‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
‘ఏంటీ కాగితాలు?’ అనుకుంటూ చూశాను.
మాసిపోయి ఉన్నాయి. ఎప్పుడో నలభై – యాభై ఏళ్ల క్రితం ఆ పెట్టెలో పెట్టినట్టున్నాను. నాకు కొందరు ఇచ్చిన బహుమతుల్ని అందులో దాచుకున్నాను. ఈవేళ వాటినోసారి చూద్దామనిపించింది. పెట్టె తెరిచి, ఒక్కోదాన్నీ చూస్తుంటే.. అన్నిటికంటే దిగువన ఈ కాగితాలు ఉన్నాయి. అవేంటో చూద్దామని, మొదటి పేరా చదవగానే.. అదో కథ అని అర్థమయింది. మరికొంత చదివాక, అది నేను రాసిందేనని అనిపించింది.
అది కథేనా? ఎవరన్నా చదివితే అది కథే! నాకు మాత్రం.. నా జీవితానుభవంలోని కొన్ని సంఘటనలు. అయితే నేను రాసినవేంటో నాకు అంతగా గుర్తులేవు కాబట్టి.. అదిప్పుడు నాకు కూడా కథే! చాలామంది బతుకులు కాస్త అటోఇటో ఒకలాగే ఉంటాయి. మేం వారికంటే భిన్నం. మళ్లీ మా జీవితాలు కూడా ఒకలాగే ఉంటాయి. అలాగని అవి అన్నీ అలాగే లేవు. కొన్ని మారాయి. కొన్ని మాత్రం అవకాశం లేక మారకుండా ఉండిపోయాయి.
కళ్లజోడు సవరించుకుని, మొదటి పేజీ చదివేటప్పటికి నేను రాసినవేంటో లీలగా నా మనసులో మెదిలాయి. ఎనిమిదో తరగతి చదువుతున్న మనవడు ప్రతిభామూర్తిని రోజూ ఆఫీసునుంచి వచ్చేటప్పుడు మా అమ్మాయి తీసుకువస్తుంది. ఇంకా గంటకు పైగా టైముంది. అందుకే.. ఆ కాగితాల మీదే దృష్టి పెట్టాను.
నా పేరు లలిత.. మాది కళావంతుల కుటుంబం. భోగంవాళ్లనీ అంటారు. అయినప్పటికీ నేను మా ఊళ్లో టెన్త్క్లాసు వరకూ చదువుకున్నాను. స్కూల్ ఫైనల్ కూడా చదివేదాన్నే కానీ, మా అమ్మ మాన్పించేసింది. అప్పటికే నేను పుష్పవతినై ఓ సంవత్సరం దాటిపోయింది. నన్ను చూసిన కొందరు కన్నెరికం చేయడానికి తహతహలాడుతూ మా అమ్మకు కబురు మీద కబురు పెట్టడంతో..
“చదువింక చాల్లే!” అనేసింది.
నేనూ ఇంకా చదువుతానని అనలేదు. ఎందుకంటే మా ఇంట్లో నాకంటే పెద్దదైన సుజాతక్కనూ, మా దూరపు చుట్టం విజయ వదిననూ చూస్తుంటే నాకూ వాళ్లలా మంచిమంచి చీరలు కట్టుకుని, బాగా ముస్తాబయి, సెంటు రాసుకుని సరదా పడదామని అప్పుడప్పుడూ అనిపించేది. ఇక స్కూలు మానేశానంటే.. వాళ్లలాగే సరదాగా ఉండొచ్చనిపించేది.
మా అమ్మ కాంతమ్మ దగ్గరికి తరచూ వచ్చే పెదరాజుగారు వేళాకోళాలాడుతుంటే నాకు సరదాగా అనిపించేది. బాగా చిన్నప్పుడు ఆయనగారింటికి అప్పుడప్పుడూ మా అమ్మమ్మతో వెళ్లేదాన్ని. పెదరాజుగారి భార్య బంగారం బొమ్మలా మెరిసిపోతుండేది. ఆమెకు అంతా తెలిసినా.. మా అమ్మమ్మతో అభిమానంగానే మాట్లాడేది.
“ఇదిగో! బెల్లపావకాయ. నీకిష్టం కదా పట్టుకెళ్లు!” అంటూ ఓ గిన్నెలో పెట్టి ఇచ్చేదావిడ.
నాకు సున్నుండో మిఠాయి ఉండో ఇచ్చేవారు. నాకు కాస్త ఊహ కలిగాక, అంత అందమైన భార్య ఉండగా ఆయనకు మా అమ్మ ఎందుకు కావాల్సి వచ్చిందో అనిపించేది. మా అమ్మ చామనఛాయ రంగు. కళ ఉన్న మొహం. తన ఒంటివాటం చూడగానే ఏ మగాడికైనా మోహం కలిగి తీరుతుందని తర్వాత్తర్వాత నాకు తెలిసి వచ్చింది. ఇంట్లో కుదరనివి కొన్ని మా దగ్గర దొరుకుతాయని కూడా మేమంటే మోజు పడతారని నాకు అర్థమైంది. అప్పట్లో ముండల దగ్గరికి వెళ్లడం తప్పుగా అనుకునేవారు కాదు. కొందరు ఎవరో ఒకరిని ఉంచుకునేవారు. అదో స్టేటస్ సింబల్ అట. తాగడం చాలా తప్పుగా భావించడమే కాకుండా.. తాగేవాళ్లను భయం భయంగా కూడా చూసేవారు. దాంతో తాగుబోతులు పెద్దగా ఉండేవారు కారు.
ఓరోజు మంచి ముహూర్తం చూసి.. నాకు మా ఊరు పెదకాపుగారి కొడుకుతో కన్నెరికం చేయించారు. అప్పట్లోనే వెయ్యి నూట పదహార్లు ఇచ్చాడాయన. అది చాలా పెద్ద మొత్తం అట. మొదట్లో తరచూ వచ్చేవాడాయన. తర్వాత మరొకడు, మరొకడు వచ్చినప్పుడు వాళ్లతో గడపడానికి నాకేదోలా అనిపించేది. అందరిదీ ఒకటే యావ. నెమ్మదిగా అలవాటు పడ్డాను.
ఒకనాడు మూర్తి అనే ఆయన వచ్చాడు. నాతో చాలా అభిమానంగా ఉన్నాడు. గౌరవంగా చూశాడు. అలాంటివాణ్ని చూడ్డం నాకు అదే మొదటిసారి. ఏదో ఆబగా వచ్చి వెళ్లిపోవడం కాకుండా.. ఏవేవో కబుర్లు చెబుతూ, జోకులు వేస్తూ ఉండేవాడు. ఎప్పుడూ అతనితోనే ఉండిపోతే బావుండుననిపించేది. అయితే, అతను కొన్నిరోజులు పూర్తిగా నాతోనే ఉండి వెళ్లాక.. మళ్లీ ఎన్నాళ్లకో ఊడిపడేవాడు. కథలు చెప్పేవాడు. తను చూసిన కొత్త సినిమాల గురించి చెప్పేవాడు. మా పిఠాపురంలో రెండే సినిమా హాళ్లుండేవి. సెకండ్ రిలీజ్ సినిమాలే వచ్చేవి.
కొందరు వాళ్ల పని చేసుకుని వెళ్లిపోయేవారు. కొందరు తామెంతో గొప్పవాళ్లమనుకుంటూ నన్ను చిన్నచూపు చూస్తున్నారనిపించేది.. వాళ్ల మాటలు చూసి. అలాంటప్పుడు ఎలాంటి బెదురూ లేకుండా నేననుకున్నది అనేసేదాన్ని.
ఒకనాడు ఒకతను వచ్చాడు. అతని పేరు గోపాలరావట.
“నువ్వీ మురికికూపంలో ఎందుకుంటున్నావ్. ఎవరైనా పెళ్లాడతానంటే చేసుకుంటావా?” అని అడిగాడు.
నేను నవ్వుకున్నాను. ఇలా చాలామంది చాలాసార్లు అడిగారు నన్ను.
ఒకనాడు ఏదో పత్రిక నాకిస్తూ.. అందులోని ఓ కథ చదవమన్నాడు. చదివాను. అది ఓ వేశ్య కథ. ఒక ఆదర్శవాది ఆమెను వివాహం చేసుకుని సంఘ సంస్కర్తగా పేరు తెచ్చుకుంటాడు. నన్నూ అలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తనకు ఇదివరకే పెళ్లయిందనీ, తన భార్య శీలం మంచిది కాదని వదిలేశాననీ చెప్పాడు.
“మరి మీ శీలం మంచిదా?” అని నేను అడిగితే..
“నేను మగాణ్ని!” అని సమాధానమిచ్చాడు.
అందుకే..
“మిమ్మల్ని నేను చేసుకోలేను. రేపు మాత్రం నన్ను వదిలెయ్యరని ఏముంది? అయినా నాకీ బతుకు బాగానే ఉంది” అని చెప్పాను.
తర్వాత గోపాలరావు నా దగ్గరికి రావడం మానేశాడు. నేనూ అతణ్ని మర్చిపోయాను. అయితే, మొన్నీమధ్య మా సుజాతక్క దగ్గరికెళ్లడం చూశాను. నేనేమీ బాధపడిపోలేదు. ఆమె మా పినతల్లి కూతురు. మా ఇంట్లో వయసులో ఉన్నవాళ్లం ముగ్గురం ఉన్నాం. మరొకరు.. విజయ వదిన. మాది వంశపారంపర్య వృత్తి కావడం వల్ల.. ఊళ్లో పెద్దవాళ్ల అండ కూడా ఉండటం వల్ల.. ఎవరూ మమ్మల్ని చిన్నచూపు చూసేవారు కారు. పోలీసుల బెడదా ఉండేది కాదు.
శ్యామలరావు అనే మా పక్కూరి వెలమ దొర కొడుకు సుజాతక్కను పెళ్లి చేసుకుంటానంటే..
“సరే! మీ పెద్దలతో మాట్లాడాలి. తీసుకురండి” అన్నది మా అమ్మ.
“వెంటనే కుదరదు. ముందు మా ఊరు తీసుకెళ్లి, ఓ పదిహేను రోజులు ఉన్నాక.. మా వాళ్లను ఒప్పించి చేసుకుంటాను” అన్నాడతను.
మా అమ్మ పదిహేను రోజులకు ముందుగా ఎంతివ్వాలో మాట్లాడి, ఆ మొత్తం తీసుకుని.. ఆయనతో సుజాతను, ఆమె తమ్ముణ్ని సాయమిచ్చి పంపింది. శ్యామలరావు బాగా డబ్బున్నవాడు కావడంతో.. సుజాతను పెళ్లి చేసుకుంటే ఆమె బతుకు సాఫీగా సాగిపోతుందని మా అమ్మ మాతో అన్నది. అయితే పదిరోజులకే సుజాత తన తమ్ముణ్ని వెంటబెట్టుకుని తిరిగొచ్చేసింది. శ్యామలరావు సుజాతను తమ ఇంటికి తీసుకుపోకుండా, తమ పొలంలోని చిన్న గెస్ట్హౌస్లాంటి ఇంట్లో ఉంచాడు.
“అదేంటి? మీ ఇంటికి తీసుకెళ్లలేదేం!?” అని అడిగితే..
“నాలుగు రోజులు పోనీ!” అన్నాడు.
ఓ పదిరోజులు పోయేక..
“నీ గుణం మంచిది కాదు”.. అంటూ తిట్టి కొట్టబోయాడు.
తమ్ముడు అడ్డుపడ్డాడు.
“కొండలరావు మొన్న నీ దగ్గరికి వచ్చాడట కదా” అన్నాడు కోపంగా శ్యామలరావు.
“అవును వచ్చాడు. ‘నేను శ్యామ్గారి ఇలాకాలో ఉన్నాను. మరే మగాణ్నీ కన్నెత్తి చూడను!’ అని చెప్పాను. వెళ్లిపోయాడు” చెప్పింది సుజాత.
“నేను నీ మాటలు నమ్మను. ఇక బయల్దేరు..” అంటూ సవారీ బండి ఎక్కించి పంపేశాడు.
దారిలో ఆ బండతను చెప్పిన కబుర్ల వల్ల తెలిసింది..
తన మావగారు ఇస్తానన్న కట్నం పూర్తిగా ఇవ్వకపోవడంతో పెళ్లాన్ని పుట్టింటికి పంపేశాడట. సుజాతను తెచ్చుకుని ఉంచుకున్నాడని తెలిసి, మావగారు అప్పోసప్పో చేసి మిగతా కట్నం డబ్బుతోపాటు కూతుర్ని నిన్ననే పంపేడట. సుజాతను అక్కడికి తీసుకెళ్లడం కూడా మావగారిని పరోక్షంగా బెదిరించడానికేనట.. సుజాత కాస్త బాధపడుతూ విషయమంతా చెప్పుకొచ్చింది.
సుజాత అనుభవం తెలిశాక నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ముఖ్యంగా శ్యామలరావు భార్యను తలచుకునేకొద్దీ ఆమె మీద అదోరకం అభిప్రాయం ఏర్పడింది. వ్యక్తిత్వాలు లేని ఆమెలాంటివాళ్లు ఎంతమంది ఉన్నారో అనిపించింది. వాళ్లకులేని వ్యక్తిత్వం మాలోనే నయం అనిపించింది. మేమెవరికీ బానిసలుగా మసలుకోవడం లేదు. మేం ఇతరులకు సుఖమిస్తాం. అందుకు తగిన ప్రతిఫలం తీసుకుంటాం.
ఈ మధ్య సుజాతను ‘సుడిగాలి’ నాటకానికి ఎవరో వచ్చి బుక్ చేసుకున్నారు. ప్రతివారం ఆమె రిహార్సల్స్కు వెళ్లి వస్తున్నది. ఖాళీ సమయాల్లో తన పోర్షన్ చదువుకుంటున్నది. నాలుగు రోజుల క్రితమే ఏదో పరిషత్ పోటీల్లో ‘సుడిగాలి’ ప్రదర్శించారు. సుజాతకు ఉత్తమ
నటిగా బహుమతి కూడా వచ్చింది. ఇప్పుడు ఆమె సంతోషంగా ఉంది. మర్నాడు పొద్దున లేవగానే.. ముఖాలు కడుక్కుని టిఫిన్ తిని, కాఫీ తాగాం. మాకు పొద్దున అంటే తొమ్మిదో పదో.. అన్నట్టు చాలామంది జర్నలిస్టులకూ మాలాగే రాత్రి డ్యూటీలట కదా! ఈ మధ్య ఓ జర్నలిస్టు ఏవో మాటల్లో నాతో అన్నాడు.
“ఇప్పుడు నాక్కొంచెం అనుమానంగా ఉంది. రాత్రి వచ్చినవాడు అంటించి పోయేడేమోనని” భయపడుతూనే చెప్పింది విజయ.
“ఇవి మామూలే కదా! మన ఆర్ఎంపీకి చూపించుకుంటే సరి” చెప్పాను.
అప్పుడు నాకు మూర్తిగారు గుర్తుకొచ్చారు. శాన్నాళ్లయ్యింది ఇక్కడికొచ్చి. నిజానికి ఆయన చాలాసార్లు కళ్లముందు కదులుతారు. రోగాల గురించి ఒకనాడు ఏదో రష్యా నవల గురించి చెప్పారు. అది తెలుగులో ‘యమకూపం’ అట. అందులో జెన్నీ అనే ఆమెకు మగాళ్ల మీద చాలా కోపం ఉండేదట. వాళ్ల కారణంగానే తాను ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చిందని ఆమె పగ. జెన్నీ పనిచేసే కంపెనీకి ప్రతివారం ప్రభుత్వ డాక్టర్ వచ్చి, పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇస్తాడు. వందలేళ్ల క్రితమే ఆ దేశంలోని ఆ ప్రాంతంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేశారట. జెన్నీ మాత్రం డాక్టర్ వచ్చే టైముకు ఎలానో తప్పించుకునేది. ఒక్కోసారి మిద్దెమీదకెళ్లి దాక్కునేది. అలా ఎందుకు చేసేదంటే.. తన దగ్గరికొచ్చే ప్రతి మగాడికీ తన వ్యాధిని అంటించెయ్యాలి. అప్పుడుగానీ తన కసి తీరదు.
మూర్తిగారు వస్తే బావుండును. ఆయనంటే మొదటే గౌరవం ఏర్పడింది. తర్వాత ఇష్టం కలిగింది. తన గురించి ఆలోచిస్తుంటే ఎవరో వచ్చాడు. బాగానే ఉన్నాడు. మేం కూడా వచ్చిన వాళ్లు ఎలా ఉన్నారో అని చూస్తాం. కాస్త శుభ్రంగా ఉండేవాళ్లతో గడపడానికి చిరాకుగా ఉండదు కదా!? నన్ను కౌగలించుకుంటూ ఏవో కబుర్లలోకి దిగాడు. అతని పేరు చక్రధర్ అట.
ఏం చేస్తుంటారని అడిగితే.. ఏదో కంపెనీలో ఫిట్టర్గా పని చేస్తున్నానని చెప్పాడు.
“మీరు కళావంతులైతే.. మేం కుమ్మరోళ్లం! మా తాత, నాన్న కుండలు, దాకలు, కూజాలు వంటివి చేసేవారు. నేనూ చిన్నప్పుడు అలాంటిదేదో ఒకటి చేయడానికి సరదా పడేవాణ్ని. ముఖ్యంగా కుమ్మరి చక్రం తిరుగుతుంటే నాకు భలే తమాషాగా ఉండేది..” అని చెబుతుంటే ‘భోళామనిషిలా ఉన్నాడే!’ అనుకుంటూ, వినడానికి ఉత్సాహం చూపిస్తూ ప్రోత్సహించాను.
“మా తాత, నాన్న వినాయకుడిలాంటి మట్టిబొమ్మలు కూడా చేసేవారు తెలుసా!? నాకూ కొద్దిగా వచ్చేది. నన్ను వాటికి రంగులు వేయమనేవారు. ముందుగా వాళ్లు వేసి చూపించేవారు. డబ్బులూ, ఏడాదికోసారి ధాన్యం బాగా వచ్చేవి. మా పెనుమళ్లలో బోర్డు స్కూలు ఉండటంతో నన్నూ పంపేవారు. ‘ఎందుకురా మనకు సదువులు!? సక్కగా మన పని నేర్చుకుంటే బాగుంటది’ అన్నాడు మా తాత మొదట్లో. తర్వాత జరుగుతున్న మార్పులు చూసి, మిన్నకుండిపోయాడు. కుండలు, దాకలు వాడకం తగ్గడం మొదలైంది. సీవెండి, స్టీలు బిందెలు రావడంతో అందరూ వాటినే కొనడం ప్రారంభించారు” అంటూ నా పైట పట్టుకున్నాడు.
“అర్జంటుగా వెళ్లిపోవాలా!? లేటయినా ఫర్వాలేదా” అన్నాను అతని వంక నవ్వుతూ చూస్తూ.
“అర్జంటేమీ లేదు.. ” అంటూ ముద్దుపెట్టుకున్నాడు.
“మీరు మీ గురించి చెబుతుంటే ఇంటరెస్టుగా ఉంది. చెప్పండి”.
“స్కూలు ఫైనల్ అయ్యాక.. కాకినాడలో ఐటీఐ చదివాను. బీసీలం కదా.. సీటు సులువుగానే వచ్చింది. స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. అదయ్యాక కొంతకాలం ఖాళీగా ఉన్నాను. ఓ ఏడాదికి ఫిట్టర్ ఉద్యోగం వచ్చింది. నువ్వూ చదువుకున్నదానిలా కన్పిస్తున్నావ్” అన్నాడతను నా వంక చూస్తూ.
“టెన్త్ దాకా చదువుకున్నాను. నేనూ స్కూలు ఫైనల్ చదివి ఉండేదాన్ని. కళావంతులం కదా! అప్పటికే పెద్ద మనిషినై పోవడంతో వృత్తిలోకి దించేసింది మా అమ్మ. మీకు పెళ్లయిందా!?”.
“లేదు. సంబంధాలు చూస్తున్నారు మా అమ్మా నాన్నా. మా చుట్టాల పిల్లను ఎవర్తినో ఖాయం చేస్తారు. రెండేళ్ల క్రితమే నాకు పెళ్లి చేద్దామనుకున్నారు. అయితే, కాస్త కుదుటపడ్డాక.. అంటే మా అమ్మానాన్నలను కూడా నా దగ్గర ఉంచుకోడానికి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆగాను. ఎప్పుడన్నా ఒళ్లు ఊరుకోకుంటే ఇలా వస్తాను. అదీ పెళ్లయ్యేదాకానే” అంటూ సరసంలో పడ్డాడు.
అతను వెళ్లిపోయాక నేను ఆలోచనలో పడ్డాను. పేరు చక్రధర్ అట. అదీ వృత్తిపరంగానే పెట్టి ఉంటారా. చక్రధారి వాళ్ల వృత్తివాడే కదా!? అవునో కాదో .. ఏవో అలా ఆలోచిస్తూ నడుం వాల్చాను. రోజురోజుకూ రోజులు ఒకేలా ఉండటం లేదు. కమ్మరి, చేనేత, మంగలి.. ఇలా చాలామంది తమ వృత్తుల్ని వదులుకోక తప్పడం లేదని నా దగ్గరకొచ్చేవాళ్ల వల్ల తెలిసింది. మాకూ ఇంతకుముందులా ఇప్పుడు కళావంతులమనే గౌరవం లేదు. పోలీసు జులుం కూడా కొనసాగుతున్నది. అయినా ఇది తప్ప మరో పని చేయలేమని అనుకునేవాళ్లం. మా అమ్మా, పిన్నీ వయసు మీరడంతో ఈ మధ్యే.. ఏదో ఎన్జీవో కుట్టుమిషిన్లు ఇవ్వడంతో జాకెట్లు కుట్టడం నేర్చుకున్నారు. ఫర్వాలేదు.. కాసిన్ని డబ్బులు సంపాదిస్తున్నారు. మేమెలాగూ ఉన్నాం.
చలికాలం వచ్చేసింది. దుప్పట్ల అవసరం బాగా ఉంటుంది. అంచేతనే మాకూ డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. చాలామంది తమ కష్టాలను తలచుకుంటూ.. కన్నీళ్లు కారుస్తూ.. ఎదుటివాళ్ల సానుభూతి కోరుతూ చెప్పుకొంటారు. నాకది నచ్చదు. నా సుఖాలు ఎలాగ నావో.. నా దుఃఖాలూ అలాగే నావి. అందుకేనేమో నాకు మా వాళ్లకంటే కాస్త ధైర్యం ఎక్కువే.
చాలారోజుల తర్వాత.. రోజులేనా? కాదు.. నెలల తర్వాత మూర్తిగారు వచ్చారు. నా ముఖంలో దాచుకోలేనంత ఆనందం కనిపించినట్టుంది. మా విజయ వదిన వేళాకోళమాడింది.
“ఇంక మా మరదలు కొన్నాళ్లు స్వర్గంలో తేలిపోతుంది. మేం అసలు కనిపించం” అన్నది నవ్వుతూ.
నేను సిగ్గుపడిపోయాను. నేనేనా..? అవును నేనే సిగ్గుల మొగ్గయ్యాను!
ఆ రాత్రి మూర్తిగారు నా భుజం మీద చెయ్యి వేయగానే.. నా ఒళ్లు ఝల్లుమంది. ఏమిటిది? అదే శరీరం కదా!? అలా ఎన్నో చేతులు నా మీద పడ్డాయి కదా!? మరి మూర్తిగారి చెయ్యి తాకినప్పుడల్లా ఎందుకిలా ఉంటుంది? చాలాకాలం తర్వాత వచ్చిన ఆయన చూపాల్సిన ఆదుర్దా, తొందర నాకు కలిగింది.
ఎప్పటిలాగే నా కళ్లలోకి చూస్తూ..
“కొత్త కొత్తగా ఉన్నదీ మా లలిత..” అంటూ రాగం తీశారు.
ఎవరం ఏమేం చేశామో నాకు తెలివిడి లేనంతగా ఆ రాత్రి గడిచిపోయింది. హాయిగా గడిచిపోయింది అనో.. తీయగా నడిచిపోయింది అనో అనకపోవడానికి నాకు తెలియని కారణమేదో ఉండి ఉంటుంది. బహుశా.. అలాంటి మాటలను మించినదేదో ఉండి ఉంటుంది.
మూర్తిగారు ఎప్పటిలాగే తన దగ్గరున్న డబ్బు నా చేతికిచ్చారు. లెక్కెట్టలేదుగానీ.. పెద్ద మొత్తమే! ఆయన ఉన్నంతవరకూ ఏ కస్టమర్నూ నా దగ్గరికి పంపకూడదని అమ్మకు బాగా తెలుసు. అతను నన్ను పెళ్లాడితే నేను సుఖపడతానని ఆమె ఆశపడకపోలేదు. మర్నాడు అందరికంటే లేటుగా లేచాను. మా వదిన మళ్లీ వేళాకోళమాడింది. మా సుజాతక్క ఆమె నవ్వుతో శ్రుతి కలిపింది. మూర్తిగారికి టిఫిన్ పెట్టి, నేనూ తింటూ కబుర్లు చెబుతూ కూర్చున్నాను. ఆయన తన సినిమా అనుభవాలు చెబుతూ జోకులేస్తున్నారు. సరదాగా చెబుతున్నా.. ఏదో విషాదం నాకు కనిపించింది. తను రాసిందేదీ తన పేరుతో రావడం లేదట. కొత్త కవి ఏది రాసినా, ఆఫీసు బాయ్తో సహా బాగోలేదన్నట్టుగా చప్పరించేస్తారట. అదే తను రాసిందే ప్రముఖ కవి పేరు మీదుంటే తెగ మెచ్చేసుకుంటారట.
“ఇకనైనా పెళ్లి చేసుకోరా!?” అన్నాను మాట మార్చడానికీ, నా సంగతి తేల్చుకోడానికీ!
“అబ్బే! నేను పెళ్లికి పనికిరాను. మామూలు ఉద్యోగాలేవీ చేయలేను. రచయితగా ఎప్పుడెంత సంపాదిస్తానో నాకే తెలీదు. నువ్వు గమనించే ఉంటావు.. నాకు నిలకడ లేదు” అన్నారాయన అతి మామూలుగా.
నాకు అర్థమైపోయింది. నిజమే! ఆయనకు కుదురు లేదు. మద్రాసులో ఏదో ఒక సినిమాకు ఘోస్ట్ రైటర్గా కొంత సొమ్ము చేతిలో పడగానే వాళ్లూరు రాజమండ్రి, తర్వాత నా దగ్గరికి వచ్చేస్తారు. చేతిలో డబ్బు అయిపోయేవరకూ ఇలాగే తిరుగుతారు. ఎంత ప్రతిభ ఉన్నా.. కొందరంతే అనుకున్నాను. నాకూ దగ్గర దగ్గర ముఫ్పై ఏళ్లు వస్తున్నాయి. మూర్తిగారితో బిడ్డను కనాలని అనుకున్నాను. నెలలో ఏ రోజుల్లో గర్భం దాల్చే అవకాశం ఉందో మాకు తెలుసు. ఆ రోజుల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు ఏ జాగ్రత్తలూ తీసుకోకుండానే ఆయనతో గడుపుతున్నాను.
“నాకంటే మీరే పవిత్రంగా ఉంటున్నారని అనిపిస్తున్నది” అన్నాను మూర్తిగారితో సరదాగా. నిజానికి సీరియస్గానే.
“పవిత్రత అన్నది ఒక్కొక్కరి విషయంలో ఒకలాగ ఉండొచ్చు. నువ్వంటే నాకిష్టం కనుక.. నీతోనే ఉండాలని అనిపిస్తుంది. నీకో చిన్న కథ చెబుతాను. ఒకావిడ.. నీలాంటిదే. అయితే, ఆమె కూడా ఒకతణ్ని ప్రేమించింది. అతనిపట్ల పవిత్రంగా ఉండాలనుకుంది. ఏ విటుడినైనా అన్నీ ముట్టుకోనిచ్చేది కానీ, పెదాలను తాకనిచ్చేది కాదు. తన ప్రియుడు వచ్చినప్పుడు మాత్రమే.. పెదాలను తనకు తానే అందించేది. ఆ విధంగా ఆమె పవిత్రురాలు కదా. ఇక నువ్వు కూడా అలాంటిదానివే..” అంటూ నా కళ్లలోకి చూశారు.
“ఎలాగ!?” అన్నాను ఆశ్చర్యపోతూ.
“నీ మనసులో నేను మాత్రమే ఉన్నాను కదా. అంటే.. నీ మనసు పవిత్రం. అలాగ నువ్వు పవిత్రం” అంటూ నా బుగ్గను సుతారంగా మీటారు.
నా మనసంతా ఆయనపై మరింత ప్రేమతో నిండిపోయింది. ప్రతిసారి కంటే నా కోరిక మీద మరో వారం రోజులుండి, దారి ఖర్చులకు మాత్రం తీసుకుని వెళ్లిపోయారు. అంతవరకూ ఆపుకొన్న కన్నీళ్లు ఇక ఆగలేదు. కొన్నాళ్లకు నేను కడుపుతో ఉన్నట్టు రూఢి అయింది. మూర్తిగారికి తెలపాలని అనుకున్నాను. తను మద్రాసు నుంచి వచ్చేముందు ఓ కార్డు రాస్తుంటారు. అందులోని అడ్రస్కు ఈ సంతోష వార్త తెలుపుతూ లెటర్ రాశాను.. అందుతుందో లేదో అనుకుంటూ. ఆనందపడుతూ.. ‘ఆరోగ్యం జాగ్రత్త!’ అని జవాబు రాశారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆరోగ్యంగా పుడితే చాలనుకున్నాను. అమ్మాయే పుట్టింది. మద్రాసుకు లెటరు రాశాను. నెల రోజులకు కానీ రాలేదు. పాపకు ఏమన్నా కొనమంటూ డబ్బు ఇచ్చారు. పాపకు స్ఫూర్తి అనే పేరు పెట్టారు. బాగా చదివించాలన్నారు. నాలుగురోజులుండి వెళ్లిపోయారు. మరో మూడు నెలలకు వచ్చారు. బాగా చిక్కిపోయారు. ఇంతకుముందు లేని మందు అలవాటైంది. ఈ లోకం మీద చాలా విసిగిపోయి ఉన్నారు. ఈసారి కూడా పెద్ద మొత్తమే నా చేతుల్లో పెట్టి వెళ్తుంటే..
“మందు మానెయ్యండి. ఆరోగ్యం జాగ్రత్త!” అని మళ్లీ చెప్పాను. నన్ను దగ్గరికి తీసుకుని, ముద్దుపెట్టుకుని వెళ్లిపోయారు. అదే ఆఖరిసారి ఆయన్ని చూడటం.
మూర్తిగారి కోరిక ప్రకారమే స్ఫూర్తిని బాగా చదివించాను. నా వృత్తిలో ఆమె కొనసాగకూడదనే కోరిక నాకు గట్టిగా ఉండటం వల్ల, నేను కూడా టైలరింగ్ నేర్చుకుని అదనంగా సంపాదించడం వల్ల అది సాధ్యమైంది. ఆయన అప్పుడప్పుడూ మనియార్డరు చేసేవారు. మా విజయ వదిన కొడుకు రమణ కూడా స్ఫూర్తితోపాటు మంచి మార్కులతో పాసయ్యి, ఉద్యోగస్తుడయ్యాడు. స్ఫూర్తికీ ఉద్యోగం వచ్చింది. మా అమ్మ వాళ్లిద్దరికీ పెళ్లి చేస్తే బావుంటుంది అన్నది. ఇద్దరూ ఇష్టమేనన్నారు. అలాగ వాళ్ల వివాహం అయిపోయింది. అమ్మ కాలం చేసింది. కాకినాడలో చక్కటి ఫ్లాట్ కొని, నన్నూ తమతో తీసుకుపోయారు. మూర్తిగారికి రాసిన రెండు ఉత్తరాలూ మద్రాసు నుంచి తిరిగి వచ్చేశాయి.
తర్వాత తెలిసింది.. నడుస్తున్న రైలు ఎక్కుతూ పడిపోయి ఆయన చనిపోయారని. ఏదో పత్రికలో ఫొటో వేశారట. నాకు చాలా రోజులు నిద్ర పట్టలేదు. మూర్తిగారి జ్ఞాపకాలు నాకెప్పుడూ ఆనందంగానే కాదు, పెద్ద అండగా కూడా ఉంటాయి. ఆయన ఫొటో పెద్దది చేయించి హాల్లో పెట్టింది స్ఫూర్తి.
“మీ పెళ్లి ఫొటో కూడా పెట్టు!” అంటే..
“వద్దమ్మా. మాది కూడా పెడితే నాన్నగారి ఫొటోకు ప్రత్యేకత ఉండదు” అన్నది.
కాలింగ్ బెల్ మోగితే.. వెళ్లి వణుకుతున్న చేతులతో తలుపు తీశాను. స్ఫూర్తి, మనవడు ప్రతిభా మూర్తితోపాటు రమణ కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయాను.
“ఏమిటి!? రేపు కదా ఊరి నుంచి రావాలి” అన్నాను.
ముందే పనైపోవడంతో వచ్చేశానన్నాడు. వాళ్లు రిలాక్స్ అయ్యాక, స్ఫూర్తికి కథ కాగితాలు ఇచ్చి..
“కంపోజ్ చేసి, ఏదన్నా పత్రికకు పంపు” అన్నాను.
వాటిని ఎగాదిగా చూసి..
“అమ్మా! కాగితాలు బాగా మాసిపోయి ఉండటం వల్ల నీ రైటింగ్ సరిగ్గా తెలీడం లేదు. నువ్వు నా పక్కన కూర్చుని చదువు. నేను కంపోజ్ చేస్తాను” అన్నది స్ఫూర్తి.
ఎదురుగా ఫొటోలో నవ్వు ముఖంతో ఉన్న ఆయన్ని చూసి, సోఫాలోంచి లేచాను.
– కలిదిండి వెంకట సుబ్రహ్మణ్య వర్మ 98487 87266