‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
కరోనా కాలం.. ఎన్నో ఊహించని మార్పులు తెచ్చింది. రోడ్డు మీద ఎవర్ని చూసినా మాస్కుతోనే కనిపిస్తున్నారు. ‘ఇంతకీ ఆనందరావు గారు ఎక్కడ ఉన్నారో, ఏమో!’ అనుకుంటూ.. గురుద్వారా బస్టాపు దగ్గర కారు ఆపాను. సన్నని తుంపరలో.. గొడుగు అడ్డుపెట్టుకొని వెనక నుంచి వేగంగా వచ్చిన మనిషి కారులోకి తొంగిచూస్తూ.. “ఉదయ్ గారేనా?” అని అడిగాడు. “అవునండీ..” అన్నాను.
‘ఆనందరావు గారేనా!?’ అని నేను అడగాల్సిన పనిలేదు. వెనక డోర్ తీయబోతుంటే ముందు కూచోమని చెప్పాను. అసలు ఒక మనిషి తోడుకోసమే కదా బ్లాబ్లా యాప్లో ఈ జర్నీ ఆఫర్ పెట్టాను. అలాంటిది ఆయన వెనక కూచుంటే ఎలా? కారులో దూర ప్రయాణం బాగుంటుంది. ఒక మనిషి తోడుంటే ఇంకా బాగుంటుంది. ప్రయాణంలో రకరకాల దృశ్యాలు కనిపిస్తాయి. రకరకాల మనుషులూ తారసపడతారు. ఎప్పటికన్నా ఇలాంటి ప్రయాణాల్లో ఆలోచనలు వేగంగా కదులుతాయి.. బహుశా కళ్ల ముందు దృశ్యాలు అప్పటికప్పుడే ఎన్నెన్నో తారసపడ్డం వల్ల కాబోలు! దృశ్యాల్లోంచి అనేకానేక ఆలోచనలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి.
“ఓం సాయిరాం! మీరు ఎక్కడినుంచి వస్తున్నారు?” అడిగాడు ఆనందరావు.
“భోగాపురం మిరాకిల్ నుంచి”.. అని చెప్పాను.
“ఓహో.. భజన పాటలు ఏమన్నా ఉన్నాయా?”
“లేవండీ..” అన్నాను.
“మీ కుర్రోళ్ల దగ్గర అన్నీ ఉంటాయి.. అసలైనవి తప్ప! ఇదిగో! దీనిని ప్లే చేయండి. ఇలాంటి ముసురు వేళ.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రయాణం హాయిగా సాగుతుంది” అని ఓ పెన్డ్రైవ్ చేతికిచ్చాడు. ప్లే చేశాను. మంద్రస్వరంలో భజన గీతాలు మొదలయ్యాయి. కళ్లు మూసుకొని తన్మయమైపోతూ ఉంటాడనుకున్నాను. మాట్లాడ్డం మొదలెట్టాడు.. “ఉదయ్ గారూ! మనం ఎక్కడున్నా, ఎంత ఎదిగినా.. మన సంస్క ృతిని, సంప్రదాయాన్ని మర్చిపోకూడదండి. మనం మర్చిపోవడం వల్లే కొందరు మొత్తం ఆక్రమించేస్తున్నారు. ఇలా చూస్తా కూర్చుంటే కొన్నాళ్లకు మనం ఉండం”.
ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా అతనివేపు చూశాను. నవ్వాడు.
“చూశారా!? అసలు ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం కావడం లేదు. పరాయోడు మన కంచెను దాటేసి, గుమ్మం దాటేసి, ఇంట్లోకి వచ్చేసి, మనోళ్లను మార్చేస్తున్నా మనం పట్టించుకోవడం లేదు. మీలాంటి కుర్రోళ్లు ఇలా ఉంటే హిందూదేశం కాస్త ఇంకేదో దేశంగా మారిపోవడం ఖాయం..” అన్నాడు. నేను ఇన్నాళ్లూ పట్టించుకోని చాలా ముఖ్యమైన విషయమేదో అతను మాట్లాడుతున్నట్టు అర్థమైంది. కానీ, విషయమేంటో అస్పష్టంగానే ఉంది. ఏదో ఒకటి అనాలి కదా అని.. “మనది భారతదేశం కదండీ..” అన్నాను.
మళ్లీ నవ్వాడు. “ఇంగ్లీషోడు రాసిన పుస్తకాలు చదివి పాడైపోతున్నారు మీరు. అసలు మనమంతా ఎవరం? హిందువులం. హిందువులు నివసించే దేశం ఏమవుతుంది? హిందూదేశం అవుతుంది. ఇలాంటి చిన్న లాజిక్ కూడా అర్థం కాకుండా చెత్త చదువులు ఎక్కిస్తున్నారు”.. నవ్వుతున్నట్టే ఉన్నాడు కానీ, ఏదో కచ్చితమైన విషయం మహా గట్టిగా ఎక్కించాలని ప్రయత్నిస్తున్నాడని నాకు అర్థమైంది. “మనదేశంలో ఇంకా చాలా మతాలు ఉన్నాయి కదండీ.. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలూ.. అందరం కలిసే జీవిస్తాం కదా?”. “కలిసి మెలసి జీవించడమంటే కలగలసిపోవడం కాదు కదా? ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాల.. ఎవరు ఎక్కడినుంచి వచ్చారో అది గుర్తుండాల. ఫర్ సపోజ్.. నేను మీ కార్లో కూర్చున్నాను. అంతమాత్రాన ఈ కారు మీతోపాటు నాకూ సొంతమైపోద్దా? ఇది మీ సొంతం అన్న జ్ఞానం నా బుర్రలో ఉండొద్దా? కానీ, ఇప్పుడు కొంతమందికి ఉండటం లేదు”.
ఆ లాజిక్ తీసేసరికి ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. డ్రైవ్ చేస్తూనే..
‘ఇంకా ఏం చెబుతాడా!?’ అన్నట్టు అప్పుడప్పుడూ అతనివేపు చూస్తున్నాను. చాలా వేగంగా, స్పష్టంగా చాలా విషయాలు చెప్పుకొంటూ పోతున్నాడు. ఎప్పుడూ నేను వినని విషయాలు, ఫ్రెండ్స్ కూడా చర్చించని విషయాలు, ఎవరెవరి నుంచి దేశానికి ఎంత ప్రమాదం పొంచి ఉందో విడమరుస్తున్న విషయాలు.. నాలో ఆసక్తిని గమనించి, ఇంకా ఉత్సాహంగా చెబుతున్నాడు. అవన్నీ వింటూ.. ‘మనచుట్టూ ఉన్న మనుషుల్లో, మతాల్లో ఇంత కుట్ర దాగి ఉందా?’ అని దిగ్భ్రాంతికి గురయ్యాను. అడ్డురోడ్డు జంక్షన్ దాటాక హఠాత్తుగా ఒక దగ్గర ఆగమన్నాడు. రోడ్డు పక్కన కారు ఆపాను. కొద్ది మీటర్లు వెనక్కి నడిచాడు. అక్కడ ఒక ఆవు కొద్దిగా గాయపడి రోడ్డుపక్కన పడుకొని ఉంది.
“గోమాతా! ఎందుకమ్మా నీకీ దుర్గతి?” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదో శ్లోకం బిగ్గరగా చదివాడు. ఆ పక్కనే పాన్షాప్ ఉంది. అక్కడ కూర్చున్న కొందరిని కేకేసి, అరటిపళ్లు తీసుకురమ్మన్నాడు. ఒకతను అరటిపళ్లు తీసుకురాగా, మరో ముగ్గురు వెంట వచ్చారు. ఈలోగా అక్కడ జనం కూడా గుమిగూడటంతో అందరినీ చైతన్యపరచాలని సంకల్పించాడు ఆనందరావు.
“మనకు జన్మనిచ్చిన అమ్మ ఒక మాత. ఈ ఆవు మరొక మాత. అదే గోమాత! అలాంటి మాతను ఇలా రోడ్డున వదిలేయడం ధర్మమేనా? మన సంస్క ృతియేనా? ఏ చీకటిపడ్డాకో దుర్మార్గులు కొందరు ఈ గోవును చంపుకొని తినేస్తే మీరేం చేస్తారు? మీ తల్లిని అలా చేస్తే ఊరుకుంటారా?”.. నాతో మామూలుగా మాట్లాడిన ఆనందరావు ఇక్కడ విశ్వరూపం చూపిస్తున్నట్టు అర్థమైంది. జనం పోగవుతున్నారు. అతను చాలా ధాటిగా ప్రసంగిస్తున్నాడు. ఇంతలో ఒకతను గుంపును తోసుకుంటూ లోపలికి వచ్చి..
‘త్ త్!’ అంటూ దాన్ని అదిలించాడు. అది నెమ్మదిగా లేచింది. చూస్తే అది ఆవు కాదు.. ఎద్దు.“గోమాత కాదండీ.. గోపిత” అన్నాడు ఓ కుర్రోడు. “ఇలాంటి వేళాకోళాల వల్లే మన సంస్క ృతి దెబ్బతింటున్నది” అని చిరచిరలాడాడు ఆనందరావు. జనం ఎవరిదారిన వారు బయల్దేరారు. “అరటిపళ్లకు డబ్బులేవీ?” అంటూ షాపాయన బయటికి వచ్చాడు. “గోవుకు పెట్టిన పళ్లకు డబ్బులు అడుగుతావటయ్యా! అది నిన్ను వైతరణిని దాటించే పుణ్యం అనుకో!” అని ఓ నవ్వు నవ్వేసి, కారువైపు నడిచాడు ఆనందరావు.
నామవరం దాటుతున్నప్పుడు రోడ్డు పక్క ఓ పెద్ద యాక్సిడెంటు దృశ్యం కనిపించింది. అంతకు కొన్ని నిమిషాల కిందే జరిగినట్టుంది. టూవీలర్, కారు ఢీకొట్టుకున్నాయి. ఇద్దరు యువకులు రక్తమోడుతూ ఉండగా, స్ట్రెచర్ మీద పడుకోబెట్టి అంబులెన్సు ఎక్కిస్తున్నారు. ప్రమాదదృశ్యం బీభత్సంగా కనిపిస్తున్నది. నేను కారును కాస్త పక్కకు తీసి, ఆపబోయాను. “పోనివ్వండి.. పోనివ్వండి! దైవదర్శనానికి వెళ్తున్నప్పుడు ఇలాంటివి పట్టించుకోకూడదు. ఎవడికి ఎక్కడ రాసి ఉంటే అక్కడ అయిపోతుంది. అంతే!” అన్నాడు.
“అయినా.. దేవుడు రాసిన రాతను కూడా వీళ్లు ముందే చెరిపేసుకుంటున్నారు. లేకపోతే ఎందుకొచ్చిన బైకులు, ఎందుకొచ్చిన దిక్కుమాలిన స్పీడ్లు.. ఒళ్లు తెలియకుండా బైకు నడుపుతారు. చివరికి ఇలా రోడ్డు మీద మిగులుతారు..” అన్నాడు. నేను కారు ఆపలేదు. ఆ దృశ్యం ఇంకా కళ్లలో కదులుతూనే ఉంది. ఆ యువకులు ఇద్దరి చుట్టూనే నా ఆలోచనలు ముసురుకుంటున్నాయి. ఆనందరావు ఆ యాక్సిడెంటు గురించే ఏవో పాపకర్మలను ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. అవి చెవుల లోపలికి వెళ్లటడం లేదు. అతని గమ్యస్థానం అన్నవరం వచ్చేసింది. మెట్ల దారి దగ్గర కారు ఆపాను. అతను దిగిపోతూ.. “ఉదయ్.. మీలాంటి యువకులు మన ధర్మాన్ని కాపాడాలి. మా సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు తోడ్పడాలి. మీకు తోచిన విరాళం ఇచ్చి ప్రోత్సహించండి..” అని ఒక చందా పుస్తకం నాముందు పెట్టాడు. “ట్రావెల్ చార్జీని చందాగా ఉంచుకోండి” అనేసి.. అతనికి ‘బై!’ చెప్పి బయల్దేరాను.
పెట్రోల్ ఖర్చు కలిసొస్తుందనీ, మనిషి తోడూ ఉంటుందని ఊరికి వస్తున్నప్పుడు, తిరిగి వెళ్తున్నప్పుడూ నా కారులో ప్రయాణికులను ఎక్కించుకుంటాను. నా తోటి వయసు వారైతే సినిమాలు, క్రికెట్టు, టూరిస్టు ప్రదేశాలు, ఉద్యోగాలూ, ప్యాకేజీల గురించి మాట్లాడతారు. మధ్య వయస్కులు రాజకీయాల గురించి మాట్లాడతారు. ఎవరేం మాట్లాడినా.. వాళ్ల ఇష్టాయిష్టాలే స్పష్టంగా తెలుస్తాయి. నేను సహజంగా వాళ్లతో ఏకీ భవించడమో, వ్యతిరేకించడమో చేయను. చెబుతూ ఉంటే వింటాను. కొన్ని విషయాలైనా కొత్తగా తెలుస్తాయి. అలా తెలుసుకోవడం మనసుకు బాగుంటుంది. బ్లాబ్లా యాప్ వచ్చాక దానిలో మన ప్రయాణం తేదీ, సమయం, చార్జీలతో నమోదైతే చాలు.. అదే మార్గంలో వెళ్లే ప్రయాణికులు యాప్ ద్వారా మనల్ని కాంటాక్ట్ అవుతారు. మనం ఓకే చేస్తే మన కోసం వేచిచూస్తూ ఉంటారు. వైజాగ్ నుంచి అన్నవరం వరకూ సాగిన ఆనందరావు ప్రయాణం అలాంటిదే! అతని నుంచి విన్న మాటలు మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి. కానీ, ఆవు అనుకొని ఎద్దు దగ్గర ఆగినవాడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మనుషుల దగ్గర ఆగకపోవడం మాత్రం.. నా మనసుకు సబబుగా అనిపించడం లేదు. అతను చెప్పిన ఇతర విషయాల గురించి తీరిగ్గా ఆలోచించాలి. చదవడమో, ఫ్రెండ్స్తో చర్చించడమో చేయాలి. వీలైతే రెండూ చేయాలి.
కత్తిపూడి దాటిం తర్వాత ఫోను మోగింది. “హలో!” అన్నాను. “నేను రవిబాబును. ప్రత్తిపాడుకు ఎంత దూరంలో ఉన్నారు?” అడిగాడాయన. “చాలా దగ్గర్లో ఉన్నానండి. పది నిమిషాల్లో అక్కడ ఉంటాను. మీరు హైవేలో ఉన్నారు కదా?” అన్నాను.ఎక్కడ ఉన్నాడో ల్యాండ్మార్క్తో సహా చెప్పాడు. ఈరోజు ప్రయాణంలో రవిబాబు నా రెండో ప్యాసింజర్. ప్రత్తిపాడు నుంచి విజయవాడ దాకా వస్తాడు. రాజమండ్రి లాలా చెరువులో మరో ఇద్దరు ఎక్కుతారు. లాక్డౌన్ పరిస్థితులు పాక్షికంగానైనా కొనసాగుతున్నందున చాలామంది తక్కువమందితో షేర్ ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అతను చెప్పినట్టు సిగ్నల్ లైట్ దాటిన తరువాత బస్షెల్టర్ దగ్గర కారు ఆపాను. అతను డోర్ తీస్తూ చనువుగా పలకరించాడు. “కచ్చితంగా పది నిమిషాల్లోనే వచ్చేశారే..” అన్నాడు.. ఓ చిన్న పుస్తకాల కట్టను లోపల పెడుతూ.
సీట్లో కుదురుకొని కూర్చున్నాక.. “దారంతా వర్షమే ఉందా?” అన్నాడు.“లేదు.. తుంపరలాగ పడుతూ ఉంది” చెప్పాను. “ఇక్కడ పొద్దున పెద్ద వర్షం పడింది. వరిరైతులకు చాలా నష్టం. పొట్ట మీద ఉన్న చేను నీట్లో నానిందంటే రైతు కష్టమంతా పోయినట్టే!” అంటూ నిట్టూర్చాడు.
నా చూపు ఆ పుస్తకాలపై పడటం గమనించి.. “చే గువేరా పేరు విన్నారా? ఆయన గురించిన పుస్తకం ఇది. 53 ఏళ్ల క్రితం ఇదేరోజు చనిపోయాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో వివిధ భాషల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి సభలు జరుపుతున్నారు” అని చెప్పాడు. నాక్కూడా ‘చే’ బొమ్మ ఉన్న ఒక టీషర్టు ఉంది. అదే చెప్పాను. నవ్వాడు. “చే గురించి ఏమన్నా చదివారా?” అనడిగాడు. “లాటిన్ దేశాల్లో ఫ్యాషన్ ఐకాన్ కదా?” అన్నాను. తను మళ్లీ నవ్వాడు. “తనొక రివల్యూషనరిస్టు. ఆయన త్యాగాన్ని మరుగున పడేసి, తెగువను బిజినెస్ సింబల్గా మార్చేశారు”. “ఎవరు?”.“ఇంకెవరు? బిజినెస్ చేసేవాళ్లు”. … అలా సాగుతూ ఉంది మా సంభాషణ.అతను చెబుతున్నవి కూడా కొత్త విషయాలే!
జగ్గంపేటకు ముందు టోల్గేట్ వచ్చింది. “సార్.. స్వీట్కార్న్.. వేడివేడి స్వీట్కార్న్!” ఓ పదీ పన్నెండేళ్ల అబ్బాయి నాకు దగ్గరగా వచ్చి అరుస్తున్నాడు. నోటికి మాస్కు, చేతులకు గ్లౌజులు వేసుకున్నాడు.
“సార్.. పొత్తుకు పైన కొన్ని రేకలు వొలవకుండా ఉడకబెడుతున్నాం సార్! ఏం ఇబ్బంది ఉండదు. తీసుకోండి సార్..” అంటున్నాడు. రవిబాబు రెండు పొత్తులు తీసుకొని.. “ఏం చదువుకుంటున్నావ్?” అనడిగాడు. “సెవెంత్లోకి వచ్చేనండీ.. స్కూలు లేదు కదాని మా నాన్నకు తోడొచ్చాను” అని చెప్పాడు ఆ అబ్బాయి. టోల్ చెల్లింపు పూర్తయింది. ఎక్సలేటర్ తొక్కాను. “ఇంత చిన్న వయసులోనే కుటుంబాలకు ఆసరాగా నిలిచే పిల్లలు మన దేశంలో నూటికి 17 మంది ఉన్నారని ఒక సర్వే చెప్పింది. అందుచేత ఈ పిల్లల్లో అత్యధికులు హైస్కూలు స్థాయి విద్యను కూడా దాటలేరు. ఎప్పటికి మారుతుందో ఈ పరిస్థితి..” అన్నాడు రవిబాబు.
“అధిక సంతానం వల్లే కదండీ ఇలా అవుతుంది. కొన్ని మతాల వాళ్లకైతే కుటుంబ నియంత్రణ కూడా ఉండదు. అలాంటివాళ్లే బాధ్యత లేకుండా ఇలా రోడ్డు మీద ఎక్కువగా కనిపిస్తారు” అన్నాను యథాలాపంగా. నిజానికి అది నామాట కాదు. ఆనందరావుతో జరిగిన సంభాషణ ఫలితంగా వచ్చిన జ్ఞానం. రవిబాబు నావైపు చురుగ్గా చూశాడు. “ఇందాకటి అబ్బాయి ఏ మతం వాడో తెలుసా?”. “తెలీదు. కానీ, చాలామంది.. ” నసిగాను.
“నో! పేదరికం అధిక సంతానానికి ఒక కారణం. కానీ, సంతానానికి, మతానికి సంబంధం లేదు. ఇలాంటి పిల్లలు అన్ని మతాల్లోనూ ఉంటారు. ఇక్కడ సమస్య మతం కాదు.. ఆర్థికస్థితి సరిగ్గా లేకపోవడం, ఆదాయ వనరులు లేకపోవడం”. నేనేమీ మాట్లాడలేదు. అతనే మళ్లీ అన్నాడు..
“చదువుకున్న యువకులు సొంత పరిశీలన ద్వారా జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని పొందాలి. ప్రామాణికమైన పుస్తకాల్లోంచి, సమాచారంలోంచి విశ్లేషించాలి. కానీ, దురదృష్టవశాత్తూ కొంతమంది వాట్సాప్ ద్వారా జ్ఞాన సముపార్జన చేస్తున్నారు”.. అతని గొంతులో కొంత బాధ. “మనం మన సంస్క ృతిని, చరిత్రను మర్చిపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందంటారా? మన పద్ధతులు ఫాలో అయితే ప్రపంచంలో మనమే గొప్పవాళ్లం అయ్యుండేవాళ్లం అంటారు కదా?” అన్నాను.
మామూలుగా అయితే, ఇలా ప్రశ్నార్థకాలు లేకుండా స్టేట్మెంట్ ఇచ్చేవాణ్ని. కానీ, ఆనందరావు మాటలు నాక్కూడా ప్రశ్నార్థకాలుగా ఉండటం వల్ల రవిబాబు నుంచి వివరణ కోరుతున్నట్టుగా అడిగాను.
“ఏ సంస్క ృతీ, చరిత్రా ఆకాశం నుంచి పుట్టవు. అవి స్థిర పదార్థాలుగా ఉండవు. నిత్యం మారుతూ ఉంటాయి. పాత వాటిని పట్టుకొని వేలాడితే మనం ఇప్పుడు కాశీ మజిలీ కథల్లోలాగ పాదయాత్ర చేయాలి తప్ప ఇలా కారులో కలిసి ప్రయాణించం కదా.. ఆధునిక విజ్ఞానం అందించిన కారులోనో, విమానంలోనో ప్రయాణిస్తూ.. పుష్పకవిమానం గురించి కట్టుకథలు చెప్పుకోవడం అర్థం లేనిది కదా. అసలు ఈ కరోనా కాలంలో ప్రయాణాల్లో, డబ్బు చెల్లింపుల్లో ఎన్నెన్ని మార్పులు వచ్చాయో చూడండి. ఈ నడక అంతా చరిత్రా, సంస్కృతే! అదెప్పుడూ ముందుకు నడుస్తూ ఉంటుంది. దానిని ఒక సరైన మార్గంలో నడిచేలా చేయడమే ఆ కాలపు మనుషుల పని. పాత కాలం ఘనమైనది అనుకుంటూ ఈ కాలంలో బతకడం అంటే ఈ కాలాన్ని అవమానించడమే!” అన్నాడు రవిబాబు.
పూర్తిగా అర్థం కాలేదు కానీ, ఈ మాటలు అర్థవంతంగా ఉన్నట్టు అనిపించింది. “ఇదిగో ఇది తీసుకోండి” అని మొక్కజొన్న పొత్తు అందించాడు. “గమనించారా దీనిని. మామూలుగా అయితే, పొత్తుకున్న రేకలన్నీ తీసి ఉడకబెడతారు. అలా ఉడకబెడితే వాళ్ల చేతులు నేరుగా గింజలను తాకుతాయి. అప్పుడు తీసుకోవడానికి మనం ఇష్టపడం. ఇలాంటి అనుభవం వాళ్లకు ఉంది కాబట్టే.. ఒక వరస రేకలు ఉండగానే పొత్తును ఉడకబెట్టారు. అంటే మొక్కజొన్న పొత్తుకు మాస్కు ఉన్నట్టే! వీటిని మనం తొలగించి చక్కా తినొచ్చు. ఈ అవసరం కానీ, తెలివి కానీ ఆరునెలల క్రితం లేదు. ఇప్పుడు ఉంది. కాలానికి ముందుచూపు ఉంటుంది తప్ప వెనక చూపు ఉండదు”.
ఈ ఉదాహరణ బాగా అర్థమైంది. నిజమే కదా.. ఒక తరం కన్నా మరొక తరం స్మార్ట్గా ఉంటుంది. ప్రతి తరానికీ కాలం అప్పటికి చలామణిలో ఉన్న జ్ఞానాన్ని అప్డేట్ చేసేస్తున్నది. రాజమండ్రి దగ్గర్లోకి వచ్చేశాం. తుంపర కాస్త వర్షంగా మారింది. వైపర్ ఆన్ చేశాను. లాలా చెరువులో వెయిట్ చేస్తున్న ఇమ్రాన్ హడావుడిగా ఫోను చేశాడు. “బ్రదర్.. వర్షం పడుతున్నది. శంకర్ విలాస్ దగ్గర ఉన్నాం. మీరేం దాటి వెళ్లిపోలేదు కదా?” అన్నాడు.
“లేదు. ఐదారు నిమిషాల్లో మీ ముందుంటాను” అని చెప్పాను. వర్షం మరింత పెరిగింది. నెమ్మదిగా లాలా చెరువు చేరుకొని, శంకర్ విలాస్ ముందు ఆగాను. ఇమ్రాన్, అతని వెంట ఒక మహిళ పరుగెత్తుకొని వచ్చారు. ఈ లోగానే ఇద్దరూ బాగా తడిసిపోయారు. డోర్ లాక్ ఓపెన్ చేసి, వెనక కూర్చోమన్నాను. వాళ్ల దగ్గర తుడుచుకోవడానికి పొడిబట్టలు ఏమీ లేనట్టున్నాయి. రవిబాబు తన బ్యాగులోంచి టవలు తీసి వారికి అందించాడు.
“ఉతికిన టవలే! పర్లేదు.. తుడుచుకోండి” అన్నాడు. మొహమాటంగానే దాన్నందుకున్నాడు ఇమ్రాన్. “కష్టానికి కష్టం తోడు. ఈవర్షం ఇప్పుడే రావాలా!?” అని తనలో తాను అనుకుంటూ చేతుల మీది తడిని అద్దుకుంటున్నాడు.
“ఏమైంది?” అనడిగాడు రవిబాబు.
“నా చిన్న చెల్లెలు నిప్పంటించుకొంది. మమ్మల్ని కాదని వెళ్లిపోయి పెళ్లి చేసుకొంది. ఏం కష్టాలు పడిందో.. వారం కిందే ఈ ఘోరానికి తలపడింది. తెలిసిన వెంటనే వెళ్లి.. డబ్బులు అవసరమై నిన్న సాయంత్రమే తిరిగొచ్చాం. ఈ పొద్దున చచ్చిపోయిందని కబురు ..” అతని కంఠంలో దుఃఖం పలుకుతున్నది. “దానికో రెండేళ్ల పాప ఉంది. వాళ్లేమో ‘వదిలించుకుందాం!’ అనుకుంటున్నారు. మాకేమో సాకేంత స్థితి లేదు. అలా అని వాళ్ల దగ్గర ఉంచాలని లేదు. రెండున్నరేళ్ల తర్వాత ఓ పది రోజుల క్రితం వాళ్ల వదినకు ఫోను చేసి, ఏడ్చిందట. బిడ్డ అనాథైపోతుందేమోనని బాధపడిందట. అప్పుడే వెళ్లి తీసుకొచ్చేసినా దక్కేది”.. మళ్లీ సైలెంటయి పోయాడు. ఏడుస్తున్నాడు కాబోలు..
“ఊరుకో ఊరుకో..” నెమ్మదిగా అంటున్నదామె. రవిబాబు సీట్లో నుంచే వెనక్కి తిరిగి.. “పెద్ద బాధే ఇది. కాస్త తమాయించుకోండి. ఆ పాప భవిష్యత్తు గురించి బాధపడకండి. మీకు సాకే అవకాశం లేకపోతే మీ రాజమండ్రిలోనే అలాంటి పిల్లలకు ఒక మంచి హోం ఉంది. వాళ్లకు ఇవ్వొచ్చు. వాళ్లే పోషిస్తారు. బాగా చదివిస్తారు కూడా!” అన్నాడు. ఇమ్రాన్ ఒక్కసారిగా ముందుకు వొంగి.. “అవునా సార్.. ఎంత మంచిమాట చెప్పారండీ. ఆ మేలు చేసిపెట్టండి. మీ మేలు జన్మలో మర్చిపోను. మా పరిస్థితి మెరుగుపడితే ఏదోలా చూసుకుంటాం. అందాక ఆశ్రయం దొరికితే చాలు”.. అన్నాడు. అతని గొంతులో ఆసరా దొరికిన ఆనందం..
“తప్పకుండా చేద్దాం!” అన్నాడు రవిబాబు. ఆ భరోసా తరువాత ఇమ్రాన్ మళ్లీ దుఃఖపడలేదు. చెల్లి వేరే మతం అబ్బాయిని ప్రేమించడం గురించి, ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడం గురించి చెబుతూనే ఉన్నాడు. మధ్యమధ్యలో పసిపాప భవిష్యత్తు గురించి, రవిబాబు భరోసా వల్ల కలిగిన ఆనందం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాడు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి దగ్గర ఇమ్రాన్, అతని భార్య దిగిపోయారు. డబ్బులు ఇవ్వబోతే..
“వద్దులెండి.. ఆ పాపకు ఏమైనా కొనివ్వండి” అన్నాను. రవిబాబు నాకేసి చాలా సంతోషంగా చూశాడు. తరువాత తన ఫోన్ నెంబర్ వాళ్లకిచ్చి, వాళ్ల ఫోన్ నెంబర్ తీసుకొని.. ఏ అవసరం వచ్చినా తనకు కాల్ చేయమని చెప్పాడు. ఇమ్రాన్ మా ఇద్దరికీ పదేపదే థ్యాంక్స్ చెప్పి హాస్పిటల్లోకి వెళ్లిపోయాడు.రవిబాబు బెంజి సర్కిల్లో దిగుతున్నప్పుడు..
“మీరు మనుషుల గురించి బాగా ఆలోచిస్తారు” అన్నాను. “మనం మనుషులం కదా.. మీలాగే నేను కూడా ఆలోచిస్తాను!” అన్నాడు నవ్వుతూ.“ఇదిగో.. ఈ పుస్తకం మీరు తప్పకుండా చదవాలి. ఈయన మనకన్నా ముందు, మనకన్నా ఎక్కువగా మనుషుల గురించి ఆలోచించిన మనిషి. ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టిన మనిషి..” అంటూ.. ‘చే’ పుస్తకాన్ని నా చేతుల్లో పెట్టి, భుజాన గుడ్డసంచి తగిలించుకొని నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
– సత్యాజీ
94900 99167