చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : జాయపుడు, కాకతి..అనుమకొండలో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. తన మిత్రబృందానికి కాకతిని పరిచయం చేశాడు జాయపుడు. ఒకనాడు శిల్ప కర్మశాలకు తీసుకువెళ్లాడు. అక్కడ ఓ మిథున శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోయింది కాకతి. ‘ఈ శిల్పంలోని యువకుడు అచ్చం నీలాగే ఉన్నాడు!’ అని కాకతి చెప్పగా.. ఆ శిల్పంలోని యువతి నర్తకి రేచమ అనీ.. తామిద్దరం ఈ భంగిమలో ప్రతీకలుగా నిలబడితే చిత్రకారులు చిత్రీకరించారని చెప్పాడు జాయపుడు. అంతే! ఆ మాటలు వినగానే కాకతి కోపంతో ఊగిపోయింది. విసురుగా బయటికి పరుగు తీసింది. ఏం చెయ్యాలో తోచక బిక్కచచ్చిపోయాడు జాయపుడు.
మెకోసం అక్కడా ఇక్కడా అశ్వంపై తిరుగుతున్నాడు జాయపుడు. ఈ అనుబంధం, ఈ అభిప్రాయభేదాలూ ఇద్దరికీ కొత్త. ఆమెను ఎలా సముదాయించాలో అతనికి తెలియదు. ఆమె కోపం తాత్కాలికమా!? అతను పెద్దతప్పు చేశాడా!? చిన్నతప్పు చేశాడా!? అసలు సజీవ ప్రతీకలుగా ఓ అమ్మాయితో కలసి నిలబడటం తప్పా.. ఒప్పా!?.. తప్పు అయితే అది అతణ్ని వదులుకునేటంత తప్పా!? ఏమో.. ఇదమిత్థంగా ఆమెకూ తెలియదు.ఇద్దరూ బెంబేలెత్తిపోయారు.
ఆయన మరో స్త్రీతో అంత సన్నిహిత భంగిమలో ప్రతీకగా ఉండటం.. కాకతి ఏమాత్రం క్షమించలేక పోయింది. ఈ ప్రతిష్ఠంభన పక్షంరోజులు చాలా గట్టిగా ఉంది. ఎవ్వరూ తగ్గలేదు. తగ్గడం ఎలాగో ఇద్దరికీ తెలియదు.ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక కిందామీదా అవుతున్నారు మిత్రబృందం. నాగంభట్టు, త్రిపుర సెట్టికి ఇలాంటి సమస్యలు తీర్చిన అనుభవం లేదు. పెద్దలు నిర్ణయించిన వివాహాలు చేసుకున్న బుద్ధిమంతులైన కుటుంబీకులు వాళ్లు. భార్యతో అలగడాలు, భీష్మించుకోవడాలు అన్నీ ఇంటిలోపలే గానీ బయట కాదు. స్త్రీ పురుష సంబంధాలలో వివాహమే అత్యుత్తమ వ్యవస్థ. పెద్దలు నిర్ణయించి.. బాల్యంలోనే వివాహం జరిపించేసి, ఆనక వయసు వచ్చాక అత్తవారింటికి పంపడం ఆనవాయితీ. రాజకుటుంబీకులలో అమ్మాయిల విద్య, విషయ పరిజ్ఞానస్థాయి ఎక్కువ గనుక.. యుక్తవయసు వచ్చాకే వివాహాలు జరిగేవి.
పోషించగల స్థాయున్న మగవాడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు. రెండో సంబంధం.. వేశ్యా సమాగమం. వేశ్యా వ్యవస్థ పన్ను వసూలుస్థాయి వృత్తి. వేశ్యాస్త్రీలకు సమాజంలో సాంఘిక గౌరవం పక్కనబెడితే.. సామాజిక హోదా ఉన్నది. ‘ఆమె నా వేశ్య!’ అని చెప్పుకోవడం మగరాయుళ్లకు, ‘వారు మాకు అయినవారు’ అని వేశ్యలు చెప్పుకోవడం సర్వసాధారణం. ఇక స్త్రీపురుషుల మధ్య స్నేహం, దగ్గరితనం తాత్కాలిక మాధుర్యమే కానీ, సాంఘిక హోదా లేనిది జాయపుడు, కాకతిల మధ్య ఏర్పడిన సమస్య.. ఊహాతీతంగానే సమస్య వచ్చినంత వేగంగా సడలిపోయింది. కాకతి నాట్యగురుకులం తరగతికి హాజరయ్యింది. వెంటనే అశోకుడు జాయపునికి కబురు తెలిపాడు. ఆగమేఘాలమీద వచ్చి పడ్డాడు.
చూశాడు. ముఖం తిప్పుకొన్నది. చిరునవ్వు నవ్వాడు. తిరిగి నవ్వలేదు. పెద్దగా నవ్వాడు.. దూరంగా కూర్చుంది. పక్కన కూర్చోబోయాడు. లేచి వెళ్లిపోయింది. చూశాడు.. తలవాల్చింది. భోజన మందిరంలో తిన్నాడు. వచ్చింది గానీ తినలేదు. మంచినీరు తాగి వెళ్లిపోయింది. అశోకుడితో మాట్లాడింది. జాయపుడు అశోకుడితో మాట్లాడాడు. ఆమె అటు తిరిగింది.
గురువు చెప్పిన నాట్యభంగిమలు అభ్యాసం చేసింది. జాయపుడు చేస్తుంటే ఇతర మిత్రురాళ్లతో ముచ్చట్లు చెప్పింది. వాళ్ల మామూలు మాటలకు కూడా కిలకిలా నవ్వింది. వాళ్లతో కబుర్ల కాలక్షేపం ఎక్కువ చేసింది.
సంధ్యవేళకు జాయపుని చూపుతో చూపు కలిపింది. ఇక జాయపుని విన్యాసాలు చూడాల్సిందే! ఆమె క్రీగంట చూపుకోసం నానాతిప్పలు పడ్డాడు. ఆమె చిరునవ్వు కోసం చాలా హాస్య సన్నివేశాలు సృష్టించుకుని అభినయించాడు. ఎట్టకేలకు ఆమె నవ్వింది. ప్రసన్నత చూపింది. కరుణించింది. పక్కకొచ్చి కూర్చుంది.
గుసగుసగా చెవిలో ఏదో చెప్పింది. నిలువెల్లా ఊగిపోయి ఆనందతాండవం చేశాడు. పగటి కలల్లోనూ, రాత్రంతా కలల్లోనూ వేదమంత్రంలా అదే వాక్యం..“ఇంకెప్పుడూ మిథునశిల్పాల కోసం ఇతరులతో భంగిమలివ్వకు.. చంపేస్తా!”..
ప్రతిమా శాస్త్రంలో చెప్పిన త్రిభంగ రూపమైన ‘చంద్రుని రొమ్ములు, హంస నడుము, ఏనుగు కటిస్థానం’ కచ్చితంగా కొలతలు వేసినట్లున్న కాకతి.. మంచి శిల్పప్రతీక కాగలదని జాయప మనసులో ముందునుంచీ ఉన్న భావన. రేచమ లేకుంటే కాకతిని అడగవచ్చు. అంగీకరిస్తుందో.. చివ్వున లేచి అయ్యనవోలు వెళ్లిపోతుందో!?
రామప స్థపతిని ప్రయోగించాడు. ఆయన వద్దకు తీసుకువెళ్లాడు.
“అహం భో అభివాదయే. స్థపతిదేవా!”.
“పూర్తిగా నాట్యానికే అంకితం అయినట్లున్నావ్?!”.
“క్షమించాలి గురువుగారూ!”.
“మరి మా శిల్పులగోడు పట్టించుకోరా సేనానులవారూ!”.
“అయ్యయ్యో! శాంతం పాపం! పాపం శమించుగాక!! మిథునశిల్పాలు చెయ్యలేని పరిస్థితి. అర్థం చేసుకోగలరు”.
“మరి ముందేచెబితే మరో అందగాణ్ని చూసుకునేవాణ్ని కదా. ఇప్పుడు మధ్యలో ఆపేస్తే.. శిల్పాలన్నీ అలా సగంసగం చెక్కి వదిలివేయాల్సిందేనా??”.
“ఆమె.. ఆమె!”.
“ఎవరు ఆమె.. రేచమా? ఏమైంది ఆమెకు??”.
“ఆమె.. ఆమె!”.
“నమస్కారం స్థపతిగారూ!”.
“ఆయుష్మాన్ భవ! ఎవరమ్మా తమరు?”.
“గతవారం జాయప మీకు పరిచయం చేశాడు నన్ను. శిల్పశాలలో!”.
“ఓ.. అయ్యనవోలు అమ్మాయి.. కాకతి కదూ!?”.
“అవునవును. ఆ రేచమ అనే దానిబదులు నేను ప్రతీకగా నిలబడతాను. తమరి అనుజ్ఞ అయితే!”.
“అంతకంటేనా కాకతి. నీపేరే ఈ సామ్రాజ్య లక్ష్మి. నువ్వు ప్రతీకవంటే ఆ శిల్పం అజరామరం!! జాయపా.. నీకేమైనా అభ్యంతరమా?”.
“అబ్బే.. అబ్బెబ్బే.. అబ్బెబ్బెబ్బే.. నేను సిద్ధం..
సదా సిద్ధం. తమరు ఎలాచెబితే అలా!”.
“హమ్మయ్య! మీరిద్దరూ మంచిజంట అని సంజయ కూడా అభిప్రాయపడ్డాడు. హమ్మయ్య!”.
ఇద్దరూ యుగళగీతంలా..
“సంతోషం గురువుగారూ.. రేపటి నుంచే శిల్పశాలకు వస్తాం!”.
“అవశ్యం. దయ చేయండి. ఆనందం!”.
ఆ రాత్రి జాయప మిత్రబృందంతో విందు చేసుకోవడం కాకతికి తెలియదు. మరునాడు శిల్పశాలలో చిత్రకారుల మందిరంలో.. చాలాకాలంగా ఆగిపోయిన మిథునశిల్ప సృష్టి తిరిగి మొదలైంది.
ఇప్పుడు జాయప, కాకతి.. మిథునశిల్పాలకు ప్రతీకలుగా నిలబడ్డారు.
చిత్రకారుడు సంజయ వారి అలంకారాలు, దుస్తులు, ఆహార్యం, ఆభరణాలు, ముఖ రంగోద్దీపన.. లాంటి అన్ని అంశాలూ సరిదిద్దుతున్నాడు.
అందరి దృష్టీ కాకతి మీదే. ఆమె శరీరసౌష్టవం శిల్పానికి కచ్చితంగా సరిపోతుంది.
అక్కడున్న శిల్పకారులు, చిత్రకారులు అందరూ ఆమెపై చూపు తిప్పుకోలేనట్లు ఆమెనే చూస్తున్నారు. వారి చూపులో కామం లేదు. కళాదృష్టి మాత్రమే ఉంది. కాకపోతే ఇలా వాస్తవ వ్యక్తులే ప్రతీకలుగా నిలబడటం ప్రథమం కాబట్టి కొంచెం ఏకాగ్రత తప్పుతున్నది.
కాకతి వీటికి అతీతంగా ఉంది. కారణం ఆమె నిత్యమూ జాయపునితో ఉండాలి. మరే స్త్రీ అతనితో ఉండరాదు. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు.
జాయపుని కోసం ఏమైనా చేస్తుంది. జాయపునికి నచ్చడం ముఖ్యం. అదే తనకు నచ్చుతుంది. అయితే అతని పనులు కొన్ని తనను బాధ పెడుతున్నాయి. వాటిని భరిస్తున్నది. అవి తమ ఇద్దరినీ దూరం చేసేవి, మరొకరు మధ్యలో దూరేవి అయితే ఆమె తట్టుకోలేదు. అతణ్నయినా దండిస్తుంది. రేచమ అనే యువతి జాయపునితో మిథున శిల్పాలకు ప్రతీకగా ఉన్నదంటే ఏమాత్రం తట్టుకోలేకపోయింది. జాయపుణ్ని కూడా క్షమించలేక పోయింది. కానీ, తర్వాత తనకు తానే జవాబు చెప్పుకొన్నది. అతనిలో క్షమించమన్న అర్థింపు కనిపించింది. తనకోసం అతను తల్లడిల్లిపోయాడని గుర్తించింది.
జాయపుణ్ని క్షమించింది. బతుకంటూ ఉంటే.. జాయపునితోనే!
లేకుంటే గుడిసానిగా బతుకుతుంది. ఆ దేవదేవుడికి తన జీవితాన్ని అర్పించుకుంటుంది.
ఆమె సామీప్యంలో ప్రతీకలుగా నిలబడినప్పుడు ఎన్నెన్నో భావనలు జాయపునిలో వెల్లువెత్తుతున్నాయి.
నిండా ఆరుమూరల ముతకచీర లేదా నిండుగా లంగావోణితో ఎల్లప్పుడూ పొలాల్లో పనిచేసుకునే కాకతిని.. ఈ పల్చని బట్టల్లో, ఆభరణాలతో ఒళ్లు కప్పుకొని, ఎవరుచూస్తున్నా తొట్రుపడక ఏకాగ్రతతో చెప్పినట్లు నిలబడిన కాకతిని చూస్తుంటే.. అచ్చెరువుతో కూడిన సందడి మనసంతా..
ఆమె తనకోసం ఎంతో త్యాగం చేస్తున్నది. తను కళ కోసం నిలబడితే.. ఆమె తనకోసం నిలబడింది.
ఇవాళ ఇక్కడ ఇలా.. తనకు శ్వాస తగిలేలా శరీరాన్ని తనకు ఆన్చి, ఆత్మీయతతో నిలబడిన ఈ జవ్వని ఎవరు!?
ఎవరు రుక్కమ!? ఎవరు కాకతి!? ఎక్కడ ద్వీపం!? ఎక్కడ అయ్యనవోలు!?
ఆ భగవంతుడే ఇలా ఒక్కచోట చేరుస్తాడు కాబోలు.
ఆమెకు ఏమివ్వగలడు?! కృతజ్ఞత మరెలా తీర్చుకోగలడు!? అసలు.. తనకూ ఆమెకూ ఏమిటీ బంధం?
జీవితం ఇవ్వాల్సిందేనా!? అంటే వివాహం? జీవితాంతం సాహచర్యం?!
ఈ భావన బావుంది..
ప్చ్.. ఏమో!? కాలమే అన్నీ నిర్ణయిస్తుంది!
జాయపుడు.. కాకతి..
సత్యమై.. మానవజాతి ఉన్నంతవరకూ శాశ్వతమవబోతున్న ఓ అద్భుత మిథున శిల్పరూపం.
గురుకులంలో అశోకుడు.. జాయపుడు, కాకతికి ప్రత్యేకంగా జంట నాట్యాలను రచిస్తున్నాడు.ఉదయం కేశవస్వామి దేవాలయం వద్ద రేణుకతో కలసి అంగపూజాదికాలు నిర్వహిస్తూ.. తదనంతరం నాట్య గురుకులంలో లాస్యనర్తనంలో ప్రత్యేక శిక్షణ. అనంతరం శిల్పకర్మశాలకు వెళ్తుంది. అక్కడ ఇద్దరూ మిథున ప్రతీకలుగానూ, విడివిడిగానూ, మరి కొందరు నాట్యాంగనలతో కలసి స్థపతులు చెప్పిన భంగిమల్లో నిల్చుంటారు.
ఆమె ఓ విచిత్ర ప్రాణి. జాయపునిపై తప్ప మిగతా దేనిమీదా ఆమెకు ప్రత్యేక ఆకాంక్ష లేదు. అన్నీ అతనికోసమే.జాయపుని కంటే ముందూ వెనకా ఆమె కొలిచేదిఆ జగన్మాత కాకతమ్మ దేవతను. కారణం.. ఆమె కాకతమ్మ అంశ వల్ల పుట్టిందని తల్లిదండ్రులు చిన్ననాటి నుంచీ చెప్పడం. తనకు జాయపతో ఏర్పడ్డ అనుబంధం కూడా కేవలం ఆ కాకతమ్మ తల్లి దీవెనే అని కాకతి తలపోస్తుంది.
విచక్షాణాలోచన, హేతుపూర్వక ధోరణి ఎలా ఉన్నా.. వాటిని ఓ దైవం లాంటి అమూర్త రూపానికి స్థిరపరచుకుని ఆ రూపాన్నే తనలో ప్రతిష్ఠించుకుని పూజించే స్ఫష్టమైన గ్రామీణ ముగ్ధ ఆమె. ఆమె కార్యకలాపాలు అన్నిటికీ ఆమె అంతరాలయంలో ప్రతిష్ఠిత రూపం జాయపుడు.
ఇప్పుడు దాదాపు పాతిక దేవాలయాలకోసం జాయపుడు, కాకతి జంటగా మిథునశిల్పాల సృష్టి జరుగుతున్నది. అలాగే జంట నృత్యాలు కూడా ఎంతో అద్భుతంగా నేర్చుకుంటున్నారు ఇద్దరూ.
జాయప శివుడు.. ఆమె పార్వతి!
అతను తాండవం.. ఆమె లాస్యం!!
అతడు నృత్తం ఎంత అద్భుతంగా అభినయించగలడో.. ఆమె లాస్యం అంతే అద్భుతంగా పలికిస్తుంది. ఇద్దరి జంట నృత్యాలు, నృత్తాలు అక్కడ రూపశిల్పులైన నాట్యగురువులనే అబ్బురపరుస్తున్నాయి. ఆమె పూర్తిస్థాయి లాస్యనర్తకిగా ప్రవర్ధితమవుతున్నది.
కానీ, జాయపుడు కాకతిని గుర్రంపై కూర్చోబెట్టుకుని.. లేదా ఆమె పల్లకి వెంట అశ్వంపై రక్షకభటునిలా తిరగడం కొందరు పరిశీలిస్తున్నారని జాయపుడు గమనించే స్థితిలో లేడు.
నారాంబ.. పలకరిస్తే కూడా పలకలేనంత పని ఒత్తిడిలో ఉంది.కుమారులిద్దరినీ పరిచారికలే చూసుకుంటుండగా భర్తను ఆమె అస్సలు పట్టించుకోలేకపోతున్నది. అందుకు ఆయన కూడా ఆనందంగానే ఉన్నట్టున్నాడు.జాయపునికి వివాహ సంబంధాలు.. రేయింబవళ్లు ఇదే ధ్యాస.. అదే పని. రాత్రంతా ఆలోచన. పగలంతా అమ్మాయి తల్లిదండ్రులతో చర్చలు.. అమ్మాయిని చూడటం.. పెదవి విరవడం..“మళ్లా కబురు పెడతాం!”..
ఇదే గోల.. పాపం నారాంబ కష్టాలు ఇన్నిన్ని అని చెప్పలేనన్ని.. ఓ నిర్ణయానికి రాలేకపోతున్నది.
(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284