న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ తన పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్ వినేశ్ పోగట్ ఆరోపించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో రెజ్లర్లు అంతా నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రంగంలోకి దిగినా.. రెజ్లర్లతో జరిగిన చర్చలు సఫలం కాలేదు. అయితే ఇవాళ మీడియాతో బ్రిజ్ భూషణ్ మాట్లాడారు. తన పదవికి రాజీనామా చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు.
బ్రిజ్పై మీటూ తరహాలో ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని, పీఎంవో, హోంశాఖతో మాట్లాడలేదని, ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్మీట్లో మాట్లాడనున్నట్లు తెలిపారు. హర్యానాకు చెందిన 300 మంది అథ్లెట్లు తమ వద్ద ఉన్నారని బ్రిజ్ మీడియాకు తెలిపారు.