Jaya Senapati Episode 34 | జరిగిన కథ : రాచనగరు నాట్యోత్సవంలో పాల్గొన్న జాయప ప్రతిభను చక్రవర్తి గణపతిదేవుడు గుర్తించాడు. అతణ్ని మంచి నాట్యకారుణ్ని చేయాలంటూ గుండయామాత్యుడికి అప్పగించాడు. అప్పటినుంచి జాయప.. గుండయామాత్యుడి శిక్షణాలయంలోనే నాట్య శిక్షణ పొందుతున్నాడు. అదే సమయంలో కొండయ బృందంతో కలిసి నాటకాల్లోనూ పాల్గొంటున్నాడు. అలా దేశీ, మార్గీ నాట్యవిధానాల్లో నటిస్తూ, అభ్యసిస్తూ.. మరింత ప్రౌఢత్వం సంతరించుకుంటున్నాడు.
గురుకుల శాస్త్రీయ పఠనం జాయప కళా, సాహితీ ప్రపంచాన్ని విస్తృతపరుస్తున్నది.
కళలు.. దృశ్య, శ్రవ్య, పఠన కళలుగా మూడురకాలు. ఏ కళ అయినా కళాకారులు మూడురకాలు.
ప్రదర్శనకారులు, గురువులు, శాస్త్ర సిద్ధాంత గ్రంథకర్తలు.
శాస్త్ర రచనలలో సంస్కృతభాష ప్రధానంగా ఉంటే.. ఇప్పుడిప్పుడే ప్రాంతీయభాషల ప్రాముఖ్యం పెరుగుతున్నది. ఆయా భాషల్లోనూ నాట్య, గేయ, సంగీతాలపై గ్రంథాలు వస్తున్నాయి. జానపదుల్లోని అలిఖిత దేశీపాటలను కవులు ఒడిసిపట్టుకుని కాస్త సంస్కరించి, తాళపత్రాలపై లిఖించడమే కాక.. శాస్త్రీయ విధివిధానాలతో హాయిగా గొంతెత్తి పాడుతున్నారు. సాహిత్యంతో, భాషతో సంబంధంలేని శుద్ధ గానమే సంగీతం. ఈ మూడింటినీ అద్భుతంగా మేళవించేది నాట్యం. వీటన్నిటినీ పాఠ్యాంశాలుగా నిర్ణయించి, ఆసక్తులలో సశాస్త్రీయ శిక్షణ ఇచ్చేవి గురుకులాలు.
కొత్తకొత్త దేశీపదాలతో నిఘంటువులు కూర్చడం గురుకులాలలో, ఘటికల్లో జరుగుతున్నది. ప్రజల భాష, ప్రజల భావనలు పొదగడంవల్ల తెలుగు సంగీతం, నాట్యం, వాద్యం, సాహిత్యం పరిపుష్టం అవుతున్నాయి.
ఈ కళలన్నిటి మధ్య ఉన్న అల్లిక మొత్తంగా సమాజం! ప్రకృతి!! మానవ వ్యక్తిగత, సామూహిక భావనలు..
ప్రాతః ఉషస్సు.. సంధ్యా సమయం.. చీకటి వెలుతురుల సంగమం.. చల్లని.. వెచ్చని గాలి! ఎర్రని ఎండ.. ఎండలో చలి.. వాన చినుకులు.. లోకాన్ని ముంచేసే తుఫానులు, వరదలు.. పచ్చని చెట్లు.. లేత మొక్కలు.. విరగబూసిన మందారాలు.. విరగపండిన పంటచేలు.. పాలు కుడిచే లేగదూడలు.. చిందులేసే తువ్వాయిలు .. ఓ భార్యాభర్త.. సరాగాలు.. విరాగాలు.. పిల్లల ఆటలు, వృద్ధుల కబుర్లు.. వానవెలిశాక తేటపడిన ఆకుచాటుగా ఒళ్లు విదిలించుకున్న పాలపిట్ట.. అమ్మకాళ్లపై పడుకుని వేడి – చల్లటి కలగలుపు నీళ్లతో స్నానమాడి నవ్వుతున్న పసిబిడ్డ.. కుంభవృష్టిలో నెమరువేస్తూ పోతున్న పశువులు.. వీధి బావివద్ద మహిళల ముచ్చట్లు – కొట్లాటలు.. పంటచేలలో పాటలు.. బౌద్ధ, జైన, హైందవ భక్తి తత్పరత.. గుడిసానుల రంగపూజలు.. కాపాలికుల అరుపులు.. దేవతా శిల్పం.. నటరాజమూర్తి.. ఎటుచూసినా.. ఏవి చూసినా.. మదిలో ఏదో భావన! ఓ మానసిక స్పందన! ఓ పాట.. ఓ ఆట! సృష్టికి ఓనమాలులా.. ఏవేవో నిరాకారమై ఆకారం కోసం పాకులాడే అమూర్త భావనలు.
గురుకులంలో ఎవరో కాలుకదిపి నర్తిస్తే.. జాయపలో ఓ మధురత! ‘ఇలా నేనూ నర్తిస్తే!’..
కొత్త కదలిక.. ‘ఓహ్.. బావుంది బావుంది. దీనిని మరింత విస్తరింపజేయాలి. అతడు ఎంత బాగా నర్తించాడు?! ఆమె నర్తనలో ఏదో ప్రత్యేకత ఉంది’.
ఓ కొత్త ఊహ.. ‘ఈ భంగిమ భరతముని రాశాడా.. అప్పుడే పొత్తం తెరచి చూడటం.. నేనైతే??’..
అప్పటికప్పుడు మనసులో ఆ భావనకు రూపం కల్పించడం.. దానిపై ఓ గురువుతో చర్చించడం.. దానికొక పొడిగింపు.. ఎక్కడో అది ఆగిపోవడం.. ముందుకు సాగదు.. ప్చ్.. ఎలా!? దానిని గుండెల్లో పదిలపరచుకుని దాని పొడిగింపు కోసం.. లోలోన పోరాటం.. ఏదో ఆరాటం.. ఎక్కడెక్కడో పిచ్చెక్కినట్లు తిరగడం.. నిలబడటం.. కూర్చోడం.. పరుగు పెట్టడం.. కళాకారులంతా ఇలాగే తమకు.. లోకానికి సామరస్యం కుదిరి ఓ కళారూపం సంతరించుకునేవరకు లోలోన సంఘర్షిస్తూనే ఉంటారా?!! ప్చ్..
“పెద్దక్కా.. ఓ చిన్న ఆలోచన! చూడు..” అంటూ
నీలాంబకు ఓ నాట్యవిన్యాసం చేసి చూపించాడు.
ఆమె ఆశ్చర్యపోయింది. గణికల చప్పట్లతో మందిరం మారుమోగింది. సిగ్గుతో చిరునవ్వు నవ్వాడు.
“నువ్వొక అద్భుత నాట్యగాడివి జాయపా..” అంటూ ఆమె దగ్గరికి తీసుకుని ముద్దులిడింది.
యువతులు అభినందించే నెపంతో మీదికొచ్చి ముద్దులు పెట్టసాగారు. జాయప కంగారు పడిపోయాడు. నీలాంబ నవ్వుతూ అందరిని పక్కకు తోసి అతణ్ని రక్షించింది.
నాట్య గురుకులంలో కొండయ బృందంతో ప్రదర్శన ఏర్పాటుచేశాడు జాయప. ఆ ప్రదర్శనలో భైరవ, కాకతి కూడా పాల్గొన్నారు.
“నేను నాట్యం నేర్చుకుంటున్నది ఇక్కడే..” అన్నాడు ప్రదర్శన రోజు రంగోద్దీపన చేసుకుంటున్న కాకతితో.
“నువ్వు బాగానే తొక్కుతావుగా. ఇంకా నేర్చుకునేదేందీ?”.. చాలా ఆశ్చర్యపోయింది.
ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులంతా కొండయ బృందాన్ని.. ముఖ్యంగా భైరవ, కాకతిని మెచ్చుకున్నారు. సుబుద్ధి బలింజవాడలో కూడా నాట్య కార్యక్రమం ఏర్పాటుచేశాడు. ఆ పేటవాసులంతా తన్మయులయ్యారు. సోమిదమ్మకు ఓ పని పురమాయించాడు సుబుద్ధి. అది జాయపకు ‘దిష్టి తీయడం’.
నీలాంబ.. జాయపకు ఓ అశ్వాన్ని కొనిపెట్టింది. ‘విక్రమ’ అని దానికి ముద్దుగా పేరుపెట్టుకున్నాడు. ప్రయాణానికి ఎక్కువమందికి నడకే ప్రధానమార్గం. జాయప తన అశ్వాన్ని చూసుకుని సంతోషించాడు. రానురానూ జాయప యుద్ధశిక్షణ తగ్గించి పూర్తి సమయం నాట్య గురుకులంలోనే గడపసాగాడు.
నాట్యం.. గానం.. గేయం.. వాద్యవిన్యాసాలు.. శాస్ర్తావగాహన.. సిద్ధాంత రూపకల్పన.. నాట్యమిత్రులతో, నాట్యగురువులతో, సంగీతజ్ఞులతో, కవులతో.. నివ్వెరపరచే నూత్న ఆవిష్కరణలు! సాహితీకబుర్లు.. చరిత్ర ముచ్చట్లు.. వీధులు – వాడలు.. అంతా సృజనాత్మక సామాజిక మేళవింపు! అంతా.. అన్నిటా అంతరబహిర్ యుద్ధారావం! అందులో ఓ మాధురీమహిమ..
సమాజం, కళాభిజ్ఞత అనే రెండుగుర్రాలపై కాలం పరిమళిస్తూ పరుగులు తీస్తున్నది.
మరో ఏడాది గడచింది.
శ. సం. 1126 వ్యయ నామ సంవత్సరం.
మాఘమాసం వచ్చింది. రాజ్యమంతటా వివాహ సందళ్లు.. విందులు వినోదాలు. ఒక సాయంవేళ గురుకులం ముందు ఓ మాండలికులవారి ప్రత్యేక పల్లకి ఆగింది. జాయప కోసం వచ్చారంటూ లోపలికి వార్త. పరుగున బయటికి వచ్చాడు జాయప.
కొండిపర్తి మండలేశ్వరుల పట్టమహిషి శ్రీమతి మల్యాల మైలాంబిక.
మందీమార్బలంతో మంగళవాద్య సహితంగా పెళ్లి పిలుపు. ఆశ్చర్యపోయాడు. మిన్నుముట్టిన మంగళవాద్య ఘోష మధ్య ఆమె నవ్వింది ఆత్మీయంగా.
“మమ్మల్ని మరచిపోయావా జాయపా!..”
అన్నదామె.
అదే ఆప్యాయత. అదే చిరునవ్వుల హుందాతనం కప్పుకొన్న అమ్మదనం.
సిగ్గుపడ్డాడు. కలిసి ఏడాది.. తప్పు చేస్తున్నానా?!
“పద్మాక్షి వివాహం జాయపా! నువ్వు తప్పక రావాలి. ఇది తల్లిగా నా పిలుపు..” అన్నదామె.
“ఈ మాఘమాసం రానున్న కృష్ణపక్షం ఏకాదశి ఉదయం రెండోఝాము లగ్నం..” జాయప నుదుట ఆహ్వాన కుంకుమను ఆవిష్కరించింది.. ఒడలంతా జలదరించింది. శిరసు వంచిన మౌనమే.. అంగీకారం!
పెళ్లి సందళ్ల పల్లకి ముందుకు సాగింది.
తల్లికి ఆరోగ్యం సరిగాలేదని ఈమె చెప్పడం. అది నమ్మి వర్తకబిడారుతో వెళ్లడం.. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని తెలియడం.. ఒంటరిగా తిరుగుప్రయాణం.. అడవిలో జరిగిన దారుణాలు.. అన్నీ అతని కళ్లముందు గిర్రున తిరిగాయి. ఆ కోపంతోనే ఆమె పంపిన కొత్త వస్ర్తాల్నికూడా తిరస్కరించి ధరించకుండా పక్కన పెట్టాడు. మైలాంబిక స్వయంగా వచ్చి పిలవడంతో.. ఆ మంచు కోపపర్వతం కరిగిపోయింది.
వివాహానికి హాజరయ్యాడు. అతని చూపు వివాహవేడుకలు, తదితర కార్యకలాపాలమీద లేదు. ఎవరికోసమో తన చూపులు సంచలిస్తున్నాయి.. వెతుకుతున్నాయి.. ఆశతో.. ఆర్తిగా! అతని ఆశ ఫలించింది. ఎదురుచూసిన వ్యక్తి ఎదురయ్యాడు.
ఆయన.. వెలనాడు మండలేశ్వరుడు పినచోడుడు. జాయప కన్నతండ్రి. తండ్రిని చూసి కన్నీరుమున్నీరయ్యాడు జాయప. కొడుకును కళ్లారా చూసుకుని అమందానంద కందళిత హృదయుడయ్యాడు పినచోడుడు.
ఎన్నేళ్లకెన్నేళ్లకు ఈ సమాగమం!! ఇద్దరికీ మాటలు రాలేదు. మనసు, కంఠం రుద్దమయ్యాయి.
“నా తండ్రి జాయపా! ఎక్కడున్నావురా తండ్రీ.. ఎక్కడున్నావు! రాజ్యం కోల్పోయినా నాకు దుఃఖంలేదు తండ్రీ. నా పిల్లలు.. నా కన్న కూతుర్లు.. అమాయకురాళ్లు! మాయమాటలతో ఇక్కడికి పంపాను. ఆ పాపం నాదే! మరి నువ్వు ఇక్కడున్నావని తెలుసు. ఇక్కడ ఎక్కడ? ఏ చెరసాలలో? ఏ ఖైదులో? ఏ వీధి పక్కన బతుకుతున్నావ్? ఏ మురికిగుంటలో నీళ్లు తాగుతున్నావ్? ముక్కుపచ్చలారని పసిబిడ్డవే.. చెప్పా చెయ్యకుండా ఎందుకు వీళ్లతో వచ్చేశావ్? ఏం సాధించావ్? ఒక్క పూటయినా తింటున్నావా.. ఎవరైనా ఇంత ముద్దయినా వేస్తున్నారా నీకు..? ఓడిపోయిన రాజును నేను. నా పిల్లల గురించి ఏమని మహారాజును అడగను?! ఎంత క్షోభ అనుభవిస్తున్నామో ఊహించు తండ్రీ!!”..
ఆయన ఓ మహారాజునన్న సంగతి మరచి, సాధారణ తండ్రిలా.. మాయమైన కొడుకు ఐదేళ్ల తర్వాత కంట పడినప్పుడు ఎలా కన్నీరు మున్నీరవుతాడో.. అలాగే కన్నీటితో కొడుకును హత్తుకుని చూపరుల గుండె ద్రవించేలా ఏడ్చాడు. జాయప కూడా మాటలురాక అలా తండ్రిని హత్తుకుని ఏడుస్తూనే ఉన్నాడు. వారిద్దరినీ చూసి విడిదిలోని వెలనాడు బృందమంతా కన్నీటిజడుల్లో తడిసిపోయింది. మరుక్షణం తమ యువరాజును చూసుకుని ఆనందంతో పరవశించింది.
పిచ్చెక్కిపోయింది జాయపకు.
ఎంత తప్పుచేశాడు తను?!
తెలిసితెలిసి మరోలా ఆలోచించి.. తప్పుమీద తప్పు చేసి,
ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు.
కాస్త తెప్పరిల్లిన జాయప అడిగిన మొదటి ప్రశ్న!..
“అమ్మ ఎలా ఉంది నాన్నగారూ?”..
“ఎలా ఉంటుంది తండ్రీ. ఇద్దరు కూతుళ్లను బందీలుగా పంపిన తల్లి.. పాలబుగ్గల చిన్నారి కొడుకు చెప్పాచెయ్యకుండా మాయమైతే ఆ తల్లి ఎలా ఉంటుంది!? జీవచ్ఛవంలా ఉంటుంది. అలాగే ఉంది. అప్పటినుంచి మంచాన ఉంది”..
ఖిన్నుడయ్యాడు. ఆశ్చర్యంతో పక్కనున్న పినతండ్రిని ప్రశ్నార్థకంగా చూశాడు. ఆయన కళ్లు తుడుచుకుంటూ.. ‘అవును!’ అన్నట్లు తల ఊపాడు.
పిచ్చెక్కిపోయింది జాయపకు. ఎంత తప్పుచేశాడు తను?! తెలిసితెలిసి మరోలా ఆలోచించి.. తప్పుమీద తప్పు చేసి, ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు.
తల్లి ఆరోగ్యం బాగోలేదని మైలాంబ చెప్పిననాటి మనోవ్యధ మళ్లీ కళ్ల ముందు కదిలింది. కర్తవ్యం గుర్తొచ్చింది. విడిదినుంచి వడివడిగా గురుకులానికి వెళ్లి.. తన గదిలో ఉన్న కొత్త వస్ర్తాలు ధరించి.. తిరిగి వివాహ వేడుకకు హాజరయ్యాడు. జాయప రాకను చూసి చౌండసేనాని సంతోషించాడు.
మెల్లగా అడిగాడు..
“ద్వీపపెద్దలు వచ్చారు. కలిశావా?!”..
“కలిశాను బాబయగారూ! సంతోషం..” అన్నాడు తృప్తిగా.
మైలాంబిక చూసింది. తనిచ్చిన కొత్తదుస్తుల ధారణ గుర్తించింది.
మరి జాయప అక్కడలేడు.
అప్పటికి సమయం మిట్టమధ్యాహ్నం కావస్తున్నది. తన గుర్రం విక్రమను అధిరోహించాడు. అది ద్వీప దిక్కుగా కదిలి, మెల్లగా సాగి.. రానురానూ రెండుకాళ్లపై ఆకాశమే హద్దుగా ఉరకలెత్తసాగింది.
మరునాడు సంధ్య వేళకు తలగడ దీవి కోట వద్దకు చేరాడు.
అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. ద్వీపనగర దండనాయకుడు, నగరు ప్రవేశ నిర్ధారకుడు జాయపను గుర్తించక అడ్డగించాడు.“ఈరోజుకు రాజదర్శన సమయం ముగిసింది. రాజనగరులో అందరూ తమ తమ అంతఃపురాలకు చేరారు. రేపు ఉదయమే ప్రవేశం..” అన్నాడు.
అయినా జాయప నవ్వుతూ..
“అలాగా.. అవన్నీ నాకు చెప్పకండి. మహారాజుగారు లేరు. అనుమకొండపురానికి వివాహ నిమిత్తం వెళ్లారు. మహారాణి గారున్నారు. వారిని కలవాల్సిందే!” అన్నాడు పెంకెగా.
అతనితో మాట్లాడుతూ పరీక్షగా చూస్తున్న దండనాయకుడు.. చటుక్కున అరిచాడు.
“యువరాజా!”..
జాయప పకపకా నవ్వాడు.
అందరూ విభ్రాంతితో చూస్తూ అతణ్ని పోల్చి.. శిరస్ర్తాణాలను తీసి కాళ్లపై పడబోయారు.
సొంత ఇంటికి వచ్చిన జాయపను గుర్తించనందుకు సిగ్గుగా అందరూ..
“క్షమించాలి యువరాజా!” అంటుంటే, వారించాడు.
“అప్పుడు నేను బాలుణ్ని! ఇప్పుడు చూడండి. మీసాలెంత బాగా వచ్చాయో!” అంటూ అందరినీ నవ్వించాడు.
అందరూ ఉబ్బితబ్బిబ్బై పరవశించిపోయారు.
జాయప అందరినీ గట్టిగా హత్తుకుంటూ.. తన ఇంటి బెంగను కొంత తగ్గించుకున్నాడు.
ఈలోగా యువరాజు జాయప తిరిగి వచ్చాడన్న వార్త అంతఃపురానికి చేరింది.
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284