NT Stories | ప్రపంచ ప్రసిద్ధి చెందిన మా మల్టీనేషనల్ కంపెనీ రజతోత్సవ సంబరాల సంరంభాలు ప్రారంభమయ్యాయి. దేశమంతా విస్తరించిన అన్ని శాఖల ఉద్యోగులకు, మా అభయ చారిటబుల్ ట్రస్ట్ భాగస్వాములకు ఆ ఆరురోజులు పండుగే! విందులూ, వినోదాలు, చర్చలు, సెమినార్లు, భవిష్యత్ ప్రణాళికా రచనలలో కాలమే తెలియడం లేదు. ఉదయం తొమ్మిది గంటలకే అల్పాహార విందు తరువాత ప్రారంభమయ్యే సమావేశాలు.. ఇండోర్ ఏసీ ఆడిటోరియం అలుపూ సొలుపూ తెలియనీయడం లేదు. సామూహిక వివాహ వేడుకల్లా, సామూహిక వ్రత నిర్వహణ విధానాల్లా పాల్గొనే వారిలో నూతనోత్సాహం నింపుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు దేశీయ వంటకాలతో షడ్రసోపేతమైన విందుభోజనం.. ఓ గంట కునుకు ప్రసాదించి తీరుతుంది! అందుకే మధ్యాహ్నం నాలుగు గంటలకు మొదలై.. స్వల్ప టీ విరామంతో రాత్రి తొమ్మిది గంటలకు ముగుస్తున్నాయి!
చైర్మన్ గారి పర్సనల్ సెక్రటరీగా రజతోత్సవ సంబరాల నిర్వహణ బాధ్యతలన్నీ నా భుజస్కంధాలపై వేసుకొని పదిమంది అసిస్టెంట్ల సహాయంతో ఆ మహోత్సవాలలో ఎలాంటి లోపాలు రాకుండా చూడటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. ఆరు రోజుల కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి.
ఆ ఆరు రోజుల కార్యక్రమాలు రూపొందించడంలో.. సాహితీ, సాంస్కృతిక, మనోవైజ్ఞానిక, మనోరంజక కార్యక్రమాలతో అతిథులనందర్నీ అలరించినందుకు, మానసికోల్లాసం కలిగించినందుకు చైర్మన్గారు నన్ను అభినందించారు. ఎక్కడా విసుగూ విరామం లేకుండా, ఠంచనుగా అనుకున్న సమయానికి తగిన విధంగా, ఎవ్వరినీ నొప్పించక.. నేను నొచ్చుకోకుండా నిర్వహించిన కార్యక్రమాలకు అతిథుల ఆదరణ అందుకున్నాను. అందులో నాతోపాటు కలిసి పనిచేసిన సీఈవో పాత్ర ప్రముఖంగా ప్రశంసించదగింది! అందుకే ఆరు రోజులు ఆరు క్షణాల్లో అయిపోయాయనిపించింది!
ముగింపు సమావేశం చైర్మన్గారి అధ్యక్షతన ప్రారంభమై.. అతిథుల అంతరంగ ఆవిష్కరణకు అవకాశమిచ్చింది. కంపెనీ విధి విధానాలపై, నడుస్తున్న భవిష్యత్ కార్యక్రమాలపై అనుభవాలు వివరించమని ఆహ్వానాలు అందాయి.
“మా కంపెనీ హితులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు, నిర్వహణలో ప్రముఖపాత్ర వహించే నిర్వాహకులకు, తమ శక్తి సామర్థ్యాలతో మన సంస్థను ఈ స్థాయికి తెచ్చిన ఉద్యోగ మిత్రులందరికీ స్వాగతం! సుస్వాగతం! శుభ స్వాగతం!
పాతిక సంవత్సరాల క్రితం చిన్న వ్యవస్థగా ప్రారంభమైన మన కంపెనీ ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడులు, షేర్లు, లావాదేవీలు అనూహ్యంగా పెరగడం ప్రారంభించి సుమారు పదిహేను సంవత్సరాలైంది! అప్పటి వరకూ నత్తనడక సాగిన షేర్లు, లాభాలు, లాభాల వాటాలు దినదిన ప్రవర్ధమానంగా పెరగడం ప్రారంభించాయి. ఎందరో ఔత్సాహికులను ఆకర్షిస్తున్నాయి. సామాజిక సేవను ప్రోత్సహిస్తున్నాయి. ఈ సందర్భంగా మిమ్మల్ని మనసు విప్పి మాట్లాడమని, మీ అమూల్యమైన, నిర్మాణాత్మకమైన సలహాలతో, సూచనలతో మన బంగారు భవిష్యత్తుకు పటిష్ఠమైన పునాదులు వేయవలసిందిగా ఒక్కొక్కరిగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను”..
నా స్వాగత వచనాల తరువాత ఒక్కొక్కరూ వేదిక మీదికి వచ్చి తమ అమూల్యమైన అంతరంగాలను ఆవిష్కరించడం ఆరంభించారు.
“మిత్రులారా! కంపెనీ ప్రారంభమైన దగ్గరనుంచీ మనలో కొందరం భాగస్వాములుగా ఉంటున్నాం! పి.యమ్. చెప్పినట్లుగా పదిహేను సంవత్సరాల నుంచీ షేర్ల విలువ బాగా పెరిగింది. అభయ చారిటబుల్ ట్రస్ట్ భాగస్వామ్యానికి ఎందరో ముందుకు వస్తున్నారు. మన కంపెనీలో షేర్లు కొనాలని ఎందరో తహతహలాడుతున్నారు. దానికి కారణం చైర్మన్ గారు చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు! మురికివాడలను బాగు చేయడంలో, స్కూళ్లను స్థాపించడంలో, నిర్వహించడంలో, వారికి కనీస అవసరాలు సమకూర్చడంలో మనల్ని భాగస్వాములను చేస్తున్నారు. కనుకనే మనం కూడా చిత్తశుద్ధితో భారీ పెట్టుబడులు పెడుతున్నాం. ఫలాలు రాబట్టుతున్నాం!” ఒకరు భాగస్వామ్యం వివరించారు.
“డియర్ ఫ్రెండ్స్! కంపెనీ భాగస్వామ్యం గొప్పదా?.. మన అభయ చారిటబుల్ షేర్లు కొనడం గొప్పదా?.. అని ప్రశ్నిస్తే.. ‘చెట్టుముందా!? విత్తుముందా!?’ అనే సామెత గుర్తుకు వస్తుంది. మేము రెండిటిలోనూ మా వంతు కృషి చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాం! కంపెనీ ఈ విధంగా దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లాలని మనలాంటి వారెందరో మనతో చేయికలపాలని ఆశిస్తున్నాం!”..
“మా కంపెనీ నిర్మించే పేదల గృహ సముదాయాలకూ, స్కూలు బిల్డింగ్లకూ, మరుగుదొడ్లకూ నాణ్యతలో రాజీపడకుండా, స్వల్పమైన లాభాలతో నిర్మించే అవకాశమిస్తున్న చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలపకుండా ఉండలేను!”..
“అనాథ శరణాలయాల నిర్వహణకు, స్కూళ్లల్లో మధ్యాహ్న భోజన పథకాలకు అవసరమైన అన్ని సంబారాలను సమకూర్చే అవకాశం కలిగించినందుకు చైర్మన్గారికి హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకొంటున్నాను!”..
అభయ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న అనేక సామాజిక సహకార పునరుద్ధరణ కార్యక్రమాల్లో తమవంతు ఇతోధిక సహాయ సహకారాలందిస్తూ అత్యంత సంతృప్తిని, ఆత్మీయ అనుభూతిని తమ పొగడ్తల ద్వారా తెలియజేసిన భాగస్వాముల ఆనందాన్ని చైర్మన్గారు చిరునవ్వుతో స్వీకరించారు. అందుకు సమాధానం చెప్పమని సైగ చేశారు.
అందరి ఆత్మీయ భాషణలు పూర్తయిన తరువాత నేను తిరిగి మైక్ ముందుకు వచ్చాను.
“ఆత్మీయ అనుభూతులు పంచిన అందరికి కృతజ్ఞతాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇంతటి అమోఘమైన, అనూహ్యమైన నిర్మాణాత్మక కార్యక్రమాలు ప్రారంభం కావడానికి కారణం.. ఒక ఆశ్చర్యకరమైన, నమ్మశక్యంగాని, ఒక అద్భుతమైన సంఘటన! అది జరిగి నేటికి సరిగ్గా పదిహేను సంవత్సరాలైంది. ఆ సంఘటన వివరించమంటే.. సభికులంతా కోరుకుంటే నేను తప్పక వివరిద్దామని అనుకుంటున్నాను. అదీ.. చైర్మన్గారి అనుమతితో!”..
క్షణం విరామమిచ్చి చైర్మన్గారి వైపుచూసి ఆయన అంగీకారం తీసుకున్నాను. ఆ విరామాన్నే అతిథులు భరించలేకపోయారు.
“చెప్పండి! ఏం జరిగిందో? ఏం జరిగిందో?”.. అతిథులంతా మూకుమ్మడిగా ఆసక్తి చూపించారు.
“ఒకసారి బిజినెస్టూర్లో ఉండగా.. మార్నింగ్ వాకింగ్ తరువాత చైర్మన్గారు తమ పర్స్ పోగొట్టుకున్నారు. హోటల్కు తిరిగి వచ్చిన తరువాత తెలిసింది! పర్స్ పోయిందని”!..
“వాట్! చైర్మన్గారి పర్స్పోయిందా!”.. ఒకరు ఆశ్చర్యం ప్రకటించగానే, ఒక్కొక్కరుగా తమ సంభ్రమాశ్చర్యాలు ప్రదర్శించారు.
“అందులో ఎంతో విలువైన కరెన్సీ ఉండాలే!”..
“ఇండియన్ కరెన్సీయే కాదు.. డాలర్లు, పౌండ్లు ఉండి ఉండాలే!”..
“ఎన్నో కంపెనీల కార్డులు ఉండాలే!”..
“డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉండాలే!”..
వారి రకరకాల ప్రశ్నలతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే నేనందుకున్నాను..
“ఆ సంఘటన యధాతథంగా వివరించాలంటే సభ నిశ్శబ్దంగా ఉంటే మంచిది!”.. అంటూ చిన్న సూచన చేశాను.
అంతే! సభలో గుండుసూది వేస్తే వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. నేను నాటి సంఘటనను చెప్పడం మొదలు పెట్టాను.
* * *
“నా పర్స్పోయింది… రాజేశ్!”.. చైర్మన్గారు అన్నారు.
“ఎప్పుడు పోయి ఉంటుందంటారు?”.
“ఏమో! ఎప్పుడు పోయిందో గమనించలేదు. బహుశా మార్నింగ్ వాకింగ్ తరువాత పోయి ఉంటుంది!”.. ఆయన ఆలోచనలో పడ్డారు.
“ఈరోజు మురికివాడల్లో మార్నింగ్ వాకింగ్ చేశారు. అక్కడే పోయి ఉండాలి” అంటున్న ఆయనవైపు ప్రశ్నార్థకంగా చూశాను.
“అక్కడే పోయి ఉంటుంది రాజేశ్! అయినా సాయంత్రానికి ఎవరో ఒకరు తెచ్చి ఇస్తారులే!” నిబ్బరంగా అన్నారు.
నేను కంగారు పడ్డాను.
“సర్! అందులో వేల రూపాయలున్నాయి. ఫారిన్ కరెన్సీ ఉంది! ఎన్నో కార్డులు ఉన్నాయి! పోలీస్ కంప్లయింట్ ఇద్దాం?”.. ఆయన అనుమతిని అడిగాను.
“ఉన్నా.. పరవాలేదు రాజేశ్! ఎవరో ఒకరు తప్పకుండా తెచ్చి ఇస్తారు!”.
“నాకు నమ్మకం లేదు సర్! వెంటనే బ్యాంకులకు ఫోన్ చేసి కార్డుల్ని బ్లాక్ చేయమని చెబుతాను. ఎకౌంట్స్ సీజ్ చేయమని చెబుతాను. ఫారిన్ కరెన్సీ వస్తే ఇన్ఫామ్ చేయమంటాను” కార్యాచరణ వివరించాను.
“లేదు రాజేశ్! నాకు పేదరికం నిజాయితీ మీద నమ్మకం ఉంది! వారి పవిత్రమైన హృదయాల మీద ప్రగాఢమైన విశ్వాసముంది! వాళ్ల కరుణాతరంగాల మీద అపనమ్మకం కలిగే అవకాశం లేదు. తప్పకుండా సాయంత్రం దాకా వేచి చూద్దాం! పర్స్ తప్పకుండా దొరుకుతుంది! అందులో మన ఫోన్ నంబర్లు అడ్రస్లున్నాయి. సాయంత్రానికి ఫోన్కాల్ తప్పక వస్తుంది!”.
ఆ తర్వాత చైర్మన్గారు నిర్లిప్తంగా విశ్రాంతి కోసం రూమ్లోకి వెళ్లిపోయారు. పేదల అంతరంగాల మీద ఆయనకున్న అవ్యాజానురాగానికి, నిజాయతీకి నాకు అమితాశ్చర్యం వేసింది! పర్స్ దొరకదని తెలుసు! ఏ చర్య తీసుకోవాలన్నా సాయంత్రం దాకా ఆగాలి!
ఆయన ప్రశాంతంగా హోటల్ రూమ్లో విశ్రాంతి తీసుకుంటున్నారు! నేను బయట కారిడార్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాను. సరిగ్గా ఐదు గంటలకు చైర్మన్గారి ఫోన్ రింగయింది. స్పీకర్ ఆన్ చేశాను.
“హలో!”.. నేనే జవాబిచ్చాను.
“మా మురికివాడలో ఒక పర్స్ దొరికింది! మీరు వాడ చివరనున్న పబ్లిక్ ఫోన్ దగ్గరికి వస్తే అందజేస్తాను”.. అది ఓ పిల్లవాడి గొంతులా ఉంది. స్పీకర్లోంచి ఆ సంభాణంతా విని చైర్మన్గారు బయటికి వచ్చారు.
“వెళ్దామా.. రాజేశ్! నేను చెప్పానా… లేదా!? తప్పకుండా నా పర్స్ దొరకుతుందని. అది సేఫ్గా తిరిగి నా చేతికి వస్తుందని”.. ఆయన ముఖంలో చిరునవ్వు అందంగా తొంగిచూసింది.
“అలాగే సర్! వెళ్దాం రండి!” అంటూ బయల్దేరాం.
తను చెప్పిన పబ్లిక్ టెలిఫోన్ ఎదుట కారు ఆపించాను. ఎదురుగా పర్స్ చేతితో పట్టుకున్న పిల్లవాడు కనిపించాడు. కారు ఆగిందో.. లేదో.. దిగిపోయి గబగబా ఆ పిల్లవాడి చేతిలో ఉన్న పర్స్ను లాక్కునేంత పని చేశాను.
క్షణంలోనే పర్స్ను ఓపెన్ చేసి.. పర్స్ విలువను అంచనా కట్టాను. నోట్లన్నీ యధాతథంగా ఉన్నాయి. ఫారిన్ కరెన్సీ సేఫ్గా ఉంది. ఇక బిజినెస్ కార్డుల గురించి చెప్పనక్కరలేదు.
“పర్స్ సేఫ్గా ఉంది సర్!” ఆనందంతో ఆయనకు అందించాను.
“ఉంటుందని అప్పుడే చెప్పానుగా!” నిర్లిప్తంగా అన్నారాయన.
ఆ పిల్లవాడి వైపు ఎగాదిగా చూశాను. బాగా మాసిపోయిన చొక్కా, నిక్కరు. అక్కడక్కడా చిరుగులు కనిపించకుండా మాసికలు వేసి ఉన్నాయి. తైల సంస్కారం లేని జుట్టు.. నిరుపేదరికానికి నిలువెత్తు నిదర్శనంలా ఉన్నాడు. సుమారు పది, పన్నెండేళ్లు ఉండవచ్చు. వయసు తెలియడం లేదు.
ముందుగా నేను కారు ఎక్కబోతుంటే..
“అయ్యా!’ అని పిలిచాడు ఆ పిల్లవాడు.
నేను కారు దిగి.. ‘ఏమిటి?’ అన్నట్లు చూశాను.
“నాకు కొంచెం డబ్బు కావాలి!” వినయంగా అడిగాడు.
‘చూశారా సర్! పర్స్ తిరిగి ఇచ్చినందుకు వెయ్యో, పదివేలో అడగబోతున్నాడు!’.. కళ్లతోనే ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగాను.
“ఎంత కావాలి బాబూ?”.. చైర్మన్గారు మృదువుగా అడిగారు.
“ఒక్క రూపాయి ఇప్పించండి!” ఆ పిల్లవాడు మరింత వినయంగా అడిగాడు.
‘ఒక్క రూపాయా?’ నేను నిశ్చేష్టుణ్ని అయ్యాను.
వాణ్ని, వాడి పేదరికాన్ని చులకనగా చూసినందుకు తలదించుకున్నాను.
“ఎందుకు బాబూ?” చైర్మన్గారు వివరంగా అడిగారు.
“అయ్యగారూ! పర్స్ దొరికిన దగ్గర నుంచీ మీ నంబర్కు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. మురికివాడలో ఫోనుండదుగా! తీరా పబ్లిక్ ఫోన్ దగ్గరికి వచ్చేసరికి రూపాయి అవసరమైంది. ఈ షాపువాడి దగ్గర రూపాయి అప్పు తీసుకొని మీకు ఫోన్ చేశాను. రూపాయి అతనికి తిరిగి ఇవ్వాలిగా! అందుకే రూపాయి అడిగాను. నాకేం అవసరం లేదు. ఆషాపు వాడికివ్వండి!”..
సమాధానం కోసం ఎదురు చూడకుండా వాడు మురికివాడలో కలిసిపోయాడు.
* * *
మాటలు ముగించి నేను సభికుల వైపు చూశాను. క్షణకాలం సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకొన్న సభికులంతా ముక్తకంఠంతో ఒకే ఒక ప్రశ్నవేశారు.
“తరువాతేమైందో చెప్పండి! మమ్మల్ని సస్పెన్స్తో అర్ధాంతరంగా వదలి వేయకుండా మిగిలిన కథ చెప్పండి!”..
వారికి సమాధానం చెప్పడం కోసం చైర్మన్గారివైపు చూశాను.
“ఇప్పుడు మిగిలిన కథ నేను చెబుతాను..” చైర్మన్గారు అందుకున్నారు.
“పేదవారి గురించి నేను చెప్పిన మాటలు నిజమయ్యాయి! ఆ పేద పిల్లవాడు రూపాయి తీసుకోకుండా, నా పర్స్ యధాతథంగా తిరిగి ఇవ్వడం ద్వారా వారి నిజాయతీ నిరూపితమైంది. వారి కరుణాంతరంగాలు ఆవిష్కృతమయ్యాయి. వాళ్ల పవిత్రమైన హృదయాలు, నిష్కల్మషమైన జాలి, దయ, సానుభూతి అవగతమయ్యాయి. అవి నాకంటే ముఖ్యంగా నా పీఎస్ రాజేశ్ ముందు సాక్షాత్కరించాయి.
షాపువాడికి రూపాయి ఇచ్చేసి ఆ పిల్లవాణ్ని అనుసరించమనీ, వాడి వివరాలు సేకరించమనీ, వారి ఆర్థిక స్థితిగతులను అవగాహన చేసుకు రమ్మని రాజేశ్ను మురికివాడకు పంపించాను. ఆ మురికివాడ పరిస్థితిని అంచనా కట్టి తిరిగి వచ్చేంతవరకూ అక్కడే ఉంటానని షరతు విధించాను.
సరిగ్గా అరగంటకు రాజేశ్ తిరిగి వచ్చాడు. అతను సేకరించిన వివరాలు వారి నిరుపేద జీవితాల స్థితిగతులు నా హృదయాన్ని ద్రవింపచేశాయి. ఆ రోజుకు సరిగ్గా ఆ పిల్లవాడి అక్క చనిపోయి పదిరోజులైంది. మరునాడు, పదకొండవ రోజు. కనీసం ముగ్గురికైనా అక్క ఆత్మశాంతి కోసం అన్నం పెట్టాలని తండ్రీ కొడుకులు ఆశపడ్డారు. అందుకు కూడా డబ్బు దొరకలేదు. ఆ సమయంలోనే నా పర్స్ దొరికింది. అందులో డబ్బు ఖర్చు పెట్టి అన్నదానం చేయమని ఎందరో ప్రలోభపెట్టారు. కానీ, వాడి నిజాయతీ అందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా నా పర్స్ క్షేమంగా నన్ను చేరుకున్నది!”.. క్షణం ఆగి కథ కొనసాగించారు చైర్మన్గారు.
“అప్పుడే ఆ మురికివాడను దత్తత తీసుకోవాలని, వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని అనిపించింది. ముఖ్యంగా మరుగుదొడ్లు కట్టించి, మురుగు పారుదల సౌకర్యాలు పెంచి ఆరోగ్యాన్ని హరించే దోమలు, వగైరాలు నివాసం చేయకుండా చేయాలని అనిపించింది. ప్రాథమిక వైద్యశిబిరం నెలకొల్పాలని అనిపించింది. విద్య నేర్పడానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని అనిపించింది. అందులో భాగంగా మొట్టమొదటగా మరునాడు ఆ పిల్లవాడి అక్క దశదిన కార్యక్రమం సందర్భంగా ఆ మురికివాడలో అందరికీ ఆహార పొట్లాలు పంచి అన్నదాన కార్యక్రమం చేయమని రాజేశ్ను ఆదేశించాను. ఆ క్షణం నుంచి మన అభయ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమాల్లో విప్లవాత్మకమైన మార్పులు రావాలని ఆశించాను. అందుకు అందరూ సహకరించారు. నెమ్మదిగా మురికివాడలు అభివృద్ధి చెందడం మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం!”..
చైర్మన్గారు ఉపన్యాసం ముగించి కూర్చుండిపోయారు. సభ నిశ్శబ్దం నుంచి తేరుకునేలోగా.. పదిహేనేళ్ల క్రితం ఆరోజు సర్వసభ్య సమావేశంలో చైర్మన్గారి ప్రసంగ పాఠ సారాంశాన్ని సభికులకు జ్ఞప్తి చేశాను.
“స్నేహితులారా! సమాజంలో ఉన్నవాళ్లంటే గౌరవం.. పేదవారంటే చులకన! ఉన్నవాళ్లు ప్రలోభాలకు లోనుకారని, నిజాయతీ వారికి మాత్రమే ఉందని ప్రగాఢమైన నమ్మకం! పేదవారంతా ఆశాపరులు, స్వార్థపరులు, నిజాయతీ లేనివారని, విశ్వాసం లేనివారని మన అంతరంగాలలో పాతుకుపోయింది. ఈరోజు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఆవిధంగానే ఆలోచించే రాజేశ్ అంచనాలను పటాపంచలు చేసింది. లక్షల విలువైన నా పర్స్ దొరికినా ఒక్క రూపాయి కూడా ఆశించక.. కేవలం నాకు ఫోన్ చేసినందుకు అప్పుగా తీసుకున్న ఒక్క రూపాయిని మాత్రమే ఇవ్వమన్న మురికివాడలోని పది పన్నెండేళ్ల పేదపిల్లవాడు.. వాళ్ల నీతి – నిజాయతీలకు పట్టం కట్టాడు. వాడి కరుణాంతరంగాలను ఆవిష్కరించాడు. సమాజంలో తినడానికి తిండిలేని, నిలువ నీడలేని అటువంటి పవిత్రమైన వారి మనుగడకు, పురోభివృద్ధికి మన అభయ చారిటబుల్ ట్రస్ట్ స్థానం కల్పించాలి! మరిన్ని సంక్షేమ పథకాలు, సేవా కార్యక్రమాలు రూపుదిద్దుకోవాలి! ప్రతీపైసా అవసరమున్న వాడికి అందుతుంది. అటువంటి మరికొందరికి చేయూతనిస్తారు. కనుక మన పెట్టుబడులు మురికివాడల పునరుద్ధరణకు వినియోగించుకుందాం! ప్రభుత్వమేదైనా మేచింగ్ గ్రాంట్ ఇస్తే దానిని సద్వినియోగపరుచుకుందాం!”..
ఆరోజు చైర్మన్గారి ప్రసంగ పాఠ సారాంశం జ్ఞప్తికి తెచ్చిన తరువాత అభయ చారిటబుల్ ట్రస్ట్ సాధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను వివరించాను.
“మనం ఎన్నో అనాథాశ్రమాలు నెలకొల్పాం! మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పించాం! వృద్ధాశ్రమాలు నిర్మించాం! ఎందరినో దత్తత తీసుకొని ఉన్నత విద్యాభ్యాసం అందించాం! మరెందరినో ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, టీచర్లుగా తీర్చిదిద్దాం! నిరుపేద యువతులకు సామూహిక వివాహాలు చేయించాం! ప్రతీ జంటకూ మాంగళ్యాలు, జత పట్టుబట్టలు, చిన్న కుటుంబానికి కావలసిన వంటపాత్రలు, తదితర నిత్యావసర వస్తువులను దానంగా అందిస్తున్నాం! అందుకే మన చారిటబుల్ ట్రస్ట్లో పెట్టుబడులు పెట్టడానికి ఎందరో ధనవంతులు ముందుకువస్తున్నారు. అందుకు కారణం.. ఆరోజు జరిగిన మురికివాడ సంఘటనే! ఆ పిల్లవాడే మన చారిటబుల్ ట్రస్ట్ దిశానిర్దేశాన్ని మార్చగలిగాడు. అందుకు ఆ పేద పిల్లవాడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సభాముఖంగా సమర్పించకుండా ఉండలేకపోతున్నాను!”..
నా గొంతు గద్గదమవ్వడం స్పష్టంగా తెలుస్తున్నది.
క్షణకాలం సభలో గుండుసూది వేస్తే వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. మరుక్షణంలో కలకలం మొదలైంది. ఒకరు లేచి సమయానుకూలమైన సందర్భోచితమైన మంచి ప్రశ్న సంధించాడు.
“ఇంతకూ ఆ పిల్లవాడెవరు? ఇప్పుడెక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఎలా ఉన్నాడు? ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నలకు సమాధానం లభించేంత వరకూ సభలో కలకలం సద్దుమణగదు!”..
అందరూ.. ఔనంటూ ముక్తకంఠంతో ఆ ప్రశ్నలను సమర్థించారు. ఉత్కంఠతో అందరి చూపులూ నా మీద, చైర్మన్గారి మీదకు ప్రసరించడం ఆరంభించాయి. నేను చైర్మన్గారిని, సీఈవోలను మార్చి మార్చి చూస్తున్నాను. చైర్మన్ గారి ఆదేశానుసారం సీఈవోను ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించాను. అంతవరకూ వేదికపై ఓ మూల ఆసీనుడైన సీఈవో మైక్ ముందుకు రావడంతో కలకలం కొంత సద్దుమణిగింది.
“సభకు నమస్కారం! ఆ పేద పిల్లవాడెవరో నాకు తెలుసు! తరువాత ఏం చేశాడో తెలుసు! చైర్మన్గారు అనుమతిస్తే ఆ పిల్లవాడి కథ వినిపిస్తాను” అని సీఈవో అనగానే సభలో నిశ్శబ్దం రాజ్యమేలసాగింది.
చైర్మన్గారు చిరునవ్వుతో అంగీకారం తెలుపగానే సీఈవో ప్రారంభించారు.
* * *
“డియర్ ఫ్రెండ్స్! చైర్మన్గారు పర్స్ పోగొట్టుకున్న అరగంటకు.. మురికి కాలువ ఒడ్డున ఆ పిల్లవాడికి ఆ పర్స్ కనిపించింది. అందులో ఏవేవో కార్డులున్నాయి. వేలు, ఐదు వందలు, వంద రూపాయల నోట్లున్నాయి. వాటితోపాటు ఏవేవో రంగురంగుల నోట్లు కనిపించాయి. వెంటనే ఆ పిల్లవాడు తన తండ్రికి ఆ పర్స్ చూపించాడు. తనకు తెలిసిన ఇంగ్లీషులో వాడు ఆ కార్డుపైనున్న యజమాని పేరు, అడ్రస్, ఫోన్ నంబర్లు చదివి వినిపించాడు.
‘ఈయన పెద్ద పారిశ్రామికవేత్తరా! ఎన్నో ఫ్యాక్టరీలు, కంపెనీలున్నాయి. ఎందరో ఆయన కింద పని చేస్తున్నారు. ఇందులో డబ్బు విలువ మనకు తెలియదు. కార్డుల విలువ అంతకన్నా తెలియదు. ఆయనకు పర్స్ అందజేయడం ఎలాగబ్బా!?’.. వాడి నాన్న ఆలోచిస్తుంటే, వాడే పరిష్కారం సూచించాడు.
‘ఇందులో ఫోన్ నెంబర్లున్నాయి నాన్నా? ఆయనకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకువెళతాడు. ఇందులో నుంచి వందరూపాయలు తీసుకోనా! అక్క చనిపోయి రేపు పదకొండో రోజు! ముగ్గురికి అన్నం పెడదామన్నావుగా!’ ఆశగా అన్నాడు.
‘వద్దురా! అందులోంచి ఒక్క రూపాయి కూడా తీయవద్దు! నా మీద ఒట్టు! మీ అమ్మ మీద.. అక్కమీద ఒట్టు! వెంటనే వెళ్లి ఫోన్ చేసి ఆయనను రమ్మను. పర్స్ జాగ్రత్తగా అందించు! నేను పనికి వెళ్తున్నా! తిరిగి వచ్చేసరికి పర్స్ నాకు కనిపించకూడదు!’.. అంటూ వాడి నాన్న పనికి వెళ్లిపోయాడు.
వాడు వెళ్లి అమ్మ ఫొటో, అక్క ఫొటోల ముందు ఆ పర్స్ ఉంచాడు. రెండు ఫొటోలకూ దండలు వేసి ఉన్నాయి. తొమ్మిదో రోజు ఉదయాన్నే తండ్రితో కలిసి శ్మశానానికి వెళ్లి, అక్కకు ఇష్టమైన వస్తువులన్నీ ఆమె సమాధిపై ఉంచి వచ్చిన దగ్గరనుంచీ ఆ ఫొటోలనే తదేకంగా చూస్తున్నాడు. అమ్మ ఎప్పుడూ అబద్ధమే చెప్పేది! నిజం చెప్పేది కాదు! అవసాన దశలో కూడా ఎప్పుడూ తనకు అనారోగ్యంగా ఉందని నిజం చెప్పలేదు. ఆకలిగా ఉందంటే.. అన్నం పెట్టేది! చాలక ఇంకా కావాలంటే తను తినేదానిలోంచి కూడా పెట్టేసేది.
‘అమ్మా! నీకు అన్నం ఉన్నదా!?’ అని అడిగితే.. ఉందనే చెప్పేది! అన్నం గిన్నె వెదకబోతుంటే.. ‘నాకు ఆకలిగా లేదురా!’ అని అబద్ధం చెప్పేది. తనను స్కూల్లో చదివించడానికి తెల్లవారకముందే పనిలోకి వెళ్లేది. అక్కడినుంచి ఏవేవో తెచ్చి అక్కకూ, తనకూ తినిపించేది. రాత్రి చాలా సేపటి వరకూ కుట్టుమిషిన్ కుడుతూ మెలకువతో ఉంటే.. ‘అమ్మా! పొద్దున్న ఎప్పుడో లేచావుగదా! నిద్ర రావడం లేదా!?’ అంటే.. ‘నిద్ర రావడం లేదురా’ అంటూ అబద్ధం చెప్పేది.
ఒంట్లో బాగుండక గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లి వచ్చినప్పుడు.. ‘ఏమైందమ్మా!?’ అంటే.. ‘ఏమీ లేదురా.. బాగానే ఉన్నానురా’ అని అబద్ధమాడేది. క్యాన్సర్తో ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు కూడా.. ‘ఎలాగున్నావమ్మా!?’ అని అడిగితే.. ‘బాగానే ఉన్నానురా! చక్కగా చదువుకోరా! స్కూలుకు వెళ్లిరా!’ అని అబద్ధాలు చెప్పి, తనను స్కూలుకు పంపించింది. తిరిగి వచ్చేసరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది! పోతూ.. పోతూ.. ఆయమ్మ మూడు రోజులపాటు ఆ పిల్లవాడికి కడుపునిండా భోజనం పెట్టించింది. చుట్టుపక్కల వాళ్లు ఆమె పోయిన తరువాత మూడు రోజులపాటు తమ వంటలతో ఆ పిల్లవాడికి ఆకలి లేకుండా చేశారు..
చెబుతున్న కథకు కళ్లు చెమ్మగిల్లాయేమో.. క్షణకాలం ఆగి కళ్లు తుడుచుకొని కథను కొనసాగించాడు సీఈవో.
“ఈసారి వాడి అమ్మ స్థానంలోకి అక్క వచ్చింది. అమ్మలాగా ఆకలిలేకుండా చూసుకునేది! తాను తినడం మానైనా వాడికి కడుపునిండా పెట్టింది. అమ్మలాగే అబద్ధాలతోనే వాడిని మభ్యపెట్టింది. రెండు మూడిళ్లలో పని చేసేది. అర్ధాంతరంగా నాన్న అనారోగ్యంతో మంచంపడితే అన్నీ అక్కే చూసుకునేది. అర్ధాకలితో నిద్రపట్టకపోతే.. అమ్మ జ్ఞాపకాలతో కలత నిద్రతో కలవరపడుతుంటే.. అక్క చక్కని జోలపాట పాడేది. ఆ పాట నాకు తెలుసు..
‘నిదురపోరా తమ్ముడా.. నిదురపోరా తమ్ముడా!
నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా!’
సీఈవో పాడుతున్న ఆర్ద్రగీతం పల్లవి అందరి కళ్లనూ చెమ్మగిల్లేలా చేసింది.
‘కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయే!
లేత మనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే!..’
నిరాశను అద్భుతంగా ఆలపించిన తీరు మూగబాధకు గురిచేసింది.
‘జాలి తలచి కన్నీరు తుడిచే దాతలే కరువాయె!
చితికిపోయిన జీవితమంతా చింతలో చితి ఆయె!
డనిచ్చే నెలవు మనకు నిదుర యేరా తమ్ముడా!’..
ఆదుకొనే అన్నదాతల కోసం, ఆసరాకోసం ఆరాటపడే నిరుపేద బతుకుల వెతలన్నీ కళ్లకు కట్టేలా పాడటంతో.. అతని పాట సభికుల హృదయాలలో జాలి కరుణ కురిపించాయి. మనసులను కదిలించాయి. క్షణకాలం నిశ్శబ్దం ఆవహించిన వాతావరణం నుంచి సభికులను వెలుపలకు రప్పించాలని.. నేనే చప్పట్లతో ఇహంలోకి రప్పించాను. సభ కరతాళధ్వనులకు శిరస్సు వంచి సీఈవో కథను కొనసాగించాడు.
“అక్క కూడా అనారోగ్యం పాలై ఆకలిని తీర్చలేని తరుణంలో.. ఆమె మంచంపై మృత్యువుతో పోరాడే సమయంలో ఆ పిల్లవాడు తండ్రిని ఓ ప్రశ్న వేశాడు. ‘అక్క ఎప్పుడు చచ్చిపోతుంది నాన్నా!’ అని. ‘ఎందుకురా.. అలా అడిగావు?’.. నాన్న విచారంగా అన్నాడు. ‘ఆకలేస్తోంది నాన్నా! మూడు రోజులపాటు కడుపునిండా తినవచ్చుగా!’.. వాడి అమాయకత్వానికి తండ్రికి నవ్వాలో.. ఏడవాలో అర్థం కాలేదు. మరోవారం రోజులకు వాడికి కడుపునిండా తినే అవకాశం ఇచ్చి అక్క వెళ్లిపోయింది. ఈసారి వాడు తినలేకపోయాడు. ఊహ తెలిసిన వాడయ్యాడుగా! తాను అన్నది జరుగుతుందని అనుకోలేదు. అక్క కూడా అమ్మలాగే అబద్ధాలు చెప్పిందని.. తనకు దూరమైందని అర్థమైంది! అక్క పోయిన పదోరోజు వాడికి చైర్మన్గారి పర్స్ దొరకడం, తిరిగి ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆ మరునాడు అందరికీ ఆహారపు పొట్లాల రూపంలో అన్నదానం జరిగింది”..
క్షణం విరామం ఇచ్చి కథనం కొనసాగించాడు సీఈవో.
“అతని నిజాయితీకి ఫలితం దక్కింది. ఆ కరుణాంతరంగాన్ని అదృష్టం వరించింది. చైర్మన్గారి సహాయ సహకారాలతో స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేయగలిగాడు. స్కూల్ ఫస్ట్ సాధించాడు. ఓ కార్పొరేట్ కళాశాలలో పైసా ఖర్చు లేకుండా ఇంటర్ చదవగలిగాడు. ఐఐటీ సీటు సాధించి అభయ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఐఐఎంలో ఎంబీఏలో ర్యాంక్ సాధించగలిగాడు. మార్కెటింగ్, ఫైనాన్స్లో అత్యధిక మార్కులు సాధించి ప్రస్తుతం ఓ మంచి కంపెనీలో మంచి హోదాలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. ఇదీ.. ఆ పేద ఇంటి పిల్లవాడి కరుణామయ గాథ!”..
సీఈవో చెప్పడం పూర్తి చేసి కళ్లను కర్చీఫ్తో అద్దుకోసాగాడు.
ఆ పిల్లవాడి కథ ముగిసేలోపు చైర్మన్గారి సంజ్ఞనందుకొని.. అతడు వెనుదిరిగేలోపు అడ్డుకొని మైకును అందుకున్నాను.
“డియర్ ఫ్రెండ్స్! నాడు మన చైర్మన్గారి పోయిన పర్సును తిరిగి ఇచ్చి, నా అంచనాలను తలకిందులు చేసి.. చైర్మన్గారి అచంచలమైన నమ్మకాన్ని వమ్ము కానీయని ఆ పేదఇంటి పిల్లవాడు ఇక్కడే ఉన్నాడు. మన మధ్యనే ఉన్నాడు. మంచి హోదాలో ఉన్నాడు!”..
కావాలనే క్షణకాలం విరామమిచ్చాను.
“ఇక్కడే ఉన్నాడా? మన మధ్యనే ఉన్నాడా? అయితే అతనెవరో చెప్పండి! ఏం చేస్తున్నాడో చెప్పండి! అతణ్ని సభకు పరిచయం చేయండి!”.. సభికులంతా ముక్తకంఠంతో ప్రశ్నలవర్షం కురిపించారు.
“అతను ఎవరో కాదు.. ఎవరో కాదు.. మన కంపెనీ సీఈవోనే ఆ పేద పిల్లవాడు!” అంటూ.. సీఈవో చేయి పట్టి పైకెత్తి సభకు పరిచయం చేస్తుంటే.. స్టాండింగ్ ఒవేషన్లో సభ మొత్తం అతణ్ని అభినందించింది.
అప్పుడే వేదిక ముందుకు వచ్చిన చైర్మన్గారి కరతాళ ధ్వనితో పులకించిపోయిన సీఈవో ఆయనకు, తనకు ఉజ్వల భవిష్యత్తునిచ్చిన తండ్రి లాంటి ఆయనకు పాదాభివందనం చేయకుండా ఉండలేకపోయాడు.
సీఈవో పాదాభివందనం పూర్తికాకముందే చైర్మన్గారు అతణ్ని ఆత్మీయ ఆలింగనంతో బంధించి వేశారు. ఆ అపురూపదృశ్యం కనిపించకుండా కనుకొలకుల్లో కన్నీటి బిందువులు అడ్డువచ్చాయి. నాకైతే కళ్లజోడు తీసి తుడుచుకుందామని అనిపించలేదు. ఎందుకంటే.. అవి ఆనందబాష్పాలు!!
* * *
సూర్యప్రసాద రావు ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ (జంతుశాస్త్రం) చేశారు. ఖమ్మంలోని శీలంసిద్ధారెడ్డి జ్యోతి కళాశాలలో జంతుశాస్త్ర హెచ్వోడీగా పనిచేశారు. ఇప్పటి వరకు 350 కథలు, 200 సంప్రదాయ వ్యాసాలు, వంద కవితలు, ఐదు కథాసంపుటాలు వెలువరించారు. వివిధ సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో పాతిక కథలకు బహుమతులను అందుకున్నారు. ఈయన రచనలపై నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఒకరు పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ‘అనిర్వచనీయం’ నవల చతురలో, ‘అతడు ఆమె ఓ చిలిపి అమ్మాయి’ నవల స్వాతి మాసపత్రికలో ప్రచురితం అయ్యాయి.