‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.
గూడెం ఘొల్లుమంది. లోతు వాగులో చేపలు పట్టడానికి పోయిన కుర్రాణ్ని పులి కరుచుకు పోయిందని తెలిసి.. ఆడామగ, పిల్లాజెల్ల, ముసలీముతక అందరూ కన్నీరుమున్నీరయ్యారు. గూడెం పెద్ద పోచయ్య ఆగమేఘాల మీద దహెగాంలోని ఫారెస్టు ఆఫీసుకు బయల్దేరాడు. ఆఫీసు బయటే ఆపిన సిబ్బందికి జరిగింది ఏంటో చెప్పాడు పోచయ్య. “మళ్లీ పులి బెడద మొదలయ్యిందన్న మాట!” అన్నాడు గార్డు యాదగిరి. “కడుపు నిండా తింటానికి బువ్వ లేకపోయినా.. ఎన్నడూ మీకు చెప్పుకోనీకి రాలె. సెలిమల్ల సుక్క నీళ్లు లేకపోయినా సాయం అడగలే. అబంసుబం తెలీని పిల్లల్ని కనేది మెకానికి తినబెట్టనీకా!? అని అడగటానికి వచ్చిన!” ఆవేశంగా అన్నాడు పోచయ్య. “ఏం పోచయ్యో! నోరు లేస్తందే! మేమేమన్నా పులిని తీసుకొచ్చి మీ గూడెంలో వదిలామా? అదేదో మా తప్పయినట్లు అంటుండావే!” అన్నాడు యాదగిరి.
“ఇయ్యన్నీ కాదు గానీ, మెకాన్ని మీరు సంపుతరా? మమ్మల్ని సంపుమంటరా?” సూటిగా అడిగాడు పోచయ్య. “సంపుతాడంట, సంపుతాడు! అట్ల చేస్తే బొక్కలో పెడతారు. అయినా పోయి లోపల ఆఫీసరుతో చెప్పుకో! ఏం దారి చూపిస్తుందో?!” అని వెటకారం చేస్తూ, లోపలికి దారి చూపించాడు యాదగిరి. లోపలి గదిలో కొత్తగా వచ్చిన, పట్టుమని పాతికేళ్లు లేని యువతి కూర్చుని ఉంది. ఆమే ఫారెస్టు రేంజ్ ఆఫీసరని తెలిశాక.. ఏం చెప్పుకోవాలో అర్థం కాలేదు పోచయ్యకు. పెద్ద చదువులు చదివిన ఆడాళ్లతో ఎలా మాట్లాడాలో అతనికి తెలియదు. పోచయ్యకు, తమ గార్డు యాదగిరికి మధ్య జరిగిన సంభాషణ.. లోపల గదిలో ఉన్న కళ్యాణికి వినిపిస్తూనే ఉంది. నిజానికి ఆమెకు వినపడాలనే అవసరానికి మించి గొంతుపెంచి మాట్లాడుతున్నాడు యాదగిరి. ఉద్యోగంలో చేరిన రోజు నుంచి యాదగిరి ఇలాంటి వ్యంగ్యపు మాటలు వింటూనే ఉంది. అవి ఒక స్త్రీని తమ పై అధికారిగా చూడలేని మగ అహంభావపు ప్రేలాపనలని ఆమె అర్థం చేసుకుంది. ఊరుకున్న కొద్దీ.. మరింత ఎక్కువ అవుతున్నాయి. అయినా ప్రస్తుతం సందర్భం కాదు కాబట్టి..లోపలికి వచ్చిన పోచయ్యను.. “ఏమైంది పెద్దయ్యా?” సౌమ్యంగా అడిగిందామె. ఏం జరిగిందో వివరించాడతను.
వెంటనే అతణ్ని జీపులో ఎక్కించుకుని, తన సిబ్బందితో గూడానికి బయల్దేరింది కళ్యాణి. తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కుమ్రం భీమ్ జిల్లాలోని పెంచికల్పేట్ ప్రాంతం.. దట్టమైన అడవులకు ఆనుకుని ఉంటుంది. గడ్డి మేయడానికి వెళ్లిన ఏ పశువునో, ఊర్లో కట్టేసి ఉన్న మేకనో పెద్దపులులు పట్టుకుపోవడం అప్పుడప్పుడూ జరిగేదే! అయితే మనిషి మీద దాడి చేయడం అన్నది ఎప్పుడో కానీ జరగదు.జీపు లోతువాగును సమీపించింది. అప్పటికే అక్కడికి గుంపులు గుంపులుగా జనం చేరుకున్నారు. చనిపోయిన కుర్రాడి బంధువుల రోదనలు బిగ్గరగా వినిపిస్తున్నాయి. పరిసరాలను జాగ్రత్తగా పరీక్షించింది కళ్యాణి. కుర్రాణ్ని అడవిలోకి ఈడ్చుకుపోయిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్యాణితో ఉన్న సిబ్బందిలో మల్లేశం అనుభవజ్ఞుడు. ఇలాంటివి ఎన్నో చూశాడు. అక్కడి కాలి ముద్రలు చూసి.. “ఇది పెద్దపులే!” అని ఖరారు చేశాడు. కళ్యాణి గూడెం వాళ్లను సముదాయించి, అతి త్వరలో ఆ పులిని బంధిస్తామనీ, అప్పటివరకూ ఎవరూ ఒంటరిగా బయట తిరగవద్దనీ చెప్పింది. ఆమె మాటలు ఎవరూ నమ్మకపోయినా.. అంతకంటే చేయగలిగింది లేక అప్పటికి ఊరుకున్నారు. వెనుతిరిగి ఆఫీసుకు వచ్చి, జరిగిన సంగతులన్నీ అప్పటికప్పుడు తన పై అధికారులకు వివరించింది. విని ఊరుకోవడం తప్ప.. వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మల్లేశం ఒక్కడే ఆమెకు సానుకూలంగా ఉన్నాడు. అతను కూడా అక్కడ గార్డే. అందరిలోకీ సీనియర్. ఆమెకు మంచీచెడూ చెప్తున్నాడు.
“మీరు టెన్షన్ పడకండి!” అని ధైర్యం నూరిపోశాడు. “అడవిలో హాయిగా ఉండాల్సిన పులులు, ఇలా ఊరి మీదికి ఎందుకు వస్తాయో?” అన్నది కళ్యాణి.“అవి మన దిక్కుకు రాటం లేదమ్మా! మనమే అవి వచ్చేట్టు చేస్తున్నాం. అడవులు కొట్టేస్తున్నం. లారీలు, జేసీబీలు పెట్టి ఏట్లో ఇసుక తోడుతుంటే నీరు నిలువ ఎట్టా ఉంటది? మెకాలకు తిండి, నీరు లేకపోతే అవి గూడేల మీద పడక ఏం చేస్తాయి?..” అన్నాడు మల్లేశం నిర్వేదంగా.
* * *
గూడెంలో మనుషులు బెదిరిపోకుండా, నలుగురు గార్డులను పంపింది కళ్యాణి. వారికి రైఫిల్స్తోపాటు ట్రాంక్విలైజర్ గన్స్ కూడా ఇచ్చింది. కొద్ది దూరం వెళ్లాక తన మీద జోకులు వేస్తూ.. యాదగిరి నవ్వుతున్న వెకిలి నవ్వులు ఆమె చెవిని దాటి పోలేదు.“మీరు కొద్దిగా స్ట్రిక్టుగా ఉండకపోతే ఆ యాదగిరి ఇలానే నెత్తికి ఎక్కుతాడమ్మా!” అన్నాడు మల్లేశం. ‘స్ట్రిక్టుగా ఉండటం అంటే ఏం చెయ్యాలి? కొట్టాలా!? తిట్టాలా!?’ అనుకుంది కళ్యాణి. పైకి మాత్రం.. “దానికంటే ముందు పులిని పట్టుకోవాలి. యాదగిరి సంగతి ఆ తరువాత చూద్దాం!” అన్నది. రెండు రోజులు గడిచాయి. ఏ దుర్ఘటనా జరగలేదు. గండం గడిచినట్లే అనుకుంటుంటే.. గూడానికి ఉత్తరాన ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో చిన్న పల్లెలో పత్తి ఏరడానికి వెళ్లిన పన్నెండేళ్ల బాలికను నోట కరుచుకుని పోయింది పులి. మొదటిసారి ఫారెస్ట్ అధికారులకు.. ఆ పులి ‘మ్యాన్ ఈటర్’ ఏమో అన్న అనుమానం వచ్చింది. మరికొంత మంది సిబ్బందిని ఆ ప్రాంతానికి తాత్కాలికంగా పంపారు.
చుట్టుపక్కల దాదాపు పాతిక చిన్నచిన్న గ్రామాలు ఉన్నాయి. పులి రెండు రోజుల్లో ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించిందంటే, తదుపరి దాడి ఎక్కడైనా చేయవచ్చు. కొత్తగా వచ్చిన సిబ్బందితోపాటు తను కూడా అలుపెరగకుండా గస్తీ తిరుగుతున్నది కళ్యాణి.
మరో రెండు రోజుల తరువాత.. మరింత ఉత్తరాన ఉన్న మరో ఊరిలో, అర్ధరాత్రి మందు కొట్టి సైకిల్ మీద వస్తున్న ఒక యువకుణ్ని పొట్టన పెట్టుకున్నది ఆ పులి. ‘జరుగుతున్న మరణాలను చోద్యం చూస్తున్నట్లు చూడటానికి కాదు నేను ఇక్కడ ఉన్నది!’ అనుకున్నది కళ్యాణి. తన స్నేహితురాలు మానసకు కబురు పంపింది. మానస డ్రోన్ ఆపరేటర్. ఆమె దగ్గర వివిధ రకాల డ్రోన్లు ఉన్నాయి. పైగా మానసకు అడ్వెంచర్ అంటే ఇష్టం. పెద్దపులినే పట్టుకునే అవకాశం అని తెలియగానే.. హుటాహుటిన హైదరాబాద్ నుంచి పెంచికల్పేట్కు చేరుకుంది. రావడమే కాదు, తనతో కొన్ని డ్రోన్లు కూడా తెచ్చి వెంటనే కార్యరంగంలోకి దూకింది. “డ్రోన్ కెమెరాలు కొంతమంది ఆపరేట్ చేస్తూ ఉంటే మరికొందరు కంట్రోల్ రూములో ఏర్పాటు చేసిన మానిటర్లలో పులి కనిపిస్తుందేమోనని వెతుకుతూ ఉండాలి. అలా మొత్తం అడవిని జల్లెడ పట్టవచ్చు!” చెప్పింది మానస. “ఎక్సలెంట్! కానీ, డ్రోన్ ఆపరేట్ చేయడం అందరి వల్లా కాదుగా!?” అనుమానం వ్యక్తం చేసింది కళ్యాణి.
“దాన్ని నాకు వదులు. లోకల్గా ఉన్న కాస్త చదువుకున్న యువతీ యువకులను పిలిపించు. వారికి ఒక గంటలో నేర్పిస్తాను!” చెప్పింది మానస.
ఈలోపు లోకల్ ప్రజాప్రతినిధి నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి.“ఇంత రిస్కు పోస్టులోకి ఒక అమ్మాయిని పంపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వెంటనే మహిళా రేంజర్ని మార్చి మగ ఆఫీసర్ని పంపండి” అని డిమాండ్ చేయసాగాడు. డీఎఫ్వో నుంచి కళ్యాణికి ఫోన్ వచ్చింది.“నిన్ను అక్కడినుంచి ట్రాన్సఫర్ చేద్దామని అనుకుంటున్నాం!” అని చెప్పాడాయన.కళ్యాణి ఉద్యోగంలో చేరడానికి వచ్చినపుడు.. ఆ మారుమూల పల్లెను చూసి, ‘ఇక్కడినుంచి ఎప్పుడెప్పుడు విముక్తి కలుగుతుందా?’ అని అనుకున్న మాట వాస్తవం. కానీ, ఇలా ఒక పెద్దపులి చేతిలో ఓడిపోయి, వెళ్లిపోవడం అంటే.. అది తనకు మాత్రమే కాదు, ఆడవాళ్లందరికీ అవమానమని ఆమె భావించింది. అందుకే.. “ఒక వారం టైం ఇవ్వండి సార్!” అని అడిగింది. “వారంలో ఏమవుతుంది కళ్యాణీ! మగవాళ్లయితే నీకంటే ఏదో ఎక్కువ సాధిస్తారని కాదు. ఈ ప్రజా ప్రతినిధుల విమర్శలకు కొన్ని రోజులు విరామం దొరుకుతుందని!” అన్నాడాయన.
“లేదు సార్! వారంలో ఆ పెద్దపులిని పట్టుకుంటాను!” ఆత్మవిశ్వాసంతో చెప్పింది కళ్యాణి.
కొద్దిగా ఆలోచించి.. “సరే! వారం రోజుల సమయం ఇస్తున్నా. వారంలో పులిని పట్టుకోలేక పోతే, నీ అంతట నువ్వే అక్కడినుంచి వచ్చేయాలి!” అంటూ ఫోన్ పెట్టేశాడాయన. ఈలోపు మానస అక్కడి యువతీ యువకులను ఉపయోగించుకుని డ్రోన్ కెమెరాలతో అడవిని జల్లెడ పట్టింది. 48 గంటల్లో వారి కృషి ఫలించి, పులి ఆచూకీ తెలిసింది. నీరు తాగడానికి సెలయేరుకు వచ్చిన పులి.. డ్రోన్ కెమెరాకు చిక్కింది. అది ఆడ పులి. పిల్లలతో ఉంది. పైగా దాని నడకను పరీక్షించిన కళ్యాణి.. దానికి ఒక కాలు విరిగిందని గమనించింది.“విరిగిన కాలుతో ఆ పులి జంతువులను వేటాడలేదు. అందుకే అది నెమ్మదిగా కదిలే మనిషిని ఆహారంగా ఎంచుకుంటున్నది” అని తన సిబ్బందితో చెప్పింది.వెంటనే పులి కనిపించిన ప్రదేశానికి బయల్దేరింది. పులి నీరు తాగడానికి వచ్చిన సెలయేరు దగ్గర ఉన్న ఒక చెట్టుమీద కళ్యాణి తన బృందంతో మాటు వేసింది. “ఈ ట్రాంక్విలైజర్ గన్ పేలిస్తే మత్తుమందు ఉన్న సిరంజి దూసుకువెళ్లి పులి శరీరంలో గుచ్చుకుంటుంది. దాంతో 30 నుంచి 45 నిమిషాల పాటు పులికి మత్తు ఉంటుంది. కానీ, ట్రాంక్విలైజర్ ప్లాస్టిక్తో చేసి ఉంటుంది. లోహంతో చేసిన బుల్లెట్లా గురి కుదరదు. ఏ మాత్రం గాలి ఉన్నా గురి తప్పుతుంది. అందుకే, పులి నిలకడగా ఉందని అనుకున్నప్పుడే కాల్చాలి! అందుకే, అది నీళ్లు తాగేందుకు సెలయేటి వద్దకు వెళ్లేవరకూ ఎవరూ కాల్చవద్దు. నీళ్లు తాగే సమయంలోనే అది చాలాసేపు కదలకుండా ఉంటుంది!” అని తన సిబ్బందికి సూచనలు చేసింది.
ఒక రోజు గడిచేటప్పటికి.. ఎప్పుడు వస్తుందో తెలియని పులి కోసం చెట్టుమీద మాటు వేసి కూర్చోవడం తేలిక కాదని ఆమెకు అర్థమైంది. రెండో రోజు రాత్రి పులి సెలయేటి దగ్గరికి వచ్చిన అలికిడి అయి.. చెట్టు మీదున్న అందరూ అప్రమత్తమయ్యారు. అసలే రాత్రి. దట్టమైన చెట్లు చీకటిని మరింత పెంచి పోషిస్తున్నాయి. చెట్ల గుబుర్లను అడ్డుగా చేసుకుని నీటివైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నది పులి. అలా వెళ్తున్న పులి ఒక్క సారిగా ఆగింది. మనుషుల వాసన దానికి తగిలినట్లు ఉంది.. చుట్టూ చూడబోయింది. కళ్యాణి సూచనలు మరచిపోయాడో.. లేక ఆమె విజయం సాధించడం రుచించలేదో!? ఆమె సూచనలకు విరుద్ధంగా గన్ పేల్చాడు యాదగిరి. ‘ఠప్!’ అన్న శబ్దంతో ట్రాంక్విలైజర్ దూసుకెళ్లింది. అయితే అది పులికి తగలలేదు. దాని పక్కగా వెళ్లి గడ్డిలో పడిపోయింది. ఈలోపు గన్ పేల్చిన శబ్దానికి అలర్ట్ అయిన పులి.. క్షణంలో పొదల్లోకి దూరి మాయమైంది. యాదగిరిని ఏమి అన్నా ఇప్పుడు ఉపయోగం లేదని తెలుసు కాబట్టి.. కళ్యాణి ఏమీ మాట్లాడ లేదు. అతని కళ్లలో కనీసం విచారం కనిపించలేదు కళ్యాణికి. “ఇక ఇక్కడ కాపు కాయడం వృథా! అది మళ్లీ ఇక్కడికి రాదు!” అన్నదామె.
* * *
తిరిగి డ్రోన్ కెమెరాలతో ట్రాకింగ్ మొదలైంది. ఈలోపు ఎరగా వేసే బోనులు వచ్చాయి. అడవి లోపలివరకూ వాహనాలు రావు కాబట్టి ఆరేడుగురు మనుషులు కలిసి ఆ బోనులను మోసుకువెళ్లాలి. పులి ఎక్కడికి వస్తుందో అంచనా వేసి.. అక్కడ ఈ బోనులు పెట్టాలి. మరో రెండురోజుల తరువాత బహిర్భూమికి వెళ్లిన ఒక మహిళను పులి ఈడ్చుకుపోవడం డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయింది. అది ఈసారి ఉత్తరానికి కాకుండా వెనక్కి ప్రయాణిస్తున్నది.
“మనం అనుకున్నదాని కంటే ఇది జిత్తులమారి పులి!” అని డిక్లేర్ చేసింది కళ్యాణి.
“పులికి ఆహారం దొరికింది కాబట్టి దాహం కూడా తీరాలి. దానికోసం అది ఎక్కడికి వస్తుందో అంచనా వేసి అక్కడ బోను పెడదాం!” చెప్పాడు మల్లేశం. పులి కనిపించిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న ఒక నీటి మడుగును గుర్తించి అక్కడికి బోనును చేర్పించారు. అప్పటికి డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇచ్చిన వారం రోజుల గడువు ముగియడానికి ఇంకా ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది. బోనులో ఉంచడానికి తెచ్చిన మేకను పక్కకు జరిపి.. “బోనులో అది కాదు! నేను కూర్చుంటా!” అన్నది కళ్యాణి.“అది ప్రమాదం అమ్మా!” అంటూ ఏదో చెప్పబోయిన మల్లేశాన్ని అడ్డుకుంటూ.. “మేక కంటే మనిషి రుచే ఇప్పుడు దానికి ఇష్టం. దానిని పట్టుకోవాలంటే ఇదొక్కటే మార్గం. నాకేమీ కాదు, మీరు వెళ్లండి. పులికి మత్తు ఎక్కగానే మీకు కబురు చేస్తాను!” అంటూ వాకీటాకీ చూపించింది కళ్యాణి.అందరూ ఆమె చెప్పిన సూచనలు పాటించినా, యాదగిరి మాత్రం ఎవరికీ తెలియకుండా వెనక్కి వచ్చి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. నిజంగానే కళ్యాణి పులిని పట్టుకుంటే.. ఆమెకు ఎక్కడ పేరు వస్తుందోనని అతని దుగ్ధ. తనే మత్తు ఇంజెక్షన్తో పులిని కాల్చి, ఆమెకు వచ్చే పేరు రాకుండా చేయాలని అతని ఊహ. బోనులో మేకను పెడితే బోను తలుపు తెరచి ఉంచుతారు. మేక కోసం బోనులోకి వచ్చిన పులికి మేక చిక్కుతుంది. అప్పుడు బోను తలుపు మూసుకు పోయి.. పులి బందీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ లోపల ఉన్నది మనిషి కాబట్టి.. బోను తలుపు వేసి ఉంచుతారు. మనిషి కోసం బోను దగ్గరికి పులి వస్తే మనిషి మత్తు ఇంజెక్షన్తో దాన్ని కాల్చాలి. బోనులో కూర్చున్న కళ్యాణి తప్ప.. మిగిలిన భాగం కనిపించకుండా పచ్చటి చెట్ల కొమ్మలు, తీగలు బోను మీద కప్పారు. చీకటి పడింది. అడవి మొత్తం కీటకాలు చేస్తున్న శబ్దాలతో నిండి పోయింది. మేక కోసం చేసిన బోను కాబట్టి.. మనిషికి విశ్రాంతిగా కూర్చునే వీలు ఉండదు. వంగి కూర్చోవాలి. గంట మీద గంట గడుస్తున్నా పులి జాడ లేదు. లోపల కూర్చున్న కళ్యాణికి నడుము లాగేస్తున్నది. సమయం చూస్తే రాత్రి రెండు అవుతున్నది. తెల్లవారితే తను ఓడి
పోయినట్లు ఒప్పుకొని వెళ్లిపోవాలి. ఓటమి అన్న భావం సహించరానిదిగా తోస్తున్నదామెకు. ఇది పులికీ తనకూ మధ్య వ్యక్తిగత పోరాటంలా మారింది.
* * *
బోనులో మేక ఉంటే దాని అరుపులకు ఎట్రాక్ట్ అయి పులి వచ్చేదేమో! ఇప్పుడు తను ఏమీ చప్పుడు చేయకపోవడంతో అది రావడం లేదేమో. అలా అనిపించిన మరుక్షణం బోను తలుపును పెద్ద శబ్దంతో తెరచింది కళ్యాణి. తోచిన పాట పాడుతూ, శబ్దం చేస్తూ బోను బయట నిల్చున్నది. దాదాపు అరగంటపాటు అలా ఏదో ఒక శబ్దం చేస్తూనే ఉన్నది కళ్యాణి. అయినా పులి జాడలేదు. వాకీటాకీలో తన సిబ్బందిని సంప్రదిద్దామా!? అనుకుని.. ఆ సమయంలో వారు చేయగలిగింది ఏమీ ఉండదని, ఆ ఆలోచన విరమించుకుంది. ఇక తను ఓడిపోయానని నిశ్చయించుకుని, తిరిగి బోనులోకి వెళ్లడానికి వెనుతిరిగిన కళ్యాణి.. ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎప్పుడు వచ్చిందో, ఎదురుగా నిల్చుని ఉన్నది పులి. సరిగ్గా బోనుకు, తనకు మధ్య.. ఇప్పుడు తను వెళ్లాలన్నా బోనులోకి వెళ్లలేదు. చేతిలోని ట్రాంక్విలైజర్ గన్ ఎక్కుపెట్టి గురిచూసింది కళ్యాణి. తన చేతులు వణకడం స్పష్టంగా తెలుస్తున్నది కళ్యాణికి. పులి ఒక అడుగు వెనక్కి వేసింది. అది కూడా దాడికి సన్నద్ధం అవుతున్నదని కళ్యాణికి అర్థమైంది. సరిగ్గా గురి చూసుకునే లోపే.. పెద్దగా గాండ్రిస్తూ కళ్యాణి మీదికి దూకింది పులి. అదే సమయంలో కళ్యాణి చేతిలోని గన్ పేలింది. మత్తు మందు ఇంజెక్షన్ పులికి గుచ్చుకుందో లేదో చీకట్లో తెలిసే అవకాశం లేదు. ఇంకోసారి పేల్చేందుకు స్పేర్ ట్రాంక్విలైజర్ తన దగ్గర లేదు. బోనులో ఉంది. పులి మీదికి దూసుకు వస్తున్నా.. దాని విరిగిన కాలు, అది అనుకున్న విధంగా దూకడానికి సహకరించ లేదు. కళ్యాణి మీద పడాల్సిన పులి.. కొద్దిగా ముందు పడింది. కళ్యాణి పక్కకు తప్పుకొన్నది. అలా పడటంతోనే.. దాని విరిగిన కాలు మరింత నొప్పి పెట్టినట్లు ఉంది. దాంతో పులి మరింత భీకరంగా గాండ్రించింది.
ఆ గాండ్రింపునకు చెట్టుమీద కూర్చున్న యాదగిరి పట్టు తప్పింది. సరాసరి వచ్చి పులికి ఎదురుగా పడ్డాడు. కళ్యాణికి తను తప్పించుకోవడమే కాదు.. యాదగిరిని రక్షించాల్సిన బాధ్యత కూడా మీద పడింది. కింద పడటంతో యాదగిరి చెయ్యో, కాలో విరిగినట్లుంది. బాధతో విలవిలలాడుతున్నాడు. అతణ్ని భుజాల దగ్గర పట్టుకుని బోను దగ్గరికి లాక్కెళ్లి, లోపలికి తోసింది. తను కూడా బోనులోకి వెళ్లి తలుపు వేసేసుకుంది. అయితే.. ఆమె వాకీటాకీ కిందికి జారిపోయింది. సిబ్బందిని పిలిచే అవకాశం లేకుండా పోయింది. పులి కూడా విరిగిన కాలు కలిగిస్తున్న నొప్పి నుంచి కోలుకుంది. ఆ తరువాత అరగంటపాటు పులి బోను చుట్టూ తిరుగుతూ, అడవి అంతా దద్దరిల్లేలా గాండ్రిస్తూనే ఉంది. అంత దగ్గరగా పులి పెడుతున్న గాండ్రింపులకు ధైర్యం సడలిపోయి.. యాదగిరి గజగజా వణుకుతున్నాడు. కొంతసేపటికి భయంతో స్పృహ తప్పి పోయాడు. కళ్యాణికి కూడా ఆ అరుపులకే తన గుండె ఆగుతుందేమో అనిపించింది. ఆమెకు ఉన్న ధైర్యమల్లా ఒకటే, పులి శరీరానికి వేలాడుతున్న ట్రాంక్విలైజర్. ఆ మందు పనిచేసి పులి స్పృహ తప్పే క్షణాల కోసం ఎదురు చూస్తున్నది కళ్యాణి. సరిగ్గా నలభై నిమిషాలకు పులి కింద పడిపోయింది. ఆ తరువాత బోను నుంచి బయటికి వచ్చి, కిందపడిన వాకీటాకీ తీసి మల్లేశానికి జరిగిన విషయం చెప్పింది. మరో అరగంటలో వలలు తీసుకుని సిబ్బంది వచ్చారు. పులిని ప్రాణాలతో బంధించారు.
* * *
మరుసటి రోజు అక్కడికి వచ్చిన డీఎఫ్వో.. “మొత్తానికి అనుకున్నది సాధించావ్! ఒక మ్యాన్ ఈటర్ను ప్రాణాలతో పట్టుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు! మేకకు బదులు బోనులో కూర్చుని మరీ పులిని పట్టుకునే అంత ధైర్యం నీకు ఎలా వచ్చింది?” అడిగాడు మెచ్చుకోలుగా. “ఆ ఆడపులి విరిగిన కాలువల్ల, పిల్లలకు ఆహారం సంపాదించడానికి మరో దారిలేక మ్యాన్ ఈటర్గా మారింది. కానీ, మన డిపార్టుమెంటులోనే, ఒక స్త్రీ తమ అధికారిగా రావడాన్ని సహించని ఒకరు నన్ను మరింత దారుణంగా హింసించబోయాడు. అలాంటివారికి సమాధానం చెప్పడానికే ఈ సాహసం చేయాల్సి వచ్చింది సార్!” అన్నది కళ్యాణి.“ఎవరతను? ఇప్పుడే అతని మీద చర్య తీసుకుంటాను!” అంటూ ఏదో అనబోయాడు ఆఫీసర్.
“అక్కర్లేదు సర్! మ్యాన్ ఈటర్గా మారిన పులి.. పిల్లలతోపాటు జూకు వెళ్లిపోయింది. దానిని బంధించే ప్రక్రియలో నాకు కూడా.. నిజమైన భయం అంటే ఏంటో తెలిసింది. ఆ భయం అనుభవించిన నాకు.. ఇక ఏ యాదగిరీ అన్నా భయం లేదు. ఇక నుంచి ఎవరిని ఎలా కంట్రోల్ చెయ్యాలో అలా చేస్తాను!” అన్నది ఆత్మవిశ్వాసంతో. “ఒక ఆడపులి.. ఇంకో ఆడపులికి జీవిత పాఠం నేర్పిందన్నమాట!” అన్నాడు డీఎఫ్వో వెళ్లిపోతూ.
పుట్టగంటి గోపీకృష్ణ
పుట్టగంటి గోపీకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ప్రస్తుతం కర్ణాటకలోని ధార్వాడ జిల్లాలో కర్ణాటక గ్రామీణ వికాస్ బ్యాంకు చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2007 నుంచి రచనలు చేస్తున్నారు. ఇప్పటివరకూ 35 నవలలు, 130 కథలు ప్రచురితమయ్యాయి. ఇద్దరి కలయిక, ఇటు తూరుపు అటు పశ్చిమం, క్వీన్ మేరీ, డూప్లికేట్ నవలలు పాఠకాదరణ పొందాయి. వివిధ పత్రికలు నిర్వహించిన నవలల పోటీల్లో ‘నిన్నటి నేడే రేపు’, ‘రణక్షేత్రం’, ‘రాజగురువు’ ప్రథమ బహుమతులు దక్కించుకున్నాయి. ‘గౌరీ కళ్యాణం’ నవలకు అనిల్ అవార్డు వచ్చింది. వివిధ సాహితీ సంస్థలు, పత్రికలు నిర్వహించిన పోటీల్లో వైరస్, ఎన్కౌంటర్, ఫాంటసీ, రోకలి ఓబవ్వ, తనదాక వస్తే.. రచనలు బహుమతులు గెలుచుకున్నాయి. ‘సాహిత్యం’ అనేది చదివే పాఠకుడికి ఏదో ఒక రసాస్వాదన కలగజేయాలని, రచనలో చదివించే గుణం ముఖ్యమని గోపీకృష్ణ నమ్ముతారు.
-పుట్టగంటి గోపీకృష్ణ
94910 91620