‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
‘పయనించే ఓ చిలకా.. నీలి మేఘాలలో గాలి కెరటాలలో.. నన్ను దోచుకుందువటే.. ఈ జీవన తరంగాలలో.. గున్నమామిడి కొమ్మమీద..’ పాత సిన్మాలలోని మధుర గీతాలను ఒకదాని తర్వాత మరొకటి ఆలపిస్తున్నాడు ధర్మభిక్షం. పాటలు వింటున్న శ్రోతల స్పందనలను ఏమాత్రం తెలుసుకోవడం లేదు. నేలమీద కూర్చుని.. తన ముందు పరిచిన గోనెసంచి మీద పడే చిల్లర డబ్బుల చప్పుడు మాత్రం చెవులతో వింటున్నాడు. అతని పాటను వింటున్న వారిలో చాలామంది తమకు పట్టనట్లు ముందుకు వెళ్లిపోతున్నారు. కొంతమంది మాత్రం చిల్లరను ఆ సంచి మీదికి విసురుతున్నారు.
గంట తర్వాత తన పక్కనున్న పాత వాటర్ బాటిల్లో ఉదయం బోరింగు వద్ద పట్టుకున్న నీటిని కడుపు నిండా తాగి.. మళ్లీ గొంతును సవరించుకున్నాడు.
అనకాపల్లి రైల్వేస్టేషన్ నిశ్శబ్దంగా ఉంది. రైళ్లు ఎక్కాల్సినవాళ్లు హడావుడిగా స్టేషన్ లోపలికి వెళ్తుండగా.. రైలు దిగినవాళ్లు తాపీగా తమ బ్యాగులను మోసుకుంటూ బైటికి వస్తున్నారు. ఆటోల కోసం, బస్సుల కోసం తొందర పడుతున్నారు..
ధర్మభిక్షం అవేమీ పట్టించుకోవడం లేదు. నేర్చుకున్న పాటలు కొన్ని.. వింటూ జ్ఞాపకం ఉంచుకున్న పాటలు మరికొన్ని పాడటానికి ఎంచుకున్నాడు. వాటిలో ఎక్కువ సోలో గీతాలే! పాటలు పాడి అలసిపోయినప్పుడు..
“బాబూ ధర్మం చెయ్యండి! ధర్మదాతలూ కనికరించండి బాబయ్యా!” అంటూ ప్రాధేయ పడుతున్నాడు.
అతను పాడే పాటల్లో మాధుర్యం, పాడే విధానం చూసిన కొంతమంది..
“వీడి గొంతులో ఘంటసాల ఉన్నాడు” అని చెప్పుకోవడం, పాటల్ని మెచ్చుకోవడం అనేకసార్లు విన్నాడు.
అలా వింటున్నప్పుడు కొండంత బలం తనలో ప్రవేశించినట్లుగా అనిపించేది. పాటలు పాడి అలసిపోయిన తర్వాత తన తిండికి సరిపడా చిల్లర వచ్చినప్పుడు ఆనందం అనిపించేది. టీ నీళ్లకు కూడా డబ్బులు రాని రోజు అతని మీద అతనికే జాలి కలిగేది. కాస్త జ్ఞానం వచ్చినప్పుడు.. అమ్మ తనను ఎత్తుకుని ఆడించిన సంగతి, తనకు గంజి అన్నం తినిపించిన విషయం గుర్తుకువచ్చేవి. ఆ తర్వాత అమ్మ దగ్గరినుంచి దూరం అయిపోయాడు. ఆమె తనను వదిలేసిందో.. వదిలించుకుందో అతనికి అంతగా గుర్తులేదు. అనకాపల్లి రైల్వేస్టేషన్ తనకు శాశ్వత నివాసం అయిపోయింది. కాస్త పెరిగిన తర్వాత.. తను ఎవరూ లేని ఒంటరివాడు అయిపోయాడు.
‘కంజిరమ్మే ఈ గుడ్డోడి తల్లి’.. అంటూ ఎవరో అనుకుంటున్న మాటలు వినిపించేవి. తనను తాను పోషించుకోలేక అమ్మ తనను వదిలేసిందని చాన్నాళ్ల తర్వాత అర్థమైంది. తన జీవన ప్రయాణం తానొక్కడే చేస్తున్నానన్న విషయం గుర్తుకువచ్చిన ప్రతిసారీ.. హృదయంలో ఎవరితో చెప్పుకోవాలో తెలియని విషాదం కమ్ముకునిపోయేది.
అటువంటి సమయంలో.. తనకు ఎవరూ లేరు, తాను ఒంటరిని అనిపించేది. ఆ స్థితిలో అప్రయత్నంగా కనుకొలుకుల్లోంచి కన్నీళ్లు జారి.. చిరిగిపోయిన అతని చొక్కాను తడిపేసేవి. మనసంతా దుఃఖ సముద్రంగా మారిపోయేది. ఆ దుఃఖంలోంచి పాత సిన్మాల్లో విషాదగీతాలు ధర్మభిక్షం గొంతులోంచి అలలు అలలుగా జాలువారేవి. ఆ బాధ అతని గొంతులోకి దూరి పాటగా బయటికి వచ్చేది. అతని పాటలో మార్దవం, చెప్పలేని ఆర్తి, ఆవేదన.. వినేవారిని కట్టిపడేసేవి.
మనసు కలచివేసే తల్లి కంజిరమ్మ జ్ఞాపకాలు, తను ఎవరూ లేని ఏకాకినన్న ఆలోచనలు.. రోజులో కనీసం రెండు మూడుసార్లు ధర్మభిక్షాన్ని చుట్టుముట్టేవి. మనసు అట్టడుగు పొరల్లోంచి కెరటాల్లా పాత పాటలన్నీ గొంతులోంచి బయటికి వస్తుండేవి. పాడుతున్నంత సేపూ మూసుకునిపోయి ఉన్న అతని కళ్లు, నీటి చెలమలుగా తయారయ్యేవి.
‘ఎవరూ లేని ఒంటరి మనిషిని!’ అని గుర్తుకువచ్చిన ఆ సమయంలో.. ధర్మభిక్షం పాడుకునే ఆ పాటలు కన్నీటి వరదలోంచి కొట్టుకుని వస్తూ గాలిలో కలిసి.. అనకాపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతమంతా విహరించేవి. ఆ స్టేషన్కు వచ్చిపోయే వారిని ఆ పాటలు కట్టిపడేసేవి.
ఆరోజు అలా పాట పాడుతున్న సమయంలో.. తను కూర్చున్న నేలకు కర్రతో తాకించిన చిన్నశబ్దం అతనికి వినిపించింది. ఎవరో తన సమీపంలోకి వచ్చారన్న విషయం వెంటనే అతని మనసు గుర్తించింది.
తన ముందున్న గుడ్డమీద వారువిసిరే చిల్లర నాణెం చప్పుడు అవుతుందేమోనని చెవులు రిక్కించాడు ధర్మభిక్షం. ఆ వచ్చిన వ్యక్తి ధర్మంగా ఎటువంటి నాణెం వేయలేదు. తన సమీపంలో ఎవరో మనిషి నిల్చుని.. తన పాట వింటున్నారన్న విషయం ధర్మభిక్షానికి అర్థమైంది. కన్నీళ్లతోనే ఆ పాటను ముగించాడు.
“నీ పాటతో అందర్నీ ఏడిపిస్తున్నావు. వింటుంటే నాకూ ఏడుపు వచ్చింది. బాగా పాడుతున్నావు”..
ఆడ గొంతుకలోంచి అనుకోని ప్రశంస. ధర్మభిక్షం ఆశ్చర్యపోయాడు. తన పాతికేళ్ల జీవితంలో ఒక అమ్మాయి తన పాటను మెచ్చుకోవడం అదే మొదటిసారి. ఉబ్బితబ్బిబ్బయి పోయాడు.
భుజం మీది తువ్వాలుతో కళ్లను తుడుచుకుంటూ..
“ఎవరమ్మా నువ్వు? నేనేమీ గొప్పోణ్ని కాదు. పొట్ట నింపుకోవడానికి ఈ స్టేషన్ ముందు కూర్చుని పాటలు పాడుకుంటున్నాను. పుట్టుకతోనే గుడ్డోణ్ని” అన్నాడు.
ఒక నిమిషం ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. వచ్చిన వారు ఎవరో అంచనా వేద్దామని.. మూసుకుపోయిన కళ్లున్న తలను పైకి ఎత్తాడు. చీకటి తప్ప ఏమీ కనిపించలేదు. “నీ గొంతులో ఒకలాంటి తపన ఉంది. పాడాలని కాకుండా నీ గొంతులోంచి దుఃఖం దుంకుతున్నట్లుగా నీ పాట ఉంది”.. ఆమె మరోసారి మెచ్చుకుంది.
“అమ్మగారూ! మీకు పాట అంతగా నచ్చితే తోచింది ధర్మం చేయండమ్మా?” జాలిగా అడిగాడు.
“ఆకలేస్తున్నదా?”.
ధర్మభిక్షం తలొంచుకున్నాడు. ఎప్పుడో ఎండ రాకముందు తాగిన టీ నీళ్లు మాత్రమే కడుపులో ఉన్నాయన్న విషయం.. అతను ఆమెతో చెప్పలేకపోయాడు.
“నీ పేరేంటి? నీ వాళ్లు ఎవరూ లేరా?”.. అడిగింది. “నాపేరు ధర్మభిక్షం. ఈ పేరు పెట్టినందుకు అడుక్కుంటున్నానో, అడుక్కుంటున్నందుకు ఈ పేరు వచ్చిందో నాకు తెలీదు. కానీ, నన్నందరూ ఇదే పేరుతో పిలుస్తారు” అని రెండు క్షణాలు ఆగి..
“నాకు ఎవరూ లేరు. మా అమ్మ పేరు ‘కంజిరమ్మ’ అని తెలుసు. ఎక్కడుంటుందో, నాకెందుకు దూరంగా ఉందో తెలీదు. నేను ఒంటరిని, కళ్లు లేని కబోదిని”..
ఆమె తన సంచిలో చెయ్యి పెట్టి, ఉదయం ఎవరో ఇచ్చిన రొట్టె ముక్కను తీసి..
“నువ్వు చూడలేనివాడివని అనుకోలేదు. నీ పాట నన్ను మైమరపించింది. అందుకే నీ దగ్గరికి పాట వింటూ వచ్చేశాను. నేనూ నీ లాంటిదాన్నే! ఈ రొట్టె తిను” అంటూ కింద కూర్చుని ఉన్న అతని తలకు రొట్టెను తగిలించింది.
“ఇద్దరి బతుకులూ ఒకలాంటివేనన్న మాట”.. నెమ్మదిగా అని రొట్టెను అందుకున్నాడు.
“నీకు ఉందా?” అని అడిగాడు మళ్లీ.
“నా పేరు కుమారి. పుట్టినప్పటి నుంచీ లోకాన్ని చూడని అంధురాలిని. నేనూ పాటలు పాడగలను. కానీ, నీ అంత బాగా కాదులే! మొదటిసారి అనకాపల్లి వచ్చాను. అందరూ ఉన్నా.. నాకు ఎవరూ లేనట్లే! అన్ని అవయవాలు బాగున్న నా వాళ్లంతా నా మీదే ఆధారపడి బతుకుతున్నారు. అందుకే అందర్నీ వదిలేసి నా బతుకు నేను బతుకుదామని గుంటూరు నుంచి వచ్చేశాను”.. అతని పక్కన చతికిల పడి, నెమ్మదిగా చెప్పింది. ధర్మభిక్షం కొత్త జీవితానికి ఆరోజు నాంది అయింది.
కుమారి పరిచయం తర్వాత ఆమె కూడా రైల్వే స్టేషన్లో చిన్న గోనె సంచిని ముందు పరుచుకుని కూర్చునేది. స్టేషన్లోకి వచ్చిపోయేవారు ఆమె వద్ద కూడా చిల్లర పైసలు వేసేవారు. ధర్మభిక్షం గొంతు చించుకుని పాడే పాటలను వింటూ తను కూడా.. “గుడ్డిదాన్ని.. ధర్మం చేయండి బాబయ్యా!” అంటూ ప్రాధేయపడేది. తన పక్కన కూర్చుని అడుక్కోవడం వల్ల తనకు పోటీ వచ్చిందని.. కుమారి విషయంలో ధర్మభిక్షం ఎప్పుడూ అనుకోలేదు. ఎవరో చేసే సాయానికి తనెందుకు బాధపడాలి అనుకునేవాడు. “ఇలా ఎంతకాలం అడుక్కోవాలి. అందర్నీ అలా అడగడం నీకు ఎలా ఉందో తెలీదు. నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. నాకు ఈ చిల్లర అడుక్కోవడం నుంచి బైటపడాలని ఉంది. నీకా దేముడు మంచి గొంతుకను ఇచ్చాడు. నీ పాటకు రావాల్సింది చిల్లర నాణేలు కాదు.. పచ్చనోట్లు!”. ధర్మభిక్షం పకపకా నవ్వాడు.
ఆ సాయంత్రం గంజి తాగుతున్నప్పుడు..
“పాట మన జీవితంగా ఉంది. అందుకే పాటను మనను నడిపించే నావను చేద్దాం!” చెప్పింది కుమారి.
“అంటే?”.
కుమారి తన ఆలోచన చెప్పింది. మంగళగిరిలో తనకు తెలిసిన ఇద్దరు అంధ కళాకారులున్నారు. వారిని కలుసుకోవాలన్నది ఆమె సూచన. ఆమె చెప్పిన తర్వాత ధర్మభిక్షం చాలా ఆలోచన చేశాడు. ఎన్నాళ్లున్నా పరిస్థితిలో మార్పు వస్తుందన్న నమ్మకం అతనికి కలగడం లేదు. ఒక ప్రయత్నం చేస్తే తప్పేముంది అనిపించింది. “మంగళగిరి వెళ్దాం” అన్నాడు.
ఆరోజు ఇద్దరూ కలిసి మంగళగిరి బయల్దేరారు. అనకాపల్లిలో తిరుపతి వెళ్లే రైలు ఎక్కి.. గుంటూరులో దిగారు. రాత్రి పది గంటలవుతున్నది. చలిగాలి రివ్వున వీస్తూ వణుకు పుట్టిస్తున్నది. ధర్మభిక్షం దుప్పటి కప్పుకొన్నాడు. రైల్లో బాత్రూం పక్కన కూర్చుని.. టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం వల్ల శరీరం ఎంతో అలసిపోయింది. ఆకలితో కడుపు నకనకలాడిపోతున్నది.
“ఏదైనా కొని తెస్తా!” అంటూ, తన చేతి కర్రను నేలమీద కొడుతూ ముందుకు కదిలిపోయింది కుమారి. రాత్రంతా అక్కడే బెంచీ మీద ముడుచుకుని కూర్చున్న ధర్మభిక్షం ఆకలిని.. ఆ దగ్గర్లో ఉన్న కొళాయి కొంతవరకు తీర్చింది. ఏవో రైళ్లు వస్తున్నాయి, వెళ్తున్నాయి. రాత్రంతా కుమారి కోసం ఎదురు చూస్తునే ఉన్నాడు. భారంగా తెల్లారిపోయింది. ముందు రోజు రాత్రి వెళ్లిన మనిషి ఎందుకు రాలేదో, ఎక్కడికి వెళ్లిపోయిందో అతనికి అర్థం కాలేదు. ఇంతలో దూరంగా కూనిరాగం వినిపించింది.
“పిల్లలూ, దేముడూ చల్లనివారే.. కల్లకపట మెరగని కరుణామయులే!”.. ఆ పాట కుమారి గొంతులోంచే వస్తున్నది. ధర్మభిక్షానికి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది. కుమారి కర్రను నేలమీద కొడుతూ.. అతను కూర్చున్న బెంచీ దగ్గరికి వచ్చింది. “రాత్రంతా ఎక్కడికి వెళ్లావు? ఇంత ఆలస్యమైందేమి?” ఆతృతగా అడిగాడు. అతని ప్రశ్నలకు జవాబు చెప్పకుండా.. తడుముకుంటూ బెంచీకి మరో పక్క కూర్చుని..
“ఆకలి దంచేస్తున్నది. నీ దగ్గర నీళ్ల బాటిలుంది కదా?” అంటూ తెచ్చిన టిఫిన్ పొట్లం విప్పింది.
“రాత్రి టిఫిను కోసం వెళ్తుంటే పోలీసోడు నన్ను టిక్కెట్టు అడిగాడు. నేను తెల్లమొహం పెట్టాను. టిక్కెట్లు లేకుండా ప్రయాణించామని గుంపులోకి తీసుకెళ్లి.. వారితో నన్ను కలిపేశారు. రాత్రంతా ఉంచి ఉదయం వదిలేశారు” అంటూ టిఫిన్ అతని ముందుకు తోసింది.ఆకలితో ఉన్న ధర్మభిక్షం గబగబా తినేశాడు.
“నిన్న పోలీసోళ్లు పట్టుకున్న గుంపులో మనలాంటి కళ్లు లేని ఇద్దరు ఆడోళ్లు ఉన్నారు. అంధుల్ని పోషించే అనాథాశ్రమం హైద్రాబాద్లో ఉందని ఎవరో చెబితే అక్కడికి వెళ్తున్నారట”.
ధర్మభిక్షం వెంటనే.. “కుమారీ! నువ్వు వాళ్లిద్దర్నీ తీసుకుని రా! మనతో ఉంచుకుందాం. కలిసే బతుకుదాం. మనం అనుకున్న పనికి ఉపయోగపడతారు. వెంటనే వెళ్లు!” అన్నాడు.
కుమారి కర్రను చప్పుడు చేసుకుంటూ వెళ్లిపోయింది. అరగంట తర్వాత ఇద్దరు ఆడవాళ్లను తనతో తీసుకుని వచ్చింది. వారి పేర్లు.. పాపమ్మ, బుజ్జి.
“మీరెక్కడికీ వెళ్లొద్దు. కలో గంజో తాగి అందరం కలిసే బతుకుదాం. పాటలు పాడటం పెద్ద కష్టం కాదు. సులభంగా నేర్చుకోవచ్చు” అంటూ ధర్మభిక్షం వారితో ఆప్యాయంగా మాట్లాడాడు.
కుటుంబ సభ్యులతో కలిసిపోయినంత ఆనందపడిపోయారు వారిద్దరు. ఆరోజు అందరూ కలిసి గుంటూరు నుంచి మంగళగిరి బయల్దేరారు. కుమారికి ఆ ప్రాంతంతో పరిచయం ఉండటం వల్ల తబలా వాయించే వీరేసు, ఆర్గాన్ పలికించే దేముడుబాబును కలుసుకున్నారు. రెండురోజులు మంగళగిరిలోనే ఉండిపోయారు. వారిద్దరు కూడా పుట్టుకతోనే అంధులు. తమ వాళ్లు ఎవరూ పట్టించుకోక పోవడంతో.. ఆ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నారు.
ఎవరి బతుకులు వారు బతకడం కన్నా.. అందరూ కలిసి బతకాలన్న నిశ్చయానికి వచ్చారు. తామంతా కలిసి పాటలు పాడే ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. మంచి గొంతుక కలిగిన ధర్మభిక్షం చేసిన ఆ ప్రతిపాదనను వారంతా అంగీకరించారు. ఎవరి మీదా ఆధారపడకుండా, భిక్షాటన జోలికి పోకుండా తమ కళను అందరికీ తెలియజేయడం ద్వారా జీవించాలని అనుకున్నారు. ఎవరికీ కళ్లు లేకపోయినా.. ఒకే మార్గంలో పయనించాలని కలిసికట్టుగా నిశ్చయించుకున్నారు. మంగళగిరి నుంచి వారి ప్రయాణం మొదలైంది.
ఆరుగురు సభ్యులతో అంధుల కచేరీ బృందం ఏర్పాటైంది. కుమారి తమ్ముడు కృష్ణారావు కన్వీనర్గా కుదిరాడు. అతనికి అన్ని అవయవాలూ సక్రమంగా ఉండటంతోపాటు ఏ పనీ లేనందువల్ల.. కుమారి ఏరికోరి అతణ్ని రప్పించింది. అతను ఆ అంధుల బృందాన్ని నడిపించే రథసారథి అయ్యాడు.
ధర్మభిక్షం, కుమారి, పాపమ్మ వరుసగా పాటలు పాడుతుంటారు. బుజ్జి కంజిర వాయిస్తుంది. వీరేసు చేతితో పనిచేసే ఆర్గాన్తో సంగీతాన్ని పలికిస్తుంటాడు. దేముడుబాబు లయబద్ధంగా తబలా కొడుతుంటాడు. మొదట పాడుతున్న పాటలకు.. వీరి సంగీతానికి సంబంధం అంతగా ఉండేది కాదు. కానీ, రానురానూ పాటలకు ఈ సంగీతమే ప్రాణమైపోయింది.
ఈ అంధుల బృందం పాడే పాటల్లో సంగీతం ఏరులై ప్రవహించేది. గ్రామ దేవతల పండుగలు, వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాల సమయాల్లో రాత్రిపూట వీరి పాటల కచేరీలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు అవుతున్నాయి. ఒక ప్రదర్శనకు రెండు మూడు వేలు మాత్రమే ఆశించే ఈ బృందానికి.. ఎక్కడబడితే అక్కడ స్వాగత సత్కారాలు లభిస్తున్నాయి. బృందంలో ఉన్నవారు అందరూ అంధులే అయినందున వీరి ప్రదర్శనలు ఎక్కడ జరిగినా చాలామంది హాజరవుతున్నారు. కృష్ణారావు కన్వీనర్గా వివిధ గ్రామాల్లో నాయకుల్ని కలుసుకుంటూ.. వీరికి అవకాశాలు కల్పిస్తున్నాడు. వారందరితోపాటు తను కూడా ఒక భాగం వాటా సొమ్ము తీసుకుంటున్నాడు.
ఒకప్పుడు రైల్వేస్టేషన్ బయట పాటలు పాడుతూ యాచకులుగా ఉన్న వీరి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎంతోమందికి ఆదర్శంగా వీరి కార్యక్రమాలు తయారయ్యాయి. కొన్ని పత్రికల్లో వారి సంగీత కచేరీల గురించి ఆసక్తికరమైన వార్తలు వెలువడ్డాయి.
“ఈ వారంలో మనం అనకాపల్లి వెళ్లాలి. నువ్వు పుట్టి – పెరిగిన.. పాటలు పాడిన ఆ రైల్వేస్టేషన్ ఎదుటే మన పాటల కార్యక్రమం ఏర్పాటు చేశారని మా తమ్ముడు చెప్పాడు” అని చెప్పింది కుమారి.
అనకాపల్లి పేరు వినగానే ధర్మభిక్షం ఓ విధమైన అనుభూతికి లోనయ్యాడు. రోజూ స్టేషన్ ముందు పాటలు పాడటం గుర్తుకువచ్చింది. కుమారి సలహాతో బృందాన్ని ఏర్పాటుచేసిన విషయం కూడా గుర్తుకువచ్చింది.
‘నా వాళ్లు ఎవరూ లేకపోయినా.. నేను తెలిసినవాళ్లు ఉన్న అనకాపల్లికి ఎప్పుడు వెళ్తానా!?’ అని అతని మనసు ఉవ్విళ్లూరింది.
తల్లి అని అతను భావిస్తున్న కంజిరమ్మ కూడా గుర్తుకువచ్చింది. రెండురోజుల్లో అనకాపల్లి వెళ్తారనగా..
“అందరికీ పెద్ద దిక్కుగా ఉన్న నీకు రుణపడి ఉన్నాం. అడుక్కోవడం నుంచి బయటపడాలని నేను చెప్పిన విషయాన్ని నువ్వు ఒప్పుకొని ఈ స్థాయికి తీసుకుని వచ్చావు. నీకు ఏం ఇవ్వగలను నేను” అన్నది కుమారి.
ధర్మభిక్షం రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు.
“నీ ఆలోచనతో మన పరిస్థితి మారిపోయింది. నువ్వు నాతో ఉండటమే నాకు కొండంత అండ. ఒంటరితనం కూడా పోయినట్లుంది” అన్నాడు నెమ్మదిగా.
‘కానీ.. నీకేదైనా ఇవ్వాలి!’ అందామని అనుకున్నది. కానీ, మనసులోంచి మాటలు బయటికి రాలేదు.
ఆరుగురు కలిసి అనకాపల్లి చేరుకున్నారు. నిర్వాహకులు వారికి చిన్న గదిని కేటాయించి..
“కార్యక్రమం రాత్రి ఉంది. అంతవరకూ విశ్రాంతి తీసుకోండి” అంటూ వెళ్లిపోయారు.
ఊరంతా తిరిగి వస్తానని కుమారి కూడా వెళ్లిపోయింది. అనకాపల్లి చేరగానే ధర్మభిక్షానికి తెలియని అనుభూతి కలిగింది. గదిలో విశ్రాంతి తీసుకుంటున్నా.. చిన్నతనం నుంచి తను తిరిగిన ఆ జ్ఞాపకాలే మనసులో మెదులుతున్నాయి. ఆ పరిసరాలేవీ తను ఏనాడూ చూడలేదు. కానీ, తన సొంత ఇంటికి వచ్చిన మాదిరిగా అనిపించింది. తనను ‘ఘంటసాల’ అనుకునే ఆనాటి మనుషులు ఎవరైనా గుర్తించకపోతారా!? అని కూడా మనసు తహతహలాడింది.
‘పుట్టుకతో చూపులేని వారు బృందంగా పాటలెలా పాడతారా?’ అని ఎంతోమంది వచ్చారు.
ధర్మభిక్షం పాటలను అందుకున్నాడు. ఒక్కోపాట అతని గొంతులోంచి ప్రవాహంలా వస్తున్నది. మృదు
మధురమైన కంఠంలోంచి తెరలు తెరలుగా వస్తున్న పాటలు.. అక్కడి వారిని చుట్టుముట్టాయి. ఒక్కోపాట ముగిసిన వెంటనే వినిపిస్తున్న కరతాళధ్వనులు.. వందల సంఖ్యలో శ్రోతలు ఉన్నారన్న విషయం, కనిపించని ధర్మభిక్షం కళ్ల వెనుక మనసు గ్రహించింది.
తమ స్టేషన్ ముందు ఒంటరిగా పాటలు పాడుతూ భిక్షం ఎత్తుకున్న ఒకనాటి నిరుపేద ధర్మభిక్షాన్ని చాలామంది గుర్తించారు. కచేరీ జరుగుతుండగానే అక్కడున్న యువకులు ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. వచ్చినవారి నుంచి డబ్బులు వసూలు చేశారు.
పది, ఇరవై, యాభై రూపాయల నోట్లతో పూలదండ మాదిరిగా తయారుచేశారు. అక్కడున్న నాయకుల్ని పిలిచి ధర్మభిక్షం మెడలో ఆ దండ వేసి అభినందించారు. శ్రోతలు చప్పట్లతో అభినందనలు తెలియజేశారు.
ధర్మభిక్షానికి జరుగుతున్నదేంటో అర్థం కాలేదు. అక్కడేం జరుగుతున్నదో వాద్య బృందానికి కనిపించడంలేదు. వేదిక మీద ఏదో జరుగుతుందన్న విషయం మాత్రం వారి మనోఫలకంలో మెదులుతున్నది.
‘ఆ వేదిక మీద కుమారి ఎక్కడుందా!?’ అని ఒక్క క్షణం ఆలోచించాడు.
“ఈ పాటగాళ్లంతా అంధత్వం శాపం కాదని నిరూపించారు. చూపులేని గానగంధర్వులుగా తయారయ్యారు. బృందాన్ని నడిపిస్తున్న ధర్మభిక్షం ఈ స్టేషన్ ముందే తన గానాన్ని మొదలుపెట్టాడు. ఈ అంధుల కచేరీ బృందం మరింత అభివృద్ధి చెందాలి”..
ఎవరో ఉపన్యాసం చెబుతున్నారు.
కచేరీ బృంద సభ్యులకు అప్పుడు అసలు విషయం అర్థమైంది. ఉత్సాహం ఉప్పొంగిన వీరేసు.. తన ఆర్గాన్తో రకరకాల రాగాలను పలికించాడు. దేముడుబాబు ఆగకుండా అయిదు నిమిషాలు నిర్విరామంగా తబలా వాయించాడు. ప్రేక్షకుల నుంచి చప్పట్లే.. చప్పట్లు!
ధర్మభిక్షం పక్కనున్న వ్యక్తిని మైక్ అడిగి తీసుకున్నాడు. అతనెప్పుడూ వేదికపై మాట్లాడలేదు. తనకు జరిగిన సన్మానానికి స్పందనగా మాట్లాడాలనిపించి గొంతు సవరించుకున్నాడు.
“మీరు మా మీద చూపించిన అభిమానం మరవలేనిది. మరుపురానిది. మేమంతా అంధులమైనా మాలోని కళను ఆరాధించారు. అభినందించారు. మీరు నాకు వేసిన నోట్ల దండ విలువ ఎంత ఉంటుందో నాకు తెలియదు. దీనికి ఎవరూ విలువ కట్టలేరు. ఇది నా ఒక్కడికే కాదు.. మా అందరికీ చెందుతుంది. మేం ఎవరం మా కళ్లతో మిమ్మల్ని చూడలేం. కానీ, మా హృదయాలతో మీ ప్రేమను కొలవగలం. గుండెల నిండా దాచుకోగలం. మాకు కళ్లు వచ్చి ఈ అందమైన ప్రపంచాన్ని, రంగుల్ని, ప్రకృతి అందాలను కళ్లారా చూసినంత ఆనందంగా ఉంది. మీ ప్రేమతో మాకు కొత్త ప్రపంచాన్ని చూపించారు. ‘నేను అనాథను కాదు’ అనే విషయం మీ అభిమానంతో అర్థమైంది”.. ధర్మభిక్షం గొంతు పూడుకుపోయింది. మరి మాట్లాడలేకపోయాడు. అతని కళ్ల వెంబడి కన్నీళ్లు బొటబొటా కారిపోయాయి.
వేదిక మీదికి చేరిన కుమారి.. తడుముకుంటూ ధర్మభిక్షం వద్దకు వచ్చింది. అతని సమీపంలోకి వచ్చిన కుమారి కదలికల్ని అతను గుర్తించాడు.
“బాబూ!”.. అంటూ ఓ వృద్ధురాలు ధర్మభిక్షాన్ని చుట్టుకునిపోయింది.
ఆమె కళ్లు కూడా తడిచి ముద్ద అయిపోయి ఉన్నాయి. ఆమె కుమారి కాదన్న విషయం తెలుసు. ఎవరీమె!? అతని మదిలో లక్ష సందేహాలు..
“మీ అమ్మ కంజిరమ్మ. వెతికి పట్టుకుని తెచ్చాను”.. కుమారి చెబుతున్న మాటలు వినిపించడం లేదు.
“అమ్మా”.. అంటూ బావురుమన్నాడు. కంజిరమ్మ కొడుకుని చుట్టకుని పోయింది. ఆమె కంటి నుంచి వస్తున్న కన్నీటి ధార అతని చొక్కాను తడిపేసింది. మరో పక్కనుంచి కుమారి అతణ్ని వాటేసుకుంది. మూతపడిన ఆమె కళ్లు కూడా వర్షిస్తున్నాయి. అనిర్వచనీయమైన ఆ దృశ్యం.. అక్కడి వారిని కట్టిపడేసింది.ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కన్నతల్లి తన పక్కనున్నా చూడలేకపోతున్న ధర్మభిక్షం.. దుఃఖంతో వస్తున్న వెచ్చని కన్నీళ్లు రెప్పలు విప్పలేని కళ్ల నుంచి ధారాపాతంగా కారాయి. ఆ కన్నీళ్లు బొట్లుగా కుమారి తలపై రాలాయి.
ప్రేక్షకుల కరతాళధ్వనులు మిన్నంటిపోయాయి.
– పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ 94405 27387