మా చిన్నప్పటి రోజుల్లో హోళీ పండుగ.. ఇప్పట్లా కాకుండా మరోలా ఉండేది. హోళి పౌర్ణమికి పదిహేను రోజుల ముందునుంచే పల్లెల్లో సందడి మొదలయ్యేది. పదిహేనేళ్లలోపు ఆడపిల్లలు, మగపిల్లలు వేరువేరు గ్రూపులుగా ఏర్పడి, ప్రతిరోజూ సాయంత్రం ఇంటింటికీ తిరుగుతూ హోళీ పాటలు పాడేది. ప్రతి ఇంట్లోనూ వాళ్లకు మక్కజొన్న గింజలో, జొన్నలో, వడ్లో పెట్టేవారు.
మగపిల్లలు కోలలను లయబద్ధంగా కొడుతూ పాటలు పాడేవాళ్లు. “ఈరన్న ఎర్రబల్లె కోడె.. ఈరా గంధం పూస్కోని, జామాశెట్లకు పండా పోతే.. శిన్నీ పాపకు తేలు గుట్టె!”; “బుగ బుగ మావిళ్లు పూసుకొచ్చె.. భూమికి తాళాలేసుకొచ్చే”; “రింగుడు పుల్ల రూపాయి దండ”.. అంటూ హుషారుగా పాడేవాళ్లు. అయితే, ఎవరైనా తమను పట్టించుకోకపోయినా, ఏమైనా ఇవ్వకపోయినా గొంతులు మరింత పెంచేసేవారు. ఆ గోల భరించలేక.. ఆ ఇంటి వాళ్లు ఏమైనా పెట్టి పంపించేవాళ్లు. ఇక ఆడపిల్లలు చప్పట్లు కొడుతూ.. “హోళీ హోళీల రంగ హోళీ.. చెమ్మ కేళీల హోళీ”; “కాముడ కాముడా వలలో.. కట్టెక్కి పోంగా వలలో!”; “మంచంల దొరసానీ వలలో.. పండుకున్నాదీ వలలో” అంటూ పాటలు పాడేవాళ్లు. ధాన్యం గింజల్ని ఆ పిల్లలు ఏం చేసుకుంటారని ఆలోచించి.. వాళ్లకు మా ఇంట్లో పల్లీలు, అటుకులు, పుట్నాలు, పేలాలు లాంటివి పెట్టేవాళ్లం. కొన్నిసార్లు మాచేత చిల్లర డబ్బులు ఇప్పించేవాడు నాన్న. ఎప్పుడైనా పది పైసలో, పావలానో ఇస్తే ఆ గ్రూపు వాళ్లు ఎంతో సంతోషపడేవాళ్లు.
కొన్నిసార్లు ఆడవాళ్లు కూడా గుంపులుగా వచ్చి పాటలు పాడేవాళ్లు. అటుగా మా నాన్న కనిపిస్తే..
“రాశీ పోశిన కుప్పల మీద ముట్టీ ముట్టీ ముద్దెరలేతువో.. చెంద్రయ్య దొరా.. మురిశీ మురిశీ ముల్లెలు పంచవో చెంద్రయ్య దొరా!” అంటూ నాన్న పేరు పెట్టి పాడేవాళ్లు. నాన్న మాత్రం.. “సరే సరే.. ఇగ పాట ఆపండి” అంటూ త్వరత్వరగా వాళ్లకు ఏదైనా ఇచ్చి పంపించమని అమ్మను తొందర పెట్టేవాడు. నానమ్మకేమో పాటలు ఇష్టం కనుక.. “మంచిగ పాడుతున్నరు. ఇంక రెండు పాటలు పాడరాదుండి” అనేది. “మనింట్లనే పాటలు పాడుకుంటు ఉంటె వాండ్లకు ఏమి దొరుకుతది?! పోనియ్యి!” అని నాన్న అనేవాడు. ఆఖరు రోజున లంబాడీ వాళ్లు వచ్చేవాళ్లు. పాటలు పాడుతూ గుండ్రంగా తిరిగి డాన్స్ చేస్తూంటే.. ఎంతో బాగనిపించి చూస్తూ ఉండిపోయేవాళ్లం. కొంచెం కలిగున్న వాళ్ల ఇళ్లల్లో అయిదేళ్లలోపు పిల్లలకు పున్నమి రోజున కొత్త బట్టలు తొడిగి.. చిన్న ఎండు కొబ్బరి ముక్కలు, గుమ్మడి పలుకులతో గుచ్చిన దండ మెళ్లో వేసేవారు.
హోళీ ముందు రోజు ఉదయమే ఊర్లో చాటింపు వేసేవారు.
“ఇయ్యాల రాత్రి కాముడు కాలుతడు. ఎవలెవలి ఇంటికాడున్న పాత సామాన్లు, శెత్తా బొత్తా అంతా తయ్యార్ పెట్టుకోండుల్లో!” అని ఒకాయన డప్పు కొడుతూ చెప్పేవాడు. సాయంత్రం మళ్లీ డప్పులు వాయిస్తూ పెద్ద ఊరేగింపుగా వెళ్లేవారు. వాళ్ల వెనుకే చిన్న పిల్లలంతా వెళ్లేవాళ్లు. వాళ్లు అన్ని వాడలూ తిరుగుతూ.. “కాముడు కాలుతాండు. అందరూ రాండుల్లో..” అని మళ్లీ చెప్పేవారు. ఊరి బయట నీళ్లు ఉండే చోట.. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా కామదహనం చేసేవారు. ఓ కర్రకు బట్టలు కట్టి చేసిన కాముడి బొమ్మను మంటల్లో వేసేవారు. దాంతోబాటు అందరూ తమ ఇళ్లల్లో ఉన్న పాత వస్తువులు తెచ్చి వేసేవారు. మా ఇంట్లోంచి మాత్రం ఉత్త పాత వస్తువులిస్తే ఊరుకునేవాళ్లు కాదు.
“అందరూ పాత సామాన్లిస్తే ఏం పెట్టి అంటుబెడతం దొరా! మీరు కొన్ని కట్టెలు, పిడకలు ఇయ్యవలశిందే!” అని అడిగేవారు. నాన్న పరమ ఉత్సాహంగా మాకు వంటచెరుకు కోసం ఉంచిన పొయ్యిల కట్టెలు, పిడకల గుచ్చె లోనుంచి పిడకలు సరిపడినన్ని వాళ్లనే తీసుకుపొమ్మనేవాడు
ఆ తెల్లవారి హోళీ పండుగ. ఇప్పటిలా ఇంత విపరీతంగా లేకపోయినా బజార్లలో మగపిల్లలు ఆడేవారు. పెద్దగా రంగులు కొనే స్తోమత ఉండేది కాదు. వసంత పూర్ణిమ ముందు మోదుగు చెట్లన్నీ ఆకులు రాలిపోయి, ముదురు నారింజ రంగు పూలు పూసి భలే అందంగా ఉంటాయి కదా! ఆ మోదుగుపూలు తెచ్చి నీళ్లల్లో ఉడకబెట్టి ఎర్రటి రంగు నీళ్లు తయారు చేసి సీసాల్లో పోసి పెట్టుకునేవారు. మైదాకు (గోరింటాకు) ఉడకబెట్టినా ఎర్రటి రంగు నీళ్లు తయారయ్యేవి. కొందరైతే పెన్నుల్లో పోసుకునే ఇంకులో నీళ్లు కలిపి నీలిరంగు తయారు చేసేవారు. ఇంకొందరు బొగ్గుపొడి, ఆయిల్ ఇంజన్లలో వాడే గ్రీజు, పేడ నీళ్లు.. ఇట్లా ఏవి పడితే అవి పూసుకుంటూ.. మీదపడి కొట్టుకున్నంత అల్లరి చేసేవారు.
మేం ఏ రెండు మూడుసార్లో తప్ప హోళీ ఆడలేదు. ఒకసారి మా ఊర్లో ఆడినట్టు గుర్తు. మరోసారి హైదరాబాద్లో చిన్నమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడు వాళ్లింట్లో అద్దెకున్న మార్వాడీలు మా అందరికీ బొట్లు పెట్టి రంగు పూశారు. “నకో భయ్యా! నకో భాబీ!” అని మేం అన్నప్పటికీ వాళ్లు వదల్లేదు. నిండా ముంచేశారు. ఆ తరువాత బోలెడు స్వీట్లు ఇస్తే అవన్నీ కడుపు నిండా మెక్కాం. నేను హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ఓసారి మా కజిన్స్ రెండు కార్లలో నారాయణగూడలో చిన్నాన్న వాళ్ల ఇంటికి వచ్చి అప్పటికే స్నానాలు చేసి ఫ్రెష్గా ఉన్న మా అందరి మీదా బోలెడంత రంగు పూసి అల్లరి చేశారు.
నేను బ్యాంకు ఉద్యోగంలో చేరిన కొత్తలో..
ఓ హోళీ రోజు ఎప్పట్లాగే కాజీపేట బ్రాంచ్లో పని చేస్తూ ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్కూ, ఇతర
సంస్థలకూ హోళీ సెలవుండేది కనుక.. బ్యాంకుకు కూడా సెలవు ఉంటుందనుకునేవారంతా. అందుకని రష్లేదు కౌంటర్లలో. అప్పట్లో ఆ బ్రాంచ్ రైల్వే వారికి, ఇతర ఉద్యోగాలకూ వెళ్లేవాళ్లకు బ్యాంకు పని చూసుకుని వెళ్లేట్లుగా.. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పనిచేసేది. మేము ఐదుగురం.. ఇరవైదాటి పాతికేళ్ల లోపు అమ్మాయిలం. మిగతా అందరూ సీనియర్ మగవాళ్లు. సడన్గా పన్నెండు గంటలు దాటుతుండగా వాళ్లు.. “మేడమ్.. ఎక్స్ క్యూజ్ మీ!” అంటూ మమ్మల్ని ఒక్కొక్కళ్లనీ డైనింగ్ హాల్లోకి పిలిచి రంగులు చల్లారు. మేం వద్దని వారించినా వినలేదు. నేను ఆ రోజు బ్యాంకు ఎదురుగా రైల్వే క్వార్టర్లో ఉన్న కొలీగ్ నిర్మల వాళ్లింటికి వెళ్లి తనిచ్చిన బట్టలు మార్చుకుని బస్సెక్కి మా ఊరికి వచ్చాను. అదే ఆఖరుసారి నేను బ్యాంకులోనూ, బయటా హోళీ ఆడటం!!
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి