళ్లిపోయాడు ఆ ఆసామీ.
ఏడాది క్రితం తండ్రి మరణంతో, పిండప్రదానానికి కాకులు దొరక్క తానుపడ్డ అవస్థ, శ్రమా.. రామశాస్త్రిలో కొత్త ఆలోచనలకు తెరలేపింది.
తన తల్లి లాగే, పిండాలు కాకులు తినలేదన్న కారణంగా మనోభావాలు దెబ్బతిని అశాంతికి గురయ్యేవారు ఎందరో! అందుకే..
‘ఆ సమస్యను ఎలా ఛేదించాలా!?’ అని చాలా రోజులు తెగ ఆలోచించాడు అతను.
ఆ ఆలోచనల పర్యవసానమే.. ఇప్పుడు అతని పెరట్లో ‘కాకుల పెంపకం’ అన్న ప్రక్రియ!
గ్రామాలకు మనుషులను పంపించి దొరికినన్ని వాయసాలను పట్టి తెప్పించాడు రామశాస్త్రి. వాటికోసం ఓ పెద్ద విశాలమైన తీగల బోనును ప్రత్యేకంగా తయారు చేయించాడు.
కాకులను అందులో ఉంచి ఆహారమూ, నీరూ వేస్తూ పోషించసాగాడు. ప్రస్తుతం అతని వద్ద పన్నెండు వాయసాలు ఉన్నాయి. పిండ ప్రదానాలకు అవసరమైన వారికి వాటిని ఉచితంగా ఇవ్వసాగాడు. ఆ విషయం మౌఖికంగా ప్రచారం కూడా చేయించాడు.
కాకుల పోషణకు ఖర్చు అవుతుంది కనుక, వాటికి అద్దె వసూలు చేయమని సలహా ఇచ్చారు అతని మిత్రులు.
“ప్రస్తుత పరిస్థితులలో ఎంత మూల్యమైనా
చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు జనం” అన్నారు.
రామశర్మ వారి సలహాను కొట్టిపడేశాడు.
“వాయసాలను సమాజసేవ కోసం పెంచుతున్నానే కానీ, వాటితో వ్యాపారం చేయడానికి కాదు. నా
చర్య వల్ల పోయినవారి ఆత్మలకు శాంతీ, కర్మలు నిర్వహించేవారికి ఆత్మసంతృప్తీ కలిగితే.. అంతకుమించిన తృప్తీ, ఆనందమూ ఏముంటాయి నాకు! అదే నేను
కోరే ప్రతిఫలం!” అంటూ జవాబు ఇచ్చాడు.
“నిజానికి ఈ ప్రతిష్ఠ మా అమ్మగారికి చెందుతుంది. ఆవిడ మూలంగానే నాలో అలాంటి ఆలోచనకు అంకురార్పణ జరిగింది” అన్నాడు మళ్లీ.
తిరుమలశ్రీ
బాల్యంలోనే చదవడం, రాయడం వ్యసనంగా మార్చుకొని.. పన్నెండేళ్లకే రచయితగా మారారు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ‘తిరుమలశ్రీ’, ‘విశ్వమోహిని’ కలం పేర్లతో అనేక రచనలు చేస్తున్నారు. స్వస్థలం హైదరాబాద్. ఎంఏ (సోషియాలజీ), ఎల్ఎల్బీ, సీఏఎం చేశారు. భారత జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’గా పదవీ విరమణ పొందారు. తొలికథ ‘టోకరా’. 12 ఏళ్ల వయసులో రాసిన ఈ కథ.. చిత్రగుప్త పక్షపత్రిక (మద్రాసు)లో ప్రచురితమైంది. మరో మూడేళ్లలోనే తొలి నవల ‘పునర్జన్మ’ రాయగా, భాగ్యశ్రీ పబ్లికేషన్స్ (మద్రాసు) వెలువరించింది. తెలుగు, హిందీ, ఆంగ్లంలోనూ అసంఖ్యాకంగా రచనలు చేశారు. అనేక రచనలు ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 200 నవలలు పుస్తకరూపంలోనూ, పత్రికలలోనూవచ్చాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు.. ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక బహుమతులు, సత్కారాలు అందుకున్నారు.
తిరుమలశ్రీ
91107 36095