చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ :
వర్తక బిడారుతో కలిసి రెండేండ్ల తర్వాత ద్వీపరాజ్యానికి బయల్దేరాడు జాయప. కానీ, నాలుగో రోజున జరిగిన ఓ ఊహించని పరిణామంతో.. తిరిగి మళ్లీ అనుమకొండ బాట పట్టాడు. అర్ధరాత్రివేళ అనుకోని రీతిలో గాయపడి, స్పృహ కోల్పోయాడు. మెలకువ వచ్చేసరికి ఓ గూడెంలో ఉన్నాడు.దొంగల నుంచి తనను కాపాడిన కంటక దొరే.. తనను అక్కడికి తీసుకొచ్చినట్లు గుర్తించాడు. అక్కడి గిరిజన పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్లతో మమేకమైపోయాడు. అక్కడే.. కొమ్ముబూర కూజితాల ప్రయోగంపై పట్టు సాధించాడు. అలా ఉండగా.. ఓరోజు ఆ గూడెంలోకి కాకతీయ రాజ్య వేగులు ప్రవేశించడంతో, వారి వెంట నడిచాడు జాయప.
అలా.. పదిరోజుల తర్వాత తిరిగి అనుమకొండలో ప్రవేశించాడు జాయప.
చౌండ సేనాని భటులతో.. తాను సుబుద్ధి ఇంటికే వెళతానని అన్నాడు. వారు ఆమోదించి సుబుద్ధి ఇంట్లో విడిచిపెట్టారు.“మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు చౌండ సేనానులవారి భవంతికి రావచ్చు..” అని చెప్పి వెళ్లిపోయారు భటులు. రెండువారాల తర్వాత జాయప రావడంతో సుబుద్ధి కుటుంబంలో.. ఆ వీధి అంతా తిరిగి పండుగ వాతావరణం చోటుచేసుకుంది. వర్తకబిడారు వదిలి అనుమకొండ తిరుగు ప్రయాణమైన జాయప ఇంకా ఇంటికి చేరకపోవడంతో, ఏమయ్యాడో తెలియక అతలాకుతలమైన సుబుద్ధి.. వెళ్లి చౌండకు విన్నవించాడు. తల్లిదండ్రుల మీద బెంగతో వెళ్తానని పోరు పెట్టాడని.. వల్లయ బిడారులో తన తమ్ముడు కూడా ఉండటంచేత వల్లయ అనుమతితో పంపానని చెప్పాడు. అయితే జాయప ఓ అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా తిరిగి అనుమకొండ బయలు దేరినట్లు తమ్ముడు వర్తమానం పంపాడనీ, కానీ పదిరోజులయినా జాయప ఇల్లు చేరలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. “ఇది నావల్ల జరిగిన అపరాధం.. క్షమించండి!” అంటూ చౌండ కాళ్లపై పడ్డాడు సుబుద్ధి. మరేమీ అనలేదు చౌండ. వెంటనే తన మండల వేగులకు ఆజ్ఞ ఇచ్చాడు.‘వెళ్లండి! ఆ బిడారు బాట అంతా గాలించండి. జాయపను రక్షించాలి. క్షేమంగా అనుమకొండ చేర్చాలి!’.జరిగింది జాయపకు వివరించాడు సుబుద్ధి.“బిడారునుంచి ఎందుకు వెనక్కి వచ్చారు. మధ్యలో ఎక్కడున్నారు?” అడిగాడు సుబుద్ధి.బాధగా కళ్లు మూసుకున్నాడు గానీ, జవాబివ్వలేదు జాయప. రెట్టించి అడగ లేదు సుబుద్ధి. జాయప ముఖమంతా బాధా వీచికల కదలికలు.. ఆ వీధి మహిళలంతా సుబుద్ధిని నివారించి జాయపను రక్షించారు.
“బిడ్డ తిరిగివస్తే సంతోషించక ఏంటా ప్రశ్నలు?” అంటూ చిరాకుపడిపోయి.. జాయపకు దిష్టితీసి, వేడివేడి పాలు తాగించి.. నులకమంచం పరచి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరారు. జాయప దివి రాజకుమారుడని వారందరికీ తెలిసిపోయింది కదా!బిడారుకు వర్తమానం పంపాడు సుబుద్ధి. జాయప క్షేమంగా చేరినట్లు. జాయప కోసం మిత్రులు నాగంభట్టు, త్రిపురశెట్టి ఎదురు చూస్తున్నారు. జాయప వచ్చాడని తెలిసి ఇద్దరూ పరుగున వచ్చారు.
“మిత్రమా! ఏమయ్యింది? ఇన్నాళ్లూ ఎక్కడున్నావు? నీకేమీ కాలేదు కదా?”.. ప్రశ్నలవర్షం కురిపించారు.
నిజానికి ఏమి చెప్పాలో అతనికీ తెలియడం లేదు. కానీ, ఆ బిడారు అనుభవం అతని జీవితాన్ని మరోమెట్టు ఎక్కించింది. ఆలోచనల్లో దృఢత్వం, స్పష్టత వచ్చింది. దారిదొంగలను చంపడంతో తన పౌరుషం మీద, శారీరక శక్తియుక్తుల మీద నమ్మకం హెచ్చింది. తన అక్కలను కాపాడి, వారికి మంచి జీవితాన్ని అందించడమే తన తక్షణ కర్తవ్యం. అది తను సాధించగలనన్న ఆత్మవిశ్వాసం అతనిలో కలిగింది. అందుకు తను అనుమకొండలో ఉండాల్సిందేనని ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మంచి నిర్ణయం కాదని.. అది బిడారు అనుభవాలవల్ల మరింత స్పష్టంగా అవగతమైందని అతడు భావించాడు. తను ఎవరిని నిలదీయాలి. తనకు శత్రువు ఎవరు? కత్తిపట్టి ఎవరిని కసా బిసా నరికేసి.. తను అక్కలను బంధ విముక్తులను చెయ్యాలి?
చౌండసేనాని గుర్తొచ్చారు. అడిగే సాహసం చెయ్యలేడు. ‘ఓరీ బాబయ దురాత్మా! నా అక్కలను విడిపించు. లేకుంటే నీ తల వెయ్యివక్కలు చెయ్యగలను..’ అని తను అనలేడు. అంటే ఆయన నవ్వి.. తన తలకాయనే పుచ్చకాయలా ఎగరగొట్టగలడు. అయినా ఆయన మిత్రువో శత్రువో నిర్ణయించుకోలేక పోతున్నాడు. ఎవరు శత్రువైనా.. తను అక్కలను కాపాడుకోవాలి. అది తథ్యం! కానీ మార్గం ఏమిటి?.. తెలియదు. ఆ మార్గం సుస్పష్టం కావడంలేదు. మార్గ దర్శనం అయ్యేవరకూ తను సహనంతో ఎదురు చూడాల్సిందే. అప్పటినుంచి జాయప కొత్తగా ఎదిగిన తన కోరలకు పదును పెట్టుకుంటూ.. మాటువేసిన పులిలా తగిన అవకాశం కోసం నిశ్శబ్దంగా ఎదురుచూడసాగాడు.
ఇప్పుడతను ఓ యువరాజు అని మిత్రులకు కూడా తెలిసిపోయింది. మిత్రులతో దినచర్య మరింత ఉత్సాహవంతంగా ఉందిప్పుడు.. ఉదయం ఆసనాలు, ధ్యానం తర్వాత యుద్ధవిద్యల సాధన. మధ్యాహ్నం చదువు. సాయంత్రపు నీరెండ వేళ మిత్రులతో వాహ్యాళి. సమాజ అధ్యయనం. రాత్రి వీధిలో ఆటలు, నాట్యాలు. మొత్తంగా ప్రగల్భిస్తూ అతనిలో నిబిడీకృతమై ఉన్న మహత్తర శక్తులను ద్విగుణీకృతం చేస్తూ.. పూర్ణ పురుషత్వానికి అతనొక రూపంగా ఆకారం కల్పిస్తున్నాయి.
నాగంభట్టు.. జాయపకు వల్లెవేసే విధానంలో కాకుండా, గురుశిష్య తర్క మీమాంస చర్చలద్వారా విద్య నేర్పేవాడు. జాయప యువరాజు అని తెలిశాక.. రాజనీతి అంశాలు, లోకరీతి అంశాలకు ప్రాధాన్యమిచ్చి రెండూ చెబుతూ.. అందుకు సంబంధించిన ఉద్గ్రంథాలను ఉటంకించేవాడు. తమ ఘటికాస్థానంలో ఉన్న గ్రంథాలను ఇచ్చి చదివించేవాడు.
‘పొత్తం హస్త భూషణం’ అంటే నాగంభట్టునే చెప్పుకోవాలి. అయన చేతిలో ఎప్పుడూ ఓ పొత్తం ఉంటుంది. క్షణకాలం విశ్రాంతి దొరికినా పొత్తం విప్పి చదువుతుంటాడు. జాయపా అదే మార్గాన్ని అనుసరిస్తున్నాడు.
క్షత్రియపుత్రులు కౌమారవయసులో రాజనీతి తప్పకుండా నేర్వాల్సిన విద్య. మహారాజులు తమ వారసులకు పట్టుబట్టి నేర్పించేవారు. ఆ విధానంలోనే జాయపను యువరాజుగా ఎంచి.. రాజనీతి ప్రధానంగా విద్యాబోధన చేయసాగాడు నాగంభట్టు. భారతీయ సంస్కృతిలో రాజుకు అధికారం ఇచ్చి దానికి రాజధర్మం అనేద్వారం ముందుపెట్టారు. ఈ రాజధర్మం అనే ద్వారం తెరవడానికి మూడు ప్రబోధ గీతాలున్నాయి. అవి వేదం, పురాణం, శాస్త్రం. ఈ మూడు అంశాలనూ ప్రబోధించే గ్రంథాలలోని సంగతులను జాయపకు వివరించి చెప్పి.. వాటిపై చర్చించేవారు.
రాజనీతి, రాజధర్మం గురించి వేదాలు ఉపనిషత్తులే కాక భారత, రామాయణాల్లాంటి ఇతిహాసాలు కూడా ఎంతో నేర్పుతాయి. ధర్మం పది అంశాలతో ఉంటుందని మనుధర్మశాస్త్రంలో ఉంది. ధృతి, క్షమ, దయ, స్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీ, విద్యా, సత్యం, అక్రోధం.. అనేవి ఆ పది అంశాలు.
అమరకోశం, సిద్ధాంతకౌముదితో మొదలుపెట్టి కౌటిల్యుని అర్థశాస్త్రం, కామందక నీతిసారం, శుక్ర నీతిసారం లాంటి నీతిబోధక గ్రంథాలు.. రఘువంశం, శిశుపాలవధ, కిరాతార్జునీయం లాంటి కావ్యాలు.. ప్రతిజ్ఞా యౌగంధరాయణం, మృచ్ఛకటికం, ముద్రారాక్షసం లాంటి రూపకాలు.. హర్షచరిత్ర, దశకుమార చరిత్రం, విక్రమాంక దేవ చరిత్ర, రాజతరంగిణి లాంటి చారిత్రక కావ్యాలు.. పంచతంత్రం, భర్తృహరి సుభాషితాలు లాంటి నీతికథలను చెబుతూ.. వివరిస్తూ.. చదివిస్తూ.. జాయపను పూర్తి రాజనీతిజ్ఞుడిగా దినదినప్రవర్ధమానం చేస్తున్నాడు నాగంభట్టు.
త్రిపుర ద్వారా చరిత్ర, భాష, శాసనాల్లాంటి అంశాల గురించి.. జాంఘియులతో, నానాదేశి పెక్కండ్రు లాంటి విదేశీ వర్తక సమయాల సార్ధవాహకులతో అనునిత్యం సంబంధాల వల్ల ఆయా దేశాలలోని సాంఘిక, రాజకీయ, సాహిత్య, భాషల్లో వస్తున్న మార్పులు తెలుసుకునేవాడు. అవన్నీ చర్చల్లో వివరించేవాడు.
“పూర్వం గ్రీకు దేశంలో అరిస్టాటిల్, ప్లేటో లాంటి తత్వవేత్తలు రాజనీతి, రాజధర్మంపై అద్భుతమైన రచనలు చేశారు. అయితే మనవాళ్లు కూడా తక్కువ తినలేదు. అదే కాలానికి చెందిన మన కౌటిల్యుడు వాళ్ల అమ్మమొగుడు. ఇంకో విశేషమేమంటే ఈ కౌటిల్యుని కన్నాముందే భరద్వాజుడు, విశాలాక్షుడు, పిశునుడు, కౌణపదంతుడు, వాతవ్యాధీ, బాహుదంత పుత్రుడు, బార్హస్పత్యుడు, ఔసనశుడు, మానవుడు, పరాశరుడు, అంభీయుడు మొదలైన వాళ్లు రాజనీతి, తత్వశాస్త్రం, అర్థశాస్త్రం రాసి పారేశారు..” అన్నాడు త్రిపురశెట్టి.
ఇతర దేశాలలో అంశాలే కాదు హిందూరాజ్యాలలో గతకాలపు అంశాలు.. వాటి ప్రస్తుత స్థితిగతులపై మంచి వ్యాఖ్యానం చేసేవాడు. అలతి అలతి మాటలతో, సాధారణ ప్రజలభాషలో చెబుతూ నవ్వించేవాడు.
మఠియవాడలో త్రిపుర మిత్రుడొకరికి అలంకార వస్తువుల అంగడి ఉంది. అదొక వీధి మొగదలలో ఉంది. పక్కనే పెద్ద బాదం వృక్షం. దానికింద రాతిబల్లల ఏర్పాటు ఉంది. మిత్రబృందంవల్ల అదొక చర్చావేదిక అయ్యింది. కొందరు కూర్చుంటే మరికొందరు చుట్టూ నిలబడి ఆసక్తిగా కొండొకచో విజ్ఞానదాయకంగా కూడా చర్చలు చేస్తున్నారు. ప్రతి సంధ్య వేళ అక్కడికి చేరతారు మిత్ర బృందం. చర్చల అనంతరం వీధుల్లో తిరగడం.. లేదా తిరిగి తిరిగి వచ్చి కూర్చుని ముచ్చట్లు.
ఆరోజు కూడా ముచ్చట్లు మోత మోగిపోతున్నాయి. అప్పుడొచ్చాడు చలమయ శెట్టి. ముఖమంతా నానా ప్రశ్నార్థక చిహ్నాలతో గందరగోళంగా ఉంది.
“త్రిపురా! ఆ మిత్రుడు వాతూల అహోబలపతి.. ఎవ్వడో.. వాని చిరునామా ఏమిటో దొరకడం లేదు!”.
“అయ్యయ్యో.. నిరాశ చెందకు. నీకు పెట్టుబడి పెట్టడానికా మిత్రుడు సిద్ధంగా ఉన్నాడు. వెదుకు.. ఆలసించిన ఆశాభంగం.. వెళ్లు వెళ్లు!”..జాయప ప్రోత్సాహంగా ఓ సుభాషితం చెప్పాడు.
“ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యాః
విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధ ముత్తమజనా న పరిత్యజంతి ॥ అంటే ..” వివరించబోయాడు. దానికి త్రిపుర..
“ఇదే పద్యం నేను తెలుగులో విసురుతాను.. వినుకో సంస్కృత మిత్రమా!”.. అంటూ భర్తృహరి సంస్కృత పద్యాన్నే తెలుగులోకి మార్చి చెప్పి..“నీ సంస్కృత పద్యానికి నా తెలుగు పద్యం.బాగున్నదా మిత్రమా..” అన్నాడు.జాయప నిజంగానే సంతోషించాడు.
“ఇలా భర్తృహరి సంస్కృతాన్ని తెలుగులో చెప్పడం అంటే.. చాలు! నా మాతృభాష ఇక వెనక్కితిరిగి చూడనక్కరలేదు. నిజంగానే మాతృమూర్తి కన్నా మధురమైనది!” అన్నాడు జాయప.
చలమయ మాత్రం సంస్కృత, తెలుగు భాషల్లో ఇచ్చిన ఉత్తేజంతో మళ్లీ వీధిలోకి వెళ్లిపోయాడు. అక్కడే మరి కొందరు మిత్రులయ్యారు జాయపకు. నాగంభట్టు స్నేహితుడు కుమారిలభట్టు మంచి గణిత శాస్త్రవేత్త, సత్యవ్రతుడు రసాయన శాస్త్రవేత్త, రసాయనాల తయారీదారుడు కూడా. ప్రజాపతి యువ వైద్యుడు. ప్రజ్ఞావతి అతని భార్య.. ఆమె వైద్యశాల నిర్వాహకురాలు. సీతయ చిత్రకారుడు. విక్రమ లేఖకుడు. త్రిపుర మిత్రుడు కనకశెట్టి వజ్రాల వ్యాపారి. నకులశెట్టి ఎగుమతి – దిగుమతిదారు. బేతన రాజనగరికి వస్తు సరఫరాదారి. అంకాల, గౌరన.. త్రిపురలాగే చరిత్ర పరిశోధకులు. చతుర్ధ కులస్తుల్లో, పంచముల్లోకూడా వీళ్లకు మిత్రులు ఉన్నారు. రాముడు పశువుల వ్యాపారి. కటారి మంచి పాదరక్షల తయారీదారు. కాంతయ యుద్ధరంగానికి కావాల్సిన అనేక తోలు వస్తువులు తయారు చేస్తుంటాడు. బ్రాహ్మణ, వైశ్య, కొండొకచో క్షత్రియ యువకులు వర్తక రంగాలను వృత్తిగా ఎంచుకుంటే.. చదువు తక్కువున్న చతుర్ధ, పంచములు ఉత్పత్తి రంగాలలో ఉన్నట్లు జాయప గుర్తించాడు. వీళ్లంతా చెప్పే ఊసులు, కబుర్లు జాయపకు ఎంతో ఉత్సుకతను, ఆసక్తిని కలిగించి అతని చైతన్యపరిధిని విస్తరింపజేసేవి.
(సశేషం)
పూర్వం గ్రీకు దేశంలో అరిస్టాటిల్, ప్లేటో లాంటి తత్వవేత్తలు రాజనీతి, రాజధర్మంపై అద్భుతమైన రచనలు చేశారు. మనవాళ్లూ తక్కువ తినలేదు. అదే కాలానికి చెందిన మన కౌటిల్యుడు వాళ్ల అమ్మమొగుడు.
-మత్తి భానుమూర్తి
99893 71284