Football: ఫుట్బాల్ టోర్నీ ఆడేందుకని పశ్చిమబెంగాల్ నుంచి 8 నుంచి 14 ఏండ్ల వయసున్న బాలులను తీసుకొచ్చి వారికి నెల రోజుల పాటు నరకయాతన చూపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నాటకలోని ఓ ఫుట్బాల్ క్లబ్ చేసిన నిర్వాకానికి ఆ యువ ఫుట్బాలర్లు నెల రోజుల పాటు నరకం అనుభవించారు. అబ్బాయిలను ఫుట్బాల్ ఆడించాల్సింది పోయి వారితో అంట్లు తోమించడం, ఫ్లోర్ తుడిపించడం, వంట చేయించడం వంటి పనులు చేయించడమే గాక ఆ పనులు చేయడానికి నిరాకరించిన వారిపై క్రమశిక్షణా చర్యలకూ దిగారు.
వివరాల్లోకెళ్తే… కర్నాటక స్టేట్ యూత్ లీగ్లో భాగంగా బెంగళూరుకు చెందిన బ్లాక్ పాంథర్ టోటల్ ఫుట్బాల్ క్లబ్ దక్షిణా కోల్కతాలోని సోనార్పూర్ డైనమిక్ స్పోర్ట్స్ అకాడమీ వద్దకు వెళ్లింది. బెంగళూరులో ఫుట్బాల్ లీగ్ ఆడేందుకు తమకు అండర్ – 13, అండర్ – 15 స్థాయిలో ఆటగాళ్లు కావాలని అక్కడ్నుంచి తీసుకెళ్లింది. వారికి ప్రత్యేక హోటళ్లలో ఆతిథ్యం, మెరుగైన ఆహారం, వైద్య సదుపాయాలు అన్నీ కల్పిస్తామని చెప్పి సెప్టెంబర్ 25న పది మంది బాలులను తీసుకొచ్చిన బ్లాక్ పాంథర్ క్లబ్ అందుకు విరుద్ధంగా వారితో వెట్టిచాకిరీ చేయించింది.
బెంగళూరుకు తీసుకొచ్చిన నాలుగు రోజుల తర్వాత బ్లాక్ పాంథర్ ప్రతినిధులు ఆ పిల్లల దగ్గర సెల్ఫోన్స్ లాక్కున్నారు. పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందిన వాళ్ల తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ (ఐఎఫ్ఎ) జోక్యంతో ఆ పది మంది జూనియర్ ఫుట్బాలర్లు బ్లాక్ పాంథర్ చెర నుంచి తప్పించుకున్నారు.