‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
నగరానికి ఒకవైపు సబ్అర్బన్గా.. మరోవైపు పంట పొలాలు ప్లాట్లుగా మార్చుకుంటున్న గ్రామం అది! మూతి గుడ్డలు ఇంకా తొలగకున్నా.. ‘అన్లాక్’ మొదలైంది. జాతీయ రహదారికి ఆనుకొని కార్పొరేట్ కళాశాలలు, కొత్తకొత్త రియల్ ఎస్టేట్ వెంచర్లు పరుచుకుంటున్న ప్రాంతం కావడంతో.. ఆ జంక్షన్లో లైన్ బస్సులు, సిటీ బస్సుల ప్రవాహం ఉదయం నుంచి రాత్రి వరకూ ఉంటూనే ఉంటుంది.
‘లక్కీ సిటీ పార్లర్’.. ఆ ప్రాంతంలో పేరున్న రోడ్సైడ్ ‘పాకవిలాస్’. పార్లర్లో చిన్నపాటి టేబుళ్లవద్ద రోజూ సిటీకి ‘అప్ అండ్ డౌన్’ చేసే ప్రయాణికుల మాటల మూటల గందరగోళం. ఎఫ్ఎం రేడియో నుంచి ‘పాట కావాలా’ కార్యక్రమం. మధ్యలో వార్తా విశేషాలు.
“మనూర్లు కూడా సిటీలో కలిసిపోతాయేమో?!” భయం – ఆశ – చిరాకు.. ముఖంమీద కనిపించకుండా అన్నాడు ముఖలింగం. “ఏటీ!? మళ్లీ సిటీకెళ్లి ఎనకేసేద్దామనే!?”.. అనుమానంతో కూడిన జోక్ వేశాడు భాస్కర్. “మనం ఈ ఊరొదిలి ఇక సిటీకి మాత్రం వెళ్లొద్దని మాట అనుకున్నాం కదా!?” అన్నాడు ఉమ.“మరి.. మల్లి మాత్రం మనని తరిమేసిన ఆ మహానగరానికి వెళ్లేందుకే నిర్ణయించుకున్నాడు కదా!?” అన్నాడు ముఖలింగం.
గడిచిన ఆరునెల్లుగా ఆ నలుగురూ మధ్యాహ్నం నుంచి రాత్రి పార్లర్ మూసేవరకూ, ఆ మూల టేబుల్ తమ సొంతం అన్నట్టు గడిపేస్తూ.. గంటకో టీ తాగుతున్నారు! పక్కనున్న బియ్యాలపేటవాసి ముఖలింగం.. మహానగరంలో కార్పెంటర్ పనిచేసేవాడు. అయినాడ వాస్తవ్యుడు భాస్కర్.. నగరంలో రాడ్ బెండర్గా ఉపాధి పొందేవాడు. ఉమ.. దాకమర్రి కుర్రాడు. సిటీలో సిమెంట్ మిక్సర్ ఆపరేటర్గా ఉండేవాడు. మల్లిది జామి గ్రామం. నగరంలో టైల్స్ వేసే పనిచేసేవాడు.
వలసల పరుగులో తిరిగొచ్చే వరకూ అందరూ ఒకే మహానగరంలో ఉపాధి పొందారని వారికే తెలియదు. వందల మైళ్ల ఆవల నగరంలో తాము బతికిన బతుకు ఇకపై పనికొచ్చేదో కాదో వాళ్లకు ఇంకా సందేహమే! ఆ గ్రామానికి తిరిగివచ్చిన నాటినుంచి ఎవరు ఎదురైనా.. ‘ఏటి సేస్తన్నవు?’ అని అడుగుతారేమో అన్న అవమానంలాంటి భయం. పక్కనున్న నగరంలో తాము చేసే పనులు దొరకవు. అక్కడ కుదురుకున్నవాళ్లే కొంతమంది గ్రామాలకు తిరిగొచ్చారని వింటున్నారు. సిటీ నుంచి తిరిగి రావడం జీవితంలో ఆ నలుగురూ మరచిపోలేరు.. తల్చుకోవడమే భయం!
గ్రామాల్లో పనుల్లేక.. ఏం చేయాలో తెలియక అలా మధ్యాహ్నానికి పార్లర్ దగ్గరికి రావడం అలవాటు చేసుకున్నారు. అలా పనిలేకుండా పోవడమే వారిమధ్య ఒక రకమైన స్నేహాన్ని పెంచింది. ఏ చిన్న వ్యాపారం చేద్దామన్నా మదుపులు కూడా లేవు. ఒకప్పుడు ఏడాదికి రెండుసార్లు ఇంటికొస్తే గడపలో పండగే! చిన్నా చితకా అప్పులు తీర్చి, తల్లిదండ్రులకు పండుగలకు బట్టలు కుట్టించడం దగ్గర నుంచి.. టీవీ, సెల్ఫోన్లు కొన్నారు. “సెలవలకు వచ్చావేట్రా!?” అంటూ గ్రామంలో అందరి నోటా కుశలం! గడిచిన మార్చి నెల అంటే ఆ నలుగురిలో భయం, కోపం!
పరిచయాలైన కొత్తలో ముఖలింగం, భాస్కర్.. ఆనాటి సంగతులు పంచుకున్నారు. కన్నీళ్లు రాకుండా ఏడుస్తూ, పరుగులు పెట్టిన ఆ రాత్రి – పగళ్లను దాటిన జీవితాన్ని ఒకరికొకరు పూసగుచ్చుకున్నారు. ఉమ, మల్లి.. అలాంటి అనుభవాల్నే గుర్తుతెచ్చుకున్నారు. ‘ప్రయోజకులు’ అనే బిరుదులాంటి పొగడ్తలతో తలెత్తుకు తిరిగే ఆ నలుగురూ.. ఇప్పుడు జవాబు చెప్పలేని అసహనంతో సిటీ పక్కనున్న ఆ గ్రామంలో ఏదైనా పని దొరుకుతుందేమోననే ఆశతో గడుపుతున్నారు. అందుకే.. పొద్దుపోయే వరకూ ఆ పార్లర్లోనే గడిపేస్తున్నారు.
ముఖలింగం, భాస్కర్, ఉమ.. ముగ్గురూ తమ గత జీవితాల జ్ఞాపకాల్లో మునిగిపోయారు. మల్లి మాత్రం పార్లర్ ఓనర్ టేబుల్ మీదున్న ఎఫ్ఎం రేడియోలో వార్తలు వింటున్నాడు. వివిధ నగరాల మధ్య ప్రయాణికుల వాహనాలు తిరుగుతున్నాయనీ, ఏ నగరంలో ఎంతమంది మహమ్మారి బారిన పడి కన్నుమూసేరో లెక్కలు చెబుతున్నాయి ఆ వార్తలు. పార్లర్ బయటికెళ్లి, సిగరెట్ వెలిగించి.. హైవేలో వెళ్తున్న బస్వైపు చూశాడు మల్లి. “ఏంటి గురూ! సడెన్గా బయటికి వచ్చావు?” అడిగారు ముఖలింగం, ఉమ, భాస్కర్. “ఇంట్లో టీవీ అమ్మేస్తే ఎంతొస్తుంది” అడిగాడు మల్లి. “ఎందుకూ!?” అన్నారు ముగ్గురు.“రేపు సిటీకి బయల్దేరుతాను!”.
“ఆ అమ్మాయి దొరుకుతుందనే!? ఆళ్ల సొంతూరోళ్లు, బంధువులే చేతులెత్తేశారు. ఆమె నీకెలా కానొస్తుంది!?” అని అడిగాడు భాస్కర్. “దొరికే వరకూ వెదుకుతాను. లారీ గ్యారేజ్ ఆయన టీవీ కొంటానన్నాడు. అడగనా!?” అన్నాడు మల్లి. ఆ రాత్రే గ్యారేజ్కు టీవీని తీసుకొచ్చి.. 15వేల టీవీని 5వేలకు అమ్మేశాడు. మిగిలిన ముగ్గురూ ఎవరెవరినో అడిగి మరో రెండువేలు ఇచ్చారు. ఉదయం బస్ ఎక్కి పక్కనున్న సిటీలో రైల్వేస్టేషన్కు చేరుకొని.. రైలెక్కాడు. జనరల్ బోగీలో.. మూతి గుడ్డలతో దూర దూరంగా ఎవరెవరో! సిటీ శివార్లు దాటి హైవే పక్కగా రైలు వెళ్తున్నది. చినుకులతో మొదలై వర్షం కురుస్తున్నది. కిటికీ పక్కన కూర్చున్న తన కంట్లో తుంపర్లు!
లాక్డౌన్ వారం గడిచాక.. ఆకలికి జడిసి నగరం నుంచి బయల్దేరాడు మల్లి. ‘వెళ్లాలా? వద్దా?’ అనే ఆలోచనలతో ఆలస్యమై.. అర్ధరాత్రి దాటిపోయింది. కాలనీ దాటి మార్కెట్ సెంటర్కు వస్తుంటే.. కొంతదూరంలో బారికేడ్ల వద్ద వ్యాన్లు నిలిపి పోలీసుల గుంపులు. పదేళ్లు ఇదే ఏరియాలో కాలరెగరేసి తిరిగాడు. కానీ, ఇప్పుడు మార్కెట్ సందుల్లోంచి జాతీయ రహదారిపైకి వెళ్లేందుకు అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. పోలీస్ వ్యాన్ వస్తున్నట్లు సైరన్ వినిపించడంతో.. ట్రాన్స్ఫార్మర్ పక్కనున్న రేకులషెడ్లో నక్కి కూర్చున్నాడు. వ్యాన్ దాటిపోయిన కొంతసేపటికి లేచి నిలబడి.. అటూఇటూ చూశాడు. ఆ రేకులకు అటువైపు నుంచి ఏదో కదిలినట్టు అనిపించింది. వెలుగుతూ ఆరుతున్న స్ట్రీట్లైట్ వెలుగులో ఒక అమ్మాయి ఆకారం. నోటికి వేలు అడ్డంపెట్టి ‘మాట్లాడకు!’ అంటూ.. మూతి గుడ్డ సరిచేసుకుంటూ సైగ చేసింది. మల్లికి భయం వేసింది. అయినా మాట్లాడలేదు.
ఆ అమ్మాయి అలిసిపోయిన గొంతుతో.. “హైవేకేనా!?” అన్నది.తల ఊపాడు. “పదమరి!” అన్నదామె.
అసలే కరోనా కాలం. అమ్మాయితో కనిపిస్తే పోలీసులు ఏమంటారోనని భయం. చుడీదార్ వేసుకుని అచ్చం హిందీ అమ్మాయిలా ఉన్న ఆమె, తెలుగులో మాట్లాడుతున్నదేమిటని సందేహం. అంతలోనే పోలీస్ విజిల్స్ వినిపించాయి. తిరిగి ఇద్దరూ ఆ రేకుల షెడ్లో అలికిడి లేకుండా ఉండిపోయారు. దాదాపు గంటసేపు.. పోలీసుల అలికిడి వినిపిస్తునే ఉంది. ఆ శబ్దాలు సద్దుమణిగాక.. మెల్లగా, సందులు గొందులు దాటుకుంటూ.. పరుగులాంటి నడకతో తెల్లారేసరికి జాతీయ రహదారికి చేరుకున్నారు. తమలాంటి వారే గుంపులు గుంపులుగా హైవే పక్కగా వెళ్తున్నారు. అక్కడక్కడా లారీలు, ట్రక్కులు.. కిటకిటలాడుతున్న జనాలతో పరుగులు తీస్తున్నాయి. ఒక ట్రక్లోకి ఎక్కేందుకు మల్లి పరిగెత్తాడు. ఆమె కూడా వెనకే పరిగెత్తింది.
“నువ్వెందుకు?” అన్నాడు. “నీతోనే!” అంటూ ట్రక్ ఎక్కుతున్న తనకు చేయి అందించింది. లాగి పైకి ఎక్కించాడు. “దోసౌ పచాస్.. ఎక్కెక్కు!” అరిచాడు ట్రక్ క్లీనర్. బ్యాగ్లోంచి తీసి ఐదు వందల నోటు ఇచ్చింది. “నా డబ్బులు నువ్వెందుకిచ్చావు?” అడిగాడు మల్లి. “పర్లేదులే!” అంటూ.. నుదుటి మీద పడుతున్న జుత్తు సద్దుకుంది. ఓ టోల్గోట్కు అల్లంత దూరంలో ఆపేసి.. “ఇంక దిగండి!” అన్నాడు డ్రైవర్. “పైకి వెళ్లదా!?” అంటే.. “టోల్గేట్ వరకు కూడా వెళ్లదు!” అంటూ తెగేసి చెప్పాడు క్లీనర్.. ట్రక్ షెటర్ దించుతూ.
అక్కడ దిగినవారంతా పోలీసుల భయంతో హైవే దిగిపోయి.. పక్కనున్న రైలు పట్టాల పక్కగా నడిచి వెళ్లిపోతున్నారు. మల్లి, ఆమె.. వారితోటే నడుస్తున్నారు. నడిచి నడిచి చెమటలు కారుస్తున్నారు. సాయంత్రానికి హైవే బ్రిడ్జి దగ్గరికి చేరుకున్నారు. ఓపిక లేనివారు జాతీయ రహదారి పక్కనే నడుం వాల్చారు. ఆ అమ్మాయి.. ‘రా!’ అంటూ అక్కడే కూచుండిపోయింది. మల్లి కూడా కూర్చున్నాడు. “నువ్వెందుకు సిటీ వదిలి వచ్చేస్తున్నావు” అడిగాడు మల్లి. “నువ్వు ఎందుకెళ్తున్నావో.. నేను కూడా అందుకే!” అన్నది.
సగం హిందీ, సగం తెలుగు భాషలో చీమల్లా మాట్లాడేసుకుంటూ.. అలా ఆ రాత్రి వెలిగే నక్షత్రాలను చూస్తూ, కబుర్లు చెప్పుకొంటూ ఒకరికొకరు పరిచయమేకాదు.. దోస్తులు కూడా అయిపోయారు. ఆమె పేరుకూడా ‘మల్లి’నే! తెల్లవారుజాము సమయంలో మళ్లీ పోలీసులు వచ్చి లాఠీలతో మాట్లాడ్డం మొదలెట్టారు. గుంపుగా మళ్లీ జాతీయ రహదారి వదలి గ్రామాల బాట పట్టారు. మధ్యాహ్నానికి చిన్న టౌన్ చేరుకున్నారు. రోడ్డు పక్కన పాక విలాస్లో చాయ్, మధ్యకు చీల్చిన స్వీట్బన్ కొనుక్కుని తిన్నారు. ఈసారి విసురుగా పర్స్ తీసి, డబ్బులిచ్చేశాడు మల్లి. కళ్లతోనే నవ్వినట్టు చూసిందామె. మళ్లీ నడక ప్రారంభం. కాళ్లు లాగుతున్నా, చెమటలు కారుతున్నా.. కబుర్లతో అలసట మరచిపోయి నడుస్తున్నారు.
“నువ్వు సిటీకి ఎందుకొచ్చావో, ఎలా వచ్చావో చెప్పావు కానీ.. ఎందుకు వదిలేస్తున్నావో చెప్పలేదేంటి?” అడిగాడు మల్లి. “మళ్లీ రాత్రి ఎక్కడో చుక్కలు లెక్కపెడతాం కదా! అక్కడ చెబుతా!” అన్నది.
సాయంత్రానికి హైవేలో మూసి ఉన్న ఓ పంజాబీ దాబా దగ్గర ఆగింది ఆ గుంపు. అక్కడ సర్దార్జీలు వ్యాన్లో రోటీ, సబ్జీ పొట్లాలు పంచిపెడుతున్నారు. మల్లి మాత్రం దూరంగా నిలుచున్నాడు.
“సిటీ వదిలేసి చాలా దూరం వచ్చాం. ఇక సిగ్గేంటి?” అంటూ క్యూలోకి లాక్కెళ్లింది మల్లి.
రోటీ, సబ్జీ రుచిగా ఉన్నాయో.. అలసట, ఆకలి వల్ల అలా అనిపించిందో తెలీదు కానీ, అందరూ గబగబా తినేశారు. సిటీ దాటిన ఐదో రోజుకు ఒక్కో టౌన్లో కొందరు కొందరుగా వారివారి గ్రామాల దారి పట్టడంతో.. గుంపు చాలా చిన్నదైపోయింది. రాత్రి తారోదయం అయింది. రోడ్డు పక్కగా అందరూ పడుకొని, ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ.. కునుకులోకి జారుకున్నారు. కాస్త దూరం వెళ్లి సిగరెట్ కాలుస్తున్నాడు మల్లి. ఆమె అతని వైపే చూస్తున్నది. సిగరెట్ ఆర్పేసి మల్లి దగ్గరకొచ్చి..
“కల్వర్టు దగ్గర కూచుందాం రా!” అన్నాడు. “అవునూ.. ఐదు చుక్కలు ఆకాశంలో కలిస్తే చెడు జరుగుద్దంటారు కదా! నీకు నమ్మకం ఉందా” అని అడిగింది. “ఐదు కాదు.. పది చుక్కలు కలిసుంటాయి. అందుకనే ఇలా దేశాలు పట్టేశాం” అంటూ కసురుకున్నాడు. “అన్నట్టు.. హిందీలో గ్రామాన్ని ‘దేశ్’ అంటారు తెలుసా!?” అన్నది. “అవును! మా తాత.. ‘మా దేశం ఎల్లొస్తాను!’ అనేవాడు తెలుగులోనే. ఇప్పుడు గ్రామాలు, ఊర్లు అంటున్నాం” అన్నాడు. మళ్లీ తనే..
“మీ మేడం నిన్ను ఎందుకు పంపేసింది” అని అడిగాడు. “అదా.. లాక్డౌన్లో వాళ్లింటికి వాళ్ల డాక్టర్ మామయ్య వచ్చాడు. పనివాళ్లను పంపేయమని కచ్చితంగా చెప్పాడు. ‘వాళ్లు ఇప్పుడు ఎక్కడికెళ్లగలరు!? ఉండనీ!’ అన్నది మేడం. రెండు రోజుల తరువాత ఒక రోజురాత్రి.. నేను మేడం స్టూడియోలో పెయింటింగ్స్ సద్దుతున్నాను. మా విల్లా గేట్మ్యాన్ నుదుటిమీద చెమట తుడుచుకుంటూ.. నక్కినక్కి వచ్చి నాకు ఓ కబురు చెప్పాడు చెవిలో. దెబ్బకు నాకు కళ్లు తిరిగినట్టయింది. ‘లాన్లో పనిచేస్తున్నట్టు నటించు. మెల్లిగా చిన్నగేటు ఓరగా ఉంచుతాను.. పారిపో! నేను కూడా నీ తరువాత పారిపోతా’ అని చెప్పాడు. అంతే.. అక్కణ్నుంచి జారుకుని, పోలీసు వ్యాన్ చప్పుడు విని ఆ రేకుల షెడ్లో నక్కాను” చెప్పింది మల్లి.
“గేట్మ్యాన్ ఏం చెప్పాడు?” అడిగాడు మల్లి.
“మేడం వాళ్ల మామయ్య పోలీసులకు ఫోన్చేసి.. మేం ఇద్దరం నగలు దొంగతనం చేశామని చెబుతుండగా విన్నాడట. అదే విషయం నాకు చెప్పాడు. అందుకే అక్కణ్నుంచి జారుకున్నాను” అన్నది మల్లి. మల్లి ఊరు కూడా తన ఊరికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లు తెలిశాక.. ఇంకా ఏదో దగ్గరతనం ఉన్నట్టు అనిపించింది అతనికి. అలా ఒకరి గత జీవితంలోకి ఇంకొకరు ఈదుతున్న ఆ సూర్యోదయ సమయంలో.. రోడ్డుపైనుంచి ఓ ట్రక్ వెళ్తుంటే గుంపు అందరూ కేకలేసి ఆపారు. రెండు మల్లెలూ ఆ ట్రక్ ఎక్కాయి. ఇంకా అలసట తీరని కొందరు కునుకు తీస్తుంటే, ఒకాయన.. “సిగరెట్టు ఉంటే ఇస్తావా!?” అంటూ ఆమె వైపు చూస్తూ, అతణ్ని అడిగాడు. ఆ చూపు నచ్చక వెంటనే సిగరెట్టు తీసి ఇచ్చేశాడు మల్లి. కొండల మధ్య నుంచి దూసుకుపోతున్నది ట్రక్. “మరి నీకు అంత అన్యాయం చేసిన ఆ విలేకరిని కుళ్లపొడిచి, చంపేయకపోయావా!?” అన్నాడు మల్లి. “వాడు నన్ను వాడుకున్నాడు కానీ, తరువాత తప్పయిపోయిందనీ, నాకు సహాయం చేస్తానంటూ.. మేడంకు పరిచయం చేశాడు” అంటూ తన గతాన్ని మల్లితో పంచుకున్నది.
మా ఊళ్లో తుఫాను ధాటికి ఇంటిగోడ కూలి అమ్మానాన్న చనిపోయారు. ఐదేళ్లకే ఒంటరిదాన్నయిన నన్ను ఈ మహానగరానికి తీసుకొచ్చాడు మా చిన్నాన్న. చిన్నప్పుడే కాలనీ పక్కనున్న అపార్ట్మెంట్లో ఇంటి పనులకు కుదిర్చాడు. మా చిన్నాన్న కూడా కొన్నాళ్లకు ఏదో చర్మవ్యాధి వచ్చి చనిపోయాడు. అప్పుడు నాకు 17 ఏళ్లు ఉంటాయి కావొచ్చు. నేను పనిచేసే ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్.. తన ఇంట్లో రెండు వేలు పోయాయని నామీద పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. అదిగో.. అప్పుడే పోలీస్ స్టేషన్లో ఎస్ఐతో మాట్లాడుతున్న విలేకరి కనిపించాడు. తరువాత నాతో మాటలు కలిపి.. ఎస్ఐని ఒప్పించి, నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడుండటం మంచిది కాదంటూ.. వాళ్ల కాలనీకి తీసుకెళ్లాడు. అబద్ధాలతో భయపెట్టి, నన్ను లొంగదీసుకున్నాడు. వాడే నన్ను ఈ మేడంకు పరిచయం చేశాడు. ఆమెకు ఒక ఎన్జీవో ఉంది. దాని ద్వారా కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండేది మేడం. అందుకోసం ప్రతినెలా ఏదో ఒక సిటీలో తన పెయింటింగ్స్ ప్రదర్శనలు పెట్టేది. మొదట్లో వాళ్ల విల్లాలో పాచి పనులు చేసేదాన్ని. ఆ తర్వాత పెయింటింగ్స్ మోస్తూ మేడం వెంట ఎన్నో సిటీలు తిరిగాను. పదో తరగతి ఫెయిల్ అయిన నేను.. మేడం దగ్గరే హిందీ, ఇంగ్లిష్ చదవడం, రాయడం నేర్చుకున్నాను. కొన్నాళ్లకు మేడంకు పీఏగా మారిపోయా. మేడం ఎన్జీవోలో ఏ పనైనా.. నా చేతులమీదే జరిగేది. మేడం నన్ను సొంత మనిషిలా చూసుకుంది. నన్ను ‘మల్లికా!’ అని ప్రేమగా పిలిచేది. నేను అక్కణ్నుంచి వచ్చే ముందురోజు.. మేడం నాతో అన్న మాటలు ఇంకా నా చెవుల్లోనే ఉన్నాయి. ‘మల్లికా.. నువ్వు వెళ్లిపోవాలి. నిన్ను వదులు కోవడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. కానీ, మామయ్య వచ్చిన దగ్గర్నుంచి మా అందరి మెదళ్లూ తింటున్నాడు. పనోళ్లను పంపేయకుంటే..
కరోనాతో చచ్చిపోతామంటూ జడిపిస్తున్నాడు. నీకు డబ్బులు, బట్టలు ఇస్తాను. మీఊరు వెళ్లిపో!’ అంటూ చెప్పింది. ఆ మర్నాడే గేట్మెన్ వచ్చి నా చెవిలో ఊదిన కబురు.. ఇక తప్పని పరిస్థితిలో ఇలా!”.. అంటూ కళ్లు తుడుచుకున్నది మల్లి. “నేనున్నానుగా!” అన్నాడు మల్లి. ఆకాశం నుంచి ఓ ఉల్క.. అలా తెల్లటి తారాజువ్వలా ఎగిసిపడింది. రెండు మల్లెల కళ్లలో ఆ కాంతిమెరుపు ఒక్క క్షణం. తెల్లారి మళ్లీ కల్వర్టు దిగి, పంట పొలాల గట్ల వెంట నడుస్తున్నారు. పర్స్ తీసి చూస్తే రెండొందలే మిగిలాయి. “మన గుంపంతా ట్రక్లో వెళ్లిపోతుంటే ఈ నడకెందుకు?” అడిగింది.
“ఆ గుసగుసలు, చూపులు.. నాకు చిరాకేస్తున్నది” అంటూ, బలంగా పీల్చిన సిగరెట్ పొగ వదిలాడు. “మరి ఇలాంటి గుసగుసలు. చెత్త చూపులు రోజూ ఎదురవుతూనే ఉంటాయి!” అన్నది. మక్కజొన్న పంట కోతకు వచ్చింది. ఆ గట్ల మధ్య అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. పక్కనున్న మక్కజొన్న పొత్తు ఒకటి తెంపి.. “నేను ఎందుకు నచ్చాను?” అడిగింది. “ఏమో! తెలియదు. ఆ రేకుల షెడ్లో ఆరుతూ వెలుగుతున్న బల్బు కాంతిలో.. నీ ముఖం, తలలో ఆ మందారం చూసినప్పటి నుంచీ, ఎందుకో తెలియదు.. నా మనసు అదోలా అయిపోయింది. ఇద్దరం కలిసి మళ్లీ సిటీకి వద్దాం! మనం అంటే తెలియని ప్రాంతంలో కిరాణా కొట్టు పెట్టుకుందాం!” అన్నాడు. “సిటీ వదిలి పరుగులు తీసిన మనం.. మళ్లీ తిరిగి వస్తామంటావా!?” అన్నది.
తొందరగా ఊరు చేరుకోవాలంటూ వడివడిగా అడుగులు వేస్తూ నడుస్తున్నారు. తమ వెంట వస్తున్నవాళ్లూ ఏదో తెలియని దుఃఖం, భయంతో అడుగులేస్తున్నారు. కొన్ని గంటలు నడిచాక.. ఓ టౌన్ పొలిమేరకు చేరుకున్నారు. వాళ్లలో ఓ కుర్రాడు మైలురాయి చూపించి.. “మన రాష్ర్టానికి వచ్చేశాం!” అంటూ కేక వేశాడు. తమ ప్రాంతానికి చేరుకున్నామన్న ఫీలింగ్తో గుంపులోని వారంతా ఆనందంగా ఉన్నారు. లారీలు, ట్రక్కులు అక్కడక్కడా ఆపుతున్నా.. గుంపులో ఎవ్వరూ ఎక్కడంలేదు. జేబులో నోట్లు లేవు. పోలీసులు పట్టుకుంటారేమోననే భయం కూడా తోడయ్యింది. అలా కొంతదూరం నడిచాక.. టౌన్ మార్కెట్ వచ్చింది. చాలాసేపట్నించీ ఎందుకో మల్లి అటూ, ఇటూ చూస్తున్నది.
“ఏంటి సంగతి?” అన్నాడు. చిటికిన వేలు చూపింది.
“ఓహో.. జనాలు పెద్దగాలేరు కదా! ఆ సందులోకి వెళ్లు. నేను మలుపులో ఉంటాను” అన్నాడు. తలలోంచి వాడిపోయిన మందారాన్ని తీసి చూసుకుంటూ.. సందులోకి వెళ్లింది. ఇంతలో పోలీస్ వ్యాన్ రావడం, అక్కడున్నవారందరినీ లాఠీలతో బాదేయడం.. క్షణాల్లో జరిగిపోయింది. ‘మల్లీ!’ అంటూ కేకవేసేలోపే.. మల్లి వీపుమీద లాఠీ దెబ్బలు. కళ్లు తిరిగి పడిపోయాడు.
కంట్లో పడ్డ తుంపర్లను తుడుచుకుంటూ.. రైలు బోగీలో చాయ్వాలా కేకతో ఈ లోకంలోనికి వచ్చాడు మల్లి. బోరున ఏడిస్తే బాగుండు అనిపించింది. ఏడుపు బదులు ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. మల్లి తప్పిపోయిన టౌన్, తాము ఆగిన గ్రామాలు ఎన్ని వెదికినా.. ఆమె జాడ తెలియలేదు. ఉదయం సిటీకి చేరుకున్న తరువాత ఏం చేయాలనుకుంటూ.. నిద్రలోకి జారుకున్నాడు. ఉదయానికళ్లా సిటీ స్టేషన్లోకి చేరుకున్నది రైలు. స్టేషన్లో దిగి.. చాయ్తాగి, సిగరెట్ వెలిగించాడు.
‘మేడంను కలవాలా? ఆ విలేకరిని కలవాలా!?’ అని ఆలోచించాడు. ఏం చేయాలో తెలియడంలేదు.
మల్లి కనుమరుగైన రోజు గుర్తుకొచ్చింది. ..అలా లాఠీ దెబ్బలతో పడిపోయిన తనను పోలీస్ లాకప్లో పడేశారు. మర్నాడు కానిస్టేబుల్ వచ్చి.. “టౌన్ వదిలి పారిపోతానంటే వదిలేస్తాం! ఇప్పటికే నీతో వచ్చిన వారిని వదిలేశాం. నువ్వు కూడా పారిపో!” అన్నాడు. “అలాగే!” అంటూ.. స్టేషన్ బయటికి వచ్చాడు. మల్లి తన కళ్ల ముందునుంచి వెళ్లిపోయిన సందుకోసం వెతుకులాడుతుంటే.. తనతోపాటు లాఠీ దెబ్బలు తిని బయటపడ్డ గుంపులోని వారు ఒక లారీని ఆపారు.
“పోలీసులకు దొరికితే ఈసారి చంపేస్తారు!” అంటూ బలవంతంగా ఆ లారీలోకి ఎక్కించి.. ఊర్లో వదిలారు. ఆమె మళ్లీ మేడం దగ్గరికే వెళ్లిందేమోనన్న చివరి ఆశతో.. తాను వదలిన నగరంలో మళ్లీ అడుగుపెట్టాడు మల్లి. మల్లిక గతంలో చెప్పిన వివరాలను బట్టి.. మేడం విల్లాకు వెళ్లాడు. అక్కడ గేట్మ్యాన్ ఉన్నాడు.
“మల్లి ఉందా!?” అని అడిగాడు హిందీలో. “మల్లి ఎవరు?” అన్నాడు అతను.“అదే మల్లిక!” అన్నాడు మల్లి. “ఇక్కడ అలాటివారు ఎవరూ లేరు. గేట్ దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు!” అంటూ పంపేయబోయాడు. “మేడం ఉన్నారా.. కలవాలి” అన్నాడు మల్లి. “ఎందుకూ!? మేడం లేరు. ఈ రోజు సిటీలో ఆమె పెయింటింగ్స్ ప్రదర్శన ఉంది. అక్కడే ఉన్నారు!” అంటూ, ఆరోజు పేపర్లో ప్రకటన చూపించాడు. మొత్తానికి ఆ ప్రదర్శన ఆడిటోరియం వెతికి.. మేడంను కలిశాడు మల్లి. మొత్తం కథ చెప్పాడు.
ఆమె కళ్ల నీరు తుడుచుకుంటూ.. “మల్లిక నా దగ్గరికి రాలేదు! ఆమెను నేను మరిచిపోలేను!” అని చెప్పింది. తన ఫోన్లో మల్లి నెంబర్ వెతికి.. కాల్ చేసింది. ‘స్విచ్డ్ ఆఫ్’ అని రావడంతో పెదవి విరిచింది. మళ్లీ ఎవరిదో ఫోన్ నెంబర్ వెతికి.. గబగబా కాల్ చేసి, ఏదో మాట్లాడింది. ఓ గంటలో మోటర్ సైకిల్ మీద నలభై ఏళ్ల వ్యక్తి వచ్చాడు. “ఇతను మల్లి. అదే.. మన మల్లిక బంధువు”.. అంటూ మల్లిని పరిచయం చేసింది. “ఈయన విలేకరి అఖిలేష్. ఈయనే.. మల్లిని నాకు పరిచయం చేసింది!” అంటూ పరిచయం చేసింది.
వాణ్ని అక్కడికక్కడే చంపేయాలని అనిపించింది మల్లికి. తమాయించుకున్నాడు. ఆమెకు, అతనికి దండంలాంటిది పెట్టి.. ఆడిటోరియం నుంచి బయటికి వచ్చాడు. రోజులు గడుస్తున్న కొద్దీ.. మహానగరం మహా కోలాహలంగా కోలుకుంది. మళ్లీ తన టైల్స్ పని చేసుకుంటూ, పాత కాలనీలోనే ఉంటున్నాడు. తామిద్దరం లాక్డౌన్ రాత్రి దాక్కున్న రేకుల షెడ్ అలానే ఉంది. అక్కడి వీధిలైట్ ఇంకా వెలుగుతూ ఆరుతూనే ఉంది. మల్లి మాత్రం దొరకలేదు. విలేకరికీ, మేడంకు ఫోన్ చేయడం కూడా మానేశాడు.
లక్కీ సిటీ పార్లర్ దగ్గర భాస్కర్, ముఖలింగం, ఉమ కలుస్తూనే ఉన్నారు. పక్కనున్న సిటీలో కడుతున్న రియల్ ఎస్టేట్ వెంచర్లో వాళ్లు ముగ్గురూ కలిసే పనికి కుదురుకున్నారు. ‘మల్లి ఫోన్ పారేసుకున్నాడా? డబ్బుల్లేక రీచార్జింగ్ చేయించలేదా? అసలు ఆ అమ్మాయి జాడ తెలిసి ఉంటుందా!?’ అని రోజూ పార్లర్ దగ్గర టీ తాగుతూ మాట్లాడుకుంటునే ఉన్నారు. “ఏం గురూ! మనూర్లు కూడా సిటీలో కలిసిపోతాయేమో!?”.. ఎప్పట్లాగానే అడిగాడు ముఖలింగం.